Monday, April 25, 2022

హార్పర్ లీ రాసిన "టు కిల్ ఏ మాకింగ్ బర్డ్" (నవల)

 హార్పర్ లీ కలం నుండి వెలువడిన "టు కిల్ ఏ మాకింగ్ బర్డ్" అనే నవల గురించి తెలుసుకోవడం అంటే అమెరికా లోని అలబామా రాష్ట్రం లో ఉన్న మేకోంబ్ అనే  ఓ చిన్న పట్టణం కి వెళ్ళడం,అక్కడి నల్లజాతి ప్రజలపై జరిగిన వివక్షాపూరిత సంఘటనల్ని తెలుసుకోవడం.అంతేకాదు ఒక శ్వేత జాతీయుడైన లాయర్ తన సమకాలీన పద్ధతుల్ని కాదని నల్ల జాతీయుని కోసం న్యాయపోరాటం చేసినందుకు తోటి శ్వేతజాతీయుల నుంచి ఎదుర్కున్న వ్యతిరేకత ని గుర్తుచేసుకోవడం. నిజానికి మేకోంబ్ అనే పట్టణం పేరు కాల్పనికమైనదే అయినప్పటికీ అక్కడి సంఘటనలన్నీ నాటి అమెరికా లో ముఖ్యం గా దక్షిణాది ప్రదేశాల్లో నిత్యకృత్యం గా జరిగినవే.

ఈ నవల 1960 లో ప్రచురితమైనది.అయితే కథ మొత్తం 1933-35 మధ్య కాలం లో జరుగుతూంటుంది.రచయిత్రి హార్పర్ లీ తాను పుట్టిన మన్రోవిల్లే (అలబామా) ప్రాంతం లో జరిగిన అనేక సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ నవల ని నిర్మించింది. దీనిలోని పాత్రలన్నీ నాటి అమెరికా సమాజం లోని వాస్తవాల్ని మనముందు కళ్ళముందు చూపెడతాయి.నల్లజాతి వివక్ష ఆనాటి సంఘం లో ఎంత ఘోరం గా ఉండేదో ఈ నవల లో తెలుసుకోవచ్చు.అయితే కారుణ్యం తో పాటు ఈ రచన లో హాస్యాన్ని ఇంకా సంస్కరణ అభిలషత్వాన్ని రచయిత్రి చక్కని శైలి లో అందించారు.   

అసలు మాకింగ్ బర్డ్ అనే పేరు ని రచయిత్రి ఎందుకని టైటిల్ లో పెట్టడం జరిగింది అంటే...ఆ పక్షి ఆ దక్షిణాది అలబామా ప్రాంతం లో చాలా సాత్వికమైన,అమాయకం గా సంగీతం పాడుతూ అందర్నీ అలరించే మంచి పక్షి గా పేరెన్నికగన్న ప్రాణి.దాన్ని అందరూ ప్రేమ తో చూస్తారు.అయితే అలాంటి మంచి ప్రాణి ని సైతం చంపే మనుషులు ఈ లోకం లో ఉన్నారు.దాన్ని తలపించే ఒక నల్లజాతి యువకుని పాత్రయే టాం రాబిన్సన్. మరి అలాంటి యువకుడు ఎందుకని చంపబడ్డాడు...అతడిని కాపాడడానికి అటికస్ అనే శ్వేతజాతి న్యాయవాది ఎలా ప్రయత్నించాడు వంటి ఎన్నో విశేషాల సమాహారమే ఈ నవల.

ఈ నవల అంతా ఒక జ్ఞాపకం లా సాగుతుంది. అంటే స్కౌట్ ఫించ్ అనే ఆమె తన చిన్నతనం లో ఒక మాదిరి పట్టణమైన మేకోంబ్ లో నివసించే సమయం లో అక్కడి విశేషాలు ఎలా ఉండేవో చెబుతుండగా మనకి కథ నడుస్తూంటుంది.సరే...మనం కూడా ఆ ప్రాంతం లోకి వెళ్ళిపోదాము.అది మేకోంబ్ అనే చిన్న పట్టణం,ఎప్పుడూ నిద్రపోయినట్లుగా ఉంటుంది.అక్కడ గొప్ప విషయాలు ఏమీ ఉండవు.అయితే ఉన్నంతలో బాగా ఉంటుంది.ఒక స్కూల్,చక్కటి ఇళ్ళు,పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్రదేశాలు ఇలా కొన్ని ఉన్న పట్టణం.స్కౌట్ అనే ఈ అమ్మాయి ఫించ్ కుటుంబం కి చెందినది.ఆ ఊళ్ళో ఆ యింటి పేరు వాళ్ళు చాలామందే ఉంటారు. అప్పుడు స్కౌట్ కి ఆరేళ్ళు కాగా ఆమె సోదరుడు జెరెమె ..సరే అతడిని జెం అంటారు...అతనికి పదేళ్ళు. స్కూల్ లో చదువుతూ , ఆటలు ఆడుకుంటూ హాయిగా గడుపుతుంటారు.

వాళ్ళ నాన్న పేరు అటికస్.భార్య చనిపోయింది,మళ్ళీ పెళ్ళిచేసుకోలేదు. తను లాయర్  వృత్తి లో ఉన్నాడు.ఆ ఊళ్ళో కాస్తా కలిగిన కుటుంబం అని చెప్పాలి. గ్రేట్ డిప్రెషన్ ప్రభావం ఈ ప్రాంతం మీద కూడా ఉన్నది.అయినా బండి అలా సాగిపోతూంటుంది.అలా ఉండగా డిల్ అనే కుర్రాడు ఈ ఊరిలో ఉన్న వాళ్ళ బంధువు ఇంటికి వచ్చినపుడు, స్కౌట్ తోనూ ,జెం తోనూ స్నేహం ఏర్పడుతుంది.ముగ్గురూ కలిసి ఆడుకుంటూ,ఓసారి బూ రాడ్లీ అనే ఆయన ఇంటికి సమీపం గా వెళుతూ ఎలాగైనా ఆ యింటి లోకి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటారు.ఎందుకంటే ఈ బూ రాడ్లీ ఎప్పుడూ బయటకి రాకుండా ఇంట్లోనే కాలం గడుపుతుంటాడు.అసలు ఇతగాడు కేరక్టర్ ఏమిటి అని ఈ ముగ్గురి లో ఆసక్తి మొదలవుతుంది.ఊళ్ళో కూడా బూ రాడ్లీ అంటే దెయ్యం లాంటి వాడని ఎన్నో పుకార్లు షికారు చేస్తుంటాయి.

ఇతరుల జీవితం లో ఎన్నో ఉంటాయని వాటిని వాళ్ళ కోణం లో చూస్తే తప్పా అర్థం కావని తండ్రి అటికస్ తన పిల్లలకి చెబుతాడు.మళ్ళీ ఎండాకాలం లో డిల్ ఊరిలోకి వచ్చినపుడు ముగ్గురు పిల్లలు బూ రాడ్లీ ఇంటిలోకి వెళ్ళే ప్రయత్నం చేయగా ,ఒక పిష్టల్ శబ్దం వినిపించడం తో పారిపోయి వచేస్తారు.జెం దుస్తులు చిరిగిపోతాయి తప్పించుకునే సమయం లో..! ఆ తర్వాత కూడా ఈ పిల్లలు ఆ యింటి మీద నుంచి వచ్చేటప్పుడు, అక్కడున్న చెట్టు తొర్ర లో కొన్ని బహుమతులు పెట్టి ఉండటం గమనిస్తారు.అలా మరి కొన్ని సార్లు జరుగుతుంది.అయితే బూ రాడ్లీ మంచివాడే అనిపిస్తుంది వాళ్ళకి.ఓసారి ఫైర్ ఆక్సిడెంట్ జరిగినపుడు తన మీద దుప్పటి వేస్తాడు రక్షణగా...స్కౌట్ అనుకుంటుంది అది బూ రాడ్లీ అని.

అటికస్, ఒక నల్లజాతి యువకుడు టాం రాబిన్సన్ మీద మోపబడిన ఓ నేరం విషయం లో అతని తరఫున వాదిస్తుంటాడు. ఒక శ్వేత యువతి ని మానభంగం చేశాడని అతని పైగల అభియోగం. టాం రాబిన్సన్ మీద కొందరు శ్వేత జాతీయులు కావాలని నేరం మోపారని అటికస్ భావిస్తాడు.తోటి తెల్లవాళ్ళంతా అటికస్ ని తిడుతుంటారు,ఒక తెల్లవాడివై ఉండి నీగ్రో కి సపోర్ట్ చేస్తావా అని.జాతి కంటే ముఖ్యం గా సత్యం గెలవడమే తనకు ప్రధానమని అటికస్ అంటాడు.స్కూల్ లో కూడా తోటి పిల్లలు ఈ విషయమై స్కౌట్ ని,జెం ని తిడుతూంటారు.అయినా వాళ్ళు కూడా ధైర్యం గా నిలబడతారు.

టాం రాబిన్సన్ మీద కోర్ట్ లో వాదనలు మొదలవుతాయి.తెల్లవాళ్ళంతా కలిసి అటికస్ ఇంటి మీదకి వస్తారు.స్కౌట్ చిన్నపిల్ల అయినప్పటికి తన వాదం తో వాళ్ళనందర్నీ ఒప్పించి వెనక్కి పంపిస్తుంది.రేప్ కి గురయిందని చెప్పబడే మేయెల్ల ఏవెల్ అబద్ధం చెప్పిందని,అలాగే ఆమె తండ్రి బాబ్ ఏవెల్ కూడా దాంట్లో పాత్రధారి అని అటికస్ కోర్ట్ లో ఆధారాలతో సహా నిరూపిస్తాడు.దాంతో కోర్ట్ ,నల్లజాతి యువకుడిది తప్పులేదని చెప్పి ,అంతలోనే అతగాడిని కొన్నాళ్ళు జైల్ లో పెట్టమని చెబుతుంది.జడ్జ్ లు అంతా తెల్లవాళ్ళు కావడం తో వివక్ష చూపిస్తారు. దానితో నీగ్రో యువకుడు టాం రాబిన్సన్ పారిపోవడానికి ప్రయత్నించి పోలీసుల తుపాకి కి బలవుతాడు.

అంతవరకు న్యాయవ్యవస్త లో ఎంతో నమ్మకమున్న ఫించ్ కుటుంబీకులకి న్యాయం అనేది తెల్లవారికి వేరుగా ,నల్లవారికి వేరుగా ఉందని తేటతెల్లమవుతుంది.స్కౌట్,జెం లాంటి పిల్లలకి సైతం కోపం వస్తుంది.బాబ్ ఏవెల్ పగ తో రగిలిపోయి హాలోవీన్ పార్టీకి వెళ్ళి వస్తూన్న అటికస్ సంతానం మీద దాడి చేస్తాడు,అయితే బూ రాడ్లీ అదే సమయానికి వచ్చి బాబ్ ని చంపుతాడు. ఆ ఊరి షరీఫ్ ,అబద్ధం చెప్పి బూ రాడ్లీ ని  చట్టం నుంచి రక్షిస్తాడు. చెట్టు మొదలు దగ్గర తన కత్తి మీద తానే పడి ఏవెల్ చనిపోయాడని చెబుతాడు.

స్కౌట్ తోనూ మిగతా వాళ్ళతోనూ మాట్లాడిన తర్వాత బూ రాడ్లీ మళ్ళీ తన ఇంటిలోకి వెళ్ళిపోతాడు.తను మళ్ళీ బయటకి రాగా నేను చూడలేదు అంటూ స్కౌట్ చెబుతుంది.ఆ విధంగా కథ ముగుస్తుంది. తండ్రి చెప్పినట్లు,ఇక ఎప్పుడూ ఎవరినీ వాళ్ళ గురించి తెలుసుకోకుండా అభిప్రాయం ఏర్పరుచుకోకూడదని ఆమె అనుకుంటుంది. 

అమెరికన్ కోర్ట్ లు సైతం ఆ రోజుల్లో ఎలా నీగ్రోల పట్ల వ్యవహరించేవి అనేది ఈ నవల్లో చెప్పబడింది.దక్షిణాది రాష్ట్రాల్లోని జీవనశైలి ని ,ఆనాటి ప్రజల రోజువారీ వ్యవహారాల్ని ఒక చిన్నపిల్ల కోణం లో నుంచి చెప్పడం జరిగింది. రచయిత్రి హార్పర్ లీ తన జీవితం లోని అనేక సంఘటనల్ని ఈ నవల్లో చేర్చినట్లు చెబుతారు.ఆమె తండ్రి కూడా అటికస్ లాగే నల్లజాతి వారి హక్కుల కోసం కృషిచేసిన లాయర్.ఆమె జన్మించిన మన్రోవిల్లే కూడా రెండు వర్గాల ఘర్షణ కి కేంద్రం గా ఉన్న ప్రదేశాల్లో ఒకటి.1962 లో ఈ నవల సినిమా గా మలచబడినప్పుడు అకాడమీ అవార్డ్ ని పొందింది.ప్రతిఒక్కరు చదవవలసిన పుస్తకాల్లో ఒకటిగా బ్రిటీష్ లైబ్రరీస్ సంస్థ వర్ణించింది.మోడర్న్ అమెరికన్ క్లాసిక్ గా ఈ రచన ని హై స్కూల్,మిడిల్ స్కూల్ లో ప్రవేశపెట్టారు.పులిట్జర్ బహుమతి ని సైతం పొందింది.1964 తర్వాత నుంచి హార్పర్ లీ  ఏ పబ్లిసిటీ ని ఆశించకుండా జీవించి,2016 లో మరణించారు. 

----- మూర్తి కెవివిఎస్ (7893541003)     

     ( published in Nava Telangana Daily,25.4.2022)

No comments:

Post a Comment