Friday, August 30, 2024

డిజిటల్ డిమెన్షియ అంటే ఏమిటి ? దాని పరిణామాలు ఎలా ఉంటాయి ?

 "డిజిటల్ డిమెన్షియా" అంటే ఏమిటి ? దాని పరిణామాలు ఎలా ఉంటాయి ?

------------------------------------------------------------------------------------------------

టెక్నాలజీ మానవ జీవితాన్ని సుఖమయం చేసిన మాట వాస్తవం. కాని అదే టెక్నాలజీ ని అవసరానికి మించి అధికంగా ఉపయోగిస్తే మనం ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వాటిని మొదట గుర్తించడం కూడా కొంత కష్టమే! కాని కాలం గడుస్తున్న కొద్దీ మన శరీరం ఇచ్చే సంకేతాలు నిరాకరించలేని స్థాయి లో ఉంటాయి. విపరీతం గా స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ టైం ని వెచ్చించి గంటల కొద్దీ చూసే వారికి ఈ డిజిటల్ డిమెన్షియా అనే మానసిక రుగ్మత కలుగుతుందని న్యూరోశాస్త్రవేత్తలు అంటున్నారు. 

దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యమైన విషయాల్ని మర్చిపోవడం,వస్తువుల్ని ఒకచోట పెట్టి మరో చోట వెదకడం, మాట్లాడే సమయం లో చెప్పాలనుకున్న పదాలు నోటికి రాకపోవడం,క్రమేపి కాగ్నిటివ్ స్కిల్స్ బాగా తగ్గిపోవడం ఇలాంటివి అన్నీ డిజిటల్ డిమెన్షియా లో భాగాలే! జర్మన్ శాస్త్రవేత్త మన్ ఫ్రెడ్ స్పిజర్ ఈ మానసిక వ్యాధి లక్షణాల్ని మొదటిగా గుర్తించి దానికి ప్రత్యేకంగా ఈ పేరు ని పెట్టాడు.

దీంట్లో ఏడు స్థాయిలు ఉన్నట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశ లోనే గుర్తించి జాగ్రత్త పడితే ఫలితం ఉంటుంది లేదా అల్జీమర్స్ , ఫ్రంట్ టెంపోరల్ డిమెన్షియా కి దారి తీస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు మరికొన్ని ఏమిటంటే విపరీతంగా నిద్రపోవడం ఇంకా శ్వాసకోశపరమైన ఇబ్బంది కలగడం, యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ రావడం ఇలాంటివి సంభవిస్తాయి. మన మెదడు కి ఇవ్వవలసినంత పని రోజూ ఇవ్వాలి. 

టెక్నాలజీ ఉంది గదాని దాని పనితనాన్ని నిద్రబుచ్చితే సహజంగా మన మెదడు కి ఉండే కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గిపోవడం ప్రారంభమవుతాయి. నేర్చుకునే శక్తి సన్నగిల్లడం, ఏకాగ్రత ఉండకపోవడం,జ్ఞాపక శక్తి దెబ్బతినడం జరుగుతాయి.ఇవి ఒకేసారి జరగకపోవచ్చు,కాలం గడుస్తున్నకొద్దీ ఇవి మనలో చోటుచేసుకుంటాయి.చివరి స్థాయి చేరే వరకు గుర్తించకపోతే రోజువారీ పనులు చేసుకోలేని దశకి చేరుకోవడం జరుగుతుంది.

మరి దీనికి తరుణోపాయం ఏమిటి అంటే, టెక్నాలజీ ని అవసరం మేరకు మాత్రమే వాడాలి. కాలక్షేపానికి గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్ లో కాలం గడపకుండా ఇతర వ్యాపకాలు పెంచుకోవాలి. పుస్తకాలు చదవడం , తగు వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే మెదడు కి మేత కల్పించే జీవన విధానం లోకి వెళ్ళాలి. గ్రీన్ టీ తాగడం కూడా మంచిది. ముఖ్యంగా మనుషులతో ప్రతిరోజూ ఎంతో కొంత సమయం మాట్లాడుతుండాలి. 

స్మార్ట్ ఫోన్ ని చూసే సమయం మీ చేతిలో ఉంచుకోవాలి.అవసరమైతే పొద్దున లేదా సాయంత్రం ఏదో ఖచ్చితమైన ,మీరు నిర్దేశించుకున్న సమయం లో మాత్రమే చూడాలి. మీరు ఫేస్ బుక్ లోనో,ఇంకే సోషల్ మీడియా లోనో చేసిన కామెంట్ కి ఎన్ని లైక్ లు వచ్చాయి అనే ఆత్రుత ని పూర్తిగా వదలిపెట్టాలి. ఇవన్నీ కూడా మన మెదడు యొక్క ఆరోగ్యం కంటే ఎక్కువేమీ కాదుగదా!

స్మార్ట్ ఫోన్ ని వదిలిపెట్టాం గదాని కంప్యూటర్ ని, టెలివిజన్ ని గంటలకొద్దీ చూద్దాం అనుకోవద్దు. అవి కూడా మన మెదడు లోని గ్రే మేటర్ పైనా,వైట్ మేటర్ పైనా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మన లోని ఉద్రేకాల్ని,కదలికల్ని,ఆలోచనా విధానాల్ని ఆ రెండు నిర్దేశిస్తాయనే సంగతి తెలిసిందే. మీరు ఏ స్థాయి లో ఉన్నారో తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష చేసుకోవచ్చు. 

 ఏవైనా అయిదు పదాల్ని ఒక క్రమం లో ముందు మనసు లో అనుకోండి. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత వాటిని అవే క్రమం లో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుదామని అనుకుని , తీరా మరో విషయాన్ని పొంతన లేకుండా మాట్లాడటం చేస్తున్నారా ఇలాంటి వాటిని పరిశీలించుకోవడం వల్ల మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు.మన దేశం లో దీనిని డయగ్నస్ చేసి వైద్యం చేసే స్పెషలిస్ట్ లు ప్రస్తుతానికైతే లేరు అని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఎవరి జాగ్రత్త వారు తీసుకోవడమే మనం చేయగల పని!  


----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003) 




No comments:

Post a Comment