Monday, June 6, 2022

హెన్రీ డేవిడ్ అరణ్య కుటీరం, "వాల్డెన్"

 


 అమెరికన్ రచయితల్లో హెన్రీ డేవిడ్ థోరో కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.తాత్వికునిగా,ప్రకృతి ప్రేమికునిగా ఇంకా జీవితం తో ప్రయోగం చేసిన విన్నూత్న ఆలోచనావేత్త గా పుస్తక ప్రేమికులు ఎంతగానో అభిమానిస్తారు. నాగరిక జీవనం నుంచి సెలవు తీసుకుని కొన్నాళ్ళపాటు ఒంటరిగా ఏ అడవి లోనో,అత్యంత తక్కువ అవసరాలతో,ప్రకృతి ఒడి లో ఉండిపోతే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిన థోరో దాన్ని అమల్లో పెట్టి చూశాడు.ఆ సాధకబాధకాలతో కలిపి ఒక పుస్తకాన్ని కూడా రాశాడు.దాని పేరే "వాల్డెన్".

1845 లో జూలై4 న అడివి లోని ఓ చిన్న కేబిన్ లో ప్రవేశించి సెప్టెంబర్6, 1847 దాకా దాంట్లో ఒంటరిగా నివసించాడు.అంటే రమారమి 2 సంవత్సరాల 2 నెలలు పాటు వాల్డెన్ అనే చెరువు పక్కన తాను స్వయం గా నిర్మించుకున్న చెక్క కెబిన్ లో రాత్రింబవళ్ళు అక్కడి చెట్టు పుట్టలతో పశుపక్ష్యాదులతో క్రిమికీటకాలతో కలిసిమెలిసి జీవించాడు.ఎవరి అవసరం లేకుండా సాధ్యమైనంత సామాన్యం గా మనిషి జీవించలేడా అని ఈ ప్రయోగం చేశాడు.

ఈ ప్రయోగం చేయడం వెనుక థోరో మీద ఆయన స్నేహితుడైన మరో రచయిత రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ యొక్క ప్రభావం లేకపోలేదు. నిజానికి థోరో వేసుకున్న ఆ చిన్న గుడిసె లేదా కేబిన్ ఉన్న స్థలం ఎమర్సన్ దే. తన స్వహస్తాలతో ఆ చిన్న నివాసాన్ని తయారు చేసుకున్నాడు.దానికైన ఖర్చు ఆ రోజుల్లో రమారమి 28 డాలర్లు.దానికోసం కొనుక్కున్న చెక్కలు,ప్లాస్టర్లు,మేకులు,కిటికీ ఇలా అన్నిటికీ ఎంత అయిందో చాలా వివరం గా రాసుకున్నాడు.

తాను అనుభవించిన రోజువారి జీవితాన్ని నమోదు చేశాడు.రకరకాల మొక్కలు,జంతువులు,కీటకాలు,పక్షులు వాటి కదలికలు గురించి లోతుగా రాశాడు.అంతకు ముందు తనకి తెలియని అనేక చిన్న చిన్న జీవుల్ని కనిపెడతాడు.బీన్స్ తోట ని వేసుకుంటాడు.దాంట్లో కాసేపు పనిచేసుకుంటాడు.మధ్యానం నుంచి చదువుకోవడం,రాసుకోవడం చేస్తుంటాడు.ఇంత అడివి లో ఉన్న కొన్ని శబ్దాలు వినిపిస్తుంటాయి,అక్కడికి కొన్ని మైళ్ళ దూరం లో రైలు మార్గం వేస్తుంటారు.      

రైలు మార్గం వేయడానికి వచ్చిన ఐరిష్ శ్రామికులు,ఆ మార్గం గుండా తమ పల్లెలకి వెళ్ళే రైతులు అప్పుడప్పుడు థోరో ని కలిసి ఎందుకు ఈ అడివి లో ఒంటరి గా ఉంటున్నారు లాంటి ప్రశ్నలు వేస్తుంటారు.తన కేబిన్ ముందు ఉన్న వాల్డెన్ చెరువు ఏ రుతువు లో ఎలా కనిపిస్తుంది,అక్కడ పేరుకునే మంచు ఎప్పుడు ఎలా ఉంటుంది అంతా రికార్డ్ చేశాడు.నల్ల చీమలు,ఎర్ర చీమలు వాటి జీవన విధానం, చేసే యుద్ధాల్ని ఓ మూడు పేజీలు వర్ణిచాడు. థోరో తో ఉన్న సమస్య ఏమిటంటే ప్రతిదాన్ని చాలా లోపలికంటా వెళ్ళి చెబుతుంటాడు.గ్రీక్,రోమన్ గాథల దగ్గరనుంచి వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన వరకు అదీ ఇదీ అని లేకుండా పరమ విస్తారం గా రాశాడు.ఆసియా,ఆఫ్రికా,యూరపు అన్ని ఖండాల కవుల, తాత్వికుల గురించి సందార్భానుసారం గా చెబుతుంటుంటాడు. 

పనిలో పనిగా భగవద్గీత గురించి,వేదాల గురించి కూడా ప్రస్తావించాడు.ఈ వాల్డెన్ పుస్తకం లోని అంశాలు 17 రకాలుగా విభజించారు.చదువరుల సౌకర్యం కోసం.పాతతరం కి చెందిన శైలి కావడం వల్లనూ,అనేక పారమార్థిక,లౌకిక విషయాలనూ కలిపి రాయడం వల్లనూ ఈ పుస్తకాన్ని ఓ డైరీ మాదిరి గా చదువుదాం అనుకుంటే అంత తొందరగా ముందుకి పోనివ్వదు.ఆ కేబిన్ లో ఉన్నప్పుడు విన్న శబ్దాలను,ఒంటరితనం లోని సౌందర్యాన్ని,తన వద్దకి వచ్చిన మనుషుల గురించి,తను పెంచిన బీన్స్ తోట గురించి,ఇతరుల్ని బాధించి ఆనందించే పొరుగు వారి గురించి,వివిధ రుతువుల్లో మారే ప్రకృతి గురించి,పక్షుల గురించి ముఖ్యం గా వాల్డెన్ చెరువు గురించి ఇలా అనేక అంశాల గురించి ఈ పుస్తకం లో అతి సూక్ష్మ చిత్రణ చేశాడు.

థోరో మొత్తం తన జీవితకాలం లో రాసిన వ్యాసాలు,కవితలు ఇతర పుస్తకాలు అన్నీ కలిపి 20 వాల్యూం ల వరకు ఉంటాయి.బానిస చట్టాల కి వ్యతిరేకం గా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు.పౌరులకి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛ ఎప్పుడూ ఉంటుందని ప్రభోదించాడు.సివిల్ డిసొబిడియన్స్ అనే మాట కి పర్యాయపదం గా ఈయన పేరు ని చెబుతారు.లియో టాల్స్ టాయ్,గాంధీజీ,డా.మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు హెన్రీ డేవిడ్ థోరో నుంచి ప్రేరణ పొందారు. 

280 పేజీలు ఉన్న ఈ పుస్తకం లో ఇంకా ఎంత చరిత్ర ఉందో చదివిన వారికే తెలియగలదు.ఒక ఎన్సైక్లోపీడియా మాదిరిగా ఎన్నో విషయాల్ని ప్రస్తావించాడు. మొదట్లో ఈ పుస్తకం 2000 కాపీలు వరకు అమ్ముడైంది.ఆ తర్వాత కాలక్రమేణా అనేకమంది రివ్యూ ల ద్వారా ప్రఖ్యాతి పొంది అమెరికన్ క్లాసికల్ సాహిత్యం లో ఒక మణిపూస గా పేరుపొందింది. చాలా ముద్రణలు పొందింది.ముఖ్యంగా రాబర్ట్ ఫ్రాస్ట్ దీని గురించి రాయడం తో అందరి దృష్టి వాల్డెన్ పై ప్రసరించింది.  1968 లో దీని ఆధారం గా జొనాస్ మెకాస్ అనే సినిమా వచ్చింది.     

To be a philosopher is not merely to have subtle thoughts,nor even to found a school,but to love wisdom as to live according to its dictates,a life of simplicity,independence,magnanimity and trust." అంటూ తాత్వికత కి తనదైన భాష్యాన్ని చెప్పి దానికి అనుగుణం గా జీవించిన హెన్రీ డేవిడ్ థోరో బోస్టన్ కి ఇరవై మైళ్ళ దూరం లో ఉన్న Concord,Massachusets లో జన్మించి,ఎక్కువ కాలం అక్కడే జీవించి మరణించారు.

----- మూర్తి కెవివిఎస్ (7893541003)

(Printed in Nava Telangana Daily,6-6-2022)

No comments:

Post a Comment