Tuesday, May 2, 2023

"కోరాపుట్ అండ్ అదర్ స్టోరీస్ "


 "కోరాపుట్ అండ్ అదర్ స్టోరీస్ " అనే ఈ ఆంగ్ల కథాసంపుటిని చదవడం ఒక మరపురాని అనుభవం  లా మిగిలిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. గౌరహరి దాస్ గారు ఒరియా భాష లో రాసిన కథల్ని ఇలా ఆంగ్లభాష లోకి సరోజ్ మిశ్రా,గోప నాయక్ అనువదించారు. ఇంతకుముందు కూడా ఓ పుస్తకం వచ్చింది.దాని పేరు "ద లిటిల్ మాంక్ అండ్ అదర్ స్టోరీస్". పత్రికా సంపాదకునిగా,కథకునిగా,నాటక రచయితగా ,కాలమిస్ట్ గా గౌరహరి దాస్ గారు ఒరియా పాఠకులకు ఎంతో తెలిసినవారు,ప్రతి ప్రక్రియ లోనూ తనదైన ప్రత్యేక శైలి కలిగినవారు.

కోరాపుట్ అనే పేరు వినగానే ప్రకృతి దృశ్యాలు మన కళ్ళముందు మెదులుతాయి.అలాగే అక్కడి శ్రామిక జనుల వెతలూ గుర్తుకువస్తాయి.ఈ పుస్తకం లో మొత్తం 15 కథలు ఉన్నాయి.అవి అన్నీ కూడా వివిధ ఇతివృత్తాలతో కూడి ఉన్నాయి.మొదటి కథ కోరాపుట్ తో సంబంధం ఉన్న కథ.కొన్ని కథల గురించి ముచ్చటించుకుందాము.గౌరహరి దాస్ గారి కథల్లో ఒక మేజిక్ ఉంటుంది.ఏ ఒక్క కథ ఇంకో కథ లా అనిపించదు.ప్రతి చిన్న విషయం లోనూ మన కంటికి కనబడని ఏదో కొత్త కోణం ని మన ముందు నిలబెడతారు.

కథా వ్యూహం కూడా పఠిత ని నిలవనివ్వదు.చివరిదాకా వెళ్ళు అంటుంది.కొద్దిసేపటిలో కథ అవబోతుంది అనుకున్నప్పుడు "ఎండింగ్" తెలిసిపోయిందిలే అనిపిస్తుంది.కాని చివరి వాక్యాలకి వచ్చేసరికి ఊహించలేని ఒక ట్విస్ట్ ఇచ్చి మన పెదాలపై నవ్వుని తెప్పిస్తారు.ఎంతో సాధనతో,ఆలోచనా పటిమ తో గాని అలాంటి విద్య వస్తుంది.కొన్ని ముఖ్యమైన దృశ్యాల్ని ,మానసిక పరిస్థితుల్ని వర్ణిచేటప్పుడు మనల్ని పరకా ప్రవేశం చేయిస్తారు ఆ పాత్రల్లోకి.    

మొదటి కథ కోరా పుట్ గురించి చెప్పుకుందాం.పూర్ణిమ అనే అమ్మాయి హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ లో భువనేశ్వర్ నుంచి కోరా పుట్ వస్తూంటుంది.అక్కడ ఉన్నత అధికారిగా గా పనిచేసే ప్రశాంత్ అనే వ్యక్తిని ఈమె త్వరలో పెళ్ళి చేసుకోవల్సిఉంది. కోరా పుట్ లో రైలు దిగి,ప్రభుత్వ కార్యాలయాలు ఉండే జేపూర్ కి వెళ్ళడానికి టాక్సి ఎక్కుతుంది. విధివక్రించి ఈమెని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు.లోపల ఎక్కడో ఉండే ఓ గ్రామం లో ఈమె ని ఉంచుతారు.పారిపోవడానికి దారి తెలియదు.అక్కడ ఉండే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా ఇంకా కొంతమంది ప్రజలు ఎలా జీవిస్తున్నారో అర్థమవుతుంది.

తాను పెళ్ళాడబోయే ప్రశాంత్ కూడా అవినీతి అధికారుల్లో ఒకడని తెలిసి హతాశురాలవుతుంది.అతని వద్ద నుంచి డబ్బు,కొన్ని ప్రయోజనాల్ని పొందిన తర్వాత గాని తీవ్రవాదులు ఆమెని విడిచిపెట్టరు.ఈ కథలో ఒరియా ,ఆంధ్రా బోర్డర్ లోని గిరిజనుల స్థితిగతుల్ని ,జీవనాన్ని కళ్ళకి కడుతుంది.కోరాపుట్ అందచందాల్ని వివరిస్తూంది.

"ఒన్స్ ద స్కై వజ్ బ్లూ" అనేది మరో విన్నూత్నమైన కథ. ఒక బంగ్లాదేశీ శరణార్ధ కుటుంబం ఒరిస్సా రాష్ట్రం లో ఎదుర్కునే వెతల్ని దీనిలో చిత్రించారు.షిరాజ్ ఇంకా టుటుల్ చిన్ననాటినుంచి స్నేహితులు.పై చదువు కోసం టుటుల్ వేరే రాష్ట్రం వెళ్ళిపోతాడు. షిరాజ్ మాత్రం తండ్రికి హెల్ప్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న ఆ షాప్ లోనే కాలం గడుపుతుంటాడు.ఒక పెద్ద మాల్ ఆ దాపునే నిర్మించబడుతుంది. వాళ్ళు తమకి ఉన్న అర్ధ,అంగ బలం తో ఆ దగ్గరే ఉన్న చిన్న చిన్న షాపుల్ని కూడా కలిపేసుకుంటారు.నిజానికి అది ప్రభుత్వ స్థలం అయినప్పటికి చిన్న షాపుల యజమానులు ఏమీచేయలేకపోతారు. అప్పుడు టుటుల్ అది చూసి తన తండ్రిని హెల్ప్ చేయమని కోరుతాడు. తను ఆ చుట్టుపక్కల పేరున్న మనిషి.

ఇంత పెద్ద మాల్ ముందు అలాంటి చిన్న షాప్ లు ఉంటే ఎలా చెప్పండి. కావాలంటే మా షాప్ లో సేల్స్ మేన్ గా ఉద్యోగం ఇస్తాం అంటారు.చివరికి మాస్క్ వేసుకుని పిల్లల్ని ఎంటైర్టైన్ చేసే పని కల్పిస్తారు. ఒకప్పుడు అతి చవకగా దొరికే కూరగాయల్ని,కిరాణా సామాన్లని వాటిని ఎలా రేట్లు పెంచి అమ్ముతారు ,హైప్ చేయడానికి రకరకాల ఇంగ్లీష్ పేర్లని వాటికి ఎలా పెడతారు అనేది దీనిలో బాగా వివరించారు. మార్కెట్ ఎకానమీ లో పెద్దచేప చిన్న చేపల్ని మింగే పద్ధతి అంతర్లీనంగా ఉంటుందనే సత్యం మనకి తెలుస్తుంది.  

"ద మిరేజ్" అనే కథ రాజకీయుల్ని ఆశ్రయించి మనుగడ సాగించే గూండాల జీవితాల్ని చిత్రించింది.పన్ను అనే గూండా...ఆ చుట్టుపక్కల 12 గ్రామాలకి హడల్.ఎంతో జాగ్రత్తగా ప్రత్యర్థుల్ని మట్టి గరిపించే తను,ఒక యువతి పెట్టిన చిన్న పరీక్ష ని సవాలుగా తీసుకుని ,పాములున్న చెరువు లో కి దిగి తెల్ల కలువపూలు కోస్తూ విషనాగులు కి బలి అవుతాడు.ఈ కథ మొత్తం మనసు చేసే గారడిని మన ముందు పెడుతుంది.గ్యాంగ్ స్టర్ ల ఆలోచనా విధానాన్ని సూక్ష్మంగా వర్ణించారు గౌరహరి దాస్ గారు. పన్ను జీవితగమనాన్ని బాగా వాస్తవానికి దగ్గరగా చిత్రించారు.

"హేండ్ రైటింగ్" అనే కథ లో ఒక ఉపాధ్యాయుడు తన దగ్గర చదివిన ఇద్దరు విద్యార్థుల జీవితాల్ని గమనించి ఆశ్చర్యపోతాడు.స్కూల్ లో ఎంతో మంచిగా చదివి తన ఫేవరేట్ స్టూడెంట్ గా ఉండే ఓ పిల్లాడు పెద్ద పెరిగి ఉన్నత అధికారి అయ్యి సెక్రటేరియట్ లో ఉంటాడు.ఈ మేస్టారికి అవసరం పడి వెళ్ళగా కాయితం ఇచ్చి వెళ్ళండి అంటాడు,తర్వాత పట్టించుకోడు. నీ చేతిరాత బాగోదురా అని ఎప్పుడూ స్కూల్ లో తిట్టే మరో స్టూడెంట్ పెద్దయి కండక్టర్ అవుతాడు.కాని మేస్టారి పర్స్ పోయినప్పుడు మానవతా దృక్పథం తో తానే చార్జ్ పెట్టుకుని తాను పాత విద్యార్థిని అని గుర్తుచేస్తాడు. కాబట్టి చిన్నప్పుడు బాగా చదివేవాళ్ళందరికి గొప్ప హృదయం ఉంటుందని ఊహించుకోవడం తప్పని మేస్టారికి తెలుస్తుంది.

 'వేర్ హేజ్ సుదాం జెనా గాన్" అనే కథ, విదేశీ మదుపుదారులు ఎలా దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటారు అనే విషయాన్ని వివరిస్తుంది.గరుడా అనే టివి కంపెనీ ఎలా విదేశీ నిధుల్ని సంపాదిస్తుంది,తన కార్యకలాపాల్ని విస్తరిస్తుంది చివరికి నిర్దయ గా ఉద్యోగుల్ని ఎందుకు తొలిగిస్తుంది అనే ప్రక్రియ ని తెలుపుతుంది.ఆ సంస్థ లో ప్యూన్ గా పనిజేసే సుదాం కి అసలు విదేశీ నిధులు ఎందుకు తీసుకోవాలి,మనకి ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది ,విదేశీయుల అవసరం లేకుండా మనం వ్యాపారం చేయలేమా ఇలాంటి సందేహాలు వస్తుంటాయి.

ఇవన్నీ ఎంతో కొంత తెలిసేసరికి సుదాం ని ఉద్యోగం నుంచి తొలిగిస్తారు.చివరన ఓ ట్విస్ట్ కూడా ఉంటుంది. గ్లోబలైజేషన్ అనే పేరు ఎక్కడ ఎత్తకుండా చాలా సింపుల్ సన్నివేశాలతో పెద్ద కార్పోరేట్ లు సైతం ఎలా తిప్పలు పడుతుంటాయో చక్కగా వర్ణించారు. ఇంకా మిగిలిన కథలు దేనికి దానికే ప్రత్యేకత కలిగినవి.ఒరియా సమకాలీన కథా సాహిత్యం లో వస్తోన్న అనేక మార్పుల్ని మనం ఈ కథాసంపుటి ద్వారా తెలుసుకోవచ్చు.

----- మూర్తి కెవివిఎస్   


     

No comments:

Post a Comment