Sunday, August 8, 2021

కథా రచయితగా సోమర్సెట్ మామ్


సోమర్సెట్ మామ్... ఈ పేరు ఆంగ్ల కథాప్రేమికులకి చిరపరిచితమే. 20 వ శతాబ్దం లో ఎన్నదగిన కథా రచయితల్లో ఒకడైన ఈయన నిజానికి నాటకాలు,నవలలు రాసినప్పటికీ కథకుని గానే ఎక్కువ ప్రాచుర్యం పొందడం జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి.కథా రచయిత గా మామ్ ది ఒక విశిష్టమైన,ప్రత్యేకమైన బాణీ.ఆయన కథలు చాలా వరకు అనేక దేశాల్లో జరుగుతుంటాయి.అంటే ఇతివృత్తాలు అలా సాగిపోతాయి.అసలీయనకి సొంత దేశం ఏది అనే అనుమానమూ రాకపోదు.అంత సాధికారకం గా ఆ ప్రదేశాల్ని మన కళ్ళ ముందు ఉంచుతాడు.

ఆ నైపుణ్యం ఊరకనే రాలేదు.అనేక దేశాలు,ద్వీపాలు,ద్వీపకల్పాలు ఇలా ఎన్నో రకాలైన ప్రదేశాల్లో సంచరించాడు.నివసించాడు.నిరంతరం ప్రయాణాల్లోనే ఉన్నాడా ఈ మనిషి అనిపిస్తుంది.మనం ఇప్పుడు మ్యాప్ లో ఎక్కడుందా అని వెదుక్కునే చిన్న చిన్న ద్వీపాల్లో కూడా ఉన్నాడు.ఇక సముద్ర ప్రయాణాలు లెక్కలేదు.ఆ అనుభవాలు అన్నిటిని కథల రూపం లో మన ముందు పరిచి వెళ్ళిపోయాడు.మపాసా,చెకోవ్ తరువాత కథా రచయిత గా అంత పేరు సంపాదించుకున్నాడు.చెకోవ్ మాదిరిగా వైద్య విద్య అభ్యసించినప్పటికీ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు.బహుశా ప్రయాణాల మీద ఆసక్తి ఇంకా ఇతరత్రా కారణాల వల్ల అనుకుంటా బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి అనేక దేశాల్ని చుట్టివచ్చాడు.

సోమర్సెట్ మామ్ యొక్క కథాశైలి గొప్ప అలంకార భూషితమై ఉండదు. సామాన్యమైన రీతి లో,సాధ్యమైనంత ఎక్కువమంది అర్థం చేసుకునేలా ఉంటుంది.అయితే మానవ మనోసీమ ని విశ్లేషించడం లోనూ,చిన్న సంఘటన నుంచి కథ ని సృష్టించడం లోనూ,ఇతివృత్తాల్ని ఎంచుకోవడం లోనూ ఆయన కి తనదైన పద్ధతి ఉంది. కొన్ని కథల్లో విశ్లేషణ ఎక్కువ కనిపిస్తుంది.బ్రహ్మాండమైన,మతిపోయేంత ట్విస్ట్ లు చాలా కథల్లో మనకి కనిపించవు. అయితే కథ ముగిసినతర్వాత కొద్దిసేపు పఠిత అలా ఆలోచనలో పడిపోతాడు.అటువంటి మైమరపు కి గురి చేస్తాడు. కథ అంటే ఇదిగో ఇన్ని పేజీల్లో ఉండాలి అనే పట్టింపు కూడా మామ్ కి లేదు. కొన్ని కథలు అయిదు పేజీలు ఉంటాయి.కొన్ని పది పేజీల లోపు, ఇంకొన్ని ఇరవై పేజీలు లోపు ఉంటే కొన్ని నలభై పేజీలకి దగ్గరగా,ఇంకొన్ని అరవై పేజీలు దగ్గరగా ఉండేవి కూడా ఉన్నాయి.ఒక్క పేజీ నిడివి లో కూడా రాశాడు. అతని పాత్రలు ఎంత డిమాండ్ చేస్తే అంత మేరకు రాసుకుంటూ పోతాడు.      

సరే..ఆయన రాసిన కొన్ని కథల్ని చర్చించుకుందాము. "Vintage Maugham" అనే పేరిట ప్రచురించబడిన కథా సంపుటి నుంచి వీటిని తీసుకోవడం జరిగింది. మొత్తం దీనిలో 22 కథలు ఉన్నప్పటికీ కొన్నిటి గురించి మాత్రం ప్రస్తుతం ఇక్కడ మాట్లాడుకుందాం.

"Mackintosh" అనేది 38 పేజీల కథ. ఈ కథ నడిచే ప్రదేశం కొన్ని వందల మంది మాత్రమే ఉండే ఒక చిన్న ద్వీపం...ఈ ద్వీపం కూడా ఓ ద్వీపాల సమూహం లో ఉంటుంది.ఇంతకీ ఇది ఎక్కడ ఉందీ అని వెతికితే పసిఫిక్ మహాసముద్రం లో దక్షిణం గా ఉన్నది.ఆ ద్వీపం పేరు సమోవ కాగా దానికి సంబందించిన ప్రధాన అధికార కేంద్రం అపియా అనే పక్కనే ఉన్న మరో ద్వీపం లో ఉంటుంది.మరి ఇంతకీ దీని పాలకులు ఎవరయ్యా అంటే ఇంకెవరూ బ్రిటీష్ వారే..!

 అయితే ఇక్కడ పాలకునిగా చాలా ఏళ్ళ క్రితం ఓ గవర్నర్ ని నియమించారు ...ఆయన పేరు వాకర్. ఇక్కడ ఇతనే మకుటం లేని మహారాజు. ఈయనకి సహాయకునిగా  Mackintosh అనే యువకుడిని పంపిస్తుంది ప్రభుత్వం. తన అనుభవం లో ఎన్నో పాలనాపరమైన సామర్ధ్యాలు గడించానని ,ప్రత్యేకమైన పుస్తకాలు చదవాల్సిన అవసరం తనకి లేదని వాకర్ కొత్తగా వచ్చిన యువ అధికారికి గప్పాలు కొడుతుంటాడు. ఎందుకంటే కొత్తగా వచ్చిన యువ అధికారి ఇంగ్లండ్ నుంచి షిప్పుల్లో పుస్తకాలు తెప్పించుకుని చదువుతుంటాడు.  

ఆ ద్వీపం మొత్తం లో వీళ్ళు ఉండేదే పెద్ద భవనం.మిగతా నేటివ్ ప్రజలు చిన్నపాటి గుడిసెల్లో నివసిస్తూంటారు. ఒక స్థానిక వ్యాపారి ఉంటాడు ,అతని పేరు జెర్విన్.స్థానికుల్లో ఇతనికే కాస్త ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంటాయి.కథలో ఇతడిని Half-Caste అని సంబోధించడం కనబడుతుంది. కారణం ఇతని తండ్రి యూరోపియన్ కాగా తల్లి స్థానిక జాతీయురాలు. ఈ జెర్విన్ పాలక వర్గమైన బ్రిటీష్ వారికే విశ్వాసపాత్రత ని కలిగి ఉండడం కనిపిస్తుంది.స్థానికుల్ని అదుపు చేయడానికి నాటి వలస పాలకులు ఇలాంటివారిని ఎలా ఉపయోగించుకునేవారో ఈ పాత్ర ద్వారా తెలుస్తుంది.

సరే...యువ అధికారి కూడా సీనియర్ అధికారి అయిన వాకర్ కి బాగానే సహకరిస్తుంటాడు.అయినప్పటికీ వాకర్ ఆ కుర్ర అధికారిని ఏదో పేరు మీద ప్రతిదానికీ చిన్నబుచ్చుతుంటాడు. తను ఇచ్చే ఏ సలహా ని లక్ష్యపెట్టడు సరిగదా ఎవరిని ఏ విధం గా చూడాలనేది నాకు తెలుసు అని అంటూ స్థానికుల్ని ఇష్టం వచ్చినట్లు అదిలించి పనిచేయిస్తుంటాడు. తనకి ఎవరు ఎదురు తిరిగినా వాకర్ కి నచ్చదు. ఆ ద్వీపం లో సువార్త చెప్పడానికి వచ్చిన క్రైస్తవ మిషనరీస్ ఏదో విషయం లో తను చెప్పినట్లు వినలేదని స్థానికులు వీరికి సహకరించకుండా చేస్తాడు.దెబ్బతో వాళ్ళు దిగి వస్తారు. అలా ఆ ద్వీపానికి తానే తండ్రిని అని మిగతావాళ్ళు అంతా పిల్లల్లా ఉండాలని వాకర్ చెబుతాడు.

ఇదిలా ఉండగా ఆ ద్వీపం చుట్టూరా రోడ్డు వేయడానికి  బ్రిటీష్ ప్రభుత్వం వెయ్యి పౌండ్ల ని మంజూరు చేస్తుంది. స్థానిక నాయకుడు మనూమ ని పిలిచి రోడ్డు వేయడానికి అందరూ రావాలని అందుకు గాను మొత్తం వంద పౌండ్లు ఇస్తానని చెబుతాడు.అయితే ఆ నాయకుని కొడుకు తెలివైన వాడు. ప్రభుత్వం చాలా నిధులు మంజూరు చేసిందని కాని వాకర్ తమని మోసం చేస్తున్నాడని మనం చెప్పిన కూలీ ఇవ్వనంతవరకు పనికి వెళ్ళవద్దని అందరి తో చెబుతాడు.దీంతో వాకర్ ఒక మాయోపాయం పన్నుతాడు.పక్క ఊరి వారిని పిలిపించి వాళ్ళకి విందు భోజనాలు,సారాయి పోయించి వారితో పనిచేయించుకోవడం మొదలుపెడతాడు. దీనితో స్థానికులు ఉపాధి కోల్పోయినా ఆ పక్క ఊరి వారితో గొడవ పెట్టుకోవడానికి సాహసించరు.కారణం వారు కూడా సొంత తెగ వారే గదాని.సరిగ్గా ఆ సెంట్ మెంట్ నే వాకర్ ఉపయోగించి మొత్తానికి స్థానికుల్ని కాళ్ళ బేరానికి తెస్తాడు.దానితో ఆ నాయకుడి కొడుకు కక్ష పెంచుకుంటాడు.

ఈ విషయం గ్రహించిన యువ అధికారి,ఒకసారి ఆ నాయకుని కొడుకు ఆరోగ్యం బాగోలేక తనవద్దకి వచ్చినప్పుడు రివాల్వర్ బుల్లెట్స్ ని అందుబాటు లో ఉండేలా పెడతాడు.వాటి సాయం తో అతను ఒకరాత్రి పూట వాకర్ గుర్రం మీద వస్తుండగా కాల్పులు జరుపుతాడు.దీనితో వాకర్ గాయపడి మంచం మీద కొన్ని గంటలు ఉండి మరణిస్తాడు.చివరి క్షణాల్లో యువ అధికారి Mackintosh కి కొన్ని నిజాలు తెలుస్తాయి. సీనియర్ అయిన వాకర్ పెద్దగా కూడబెట్టినది ఏమీ లేదని,నిస్వార్ధపరుడైన గవర్నర్ అని తెలుసుకొని తాను తుపాకి తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు.ఇదీ స్థూలం గా కథ. దీని ద్వారా రచయిత చెప్పదలిచినది ఏమిటంటే వలస పాలకుల్లో నిస్వార్ధులు ఉన్నారు.వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించారు అనేది.ఈ కథ లో ఆ ద్వీపాల్లో ఉండే వారి జీవిత విధానాల్ని కళ్ళకి కట్టినట్లు గా చూపించాడు. సముద్రం నిత్య జీవితం లో పోషించే పాత్ర అర్థమవుతుంది.    

  ఇక మరో కథ ని చూద్దాము. దానిపేరు The Letter. ఈ కథ మామ్ కి బాగా పేరు తెచ్చిన కథ ల్లో ఒకటి. మొత్తం 35 పేజీల్లో సాగింది.ఇది సింగ పూర్ నేపథ్యం లో ఉంటుంది. ఇక్కడి సామాజిక,సాంఘిక విషయాల్ని స్పృశించాడు రచయిత. అలాగే అక్కడికి వలస వచ్చిన మలయా,చీనీ,తమిళ ప్రజల గూర్చి చెబుతాడు.ఇక యూరోపియన్ల గూర్చి చెప్పేదేముంది.ఆ చుట్టుపక్కల టీ ఎస్టేట్ యజమానులు వారే. అలాంటి టీ ఎస్టేట్ యజమాని మిస్టర్ క్రాస్బి ఓ రోజు లాయర్ జాయిస్ వద్దకి వస్తాడు.తన భార్య హామండ్ అనే వ్యక్తిని కాల్చి చంపిందని దానికి కారణం అతని విపరీత ప్రవర్తనే అని చెబుతూ ఆ కేసు నుంచి ఆమెని రక్షించవలసింది గా కోరుతాడు. వీరు ఇరువురు కుటుంబ స్నేహితులు కూడా.

అయితే జాయిస్ వద్ద పనిచేసే సహాయకుడు,సింగ పూర్ యువకుడు అయిన వాన్ చెన్ సెంగ్ తనకి స్థానిక స్త్రీ ఒకామె ఉత్తరం ఇచ్చిందని కేసుకి సంబందించిన కొన్ని రహస్యాలు దానిలో ఉన్నాయని చెబుతాడు.దాని అసలు ప్రతి ని సంపాదించడానికి ఎన్నో బజార్లు దాటి ఓ మారుమూల గది లో ఉన్న వ్యక్తి కి కొంత పైకం ఇచ్చి మొత్తానికి సంపాదించుతారు.

తీరా ఈ ఉత్తరం ద్వారా కొన్ని ఆధారాల్లోకి వెళితే తేలింది ఏమిటంటే హామండ్ అనే వ్యక్తి తో క్రాస్బీ భార్య కి అక్రమ సంబంధం ఉందని. అతను ఇటీవల ఈమె ని నిర్లక్ష్యం చేసి స్థానిక స్త్రీ తో కలిసి ఉంటున్నాడని అసూయ తో కాల్పులు జరిపిందని తేలుతుంది.అయితే చివరకి క్రాస్బీ భార్య ని ఎలా దీని నుంచి ఆ లాయర్ జాయిస్ కాపాడాడు అనేది సస్పెన్స్ లో ఉంటేనే మంచిది.ఇది ఒక క్రైం థ్రిల్లర్ లా సాగుతుంది.    

 ఇక ఆ తర్వాత Salvatore అనే కథ ని పరిశీలిద్దాం.ఇది అయిదు పేజీలు నిడివి లో ఉన్నది. ఇటలీ కి దగ్గర లో ఉన్న ఓ దీవి లోని మత్స్యకార యువకుని జీవితాన్ని చిత్రించే కథ ఇది.మనం ముందే చెప్పుకున్నట్లు మామ్ కొన్ని కథల యొక్క ముగింపు ని సాదాసీదా గా వదిలేస్తాడు.అలాంటి వాటిలో ఇది ఒకటి.మరి దీనిలో ఏమి చిత్రించాడు అంటే...యవ్వనం లో ప్రేమ లో పడ్డ మనిషి భాగస్వామి తో రాబోయే రోజులు గురించి ఏవేవో కలలు కంటూ ఉంటాడు.ఆ మనిషి తనకి దొరకదు...కాని ఇంకెవరి తోనో జీవితం అలా ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది అనేది దీనిలోని సారం.నేపుల్స్ సమీపం లో నివసించే Salvatore అనే యువకుడు జాలరి కుటుంబానికి చెందినవాడు. అతను గ్రాండ్ మెరీనా కి చెందిన ఓ యువతి ని ఎంతగానో ప్రేమిస్తాడు.ఆ దేశ చట్టాల ప్రకారం తప్పనిసరిగా మిలటరీ సర్వీస్ లోకి వెళ్ళవలసి వస్తుంది.దానితో అతను విచారం గా దానిలో చేరి దూర ప్రాంతాలకి వెళ్ళిపోతాడు.వెనిస్,బారి,చీనా ఇలా ఎన్ని ప్రాంతాలకో విధులలో భాగం గా ప్రయాణం చేస్తాడు.

ఈ విధుల నిర్వహణ మూలంగా ఎముకల వ్యాధికి గురవుతాడు.వైద్యం చేయించుకొని కొద్దిగా నయం అయినతర్వాత సొంత ఊరికి తిరిగివస్తాడు.ప్రేమించిన యువతి కోసం చూస్తాడు గానీ ఎక్కడా కనపడదు. తల్లిని అడిగితే ఆమె చెబుతుంది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిందని..!కొన్ని రోజులు గడిచిన తర్వాత తల్లి దండ్రుల వత్తిడి వల్ల ఇంకో యువతి ని పెళ్ళాడుతాడు. ఆమె ని పెళ్ళి చేసుకోవడం వల్ల చేపల వ్యాపారానికి కావలసిన డబ్బు సమకూరుతుంది.అది కూడా తల్లిదండ్రుల ఆలోచనే.చేపలు పడుతూ ఆ తర్వాత జీవన ప్రయాణం లో సాగిపోతుంటాడు. 

ఇద్దరు పిల్లలు పుడతారు.ఇతనికి ఎముకల వ్యాధి ఎక్కువ అవుతుంది.ఇదివరకటిలా పని చేయలేకపోతుంటాడు. కనుక సముద్రం ఒడ్డున కూర్చొని కాలం గడుపుతూ,పిల్లలకి స్నానం చేయిస్తూ ఉంటాడు. అక్కడకి వచ్చిన టూరిస్ట్ లు ఇతడిని చూసి పని పాటా లేని బద్దకస్తుడైన ఇటాలియన్ జాలరి లా ఉన్నాడు అనుకుంటూ ఉండగా కథ సమాప్తమవుతుంది.      

   ఆ తర్వాత ఇంకో కథ లోకి వద్దాము.దీని పేరు Gigolo and Gigolette. కొంత వరకు పెద్దలకి మాత్రమే తరహా వంటి ఇతివృత్తం అని చెప్పాలి.ఒక మగ వేశ్య ఇంకా అతని భార్య కి సంబందించిన కథ. అది ఒక మహా నగరం లోని కిక్కిరిసిన బార్. అక్కడికి వచ్చిన వాళ్ళ లో రకరకాల దేశాల వారు ఉన్నారు.ఆ బార్ లో ప్రస్తుతం ఉన్న ఎట్రాక్షన్ ఏమిటంటే స్టెల్లా అనే ఆమె చేసే విన్యాసం.అది ఏమిటంటే చాలా ఎత్తు నుంచి అగ్ని జ్వాలలు ఎగిసే స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకుతుంది.ప్రతి రోజు రెండు షోలు ఉంటాయి. మంచి ఆదాయం వస్తూన్నది. ఈమె భర్త సిడ్ కాట్ మన్.ఇతను ఈ పనిలో ఆమె కి సహకరిస్తూంటాడు.

బార్ లో కలిసిన కొంతమంది మాటల వల్ల స్టెల్లా నిరాశ కి గురయి నేను ఇక ఈ పని చేయను.నా ఆరోగ్యం పాడవుతుంది అంటుంది.భర్త సిడ్ కాట్ మన్ ఆమెని బలవంతపెట్టడు కాని ఆ తర్వాత జీవితం ఎలా గడుస్తుందో వివరిస్తాడు.ఎందుకంటే అప్పటికే వారు ఖరీదైన జీవితానికి అలవాటు పడి ఉంటారు. గతం లో పెళ్ళి కాకమునుపు సిడ్ కాట్ మన్ మధ్య వయసు ఇంకా వయసు మళ్ళిన స్త్రీల కి తన శృంగారసేవలను అందించి మంచి ఆదాయం పొందేవాడు.స్టెల్లా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన యువతి.స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ గా ఉండేది.ఇద్దరికీ మనసులు కలిసి పెళ్ళి చేసుకున్నారు.

ఈ కారణం చేత అతని యొక్క గిరాకి తగ్గింది.స్టెల్లా తనకి ఉన్న అరుదైన టాలెంట్ తో ఈ డైవింగ్ వృత్తిని చేపట్టింది.కాంట్రక్ట్ లు కుదిరించడం,ఇంకా ఇతరత్రా సాయం చేస్తూ సిడ్ కాట్ మన్ ముందుకు సాగుతున్నాడు.ఇప్పుడు ఈ తరుణం లో ఈ డైవింగ్ పనిని వదిలేస్తే ఎలా అని ఇరకాటం లో పడతాడు.తాము ఏ ఏ పనులు చేస్తే ఎంత సంపాదించవచ్చో అంచనా వేసుకుంటారు.ఇక చివరకి స్టెల్లా అంటుంది,లేదులే మళ్ళీ నేను నా పాత పని ...ఆ డైవింగ్ నే కొనసాగిస్తాను అంటుంది. అంతటితో కథ ముగుస్తుంది. నిజానికి ముగింపు ఈ కథ లోనూ సాదా సీదా గానే ఉంది.అయితే కథనం లో భాగం గా రచయిత మానవ సంబంధాల్ని అనేక కోణాల్లో చిత్రించి వదిలేస్తాడు.మంచి చెడు లాంటి తీర్పుల్ని ఎక్కడా ఇవ్వడు.

సరే...మిగతా కథల్ని అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ చర్చించుకుందాం.సోమర్సెట్ మామ్ గురించి చెప్పాలంటే తన కాలం లో ఎక్కువ సంపాదించిన రచయిత గా చెప్పాలి.ముఖ్యం గా 1930 ల్లో..! మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో రెడ్ క్రాస్ అంబులెన్స్  కార్ప్స్ లో పనిచేసినపుడు మామ్ ,ఎర్నెస్ట్ హెమింగ్వె కి సహోద్యోగి గా ఉన్నాడు.1938 లో మన దేశం లోని రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు.ఈ అనుభవాల్ని Razor's Edge (1944) అనే నవల లో పొందుపరిచాడు. ఆయన వైవాహిక జీవితం అర్ధాంతరం గా ముగిసింది. జీవిత చరమాంకం లో ఇద్దరి తో హోమోసెక్సువల్ సంబంధాలు పెట్టుకున్నాడు.అదేమిటో గాని చాలామంది పాశ్చాత్య రచయితలు వాల్ట్ విట్మన్,ఆస్కార్ వైల్డ్,డిహెచ్.లారెన్స్ , ఇ.ఎం.ఫారెస్టర్,బాల్జాక్,థోరో,టెన్నెసి విలియంస్, లాంటి వారందరూ ఇలాంటి సంబంధాల్ని కొనసాగించారు. ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన జేంస్ బాండ్ పాత్ర కి సోమర్సెట్ మామ్ నే ప్రేరణ అని చెబుతారు.25,జనవరి,1874 లో లండన్ లో జన్మించిన సోమర్సెట్ మామ్ 1965 లో డిసెంబర్ 16 నాడు పారిస్ లోని తొమ్మిది ఎకరాల స్వగృహం లో మరణించాడు. 

                                            --- మూర్తి కెవివిఎస్

(Published in Nava Telangana Daily, 2-8-2021) 

No comments:

Post a Comment