Thursday, July 31, 2025

ఓసారి నిషేధింపబడిన కోకో కోల, దేశం లో నెంబర్ వన్ ఎలా అయింది ?

 

ఓసారి నిషేధింపబడిన కోకో కోల, దేశం లో నెంబర్ వన్ ఎలా అయింది ? 

--------------------------------------------------------------------------------------------

కొకో కోల పేరు తెలియని వారు మన దేశం లో బహుశా ఎవరూ ఉండరు. నగరం గాని, చిన్న పట్టణం గాని, గ్రామం గాని ప్రతి చోట ఆ కంపెనీ కి చెందిన శీతల పానీయాలు తాగుతూనే ఉంటారు. ఏ శుభకార్యాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలన్నా ఆ కూల్ డ్రింక్స్ తెప్పించకపోతే ఏదో లోటులా ఫీల్ అవుతుంటారు. థంస్ అప్, ఫాంటా, స్ప్రైట్ ఇలాంటి డ్రింక్ లన్నీ కూడా కోకో కోల కంపెనీ కి చెందినవనే నిజం చాలా మందికి తెలియదు. ప్రపంచం లోని 200 దేశాల్లో ప్రస్తుతం కోకో కోల తమ ఉత్పత్తుల్ని అమ్ముతోంది. చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని శాసించగలిగే స్థాయి లో ఉండే ఈ బహుళ జాతి సంస్థ అమెరికా లో 1886 లో చిన్న వ్యాపార సంస్థ గా ఊపిరిపోసుకుంది.

జాన్ ఎస్. పెంబర్టన్ అనే వైద్యుడు మందుల్లోకి వాడటానికి కోకో ఆకుల రసం తీసి ఓ సిరప్ తయారు చేశాడు. అదే క్రమేణా అనేక మార్పులు పొందుతూ సాఫ్ట్ డ్రింక్ లా అవతరించింది. ప్రస్తుతం దీనిలో కార్బోనేటెడ్ వాటర్,సుగర్, కరమెల్ కలర్,ఫాస్పరిక్ ఆసిడ్,ఇంకా కొన్ని సహజ ఉత్పత్తులు వాడుతున్నట్లు చెబుతారు.అయితే దీంట్లో ఇంతవరకు ఎవరకీ తెలియని రెండు రహస్యమైన ఉత్పత్తుల్ని కలుపుతారని , అది కేవలం కంపెనీ కి చెందిన ఇద్దరు అధికారులకి మాత్రమే తెలుస్తుందని , దాని అసలు ఫార్ములా అట్లాంటా లోగల సన్ ట్రస్ట్ బ్యాంక్ లోని ఓ వాల్ట్ లో భద్రంగా ఉందనేది జగమెరిగిన సత్యం.

మన దేశం లోనికి కోకో కోల కంపెనీ నిజానికి 1956 లోనే ప్రవేశించింది.ఇరవై ఏళ్ళపాటు ఎదురులేని సాఫ్ట్ డ్రింక్ గా లాభాలు పొందింది. స్థానిక వ్యాపారులకి ఎలాంటి ఈక్విటీ ఇవ్వకుండా వచ్చిన లాభాలన్నీ ఆ కంపెనీ యే పొందుతుండటం తో , ప్రధాని ఇందిరా గాంధి హయాం లో విదేశీ పెట్టుబడులకి సంబంధించి కీలకమైన యాక్ట్ చేశారు. దానితో కోకో కోల ఇరుకున పడింది. ఆ తరువాత 1977 లో అధికారం లోకి వచ్చిన జనతా పార్టీ కూడా కోకో కోల ఉత్పత్తుల్ని నిషేధించే దిశగా సాగింది. ఈ కంపెనీ కి వ్యతిరేకంగా జార్జ్ ఫెర్నాండెజ్ చాలా ఉద్యమాలు చేసి సక్సెస్ అయ్యారు. దానితో కోకో కోల మన దేశం నుంచి నిష్క్రమించింది.

          నిషేధింపబడిన తర్వాత, అలాగే ఉండిపోతే అది కోకో కోల ఎందుకవుతుంది. ఆర్ధిక సరళీకరణ ప్రారంభం కావడం తో మళ్ళీ 1993 లో మన దేశం లోకి అడుగుపెట్టింది. పార్లే గ్రూప్ కి చెందిన అన్ని సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్ ని కొనేసింది. భారతదేశ శీతల పానీయాల రంగం లో ప్రస్తుతం నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే జుబిలెంట్ భాటియ కంపెనీ తో బాటిల్స్ తయారు చేసే విషయం లో ఒప్పందం చేసుకుంది. సంకేత్ రే ప్రస్తుతం ఇండియా విభాగానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. 

గత ఆర్ధిక సంవత్సరం లో 4,713 కోట్ల రూపాయల అమ్మకాలు మన దేశం లో సాగించింది. ప్రచారం విషయం లో ఎప్పటికప్పుడు కోకోకోల కొత్త పుంతలు తొక్కుతుంది. సెలెబ్రెటీ లతో యాడ్స్ చేయడమే కాకుండా ఆయా దేశాల్లోని సంస్కృతిని,పండుగల్ని వాటిల్లో ప్రవేశపెడుతూ ప్రజల కి చేరువ అవుతుంది. పట్టణం గానీ, పల్లె గానీ ఏ వైపు చూసినా కోకోకోల లోగో కనబడేలా ప్రణాళిక రూపొందించింది. దాని పర్యవసానంగా నిరక్షరాస్యులు కూడా దాన్ని గుర్తుపడతారు.

ఇదిలా ఉండగా కోకో కోల బాగా సేవించే వారికి ఒబేసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తున్నాయని కొన్ని లాటిన్ అమెరికా దేశాల్లో ఆందోళనలు జరిగాయి. భూమి లోనుంచి కోకో కోల యూనిట్లు విపరీతం గా నీళ్ళ ని లాగేస్తున్నాయని మన దేశం లో సైతం కొంతమంది కోర్ట్ లకి ఎక్కిన ఉదాహరణలున్నాయి. ఒక లీటర్ డ్రింక్ తయారు చేయడానికి రమారమి మూడు లీటర్ల భూగర్భ జలాలు లాగుతున్నారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ హెల్త్ కేర్ డ్రింక్స్ తయారు చేసే ప్రణాళికలు తయారుచేస్తోంది. కొబ్బరి నీళ్ళ ని కూడా సేకరించి మార్కెట్ చేసే యోచన లో ఉన్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజూ 1.9 బిలియన్ కోకోకోల ఉత్పత్తుల్ని దేశదేశాల్లో అమ్మే ఈ సంస్థ కి పోటీ వచ్చే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ సంస్థ మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు.

----- మూర్తి కెవివిఎస్ (7893541003)       




Thursday, July 24, 2025

షింటో మతం యొక్క ప్రత్యేకతలు ఎన్నెన్నో !


షింటో మతం యొక్క ప్రత్యేకతలు ఎన్నెన్నో !

-----------------------------------------------------------

 జపాన్ లో చాలామంది అనుసరించే మతం ఏమిటి అంటే చటుక్కున షింటో మతం అని చెబుతారు. నిజమే దాదాపు 70 శాతం పైగా జపనీయులు ఆ విశ్వాసులే కానీ ఆ మతం యొక్క స్వరూపం మనకి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ప్రత్యేకించి ఆ మతాన్ని స్థాపించిన వారు అంటూ ఎవరూ లేరు. అలాగే ప్రత్యేక గ్రంథం అంటూ ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఆ మతం అక్కడ ఎలా మనగలిగింది అనే సందేహం రాక మానదు. అయితే దానిలో పూజలు ఉన్నాయి. రకరకాల తంతులు ఉన్నాయి.పండుగలు ఉన్నాయి.నిజానికి జపాన్ యొక్క సాంస్కృతిక,నైతిక జీవన విలువలు అన్నీ కూడా షింటో మతమే ప్రభావితం చేసింది అంటే అతిశయోక్తి కాదు.

ఇంతా చేసీ ప్రధాన దైవం అంటూ చెప్పడానికి ఎవరూ లేరు. ప్రకృతి లోని ప్రతి చెట్టు,నది,పర్వతం ఇలా ప్రతి దానిలోనూ మనిషి లో ఉన్నట్లే ఆత్మ ఉన్నది.మనిషి పోయిన తర్వాత శరీరం లోని సూక్ష్మశక్తి పై లోకాలకి చేరినట్లే , విశ్వం లోని ప్రతిది ఇక్కడ నాశనమైనప్పటికి వాటిలో ఉన్నది కూడా ఆ లోకాలకి చేరుతుంది. ఆ లోకాన్నే "కామి" (Kami) అంటారు.అదే జపనీయుల ఆరాధ్య దైవం. తమ పూర్వికులు కూడా అక్కడే ఉంటారని భావిస్తారు. ఈ కామి అనే పదాన్ని వారు బహువచనం లో కూడా వాడతారు. ఈ ఆత్మ లోకం లో స్వర్గం,నరకం అంటూ ఏమీ ఉండవు. ప్రతి మనిషి స్వతహాగా మంచివాడే అయినప్పటికీ కొన్ని దుష్ట ఆత్మలు అతడిని  చెడ్డవాడు అయ్యేలా ప్రేరేపిస్తాయని నమ్ముతారు.

జింజా అనేది షింటో మతం లో ఆలయం. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. ఇంటిలో నిర్మించుకునేదాన్ని కామిడన అంటారు. అలాగే కుటుంబం మొత్తానికి కలిపి ఒకటి ఇంకా సామూహికంగా అందరకీ కలిపి జింజా అనేది ఉంటుంది. జనాలు ఎవరైనా మూడవ ఆలయానికి వెళ్ళవచ్చు. లోపలికి వెళ్ళి దక్షిణ వేసి,గంట కొట్టాలి. ఆ తర్వాత గౌరవంగా వంగి కాసేపు ప్రార్థిస్తారు.కామి విశ్వాసం ప్రకారం శుభ్రత,నిజాయితీ,కష్టపడి పనిచేయడం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. షింటో మత నమ్మకాలన్నీ కాలక్రమం లో ఒక్కొక్కటిగా చేరి రాయబడని శాసనాలుగా మిగిలిపోయాయి. క్రీ.పూ.300 ఏళ్ళ నుంచి ఈ షింటో మతం జపాన్ లో ఉన్నది.

అయితే విచిత్రం గా బౌద్ధ మతం క్రీ.శ.6 శతాబ్దం లో జపాన్ లోకి ప్రవేశించి షింటోమతం తో పడుగూ పేక లా కలిసిపోయింది. తనదైన తాత్విక విచారణ ను ప్రసరింపజేసి దానిలోని కొన్ని లోటుపాట్లను తీర్చింది. చాలా షింటో ఆలయాల్లో బుద్ధుని విగ్రహం కూడా ఓ చోట ఉంటుంది.1868 నుంచి 1912 దాకా జపాన్ ని పాలించిన మైజీ వంశానికి చెందిన చక్రవర్తి తమ దేశం లోని ఆలయాల్లో బుద్ధుని విగ్రహాలు ఎందుకు అని తొలగించాడు. అయితే ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించలేదు. మళ్ళీ ఆయన విగ్రహాలు పెట్టడం ప్రారభించారు. షింటో మతాన్ని ఆచరించే ప్రతివారు మరణాంతరం చేసే కార్యక్రమాల్ని బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ చేయాలని నిర్ణయించారు. అందుకే జపాన్ లో ఒక సామెత పుట్టింది, షింటో మతం లో పుట్టిన ప్రతివ్యక్తి బౌద్ధ మతం లో కన్నుమూస్తాడని..!          

      "కామి" విశ్వాసం ప్రకారం మూడు రకాల పూజ్యులు ఉన్నారు.పై లోకం లో ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళు, ఇంకా అసంఖ్యాక పూర్వికుల ఆత్మలు. బాన్ అనేది పెద్ద పండుగ.ఆ రోజు పూర్వికుల ఆత్మలు భూమి పైకి వస్తాయని నమ్ముతారు. అప్పుడు రకరకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. షింటో ఆలయాల్లో పూజలు నిర్వహించే వారిని కనూషి అని పిలుస్తారు. జపాన్ లో ఉన్న రమారమి లక్షకి పైగా జింజా లు (ఆలయాలు) వారసత్వం గా వారి చేతి లోనే ఉండేవి. దాదాపు వంద తరాల నుంచి స్వంత జింజా లు ఉన్న కుటుంబాలు ఈనాటికి జపాన్ లో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వారసత్వ హక్కుల్ని రద్దు పరిచారు.

 షింటో మతం అనేక ఉప వర్గాలుగా కాలక్రమేణా విడిపోయినప్పటికీ దాని ప్రధాన సిద్ధాంతం మటుకు ప్రకృతి లోని, పూర్వికుల లోని ఆత్మ శక్తిని పూజించడమే! జపాన్ లో ఒక సగటు షింటో విశ్వాసిని,మీదే మతం అంటే నాది షింటో మతం అని చెప్పకపోవచ్చు. అసలు తాను ఓ మతాన్ని అనుసరిస్తున్నానే స్పృహ కూడా లేకుండా తమ పూజలు తాము చేసుకుంటూ పోతారు. అందుకే మనకి జపాన్ గణాంకాల్లో మతం ని వెల్లడించని వారి సంఖ్య కూడా బాగా కనబడుతుంది.


----- మూర్తి కెవివిఎస్ (7893541003) 




Friday, June 6, 2025

బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాఖ్ - కొన్ని విశేషాలు

బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాఖ్ - కొన్ని విశేషాలు

--------------------------------------------------------------

కర్నాటక రాష్ట్రానికి చెందిన రచయిత్రి బాను ముష్తాఖ్ ఆంగ్ల కథా సంపుటికి బుకర్ ప్రైజ్ (2025) వచ్చిందన్న వార్త తెలుగు పాఠకులకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. 1990 నుంచి 2023 వరకు ఆమె కన్నడం లో రాసిన చిన్న కథల్ని దీపా భస్తి అనే కొడగు ప్రాంతానికి చెందిన అనువాదకురాలు హార్ట్ లాంప్ అనే పేరు తో ఇంగ్లీష్ లో అనువదించారు. దానిలో 11 కథలు ఉన్నాయి. దీపా భస్తి జాతీయ,అంతర్జాతీయ ఇంగ్లీష్ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ఈమె గతం లో కోట శివరామ కారంత్ నవలని ఇంకా చిన్న కథల్ని అనువాదం చేశారు. బాను ముష్తాఖ్ యొక్క జీవితం కూడా ఎంతో పోరాటశీలత తో కూడుకున్నది. ఆమె స్త్రీల హక్కుల కార్యకర్త గా,న్యాయవాదిగా, అన్నిరకాల అణచివేతల కి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు.అవన్నీ కూడా ఆమె రచనల్లో ప్రతిఫలించాయి.తన సొంత వర్గీయుల నుంచి సైతం ఎంతో వ్యతిరేకత ని ఎదుర్కున్నారు.

దళితుల,వెనుకబడిన వర్గాల నుంచి ఇంకా పీడన కి గురైన రచయితలు, రచయిత్రులు ఒక్క ఉప్పెన లాగా నిర్మించిన సాహిత్య ఉద్యమం కన్నడ దేశం లో చోటు చేసుకున్నది. అది బందయ సాహిత్య ఉద్యమం. దానిలో బాను ముష్తాఖ్ ప్రముఖ పాత్ర పోషించారు. అంతర్గతంగా , సంఘపరంగా ముస్లిం స్త్రీలు పడే వేదనలను ధైర్యంగా తమ రచనలతో ప్రశ్నించారు. బుకర్ జ్యూరీ లండన్ నుంచి వెలువరించిన పత్రికా ప్రకటన లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బాను ముష్తాఖ్ యొక్క శైలి వచన గేయం లా ఉండి,అనుభూతి లోతులను భయరహితమైన భావప్రకటన ని సంతరించుకుని శక్తిమంతమైన కాంతి లా ఆమె కథలు ఉంటాయని వక్కాణించింది.      

 బాను ముష్తాఖ్ గతం లో ఆరు కథా సంపుటాలు,ఒక నవల,ఒక వ్యాస సంపుటి ఇంకా ఓ కవితా సంపుటి కన్నడం లో వెలువరించారు. కర్ణాటక సాహిత్య అకాడెమీ,దాన చింతామణి అట్టిమబ్బె అవార్డులు పొందారు. ఇంకో విశేషం ఏమిటంటే ప్రస్తుతం బుకర్ పురస్కారం పొందిన హార్ట్ లాంప్ కథా సంపుటి "పెన్ ట్రాన్స్ లేట్స్" అనే అంతర్జాతీయ పురస్కారం కూడా పొందింది. బాను ముష్తాఖ్ కథల గురించి చెప్పాలంటే పాత్రలు సున్నితంగా, సహజంగా, మానవ వ్యథల చిత్రీకరణ పాఠకులకు హత్తుకునేలా ఉండి కొన్నిసార్లు వయక్కం బషీర్ కథల్ని తలపిస్తాయి. అయితే బలహీనమైన గుండె ఉన్న వారి కోసం ఈ కథలు రాయబడలేదు అని ఓ ఆంగ్లపత్రిక వ్యాఖ్యానించింది.

హార్ట్ లాంప్ సంపుటి లోని కథలు Stone slabs for Shaista mahal, Fire Rain, Black cobras, Red lungi, Heart lamp, High heeled shoe, Soft whispers, A taste of heaven, The shroud, The Arabic teacher and Gobi Manchuri, Be a woman once,oh Lord ఇలా ఉన్నాయి. మచ్చుకి కొన్ని కథల గురించి రేఖామాత్రంగా తెలుసుకుందాం. మొదటి కథ Stone slabs for Shaista Mahal లో రెండు కుటుంబాల మధ్య ఉండే అనుబంధం,స్నేహం అదే సమయం లో స్త్రీ అనారోగ్యం లో ఉంటూ కూడా పిల్లలు కనే యంత్రం లా మారడాన్ని చిత్రించారు. ముజాహిద్,జీనత్ లకి పెళ్ళయి సుమారు పది నెలలు అవుతుంది. మిత్రుడు ఇఫ్తీకర్,ఆమె భార్య షయిస్ట వాళ్ళ ఇంటికి వెళతారు.

షయిస్ట కి అప్పటికే ఆరుగురు పిల్లలు,భర్త ఇఫ్తీకర్ ఆమె పై విపరీతమైన ప్రేమ కలిగిఉంటాడు. అతనికి యాభై ఏళ్ళు కాగా ఆమె కి నలభై ఏళ్ళు. తాజ్ మహల్ మాదిరిగా భార్య కి షయిస్ట మహల్ కట్టిస్తానని చెబుతుంటాడు. పెద్ద కూతురు ఆసిఫా పెళ్ళి కి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయం లో షయిస్ట గర్భం తో ఉంటుంది. జీనత్ ఈనాటి యువతి గా వ్యతిరేకిస్తూ, ఆరోగ్యం అంతంత మాత్రం గా ఉన్న ఆమె ఏడవ సంతానాన్ని కనడం పట్ల విచారిస్తుంది.మగవారి ప్రేమ వెనుక ఉన్న స్వార్థాన్ని సున్నితం గా ఈ కథ స్పృశిస్తుంది. తల్లి ప్రేమ అన్నిటికన్నా గొప్పదని, తల్లి పోతే మరో తల్లి రాదని కానీ భార్య చనిపోతే మరో భార్య ఆ స్థానాన్ని పూరించవచ్చునని భర్త ముజాహిద్ అనడం ఆమె కి కోపాన్ని కలిగిస్తుంది. ఈ కథ రచయిత్రి బాను ముష్తాఖ్ యొక్క ఆలోచనా స్రవంతికి మచ్చుతునక గా చెప్పవచ్చును.

భర్త వదిలేసిన వితంతువు ఆమె పిల్లలతో పడే బాధల్ని,అదే సమయం లో స్థానిక ముతావలి సాయాన్ని కోరినప్పటికీ తాను ఏమి చేయలేని స్థితి లో ఉండడం దానికి గాను తోటి వారైన స్థానిక స్త్రీలు సహానుభూతి చూపకుండా ముతావలి ని నిందించడం ఇలాంటి కథా వస్తువు తో The black cobras అనే కథ సాగుతుంది. ధనవంతురాలైన రజియా అనే తల్లి తన కొడుకు తో పాటు తమ వీథిలో ఉన్న 18 మంది పిల్లలకి సుంతీ చేయించే కార్యక్రమం చేపడుతుంది. దీంట్లో పేద పిల్లలకి నాటుగా చేసిన సుంతీ ఎలాంటి అనారోగ్యం లేకుండా కోలుకునేలా చేస్తుంది. డబ్బులున్న వారు తమ పిల్లలకి అనాస్థీషియ ఇచ్చి నాజుకుగా చేయిస్తే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఏమీ లేనివారికి దేవుడే దిక్కు అని ఊరికే అనలేదు అని నిట్టూర్చుతుంది ఆమె!ఈ సంఘటన Red Lungi అనే కథ లోనిది.

అమ్మాయిలకి అరబీ పాఠాలు చెప్పే యువ ఉపాధ్యాయుడు, పనిలో పనిగా తనకి తగిన భార్య ఆ అమ్మాయిల్లో దొరుకుతుందేమోనని చూస్తుంటాడు. గోబీ మంచూరియ అనే వంటకం అతనికి బాగా ఇష్టం. దాన్ని బాగా వండేవాళ్ళనే చేసుకోవాలని తన కోరిక. ఎట్టకేలకు అలాంటి అమ్మాయిని కనిపెట్టి పెళ్ళి చేసుకుంటాడు. అయితే పెళ్ళి అయిన తర్వాత జరిగే విషయం వేరుగా ఉంటుంది. ఈ వర్ణన అంతా The Arabic teacher and Gobi Manchuri అనే కథ లోనిది.కొన్ని కథలు, వర్ణనలు రిపిటిషన్ లా అనిపిస్తాయి. మన తెలుగు లో కూడా మైనారిటి ప్రజల జీవితాల పై రకరకాల కథలు వచ్చాయి. స్కైబాబా లాంటి వాళ్ళ కథలు చక్కటి ఆదరణకి కూడా పొందాయి. బుకర్ ప్రైజ్ పొందటం వల్ల విస్తృతమైన పబ్లిసిటి వస్తుంది. పుస్తకాలకి మార్కెట్ పెరుగుతుంది. యాభై వేల పౌండ్లు వస్తాయి.వాటిని రచయిత్రి,అనువాదకురాలు సమానంగా పంచుకుంటారు. ఏది ఏమైనా మన పొరుగు భాష రచయిత్రి బాను ముష్తాఖ్ కృషి కి అంతర్జాతీయ గుర్తింపు లభించిన సందర్భం లో ఆమెకి శుభాకాంక్షలు, జేజేలు..!

                                       ----- మూర్తి కెవివిఎస్ 



              


     

Monday, May 12, 2025

ఆత్మాన్వేషణ లో ఓ భాగం - హెర్మన్ హెస్సి నవల సిద్ధార్థ

ఆత్మాన్వేషణ లో ఓ భాగం - హెర్మన్ హెస్సి నవల సిద్ధార్థ

--------------------------------------------------------------------------


 జర్మన్ రచయిత హెర్మన్ హెస్సి 1922 ప్రాంతం లో వెలువరించిన "సిద్ధార్థ" నవల అదే పేరు తో ఆంగ్లం లో కూడా అనువదింపబడటం తో చదివే అవకాశం దొరికింది. హెర్మన్ హెస్సి ని జర్మన్ స్విస్ రచయిత గా తరచూ ఉటంకిస్తుంటారు. తను జర్మనీ లో పుట్టినప్పటికి తల్లి వైపు మూలాలు స్విజర్ లాండ్ లో ఉండటం, చివరి దశలో అదే దేశం లో చనిపోవడం వల్ల అలా భావించడం లో తప్పులేదు. కానీ ఆయన రచనా వ్యాసంగం అంతా జర్మన్ భాష లోనే సాగింది. ఏ యూరోపియన్ భాష లో ఎన్నదగిన రచన వచ్చినా అది శరవేగం తో ఇంగ్లీష్ లోకి ఇతర ప్రపంచ భాషల్లోకి అనువాదమైపోతుంది.

సిద్ధార్థ అనే ఈ నవల పేరు చూసి ఇది బుద్ధుని గురించి రాసింది అనుకుంటే పొరబాటు. పైగా కవర్ మీద బుద్ధుని బొమ్మ కూడా ఉంది గదా. అయితే బుద్ధుని పాత్ర ఉంటుంది. కథానాయకుడైన సిద్ధార్థ తన పరివ్రాజక జీవితం లో ఒకసారి బుద్ధుడిని చూస్తాడు. అతని అనుయాయులతో కూడా మాట్లాడుతాడు. అంతే. ఈ నవల లో మరెక్కడా బుద్ధుడు మనకి కనిపించడు. కాని ఆయన బోధనలు ఆనాటి ప్రజల్లో కలిగించిన ప్రభావాన్ని మనం అనుభూతి పొందుతాము. అదీ వివిధ పాత్రల ద్వారా మాత్రమే.

సిద్ధార్థ ఒక బ్రాహ్మణ యువకుడు. చిన్నతనం నుంచి పూజాదికాలు ఇతర వైదిక కార్యక్రమాల్లో కాలం గడుపుతుంటాడు. తన జీవితం లో ఏదో వెలితి. అసలైన జ్ఞానకాంతి తన లో ప్రవేశించలేదని , ఇంకా ఏదో నేర్చుకోవాలి అని అరణ్యం లో కి వెళ్ళి సమానులతో కలిసిపోతాడు. సమానులు అనే మాటకి భౌతిక జీవితాన్ని నిర్జించి అన్వేషణ లో సన్యాసి గా మారినవారు అని ఈ పుస్తకం లోని అర్థం. Samana అని ఇంగ్లీష్ లో రాశారు. కొన్ని ఏళ్ళు ఉన్న తర్వాత సిద్ధార్థ కి ఇంకా అసంతృప్తి పెరుగుతుంది. ఇది తన దారి కాదు అనిపిస్తుంది. అయితే వాళ్ళతో ఉన్నప్పుడు కొన్ని విద్యలు నేర్చుకుంటాడు.    

తనతో పాటు గోవింద అనే మిత్రుడు కూడా ఉంటాడు. ఓసారి గౌతముడి ని (అంటే బుద్ధుడిని) ఇద్దరూ చూస్తారు. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు,ఈ ఇద్దరూ గొప్ప గౌరవం తో ఆయన ని ఆలకిస్తారు. గోవింద ఆ బౌద్ధ సన్యాసులతో ఉండిపోతాడు. కాని సిద్ధార్థ మాత్రం లేదు లేదు నేను ముందుకి సాగిపోతాను. నేను తెలుసుకోవలసింది ఇంకా ఏదో ఉంది అని వెళ్ళిపోతాడు. అలా తను నడిచి నడిచి ఓ పట్టణానికి చేరుకుంటాడు. అక్కడ కమల అనే వేశ్య ని చూస్తాడు. ఆమె చాలా ధనవంతురాలు.రాజాస్థానం లో ఉంటుంది. సిద్ధార్థ తనకి ప్రేమ విద్య ని నేర్పించమని కోరుతాడు.

ఆమె నవ్వి నీ లాంటి సన్యాసుల్ని నా ఇంటి లోకి కూడా రానివ్వను. అయినా నీలో ఏదో ఉంది. నేర్పించుతాను గాని ముందు నువ్వు ధనం సంపాదించడం నేర్చుకో. మంచి వస్త్రాలతో దర్జాగా నా వద్దకి రా,అప్పుడు చూస్తాను అంటుంది కమల. కామస్వామి అనే వర్తకుడి దగ్గర సహాయకుని గా నియమిస్తుంది. వ్యాపారం జరిగే పద్దతి ని , మనుషుల ప్రవర్తన ని గమనిస్తూ మనుషులకి వయసు పెరిగినా మనసు లో పెద్దగా పరిణామం జరగట్లేదని చిన్నపిల్ల ల చేష్టలే అని భావిస్తుంటాడు.నష్టానికి విపరీతంగా కుంగి పోవడం,లాభానికి విపరీతంగా పొంగిపోవడం వింత గా అనిపిస్తుంది.తను సమానులతో ఉండి అన్ని పరిస్థితుల్లోనూ మధ్యేమార్గంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు.

కామస్వామి తో ఇదే అంటాడు. మనిషి అలా అనుభూతి చెందకపోతే ఎలా బ్రతకగలడు..అని ఆ కామస్వామి ఒక మాటంటాడు. నీకు నా ఆస్తి లో పావు భాగం ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించు .. నీ తెలివి తో లాభాలు తెస్తావా ..లేదా పోగొడతావా .. నీ ఇష్టం ..అని ఆ విధంగానే రాసిస్తాడు. మొదట్లో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా వ్యాపారం చేసినా పోను పోనూ ఒక అసలు సిసలు వ్యాపారి లా మారిపోతాడు సిద్ధార్థ. నష్టం వచ్చినపుడు కసి గా లాభాలు సంపాదించడం,లాభాలు రాగానే బాగా ఆనందించడం మొదలవుతుంది. కమల దగ్గర కి వెళతాడు. ఆమె కూడా ఇతనికి ప్రియురాలిగా మారిపోతుంది. ప్రేమ లో పట్లు అన్నీ నేర్పిస్తుంది.

ఇవన్నీ చేస్తూనే తన మనసు ని , దాని మార్పుల్ని వేరే మనిషి లా గమనిస్తుంటాడు. తాగుడు, జూదం కూడా మొదలవుతుంది. చివరకి ఉన్న ఆస్తి అంతా పోయి బికారి అవుతాడు. మిత్రులు అనుకున్న వాళ్ళు కూడా ఎవరూ అప్పు కూడా ఇవ్వరు. అసలు తన మొదటి స్థితి ఇదేగా ..ఎందుకు అనుకోవడం అని ఎంత సముదాయించుకున్నా బాధ ఆగదు. ఆత్మహత్య చేసుకోవాలని నది దగ్గర కి వెళతాడు. అక్కడ పడవ నడిపే వాసుదేవ అనే వ్యక్తి రక్షించి చేరదీస్తాడు. అతను నది ఒడ్డున ఒంటరిగా చిన్న గుడిసె లో నివసిస్తుంటాడు. 

తనూ అక్కడే కాలం గడుపుతూ , వాసుదేవ సాంగత్యం లో , ప్రకృతి ని, ముఖ్యంగా ఆ నది ని ఆస్వాదిస్తూ ,మాట్లాడుతూ ఏ విధంగా తను ఇన్నాళ్ళ నుంచి వెతుకులాడుతున్నాడో ఆ జ్ఞానాన్ని పొందుతాడు. నవల లోని చాలా పేరాలు సింబాలిక్ గా , ఒక్కొక్క జీవితపు పొర ని రకరకాల సంఘటనల ద్వారా చూపిస్తూ లోతైన అర్ధాన్ని ఈ నవల ద్వారా రచయిత నర్మగర్భంగా వివరించాడు. బౌద్ధ ధర్మాన్ని, వేదాంత ధోరణుల్ని హెర్మన్ హెస్సి బాగా చదివేడనే ఆలోచన మనకి స్ఫురిస్తుంది. కమల ద్వారా కలిగిన కొడుకు సిద్ధార్థ ని కలవడం ఆ తర్వాత జరిగే సన్నివేశాలు మెలోడ్రామా ని తలపిస్తాయి. 

ఈ నవల ఆధారంగా 1973 లో హిందీ లో శశి కపూర్ హీరో గా ఓ సినిమా తీశారు. ఇండో అమెరికన్ టెక్నీషియన్స్ పని చేసిన ఈ సినిమా కి కాన్రాడ్ రూక్స్ దర్శకత్వం వహించాడు. రిషికేష్ లోనూ,భరత్ పూర్ ప్యాలస్ లోనూ చిత్రీకరణ జరిగిన దీనిలో న్యూడ్ సీన్ లు ఉన్నాయని కొన్ని సీన్లని కత్తిరించారు. ఆ తర్వాత పంపిణీలో తేడాలొచ్చి కొన్నాళ్ళు రిలీజ్ కాకుండా ఆగిపోయింది.  

నిజానికి ఈ పుస్తకం గురించి ఇంకా చాలా రాయవచ్చు. కాని రచయిత చేసిన తాత్విక ఆలోచనలు ఎలాంటి పదాల్లో చెప్పాలో సంధిగ్ధం లో పడి ఆపుజేస్తున్నాను. ఎవరికి వాళ్ళు చదివి అర్థం చేసుకోవాలి. అదే మంచిది. ఈ చిన్న పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించి ఒకదాన్ని రోమై రోలా కి ఇంకోదాన్ని మరో మిత్రునికి అంకితం ఇచ్చాడు. నాకు నచ్చిన కొన్ని లైన్లను ఇక్కడ ఉటంకిస్తాను.

" The world, my friend, is not imperfect, or on a slow path towards perfection. No, it's perfect in every moment, all sin already carries the divine forgiveness in itself, all small children already have the old person in themselves, all infants already have death, all dying people the eternal life. It is not possible for any person to see how far another one has already progressed on his path: in the robber and dice-gambler , the Buddha is waiting." 

---  మూర్తి కెవివిఎస్  (78935 41003)        



Friday, April 18, 2025

పుస్తక విక్రేతల్లో "హిగ్గిన్ బాథంస్" చరిత్ర ప్రత్యేకమైనది

పుస్తక విక్రేతల్లో "హిగ్గిన్ బాథంస్" చరిత్ర ప్రత్యేకమైనది

-----------------------------------------------------------------------

 ఒకానొక సమయం లో రైల్వేస్టేషన్ లో ఉన్న హిగ్గిన్ బాథంస్ లో పుస్తకం కొనడం అనేది మరిచిపోలేని అనుభూతి. ఎన్నో దేశ,విదేశ పత్రికలు ఇంకా రకరకాల పుస్తకాలు పాఠకుల్ని రారమ్మని పిలుస్తుండేవి. ఇంచుమించు ప్రతి ప్రముఖ రైల్వే స్టేషన్ లో హిగ్గిన్ బాథంస్ వారికి షాపు ఉండేది. ఆ అక్షరాల్ని చదవడం లోనే ఓ ఆనందం ఉండేది. నిజానికి హిగ్గిన్ బాథంస్ అనేది ఓ బ్రిటీష్ వ్యాపారి పేరు. ఆయన అసలు ఎప్పుడు,ఏ పరిస్థితుల్లో ఆ బుక్ స్టోర్స్ ని స్థాపించి దాన్ని అంచెలంచెలుగా విస్తరించాడు అనేది తెలుసుకుందాం.

హిగ్గిన్ బాథంస్ అసలు పేరు ఏబుల్ జాషువ హిగ్గిన్ బాథంస్. లండన్ లో బయలు దేరి చెన్నయ్ వచ్చే ఒక ఓడ లో దాక్కుని భారత దేశం లో దిగాడు. ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామని ప్రయత్నించగా మిషనరీస్ నడిపే ఓ పుస్తకాల షాపు లో పని దొరికింది.అది 1840 వ సంవత్సరం. భారత దేశం లో అతి పాత బుక్ స్టోర్ అది. దాన్ని ప్రీమియర్ బుక్ షాప్ ఆఫ్ మెడ్రాస్ అని పిలిచేవారు. ఆ పుస్తకాల షాపు కి నష్టాలు వచ్చి మూసివేసే స్థితి లో హిగ్గిన్ బాథంస్ దాన్ని 1844 లో తక్కువ ధర కి కొన్నాడు. ఆ తర్వాత పుస్తకాల్ని ముద్రించి అమ్మడం, స్టేషనరీ సామాను అమ్మడం లాంటివి చేయడం తో ఆ షాపు లాభాల బాట పట్టింది.

పుస్తకాల షాపు కి ప్రముఖుల్ని ఆహ్వానించేవాడు. బ్రిటీష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ, మైసూర్ మహారాజా,ఇంకా ఇతర ప్రముఖులు వచ్చి యూరప్ లో రిలీజ్ అయిన పుస్తకాల్ని వెంటనే ఇక్కడ కొనే ఏర్పాటు చేసేవాడు. తన షాపు కి అలా మంచి పబ్లిసిటీ వచ్చేలా చూసుకునేవాడు.దానితో భారతీయ ఉన్నత వర్గాల వారు కూడా మౌంట్ రోడ్ (చెన్నై) లో ఉన్న ఆ షాపు లో పుస్తకాలు కొనడం ఓ ప్రిస్టేజ్ గా భావించేవారు. 1858 లో భారతదేశ పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ రాణి చేతిలోకి వెళ్ళింది. దానికి సంబందించిన అధికారపత్రాన్ని ఇంగ్లీష్ లోనూ, తమిళ్ లోనూ ముద్రించి పాఠకులందరికీ హిగ్గిన్ బాథంస్ ఉచితంగా పంచిపెట్టాడు. 

   దానితో ఆనాటి అధికార వర్గాల్లో మంచి పేరు సంపాదించుకున్న హిగ్గిన్ బాథంస్ బ్రిటీష్ రాచ కుటుంబాల వారికి అఫీషియల్ బుక్ సెల్లర్ గా ప్రకటించబడ్డాడు. అంతేగాక ప్రసిద్ది చెందిన కన్నెమెర లైబ్రరీ కి బుక్ సప్లయర్ గా మారిపోయాడు. ఆ తర్వాత మొట్టమొదటి బుక్ స్టోర్స్ చైన్ ని స్థాపించాలనే ఉద్దేశ్యం తో దక్షిణ భారత దేశం లోని చాలా ప్రముఖ రైల్వే స్టేషన్ లలో హిగ్గిన్ బాథంస్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతని కుమారుడు వాటిని ఇంకా అభివృద్ది లోకి తీసుకురావడం జరిగింది. బెంగళూరు లోని మొదటి పుస్తకాల షాపు ని కూడా ఈ సంస్థ వారే స్థాపించారు. 1929 కల్లా మొత్తం 400 మంది ఉద్యోగులు పనిచేస్తుండేవారు.

లార్డ్ మెకాలే కి ఒక బ్రిటీష్ మిత్రుడు ఇలా రాశాడు." మౌంట్ రోడ్ లో ఉన్న హిగ్గిన్ బాథంస్ బుక్ షాప్ కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం.మన యూరప్ లో విడుదల అయిన ప్రతి ప్రముఖ పుస్తకాన్ని ఇక్కడకి వెంటనే తెప్పిస్తారు.సోక్రటీస్,ప్లేటో,షిల్లర్,గేథే లాంటి తత్వవేత్తల రచనలు ఎన్నో లభ్యమవుతాయి. అంతేకాదు, విక్టర్ హ్యూగో రచించిన తాజా పుస్తకాన్ని నేను ఇక్కడే కొన్నాను." అంటూ ప్రస్తుతించాడు.

అయితే 1925 లో ఈ హిగ్గిన్ బాథంస్ గ్రూప్ ని స్పెన్సర్ గ్రూప్ కొనుగోలు చేసింది. మళ్ళీ చేతులు మారి అనంత కృష్ణన్ కి చెందిన అమాల్గమేషన్ గ్రూప్ కి సొంతమయింది. 1990 దాకా కూడా హిగ్గిన్ బాథంస్ పెద్ద బుక్ స్టోర్స్ చైన్ గానే ఉండింది. ప్రస్తుతం కేవలం 22 బుక్ షాప్ లు మాత్రమే దక్షిణ భారతదేశం లో నడుస్తున్నాయి. అమేజాన్ లాంటి దిగ్గజాలు కోరుకున్న పుస్తకాన్ని ఇంటివద్దకే చేరుస్తున్న ఈ తరుణం లో హిగ్గిన్ బాథంస్ ఒకప్పటి ప్రతిష్ఠ కొంత మసక బారిందనే చెప్పాలి. పుస్తకాల విక్రయం గురించి ఎవరు రాసినా హిగ్గిన్ బాథంస్ కి ఉన్న చరిత్ర కొన్ని పేజీల్లో తప్పక రాయవలసిందే!

----- మూర్తి కెవివిఎస్      



In Nirbhaya Vaarta Daily (18-4-2025)


        


Friday, March 14, 2025

ద బ్లాక్ హిల్ " ఈశాన్య భారత నేపథ్యం లో ఓ గొప్ప నవల

" ద బ్లాక్ హిల్ " ఈశాన్య భారత నేపథ్యం లో ఓ గొప్ప నవల

-------------------------------------------------------------------------------

 మమాంగ్ డాయ్ గురించి మన తెలుగు సాహితీలోకం లో తెలియవలసినంత గా తెలియలేదేమో. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఆమె రచనల గురించి ఇంకా ఎంతో తెలియవలసి ఉంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన బలమైన స్వరాల్లో మమాంగ్ డాయ్ ఒకరు. ఇటీవల ఆమె ఆంగ్ల నవల "ద బ్లాక్ హిల్" చదివిన తర్వాత కొన్ని అంశాలు పంచుకోవాలనిపించింది. ప్రకృతి అందాలకు పర్యాయ పదం ఈశాన్య రాష్ట్రాలు. అయితే అక్కడ జీవిస్తున్న వివిధ గిరిజన తెగల గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి,చరిత్ర లో వారి స్థానం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. పుస్తకాలు లేక కాదు వాటి గురించి బయట ప్రపంచానికి పబ్లిసిటి లేక పోవడం. అలా రరకాల కారణాల వల్ల జరుగుతుంది.

ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న మేబో,జయుల్ ఇంకా టిబెట్ దాకా ఈ కథా ప్రదేశాలు ఉన్నాయి. ఇది చరిత్ర కి కొంత కాల్పనికత అద్దిన నవల అని చెప్పాలి. 1840 నుంచి ఇప్పటి కాలం దాకా సాగిపోతుంది.బ్రిటీష్ వారు అప్పటి ఈశాన్య ప్రాంతాల్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. మిష్మి,అబోర్ తెగలు విదేశీయుల రాకని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాయి. కజిన్ ష, గైమర్ అనే యువ ప్రేమికులు ఈ రెండు తెగలకి చెందిన వారు. ఒక తెగ కి మరో తెగ కి పడదు. అందువల్ల వీరిద్దరూ టిబెట్ కి దగ్గర్లో ఉన్న ఓ అడవి లోకి పారిపోయి జీవనం గడుపుతుంటారు. అక్కడి అరణ్యాల్ని,పర్వతాల్ని,సహజసిద్ధ జీవనాన్ని రచయిత్రి అద్భుతం గా కళ్ళకి కట్టినట్లు రాశారు.

అడవి లో వాగు పక్కనే గుడిసె వేసుకుని నివసిస్తున్న ఆ జంట కి ఓ మగపిల్లాడు పుడతాడు. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చినందుకు ఇరువురు బాధపడుతున్నా ,ఇంతకి మించిన దారి లేదని సముదాయించుకుంటారు. ఇలా ఉండగా నికోలస్ క్రిక్ అనే క్రైస్తవ మిషనరీ ఫ్రాన్స్ నుంచి ఇక్కడకి వస్తాడు.చెన్నయ్ లో ఓడ దిగి,అక్కడ నుంచి కలకత్తా వచ్చి, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పటి అస్సాం లో ని గువాహతి దగ్గర ఓ చిన్న ఊరు కి చేరుకుంటాడు. అక్కడ గది అద్దె కి తీసుకుంటాడు. టిబెట్ కి వెళ్ళాలనేది అతని ఆలోచన. మిష్మి,అబోర్ ఇంకా ఇతర తెగలున్న ప్రాంతాల గుండా వెళ్ళవలసి ఉంటుంది.

స్థానికులైన ఒకరికి డబ్బులు ఇచ్చి టిబెట్ కి దారి చూపమంటాడు. ప్రయాణం అంతా నడక ద్వారా నే సాగుతుంది. దాదాపు పది రోజులు పైన కొండలు,వాగులు దాటుతూ ప్రయాణిస్తారు. చాలా బాధలు పడి అక్కడికి చేరిన తర్వాత అక్కడి అధికారులు మీ దేవుడు మాకవసరం లేదు,ఇక్కడ నుంచి వెళ్ళిపో అని నిరాదరిస్తారు. మళ్ళీ తిరుగు ప్రయాణం లో అడవుల వెంబడి వస్తుండగా కజిన్ ష, గైమర్ లు కనిపిస్తారు. వాళ్ళతో సంభాషణలు రకరకాల విధాలుగా జరుగుతాయి. 

కొన్నాళ్ళు కాపురం చేసిన తరువాత కజిన్ ష, గైమర్ ల మధ్య గొడవులు జరిగి ఆమె భర్త ని విడిచిపెట్టి ఓ రాత్రి పూట పుట్టింటికి చేరుకుంటుంది.అప్పటికే తల్లి మరణిస్తుంది.ఆమె సోదరుడు ఈమె ని ఆదరిస్తాడు. పుట్టిన కొడుకు వచ్చే దారి లో మరణిస్తాడు. ఆ అడవి లోనే కప్పెడుతుంది.మళ్ళీ  విచారం గా రోజులు గడుపుతూ ఉండగా , అటు కజిన్ ష కూడా తమ మిష్మీ తెగకి చెందిన స్వగ్రామానికి  చేరుకుంటాడు. మిషనరీ నికోలస్ క్రిక్  పట్టువదలని విక్రమార్కునిలా మళ్ళీ మిష్మీ కొండప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ చిన్న చర్చ్ నెలకొల్పాలని , జనాలకి అవసరమైన మందుల్ని కూడా తీసుకుని వెళతాడు.

ఈసారి క్రిక్ కి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే కొంతమంది శత్రువులు కూడా ఏర్పడి ఇతనికి ఆటంకాలు కలిగిస్తుంటారు. చివరకి ఈయన్ని ఓ వాగు దగ్గర కత్తి తో నరికి చంపుతారు. ఇతడిని మాత్రమే కాకుండా సహాయకారి గా వచ్చిన మరో విదేశీ మిషనరీ ని కూడా చంపుతారు. దానితో బ్రిటిష్ సైనికాధికారులు సీరియస్ గా తీసుకుని స్థానికం గా ఉన్న కొంతమందిని డబ్బు తో కొని కొండప్రాంతాల్లోని మిష్మీ తెగ వారిని ఊచకోత కోసి కజిన్ ష ని బందీ గా తీసుకువెళతారు. ఆ తర్వాత గైమర్  ఈయన కోసం చేసింది,అక్కడి ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారు, ఇదంతా తెలియాలంటే నవల మొత్తం చదవాలి.

ఈశాన్య భారత దేశం లోని కొన్ని తెగల జీవన శైలిని తెలుసుకోవాలంటే ఈ నవల బాగా ఉపయోగపడుతుంది.విదేశీ జాతుల్ని నిలువరించడం లో వారి యుద్ధ నైపుణ్యం తెలియవస్తుంది. ఏ జంతువు నైనా చంపకుండా ,వాటితో ఎలా కలిసి జీవించాలో మమాంగ్ డాయ్ చిత్రించిన విధానం వాస్తవానికి దగ్గరగా ఉంది. అంతదాకా ఎందుకు, స్వర్గతుల్యమైన మిష్మి కొండల నడుమ మనల్ని ఊపిరి సలపనీయకుండా నడిపిస్తారు.

దీంట్లో చాలా సంఘటనల్ని ఏ రికార్డుల నుంచితీసుకున్నదీ సోదాహరణగా చెప్పినపుడు కల్పితం కంటే కొన్నిసార్లు వాస్తవమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రచయిత్రి మమాంగ్ డాయ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి 1979 లో IAS కి ఆ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి గా సెలెక్ట్ అయినారు. ఆ తరువాత కొన్నాళ్ళకి  రాజీనామా చేసి తనకి ఎంతో ఇష్టమైన జర్నలిజం లో కొనసాగారు. టెలిగ్రాఫ్, హిందూస్థాన్ టైంస్ లోనూ రాసేవారు.

----- మూర్తి కెవివిఎస్ 

(పేజీలు :296 , వెల :499, అలీఫ్ కంపెనీ ప్రచురణ )  

Wednesday, March 5, 2025

పుస్తకపఠనం వల్ల ఊహించని లాభాలున్నాయి!


పుస్తకపఠనం వల్ల ఊహించని లాభాలున్నాయి!

---------------------------------------------------------------

 ఇంకా మీరు ప్రింట్ చేసిన పుస్తకాల్ని చదువుతున్నారా? అంతా సోషల్ మీడియా లోనూ,ఇంకా  ఈ పేపర్ల ని, పి.డి.ఎఫ్. ల్ని చదువుతున్నారు. ఎందుకు ఆ పాత పద్ధతి అని ఎవరైనా అంటే వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోలేదని అర్థం. అదేమిటంటే బిల్ గేట్స్,ఎలన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఇంకా ఇప్పటికీ ప్రింట్ పుస్తకాల్ని చదువుతూనే ఉన్నారు. వాళ్ళకి కంప్యూటర్ లు లేకనా లేదా ఉపయోగించటం రాకనా? మరోవైపు ఎలెక్ట్రానిక్ వెర్షన్స్ లో చదువుతున్నప్పటికీ వాళ్ళు ప్రింట్ పుస్తకాలు చదవటం మానలేదు. ప్రింట్ చేసిన పుస్తకానికి ఉండే సౌలభ్యం వేరు. అది పాఠకులకి అందరకీ తెలుసు.

మరొక అంశం ఏమిటంటే పుస్తకపఠనం వల్ల బ్రెయిన్ కి వ్యాయామం జరిగి క్రిటికల్ థింకింగ్,ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఏకాగ్రత,జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. మనం చదువుతున్న కొద్దీ మెదడు లోని న్యూరాన్లు వాటి పనితనాన్ని పెంచుకుంటాయి. అందుకే రోజుకి కొంత సేపు అయినా పుస్తక పఠనం చేయడం మానరాదు. అవసరమైతే కొన్ని గంటల సేపు చదివినా మీ మెదడు అలిసిపోదు.కానీ అదే పనిగా సిస్టం లో చదివితే తప్పనిసరిగా కళ్ళనొప్పి,నిద్ర లేమి, మతిమరుపు లాంటివి చోటు చేసుకుంటాయి. స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించితే మరింత త్వరగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఎవరికి వాళ్ళకి ఇవి తెలుస్తూనే ఉంటాయి,కానీ అవి తీవ్ర రూపం దాల్చితే తప్పా చాలా మంది గమనించరు.కాబట్టి కంప్యూటర్ ని తప్పనిసరిగా ఉండే అవసరాలకి మాత్రమే ఉపయోగిస్తే మంచిది. స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఇంటికి వస్తే చాలు గంటలకొద్దీ విరామం లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. దీని ప్రభావం వాళ్ళ మీద పడుతూనే ఉంది. తల్లి మందలించిందని,టీచర్ మందలించిందని చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకి పాల్పడటం చేస్తున్నారు. దీని వెనుక సామాజిక కారణాలకంటే వారి మెదడు లోని న్యూరాన్లు పనితనం దెబ్బతినడం ఇంకా ఆందోళన,ఒత్తిడి పెరగడం మూలంగా ఇలాంటి ఆఘాయిత్యాలకి ఒడిగడుతున్నారు.

 కనీసం రోజుకి 30 నిమిషాలు పాటు పుస్తక పఠనం చేయడం వల్ల ఫిజికల్ ఇంకా ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కనుక సాధ్యమైనంతవరకు పిల్లలకి ఈ విషయం చెప్పి స్మార్ట్ ఫోన్ వాడే సమయాన్ని తగ్గించాలి. మన దేశం లో 71 శాతం మంది వార్తల్ని ఆన్ లైన్ లో చూస్తున్నట్లు తేలింది. కేవలం 29 శాతం మంది మాత్రమే ప్రింట్ వెర్షన్స్ చదువుతున్నారు. ముఖ్యమైన హెడ్ లైన్స్ ని, బ్రేకింగ్ న్యూస్ ని ఆన్ లైన్ లో చూసినా వార్తల్ని వివరంగా చదవడానికి ప్రింట్ అయిన పేపర్ ని చదవాలి. దానివల్ల కంటికి,మెదడు కి కలిగే మార్పు ని ఎవరికి వారే అనుభవించగలరు. కేరళ లో ఎక్కువ అక్షరాస్యత ఉన్నప్పటికి ప్రింట్ వెర్షన్స్ ని కొని చదివే విషయం లో మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ముందున్నాయి. 

----- మూర్తి కెవివిఎస్ (78935 41003)




Sunday, February 2, 2025

తోడేలు ప్రత్యేకత దేనికీ లేదు

 తోడేలు అనగానే కుక్క లాంటి మరో జంతువు అనుకుంటాము. రూపం లో కుక్క కి దగ్గర గా ఉన్నప్పటికీ తోడేలు చాలా ప్రత్యేకతలు ఉన్న జంతువు. కుక్క ని పెంచుకుని మన ఇంట్లో కాపలా ఉంచుకోవచ్చు. శిక్షణ ఇస్తే చెప్పిన పనులు చేస్తుంది.కానీ తోడేలు అలా కాదు.దాన్ని మన ఇంట్లో పెంచుకుని శిక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తే అది మనం చెప్పినట్లు చెయ్యదు.అసలు మచ్చిక కావడం కూడా కష్టం అంటున్నారు నిపుణులు. మన దేశం లో ఎక్కువ గా బూడిద రంగు లో ఉన్న తోడేళ్ళు ఉన్నాయి. ఇవి చాలా తెలివైనవి.

చింపాంజీ,ఏనుగు,డాల్ఫిన్ ఇలాంటి పది అత్యున్నత తెలివైన జంతువుల్లో ఇది కూడా ఒకటి. వాటి పిల్లలకి వేట గురించి నేర్పించడమే కాకుండా , వాటికి గాయాలు తగిలితే మనుషుల్లాగానే జాగ్రత్తలు తీసుకుంటాయి. సాధ్యమైనంత వరకు మనుషులకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. చూడటానికి గాని,ఫోటో తీసుకోవడానికి గాని తోడేళ్ళకి కనీసం 100 యార్డ్ లు దూరం ఉండటం మంచిది. అవి కౄర జంతువులు అనే విషయం గుర్తుంచుకోవాలి.

తోడేళ్ళని కొన్ని దేశాల్లో మృత్యువు కి, వినాశనానికి సంకేతం గా పరిగణిస్తారు. అయితే రోమన్ పురాణాల్లో వీటికి గౌరవనీయమైన స్థానమున్నది. హిట్లర్ తమ మూడు మిలటరీ స్థావరాలకి హెర్ వుల్ఫ్, కండక్టర్ వుల్ఫ్, వర్ వుల్ఫ్ అనే పేర్లు పెట్టాడు. వ్యవసాయానికి,యుద్ధానికి అధి దేవతలుగా తోడేళ్ళని భావించడం వల్ల చాలా పాశ్చాత్య దేశాల్లో వాటిని వేటాడరు.మనం కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో కూడా చూసి ఉంటాం.అడివి లో తోడేలు ఎదురైతే తుపాకి ని గాల్లోకి పేల్చి వాటిని వెళ్ళగొడతారు తప్పా చంపరు. 

రొములస్,రెముస్ అనే చంటిపిల్లల్ని అడివి లోకి తీసుకెళ్ళి చంపమని అమూలియస్ అనే రాజు ఆజ్ఞాపించగా వాళ్ళని కొన్ని తోడేళ్ళు పాలిచ్చిపెంచాయని రోమన్ పురాణాల్లో ఒక ఉదంతం ఉన్నది. దానివల్ల తోడేలు విషయం లో వాళ్ళకి ఓ సెంట్ మెంట్ ఉందనుకోవాలి. ఇవి దుప్పి,కుందేలు,చిట్టెలుక,పక్షులు ఇంకా చిన్న జంతువుల్ని వేటాడి తింటాయి. మనుషుల్ని చంపిన ఉదంతాలు తక్కువ.అయితే ఇవి మంద గా ఉన్న సమయం లో ఎంతకైనా తెగించే అవకాశం ఉంది.

6 నుంచి 13 సంవత్సరాలు జీవించే ఈ తోడేళ్ళు అన్యోన్య దాంపత్యానికి మారు పేరు అని చెప్పవచ్చు.ఒక ఆడ తోడేలు జీవితాంతం ఒక మగ తోడేలు తోనే ఉంటుంది. ఇది మరే జంతువు లోనూ కనబడదు. మంద లో ఉన్నప్పటికీ ఎవరి పనులు అవి విభజించుకుని చేస్తాయి.ఆహారం కూడా మంద లో ఉన్న తోడేలు నాయకుడు తిన్న తర్వాత మిగతావి తింటాయి. ఒకేసారి 9 కిలోల మాంసాన్ని కూడా ఇవి తినగలవు. 

6 అడుగుల పొడవు,30 నుంచి 50 అంగుళాల ఎత్తు ఉండే తోడేళ్ళు పుట్టిన పిల్లల ని మనుషుల మాదిరిగానే ఆహారం ఇవ్వడం లోనూ,దెబ్బలు తగిలితే ఆదుకోవడం లోనూ జాగ్రత్త గా ప్రవర్తిస్తాయి. వీటికి నలభై రెండు పళ్ళు ఉంటాయి.పుట్టిన వెంటనే పిల్లలకి కొన్ని రోజులపాటు కళ్ళు,చెవులు పనిచేయవు. కిర్గిస్థాన్ దేశ ప్రజలు తోడేలు కలలోకి వస్తే మంచిదని నమ్ముతారు. రాజస్థాన్ ,గుజరాత్,కర్నాటక,మధ్య ప్రదేశ్,మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్ ఇంకా హిమాలయ సానువుల్లో కూడా గణనీయం గా ఉన్నాయి.

తోక ఊపడం,ముఖ కవళికలు,నోటి ద్వారా చేసే శబ్దాలు వీటన్నిటిని చేస్తూ వాటిలో ఆవి మాట్లాడుకుంటాయి. వేటాడేప్పుడు జంతువు ని బాగా ఉరికేలా చేసి అవి అలిసిపోయినప్పుడు మందగా పడి చంపుతాయి.ఇక యూరేషియన్ తోడేళ్ళు తెలివి గురించి చెప్పాలంటే , వేట కుక్క వచ్చినపుడు ఎరగా ఆడ తోడేలు ని దాని దగ్గరకి పంపి ట్రాప్ చేసి చంపుతాయి.అమెరికా లో తోడేళ్ళ సంఖ్య 60,000 కాగా (పాత) రష్యా లో కూడా 60,000  దాకా ఉన్నాయి. మిగతా యూరపు దేశాల్లో కూడా 20,000 దాకా ఉన్నాయి. మన దేశం లో కేవలం డార్జిలింగ్ లో మాత్రమే తోడేళ్ళ కి సంభందించిన సంరక్షణ కేంద్రం ఉన్నది. 


----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003)