Thursday, August 15, 2024

ఆన్ లైన్ మోసాలకి అంతం ఎప్పుడు ?

  జంతారా అనే పేరు సైబర్ నేరాలు అనే పదానికి ప్రత్యామ్నాయం గా మారింది. ఆ ఊరు ఎక్కడ ఉందో చాలా మందికి తెలియకపోవచ్చు. కాని సెల్ ఫోన్ ఉన్న భారతీయులందరూ ఏదో ఓ సమయం లో ఆ ఊరి నుంచి ఒక్క కాల్ అయినా అందుకుని ఉంటారు. 

మీకు లాటరీ తగిలిందనో,మీకు వచ్చే ఓటిపి నెంబర్ చెప్పమనో,బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నట్లు గానో ఇలా అనేకమైన తీపి కబుర్లతో జనాల సొమ్ము ని కొల్లగొట్టడం లో ఇక్కడి ఆన్ లైన్ నేరగాళ్ళది అందె వేసిన చెయ్యి. 

నిరుద్యోగులైన యువతీ యువకుల్ని రిక్రూట్ చేసుకుని ,ఆ పైన వీళ్ళకి తగిన ట్రైనింగ్ ఇచ్చి ఓ కుటీర పరిశ్రమ లా ఈ చీటింగ్ కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటారు. ఇంతకీ ఈ జంతారా అనేది జార్ఖండ్ రాష్ట్రం లో ఓ చిన్న పట్టణం. 

భారతదేశపు ఆన్ లైన్ నేరాలకి రాజధాని లాంటిది. ఈ పట్టణం నుంచి జరిగే ఆన్ లైన్ నేరాల మీద నెట్ ఫ్లిక్స్ లో ఓ వెబ్ సిరీస్ వచ్చిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ కార్యకలాపాలు ఎలా ఉంటాయో !

భారతదేశం లో జరిగే సగానికి పైగా ఆన్ లైన్ స్కాం లు రాంచీ నగరానికి 210 కి.మీ. ఉండే ఈ జంతారా నుంచే జరుగుతుంటాయి. ఫిషింగ్ లింక్ లు పంపి తద్వారా జనాల సమాచారాన్ని సంపాదించి సొమ్ము కొల్లగొట్టడం లో వీరికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. 

ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడి నేరస్థుల కోసం పోలీసులు వస్తుంటారు. ఇప్పటి దాకా 28000 కప్లైంట్స్ ఈ జంతారా కి చెందిన నెట్ వర్క్ మీద వచ్చాయి. 

జంతారా లో ఉన్న నేరగాళ్ళ మీద పరిశోధన చేస్తున్నప్పుడు దీన్ని మించిన ఆన్ లైన్ స్కాం లు చేసే భరత్ పూర్ వెలుగు లోకి వచ్చింది. ఈ పట్టణం రాజస్థాన్ లో ఉంది. 

యోగేశ్వర్ మీనా అనే యువకుడు ఏకంగా 500 మంది నిరుద్యోగుల్ని నియమించుకుని ఈ దందా నడిపిస్తున్నాడు. ఇతగాడు స్టాక్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ స్కాం లు చెయ్యడం లో దిట్ట. దానికి ప్రత్యేకం గా టెలి గ్రాం గ్రూపు లు కూడా ఉన్నాయి. 

ఇక అదే రాష్ట్రం లో ఉండే మేవాట్ అనే పట్టణం భారతదేశపు నూతన ఆన్ లైన్ స్కాంల రాజధాని గా అవతరించింది. వీళ్ళు ఆన్ లైన్ నేరాలు చేయడం లో కొత్త పుంతలు తొక్కి దేశం లోని జనాల సొమ్ము ని మొత్తం 7000 కోట్ల రూపాయలకి పైగా లూటీ చేశారు.

 ఒక్క ఈ ఏడాది లో ఇప్పటిదాకా ఏడున్నర లక్షల కంప్లైంట్స్ ఇక్కడి వాళ్ళ మీద వచ్చాయంటే ఏ రేంజ్ లో వీరి పనితనం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఆకర్షణీయం గా వచ్చే మెసేజ్ ల్ని నమ్మడం మానుకోనంత వరకు వీరి ఆగడాలకి హద్దు లేకుండా పోతూనే ఉంటుంది. 

ఎన్ని దాడులు నిర్వహించినా తమ ప్రదేశాల్ని మార్చుకుని యధావిధిగా నేరస్థులు తమ పని చేసుకుపోతూనే ఉన్నారు. 

కేవైసి అప్ డేట్స్ గురించి మెసేజ్ లు పంపడం,న్యూడ్ వీడియోలు పంపి చూసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని బెదిరించడం,ఫిషింగ్ లింక్ ల ద్వారా మాల్ వేర్ ని పంపి పాస్ వర్డ్ ల సమాచారం దొంగిలించడం ఇలా ఎన్నో విన్నూత్న పోకడలతో ఆన్ లైన్ నేరాలకి పాల్పడుతున్నారు.

ఈమధ్య కాలం లో విపరీతం గా ఫేస్ బుక్ అకౌంట్ లు హ్యాక్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. మీ మిత్రుల పేరు తో మిమ్మల్ని డబ్బులు అర్జంట్ గా పంపించమని మెసేజ్ లు పెట్టడం కూడా చూసే ఉంటారు. 

ఏ అకౌంట్ ని హ్యాక్ చేయాలన్నా ముందు దానికి నమ్మకం గా అనిపించే ఫిషింగ్ లింక్ ని ఆకర్షణీయమైన యాడ్స్ రూపం లోనో మెసేజ్ రూపం లోనో పంపిస్తారు.

పొరబాటున ఒకసారి క్లిక్ చేస్తే ఇక అంతే. ఆ ఫేస్ బుక్ అకౌంట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినట్లే. హ్యాక్ అయిన అకౌంట్ తేడా కనిపిస్తూనే ఉంటుంది. 

బర్త్ డే, ఈమెయిల్, పాస్ వర్డ్ లాంటివి మారిపోతాయి. కొన్నిసార్లు పాస్ వర్డ్ మారదు.అలాంటప్పుడు వేరే సిస్టం లోనుంచి అకౌంట్ లోకి ప్రవేశించి పాస్ వర్డ్ మార్చుకుంటే మంచిది. అలాగే ఫేస్ బుక్ కి రిపోర్ట్ పెట్టడం మంచిది. 

మిగతా నేరాల విషయం లో తీసుకున్నంత శ్రద్ధ ఈ ఆన్ లైన్ గ్యాగ్ స్టర్ ల మీద మన వ్యవస్థ తీసుకోవడం లేదనిపిస్తుంది. అరెస్ట్ చేసినా మళ్ళీ బయటకి వచ్చి ప్రొఫైల్ మార్చుకుని అవే పనులు చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ప్రజలు తమ జాగ్రత్తలు తాము తీసుకోవడం మంచిది.         

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 78935 41003)

    


No comments:

Post a Comment