Thursday, November 15, 2018

అమెరికన్ రచయిత హెర్మన్ మెల్విల్లె



ఎర్నెస్ట్ హెమింగ్ వే రాసిన "ది ఓల్డ్ మేన్ అండ్ ద సీ" నవల చదివిన వారు ఎవరైనా తెలుగు లో "అతడు అడవిని జయించాడు"నవల ని చదివినప్పుడు కొన్ని సామీప్యాలు కనబడి ఆలోచన కి గురి అవుతాము.అయితే అక్కడ సముద్రం మీద జైత్ర యాత్ర అయితే ఇక్కడ యేమో అడవి లో పంది ఇంకా దాని పిల్లల కోసం సాగే అన్వేషణ.రెండు చోట్లా అస్తమయ దశ లో ఉన్న ఒక మనిషి యొక్క యాతన ఇంకా పడే తపన చిత్రించబడింది.అది తన జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి సాగించిన యాత్ర.ఈ కధ లో గనక ప్రధాన పాత్ర గా  ముసలివానికి బదులు  యువకుడు ఉన్నట్లయితే అంత రక్తి కట్టేది కాదేమో..!అందుకనే తెలుగు లో కూడా రచయిత ఆ పంధా నే కొనసాగించారు.అది ఫలించింది కూడా.

నిజానికి ఎర్నెస్ట్ హెమింగ్ వే కూడా ఈ సముద్ర సాహస యాత్ర ని ప్రఖ్యాత అమెరికన్ రచయిత హెర్మన్ మెల్విల్లె రాసిన మోబీ డిక్ నుంచి తీసుకున్నాడా అనిపిస్తుంది.అయితే ఒకటే పాత్ర ప్రధానం గా ఉండదనుకోండి.ఆహబ్ అనే నావికుడు ప్రధాన పాత్ర.ఒకసారి సముద్రం పై తిమింగళాల వేట కి వెళ్ళినప్పుడు ఒక తిమింగళం ఇతని మీద దాడి చేసి న ఫలితం గా ఒక కాలు ని కోల్పోతాడు.అయితే ఇతగాడు అంతటి తో ఊరుకోక ఎలాగైన సరే ఆ సముద్రం లో అదే ప్రాంతానికి పోయి ఆ తిమింగళం ని చంపి తీరాలి అని నిర్ణయించుకుంటాడు.తనకి కాలు పోయింది.ఎలా ..అందుకు గాను ఒక గొప్ప యోధుల బృందాన్ని సమకూర్చుకుంటాడు.అలా సముద్రం మీదనే కధ అంతా పోరాట మయం గా సాగుతుంది.దానిలో హీరో ఓ యువకుడు, తాను ...తన జ్ఞాపకాల లో భాగంగా కధ ని చెబుతుంటాడు.ఇతను న్యూయార్క్ నుంచి న్యూ బెడ్ ఫోర్డ్ కి ప్రయాణం చేస్తూంటాడు.చాలా అద్భుతం గా ఉంటుంది.

మొదటి సారి గా ఈ నవల 1851 ప్రాంతం లో ప్రచురింపబడి పెద్ద గా ఆదరణ కి నోచుకోలేదు గాని ఆ తర్వాత చాలానాళ్ళకి 1923 ప్రాంతం లో డి.హెచ్.లారెన్స్ వంటి వాళ్ళు దీన్ని ప్రస్తుతించడం తో దీని వైభవం రచయిత చనిపోయిన తర్వాత పెరిగింది.ఇది వచ్చిన ఇంచు మించు వంద ఏళ్ళకి అంటే 1952 లో ఎర్నెస్ట్ హెమింగ్ వే నవల వచ్చింది.2017 లో బాబ్ డైలాన్ నోబెల్ బహుమతి తీసుకున్న సందర్భం లో తాను హెర్మన్ మెల్విల్లే రచన నుంచి ఇన్స్పిరేషన్ పొంది మూడు గేయాలు రాసినట్లు చెప్పాడు.కనుక దేనికి ఎప్పుడు కాలం వస్తుందో తెలియదు.ఒక గొప్ప రచన ఏ రోజుకైనా తాను పొందవలసిన వాటా తాను పొంది తీరుతుంది.దానిని ఎవరూ ఆపలేరు.ఇది చరిత్ర చెబుతున్న సత్యం.  

No comments:

Post a Comment