Thursday, January 1, 2026

ప్రస్తుతం చైనా లో కూడా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పెరుగుతున్నారు

 ప్రస్తుతం చైనా లో కూడా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పెరుగుతున్నారు. చైనా వాళ్ళు మెడిసిన్, ఇంజనీరింగ్, స్పేస్ సైన్స్ ఇలాంటి కోర్సులు అన్నీ వాళ్ళ చైనీస్ భాష లో నే చదువుతారని అనుకునే వాళ్ళం. అయితే మారుతున్న రోజుల్ని బట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం 400 మిలియన్ల చైనీయులు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఆయా శిక్షణా కేంద్రాల్లో చేరారు. చైనా,జపాన్ లాంటి దేశాల్లో వాళ్ళ సొంత భాషల్లోనే అన్నీ నేర్చుకుంటున్నారు. మన దేశం లో అది ఎందుకు వీలుపడదు అని కొందరు అంటూ ఉంటారు.

చైనా మొత్తం లో ఒకే భాష అధికార భాష. అది మాండరిన్, దేశం మొత్తం లో 80 శాతం మందికి పైగా ఆ భాష మాట్లాడతారు.అలాగే జపాన్ దేశం లో మిహాంగో అనబడే జపనీయ భాషని 99 శాతం మంది మాట్లాడుతారు. కాబట్టి ఆయా భాషల్లో బోధించడం కష్టమేమీ కాదు.అదే మన దగ్గర చూస్తే దేశ భాష గా చెప్పబడే హిందీ ని 40 శాతం మందే మాట్లాడుతారు.మిగతా వాళ్ళు వివిధ ప్రాంతీయ భాషలు మాట్లాడుతారు. దానివల్ల పెద్ద సంఖ్య లో ఉండే నిరుద్యోగులకు లింక్  భాష గా ఇంగ్లీష్ ఉంటేనే ఏ ఇతర రాష్ట్రానికి అయినా వెళ్ళి ఉద్యోగం పొందడానికి వీలుగా ఉంటుంది. అందునా చైనా లాంటి దేశం లోనే భేషజాలు విడిచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.

గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం కుగ్రామమై పోయింది. ఇంటర్నెట్ లేనిదే రోజు గడవడం కష్టమైపోయింది.ఇంగ్లీష్ భాష కి ఉన్న ప్రాముఖ్యం మీడియా పరంగా కూడా బాగా పెరిగింది. నెట్ లో ఉన్న 54 శాతం వార్తా చానెళ్ళు ఇతర వెబ్ సైట్ లు ఇంగ్లీష్ లోనే వెలువడుతుండగా, రెండవ స్థానం లో ఉన్న స్పానిష్ భాషలో కేవలం 5.6 శాతం మాత్రమే వెలువడుతున్నాయి. 98 శాతం సైన్స్ మరియు సాంకేతిక పరమైన మేగజైన్లు ఆంగ్లం లో వెలువడుతున్నాయి.2022 లో లభ్యమైన డేటా ప్రకారం అ భాషని నేర్పడానికి వెలసిన శిక్షణా కేంద్రాల మార్కెట్ 19.17 అమెరికన్ బిలియన్ డాలర్లు గా ఉన్నది.

ఇంగ్లీష్ ఈ రోజున 58 దేశాల్లో అధికార భాషగా ఉంది. 142 దేశాల్లో తమ ఎడ్యుకేషన్ పాలసీ లో తప్పనిసరి గా చేశారు. మన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రపంచం అంతటా వ్యాపించడానికి ఆంగ్ల భాషా పరిజ్ఞానమే కారణం.    ఒకప్పుడు ఇంగ్లీష్ లో రాసే భారతీయులు చాలా తక్కువ గా ఉండేవారు. ప్రస్తుతం యువతరం ఐ.టి. రంగం ఇంకా ఇతర కార్పోరేట్ రంగాల నుంచి ఎంతోమంది ఇంగ్లీష్ లో రాస్తూ దేశ విదేశాల్లో మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముతున్నారు. ఆ మేరకు పబ్లిషింగ్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది.అమిత్ త్రిపాఠి,దేవ దత్ పట్నాయక్, దుర్జయ దత్తా, చేతన్ భగత్, ఆనంద్ నీలకంఠన్, రవీందర్ సింగ్, అనూజా చౌహాన్, శరత్ కొమర్రాజు, సుదీప్ నాగర్కర్,ఇలాంటి ఎందరో నేడు ఇంగ్లీష్ లో లవ్,క్రైం,థ్రిల్లర్,స్పిరిచ్యూల్ వంటి జానర్ లలో రాస్తూ భారత దేశ సరిహద్దులు దాటి తమ గళాన్ని వినిపిస్తున్నారు. కనుక ఈ రోజున ఇంగ్లీష్ ఎంత మాత్రం పరాయి భాష కాదు.   

ఒకవైపు ఇంగ్లీష్ లో రాస్తూనే తమ మాతృభాష లోకూడా విరివిగా రాస్తున్న వారు అనేక రాష్ట్రాల్లో అనేకమంది ఉన్నారు. కనుక ఇంగ్లీష్ వచ్చి స్థానిక భాషల్ని నాశనం చేస్తుందనేది పూర్తి సత్యం కాదు. ఉదాహరణకి కేరళ రాష్ట్రం తీసుకుంటే మళయాళ మనోరమ గ్రూప్ "ద వీక్" అనే ఇంగ్లీష్ పక్ష పత్రిక ను నడుపుతుంది.మళయాళ దినపత్రికల్ని కొనేవారు కూడా చాలామంది ఆ వీక్లీ కొంటారు.అంత మాత్రం చేత అక్కడ స్థానిక భాషలో వెలువడే దిన పత్రికలు ఏమీ దెబ్బ తినలేదు.పైగా ఆ ఇంగ్లీష్ పత్రిక వల్ల కేరళ కి చెందిన ఆర్ట్ గ్యాలరీలు,పర్యాటకం,కళలు,వివిధ రంగాల్లోని వ్యక్తులు దేశ సరిహద్దు దాటి ప్రఖ్యాతి పొందుతుంటారు. అలాగే తమిళ నాడు కి ఇంగ్లీష్ లో ప్రచురించబడే ది హిందూ,ఫ్రంట్ లైన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఆయా రాష్ట్రాలకి చెందినవి అవడం మూలంగా, పేరుకి జాతీయ పత్రికలు అయినప్పటికి ఆ రాష్ట్రాల విషయాల్ని చాలా ప్రాధాన్యత ని ఇచ్చి ప్రచురించుకుంటాయి. గమనిస్తే ఇలాంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి.    

 --- మూర్తి కెవివిఎస్ (7893541003)

Saturday, December 13, 2025

అలనాటి బెంగాలీ, ఒరియా సమాజాల దర్పణం ఈ ఆత్మకథ

 అలనాటి బెంగాలీ, ఒరియా సమాజాల దర్పణం ఈ ఆత్మకథ

-------------------------------------------------------------------------------

 గోపీనాథ్ మొహంతి. ఈ పేరు వినగానే చాలామంది సాహితీపిపాసులు ఆయన ఒక గొప్ప నవలాకారుడని చెబుతారు. మౌలికంగా ఆయన ఒరియా భాష లో రాసినప్పటికీ అమృత సంతానం,పరజ వంటి నవలలు తెలుగు లోకి కూడా అనువాదం కావడం తో వాటికి ఎనలేని ఖ్యాతి కలిగింది. ముఖ్యంగా ఆయన కోంధ ఆదివాసి తెగ ఆలంబనగా రాసిన అమృత సంతానం భారతీయ సాహిత్య చరిత్ర లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. 

1955 లో ఆ నవలకి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఆ తర్వాత అది ఇంగ్లీష్ లోకి ఇంకా ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడింది. అలాగే మటి మటాల అనే ఒరియా నవల కి జ్ఞానపీఠ పురస్కారం వరించింది. నవలలు, కథలు,వ్యాసాలు విరివిగా రాశారు. తన చివరి దినాల్లో అమెరికా లోని సాన్ జోస్ యూనివర్శిటీ లో ఆంథ్రోపాలజీ పాఠాలు చెబుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు.

అయన 1914 లో కటక్ ప్రక్కనే ఉన్న నాగావళి అనే గ్రామం లో జన్మించి 1991 లో అమెరికా లోని సాన్ జోస్ లో మరణించారు. గోపీనాథ్ మొహంతి తన జీవిత కాలం లో ఇంచుమించు విద్యార్థి దశనుంచి తాను మరణించే వరకు డైరీ రాసుకున్నారు. వాటన్నిటినీ కలిపి ఆయన ఆత్మకథ గా ఒరియా భాష లో గ్రంథ రూపం లో తీసుకొచ్చారు. ఆ తరువాత విస్తృతం గా ఇతర భాషల్లో కూడా ఉన్న ఆయన అభిమానుల కోసం ఇంగ్లీష్ లో కూడా అనువాదం చేశారు. 

మొదటి భాగం పేరు srotaswati (The Flowing stream) అనువాదకురాలి పేరు సుధేష్ణ మొహంతి. గోపీనాథ్ మొహంతి తను బతికిఉన్న రోజుల్లో తన ఆత్మ కథ కి సంబంధించి వారసులకి కొన్ని కండీషన్లు పెట్టారుట. ఒకటి తను పోయిన తర్వాతనే దాన్ని ప్రచురించాలి, అలాగే టైటిల్ ని స్రోతస్వతి అని ఉంచాలి, అలాగే అట్ట మీద తాను వేణువు వాయిస్తున్న ఫోటో ని ముద్రించాలి అంటూ ఆయన పెట్టిన షరతులన్నిటినీ వారసులు తుచ తప్పకుండా పాటించారు.              

ఈ గోపీనాథ్ మొహంతి గారి ఆత్మ కథ వల్ల మనకి చాలా విషయాలు, ముఖ్యంగా , దేశం స్వేఛ్చా వాయువులు పీల్చక ముందు తూర్పు దిశలో ఉన్న భారతీయ సమాజం ఎలా ఉండేది అనేది చక్కగా తెలుస్తుంది. తాను రచయిత గా, ఆలోచనాపరునిగా ఎదగడం లో తన చుట్టు పక్కన ఉన్న ప్రజలు ఎలా సహకరించారు అనేది చెబుతూనే తాను ఎదుర్కున్న విభిన్న సాంఘిక సంఘర్షణల్ని మన కళ్ళ ముందు ఉంచుతారు. కటక్ ప్రక్కనే గల నాగావళి అనే గ్రామం లో జన్మించిన గోపీనాథ్ ఆరేడు ఏళ్ళ  వరకు పాఠశాల కి వెళ్ళలేదు. ఇంటిదగ్గరే అక్షరాలు నేర్చుకున్నాడు.

 అప్పట్లో బీహార్ ,ఒరిస్సా,బెంగాల్ అంటూ ప్రత్యేకం గా లేవు. సంస్థానాలు ఉండేవి. తనతండ్రి సోనే పూర్ మహారాజా ఆస్థానం లో పనిచేస్తు అనారోగ్యం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామానికి వచ్చేయడం తో చాలా బాధలు పడతారు. కుటుంబ దీనస్థితి చూసి మళ్ళీ ఆయన ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవడం తో 58 వ యేట సర్వేయర్ గా ఉద్యోగం వస్తుంది.

నాగాబళి నుంచి సోనే పూర్ అక్కడ నుంచి ప్రస్తుత పాట్నా కి మకాం మారుతుంది. పాట్నా లో గోపీనాథ్ యొక్క పెద్దన్నయ్య చిరుద్యోగి. తండ్రి మరణించిన తరువాత పాట్నా లోనే ఎక్కువ కాలం ఉంటాడు. అప్పటి పాట్నా విశాలమైన రోడ్లతో,ప్రణాళికాబద్ధమైన నివాసాలతో , మంచి విద్యాలయాలతో ఉండేదని వివరిస్తాడాయన. కటక్ నుంచి పాట్నా వెళ్ళడానికి మూడు రైళ్ళు మారవలసి ఉండేదని చెబుతారు. 

బెంగాలీ వాళ్ళు ఎక్కువ గా ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా ఉంటూ వారి ప్రత్యేకతని చూపించేవారు. వాళ్ళలో ప్రతి కుటుంబం లోనూ కలకత్తా నుంచి వచ్చే సాహిత్య, సామాజిక పత్రికలు కనిపించేవి. పెద్దలూ పిన్నలూ వాటిని చదువుతూ ముచ్చటించుకునేవారు. మరి తమ ఒరియా ప్రజలు ఎందుకని పాట్నా లో ఇంతమంది ఉన్నా అలాంటి పత్రికల్ని తెప్పించరు అని గోపీ నాథ్ కి ఆలోచన వచ్చేది.

రబీంద్ర నాథ్ ఠాగోర్, శరత్ చంద్ర, బంకీం బాబు ఇలా ఎంతోమంది ప్రసిద్ధ రచయితలు ఒక డజన్ పైగా బెంగాలీ లో ఉన్నారు. మరి ఆ విధంగా ఒరియా లో ఎవరైనా ఉన్నారా అని తన బెంగాలీ క్లాస్ మేట్ యొక్క తల్లి అడిగినప్పుడు గోపీ నాథ్ తనకి తెలిసిన సరళా దాస్, బలరాం దాస్ వంటి పూర్వ కాలం కవుల పేర్లు చెబుతాడు. వాళ్ళందరూ రామాయణ,మహా భారతాల్ని అనువదించిన పూర్వ కాలం వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రతి భాష లోనూ ఉన్నారు.

నేను అడిగేది సమకాలీన రచయితల గురించి అని ఆమె అనడం తో గోపీనాథ్ మిన్నకుండి పోతాడు. ఇలాంటి కొన్ని సన్నివేశాలు అతని లో ఒరియా సాహిత్యం పట్ల అనురక్తిని పుట్టిస్తాయి. తమ భాష ని, రచయితలని గర్వంగా చెప్పలేని ఏ సమాజానికి గౌరవం ఉండదు. ప్రపంచం లోని ప్రతి గొప్ప జాతి చరిత్ర లో గొప్ప సాహిత్యకారులున్నారు అనేది నాకు క్రమేపి అర్థమయింది అని గోపీనాథ్ అంటారు.

పాట్నా లోని ఆయన స్కూల్ జీవితం నాటి విద్యా వ్యవస్థ యొక్క తీరు తెన్నుల్ని తెలియపరుస్థుంది. ఒక వైపు ఒరియా సాహిత్యాన్ని, మరో వైపు ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుతూ ఉపాధ్యాయులకి ప్రీతిపాత్రుడవుతాడు. విద్యాధికారి గా ఉన్న ఓ బ్రిటీష్ జాతీయుడు వీరి స్కూల్ ని సందర్శించినప్పుడు గోపీనాథ్, షేక్స్ పియర్ నాటకాల్ని వర్ణించిన తీరు ని చూసి ప్రత్యేకంగా రెండు రోజులు సెలవు మంజూరు చేస్తాడు. 

పాట్నా నుంచి కటక్ తిరిగివచ్చిన తరువాత ఆ ప్రాంతానికి, ఒరియా సమాజానికి ఉన్న తేడాల్ని గమనించిన విధానం ఎంతో లోతు గా ఉంటుంది. బెంగాలీ లు తమ ఆధిపత్య వైఖరి తో ఒరియా ప్రాంతానికి చెందిన జయదేవుడిని, చైతన్య మహా ప్రభువుని ఇంకా ఇతరుల్ని తమ వారిగా ప్రచారం చేసుకోవడాన్ని దీనిలో తీవ్రంగా ఖండించాడు. అలనాటి ఎన్నో సామాజిక,సాంస్కృతిక విషయాల్ని మనం తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.

--- మూర్తి కె.వి.వి.ఎస్ (78935 41003)                 

Saturday, September 27, 2025

సెమెటిక్ భాషలు అంటే...

 తరచుగా మనం సెమిటిక్ లేదా నాన్ సెమిటిక్ భాషలు గురించి పేపర్లలో చదువుతుంటాం. అలాగే సెమిటిక్ లేదా నాన్ సెమెటిక్ మతాలు అనే మాట కూడా వింటూంటాం. కాని చాలామందికి ఈ విషయం లో కొన్ని సందేహాలు ఉంటాయి. ఏవి సెమిటిక్ భాషలు లేదా సెమెటిక్ మతాలు అని. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ,నార్త్ ఆఫ్రికా లో ఉన్న దేశాల్లోనూ, హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాల్లోనూ మొత్తం మీద 330 మిలియన్ల ప్రజలు సెమెటిక్ భాషలు మాట్లాడుతుంటారు. ముఖ్యమైన భాషలు వీటిల్లో చెప్పాలంటే అరబిక్,హిబ్రూ,అరామిక్ భాషలుగా చెప్పాలి.దీంట్లో అరబిక్ భాష చాలా విస్తారంగా మాట్లాడుతారు. సెమెటిక్ అనే పదం షెం అనే నోవా కుమారుడి పేరు మీద వచ్చింది.

ఇక సెమెటిక్ మతాలు- జూడాయిజం,క్రిస్టియానిటి,ఇస్లాం ఈ మతాల్ని సెమెటిక్ మతాలుగా వ్యవహరిస్తారు. అంటే పశ్చిమాసియా లో జన్మించిన మతాలుగా చెప్పవచ్చు. ఇరాక్, ఇజ్రాయెల్, లెబనాన్, ఈజిప్ట్,ఇథియోపియా,అల్జీరియా లాంటి దేశాల్ని సెమెటిక్ దేశాలుగా పేర్కొంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ మూడు మతాల్ని అబ్రహామిక్ మతాలుగా పిలుస్తారు. కారణం ఈ మూడు మతాలు అబ్రహాం ని మొదటి ప్రవక్త గా భావిస్తాయి.దానివల్ల ఆయన పేరు మీదుగా అలా పిలుస్తారు. అబ్రహామిక్ మతాల్లో ఉండే కామన్ పాయింట్ ఏమిటంటే ఏకోశ్వరోపాసన. యూదులు యొహావా లేదా ఇలోహిం,లేదా హాషెం ని సర్వసృష్టికర్త గా భావించి పూజిస్తారు.


  

Wednesday, September 24, 2025

వేలాది పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు

 ప్రపంచ సాహిత్యం లో ప్రసిద్ది వహించిన ఎన్నో పుస్తకాలు, ముఖ్యంగా ఆంగ్ల భాషలోనివి చదవాలని కొంతమందికి అనిపిస్తుంది. పుస్తకాల రేట్లు ఎక్కువ గా ఉన్నాయనో లేదా తమకి నచ్చిన పుస్తకం దొరకలేదనో నిరాశ పడుతుంటారు. సుమారుగా 75 వేల పుస్తకాల కి సంబంధించిన రాశి మనకి ఒక వెబ్ సైట్ లో లభిస్తుంది. అదీ ఉచితంగా నే సుమా. మీరు నెట్ లో వాటిని చదవ వచ్చు. లేదా పి.డి.ఎఫ్. లు గా డౌన్ లోడ్ చేసుకుని మీకు ఖాళీ ఉన్న సమయం లో చదువుకోవచ్చు. ఈ-పబ్, కిండిల్, హెచ్.టి.ఎం.ఎల్. ఇంకా టెక్స్ట్ రూపం లో సైతం మీకు అవి అందుబాటు లో ఉంటాయి. మీరు ఎలాంట్ ఫీజు చెల్లించనవసరం లేదు.

ప్రపంచ సాహిత్యం లో పేరున్న రచనలే కాకుండా వివిధ రకాల చదువరులకు ఆసక్తి ఉండే అన్ని రకాల పుస్తకాలు మనకి అందుబాటు లో ఉంటాయి.సాహిత్యం, చరిత్ర, సైన్స్, టెక్నాలజీ, సోషల్ సైన్స్, మతం, ఫిలాసఫీ, మెడిసిన్,హాబీస్ ఇలా ఇంకా అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వెబ్ సైట్ లో కి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాన్ని చదవవచ్చు. లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ వెబ్ సైట్ పేరు గ్యూటెన్ బర్గ్ డాట్ ఆర్గ్. (www.gutenberg.org) దీంట్లో ఉంటే పుస్తకాలు కాపీరైట్ గడువు తీరిన పుస్తకాలు కాబట్టి మీరు ఇతరులకి బహుమతిగా కూడా పంపవచ్చు.

అనేకవేలమంది వాలంటీర్లు ఈ సైట్ లోకి పుస్తకాల్ని ఉచితంగా అప్ లోడ్ చేస్తుంటారు. నిజానికి ఇది ప్రయాస తో కూడుకున్నదే అయినప్పటికీ తమ అమూల్యమైన సమయాన్ని పుస్తక ప్రియులకోసం వెచ్చిస్తుంటారు. సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన పుస్తకం యొక్క వివరాల్ని సులభం గా తెలుసుకోవచ్చు. ఎలాంటి యాప్స్ అవసరం లేదు. మీకు వారి పని విధానం నచ్చితే చిన్న డొనేషన్ ఇవ్వవచ్చు.దాని కోసం పేపాల్ బటన్ ఉన్నది. డొనేషన్ తప్పనిసరి కాదు. మీ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని 1971 లో మైకేల్ ఎస్ హార్ట్ అనే పుస్తకప్రియుడు ఆరంభించాడు. ఆ తర్వాత ఇలాంటి వెబ్ సైట్ లు ఇంకొన్ని వచ్చినా ఈ గ్యూటెంబర్గ్ వెబ్సైట్ లో ఉన్న తేలికదనం వేరు.

----- మూర్తి కెవివిఎస్ (7893541003)


      

Saturday, September 13, 2025

జైన రామాయణం లో రావణుడిని సంహరించేది లక్ష్మణుడు

 జైన రామాయణం లో రావణుడిని సంహరించేది లక్ష్మణుడు

-----------------------------------------------------------------------------

శ్రీమద్ రామాయణం ఎవరు రాశారు అంటే ఎంత ఆధునిక కాలం లో జీవిస్తున్న యువతరమైనా వాల్మీకి మహర్షి రాశాడని చెబుతారు. ఇప్పటికీ అంత ప్రాచుర్యం ఉంది. ఆయన తర్వాత అనేకమంది ఇంచుమించు అలాంటి పాత్రల్ని,సన్నివేశాల్ని తీసుకుని ఎవరిదైన శైలిలో వారు రాశారు. కాంబోడియా, వియాత్నం, ఇండోనేషియా , థాయ్ లాండ్ వంటి దేశాల్లో కూడా రామాయాణాన్ని పోలిన భక్తి పరమైన గ్రంథాలు వచ్చాయి. 

అవి చదువుతుంటే ఇతివృత్త నిర్మాణం, కథ నడిచే పద్ధతి అంతా రామాయణాన్నే తలపిస్తాయి. కాకపోతే పాత్రల పేర్లు కొంత వేరే రూపాన్ని సంతరించుకున్నట్లు కనిపిస్తాయి. వాల్మీకి మహర్షి 24 వేల సంస్కృత శ్లోకాల్లో ఈ మహత్తరమైన గ్రంథాన్ని వెలయించారు. క్రీ.పూ.7 నుంచి క్రీ.శ.3 శతాబ్దాల మధ్య కాలం లో వాల్మీకి రామాయణం రాయబడిందని ఆధునిక చరిత్రకారులు చెప్పారు.

అయితే ఈ ఇతిహాసం ఇంకా ప్రాచీనమైనదని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఇన్ని వేల ఏళ్ళు భారతీయుల జీవితాల్లో ఒక భాగమై , మన సమాజాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసిన ఇంకా చేస్తున్న గ్రంథరాజం మరియొకటి ఉందా అంటే లేదనే చెప్పాలి. దానిలోని పాత్రల్ని , విలువల్ని మీరు నచ్చినా నచ్చకున్నా ఇన్ని వేల ఏళ్ళపాటు జీవించగలిగిఉన్నదంటేనే ఆ కథనం లోని సృజనాత్మకత లో దేనిలోనూ లేని ఏదో మార్మికశక్తి ఉన్నదని అర్థం. 

మన భారత దేశం లోనే అనేక మంది పండితులు వాల్మీకి రామాయణాన్ని తిరిగి తమదైన శైలి లో రాశారు. రమారమి 300 కి పైగా వివిధ రామాయణాలు సాధ్యమైనంతవరకు వాల్మీకి రామాయణానికి దగ్గరగా ఉండేలా రాశారు. మరికొందరు కొంతమేరా స్వతంత్ర్య భావనల్ని చొప్పించారు. అంతమాత్రం చేత వాల్మీకి రామాయణం యొక్క ప్రాభవం ఏ మాత్రం చెక్కు చెదరలేదు.

జైన మతం లో కూడా రామాయణం ఉంది. హిందూ మత వటవృక్షం లో ఒక శాఖ వంటిది జైన ధర్మం అని చెప్పవచ్చును. పాత్రల పేర్లు అన్నీ అలాగే ఉంటాయి. ఇతివృత్తం లో వారిదైన స్వేచ్చని ప్రదర్శించారు. వారి ప్రధాన సిద్ధాంతాలైన అహింస ని, తీర్థంకరుల బోధనల్ని దాంట్లో సమ్మిశ్రితం చేశారు. విమలసూరి అనే జైన పండితుడు ప్రాకృత భాష లో ఈ గ్రంథాన్ని క్రీ.శ. 3 లేదా 4 వ శతాబ్దం లో రాసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ రామాయణాన్ని పౌమచరియ లేదా పద్మచరిత్ర అనే పేరు తో వ్యవహరిస్తారు.

 రాముడికి , లక్ష్మణుడికి ఆ పేర్లతో పాటు బల్ దేవ్, వాసు దేవ్ అనే పేర్లు కూడా ఉంటాయి. రావణుడు విద్యాధర వంశానికి చెందిన రాజు. లంకా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. రావణుడికి పది తలలు ఉండవు. కానీ ఆయన పుట్టిన తర్వాత శిశువు గా ఉన్న సమయం లో అతని శిరస్సు పది రకాలైన ఆభరణాల్లో ప్రతిఫలించినట్లు రాశారు. రావణుడు జైన ధర్మాన్ని పాటించే వాడైనప్పటికీ పూర్వ జన్మ కర్మల వలన సీతా దేవి ని అపహరిస్తాడు.  

విచిత్రం ఏమిటంటే జైన రామాయణం లో రావణుడి పాత్ర ని చంపేది లక్ష్మణుడు. ఎందుకంటే రాముడు స్వతహగా జైన దీక్ష తీసుకున్న రాజు కనుక తన చేతి తో హింస చేయడు. ఆ విధంగా రావణుడు,లక్ష్మణుడు మూడవ నరకానికి వెళతారు. హనుమంతుడు కూడా విద్యాధర వంశానికి చెందిన వాడే. ఈయనకి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. 

మామూలు మనిషి లాగే ఉంటాడు. కోతి మూతి ఉన్నట్లు రాయలేదు.అయితే ఆయన రాజ్యం లో కోతులు ఉంటాయి. రావణుడు సీత ని తాకకుండా నే మాయోపాయం తో లంక కి తీసుకొస్తాడు. లక్ష్మణ రేఖ గీయడం, మారీచుని ఘట్టం వంటివి జైన రామాయణం లో లేవు. జైన ధర్మం ప్రకారం ఇష్టపడని స్త్రీ ని బలవంతం చేయకూడదు కనుక లంక లోనే ఒక వనం లో ఉంచే ఏర్పాటు చేస్తాడు.  

లక్ష్మణుడు చనిపోయిన తరువాత ఆయన దేహాన్ని ఖననం చేయకుండా, రాముడు ఎనిమిదేళ్ళపాటు ఉంచి ప్రతిరోజు స్నానం చేయించడం చేయిస్తుంటాడు. 24 తీర్థంకరులలో ఒకరైన ముని సువ్రత్ స్వామి రామునికి జ్ఞానబోధ చేసి తపస్సు చేయమని చెప్పి, అలాగే లక్ష్మణుడి దేహానికి తుది సంస్కారాలు చేయమని చెబుతాడు. ఆ విధంగానే చేసి రాముడు తన శేష జీవితాన్ని తపస్సు చేస్తూనే గడిపి స్వర్గం లో ఉన్న సీతా దేవి ని కలుసుకుంటాడు. 

సీతమ్మ అగ్నిప్రవేశం దీనిలో వేరుగా ఉంటుంది. నీరు వచ్చి అగ్ని ని ఆర్పేస్తుంది. అలాగే రామసేతు ని నిర్మించడం , వానర సేన లంక లో ప్రవేశించడం వంటి ఘట్టాలు లేవు. రాముడిని గొప్ప నిష్ఠాగరిష్ఠుడైన జైన ధర్మాన్ని గౌరవించే రాజు గా దీనిలో చిత్రించారు. జైనులు 24 తీర్థంకరులను , మళ్ళీ వారిలో మహావీరుడు,పార్శ్వనాధుడు, నేమినాథుడు, రిషభ నాథుడు వీళ్ళందరిని ఎంత పూజనీయులుగా చూస్తారో అలాగే రాముడిని కూడా భావిస్తారు.        

----- మూర్తి కెవివిఎస్ (7893541003)


Thursday, July 31, 2025

ఓసారి నిషేధింపబడిన కోకో కోల, దేశం లో నెంబర్ వన్ ఎలా అయింది ?

 

ఓసారి నిషేధింపబడిన కోకో కోల, దేశం లో నెంబర్ వన్ ఎలా అయింది ? 

--------------------------------------------------------------------------------------------

కొకో కోల పేరు తెలియని వారు మన దేశం లో బహుశా ఎవరూ ఉండరు. నగరం గాని, చిన్న పట్టణం గాని, గ్రామం గాని ప్రతి చోట ఆ కంపెనీ కి చెందిన శీతల పానీయాలు తాగుతూనే ఉంటారు. ఏ శుభకార్యాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలన్నా ఆ కూల్ డ్రింక్స్ తెప్పించకపోతే ఏదో లోటులా ఫీల్ అవుతుంటారు. థంస్ అప్, ఫాంటా, స్ప్రైట్ ఇలాంటి డ్రింక్ లన్నీ కూడా కోకో కోల కంపెనీ కి చెందినవనే నిజం చాలా మందికి తెలియదు. ప్రపంచం లోని 200 దేశాల్లో ప్రస్తుతం కోకో కోల తమ ఉత్పత్తుల్ని అమ్ముతోంది. చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని శాసించగలిగే స్థాయి లో ఉండే ఈ బహుళ జాతి సంస్థ అమెరికా లో 1886 లో చిన్న వ్యాపార సంస్థ గా ఊపిరిపోసుకుంది.

జాన్ ఎస్. పెంబర్టన్ అనే వైద్యుడు మందుల్లోకి వాడటానికి కోకో ఆకుల రసం తీసి ఓ సిరప్ తయారు చేశాడు. అదే క్రమేణా అనేక మార్పులు పొందుతూ సాఫ్ట్ డ్రింక్ లా అవతరించింది. ప్రస్తుతం దీనిలో కార్బోనేటెడ్ వాటర్,సుగర్, కరమెల్ కలర్,ఫాస్పరిక్ ఆసిడ్,ఇంకా కొన్ని సహజ ఉత్పత్తులు వాడుతున్నట్లు చెబుతారు.అయితే దీంట్లో ఇంతవరకు ఎవరకీ తెలియని రెండు రహస్యమైన ఉత్పత్తుల్ని కలుపుతారని , అది కేవలం కంపెనీ కి చెందిన ఇద్దరు అధికారులకి మాత్రమే తెలుస్తుందని , దాని అసలు ఫార్ములా అట్లాంటా లోగల సన్ ట్రస్ట్ బ్యాంక్ లోని ఓ వాల్ట్ లో భద్రంగా ఉందనేది జగమెరిగిన సత్యం.

మన దేశం లోనికి కోకో కోల కంపెనీ నిజానికి 1956 లోనే ప్రవేశించింది.ఇరవై ఏళ్ళపాటు ఎదురులేని సాఫ్ట్ డ్రింక్ గా లాభాలు పొందింది. స్థానిక వ్యాపారులకి ఎలాంటి ఈక్విటీ ఇవ్వకుండా వచ్చిన లాభాలన్నీ ఆ కంపెనీ యే పొందుతుండటం తో , ప్రధాని ఇందిరా గాంధి హయాం లో విదేశీ పెట్టుబడులకి సంబంధించి కీలకమైన యాక్ట్ చేశారు. దానితో కోకో కోల ఇరుకున పడింది. ఆ తరువాత 1977 లో అధికారం లోకి వచ్చిన జనతా పార్టీ కూడా కోకో కోల ఉత్పత్తుల్ని నిషేధించే దిశగా సాగింది. ఈ కంపెనీ కి వ్యతిరేకంగా జార్జ్ ఫెర్నాండెజ్ చాలా ఉద్యమాలు చేసి సక్సెస్ అయ్యారు. దానితో కోకో కోల మన దేశం నుంచి నిష్క్రమించింది.

          నిషేధింపబడిన తర్వాత, అలాగే ఉండిపోతే అది కోకో కోల ఎందుకవుతుంది. ఆర్ధిక సరళీకరణ ప్రారంభం కావడం తో మళ్ళీ 1993 లో మన దేశం లోకి అడుగుపెట్టింది. పార్లే గ్రూప్ కి చెందిన అన్ని సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్ ని కొనేసింది. భారతదేశ శీతల పానీయాల రంగం లో ప్రస్తుతం నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే జుబిలెంట్ భాటియ కంపెనీ తో బాటిల్స్ తయారు చేసే విషయం లో ఒప్పందం చేసుకుంది. సంకేత్ రే ప్రస్తుతం ఇండియా విభాగానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. 

గత ఆర్ధిక సంవత్సరం లో 4,713 కోట్ల రూపాయల అమ్మకాలు మన దేశం లో సాగించింది. ప్రచారం విషయం లో ఎప్పటికప్పుడు కోకోకోల కొత్త పుంతలు తొక్కుతుంది. సెలెబ్రెటీ లతో యాడ్స్ చేయడమే కాకుండా ఆయా దేశాల్లోని సంస్కృతిని,పండుగల్ని వాటిల్లో ప్రవేశపెడుతూ ప్రజల కి చేరువ అవుతుంది. పట్టణం గానీ, పల్లె గానీ ఏ వైపు చూసినా కోకోకోల లోగో కనబడేలా ప్రణాళిక రూపొందించింది. దాని పర్యవసానంగా నిరక్షరాస్యులు కూడా దాన్ని గుర్తుపడతారు.

ఇదిలా ఉండగా కోకో కోల బాగా సేవించే వారికి ఒబేసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తున్నాయని కొన్ని లాటిన్ అమెరికా దేశాల్లో ఆందోళనలు జరిగాయి. భూమి లోనుంచి కోకో కోల యూనిట్లు విపరీతం గా నీళ్ళ ని లాగేస్తున్నాయని మన దేశం లో సైతం కొంతమంది కోర్ట్ లకి ఎక్కిన ఉదాహరణలున్నాయి. ఒక లీటర్ డ్రింక్ తయారు చేయడానికి రమారమి మూడు లీటర్ల భూగర్భ జలాలు లాగుతున్నారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ హెల్త్ కేర్ డ్రింక్స్ తయారు చేసే ప్రణాళికలు తయారుచేస్తోంది. కొబ్బరి నీళ్ళ ని కూడా సేకరించి మార్కెట్ చేసే యోచన లో ఉన్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజూ 1.9 బిలియన్ కోకోకోల ఉత్పత్తుల్ని దేశదేశాల్లో అమ్మే ఈ సంస్థ కి పోటీ వచ్చే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ సంస్థ మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు.

----- మూర్తి కెవివిఎస్ (7893541003)       




Thursday, July 24, 2025

షింటో మతం యొక్క ప్రత్యేకతలు ఎన్నెన్నో !


షింటో మతం యొక్క ప్రత్యేకతలు ఎన్నెన్నో !

-----------------------------------------------------------

 జపాన్ లో చాలామంది అనుసరించే మతం ఏమిటి అంటే చటుక్కున షింటో మతం అని చెబుతారు. నిజమే దాదాపు 70 శాతం పైగా జపనీయులు ఆ విశ్వాసులే కానీ ఆ మతం యొక్క స్వరూపం మనకి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ప్రత్యేకించి ఆ మతాన్ని స్థాపించిన వారు అంటూ ఎవరూ లేరు. అలాగే ప్రత్యేక గ్రంథం అంటూ ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఆ మతం అక్కడ ఎలా మనగలిగింది అనే సందేహం రాక మానదు. అయితే దానిలో పూజలు ఉన్నాయి. రకరకాల తంతులు ఉన్నాయి.పండుగలు ఉన్నాయి.నిజానికి జపాన్ యొక్క సాంస్కృతిక,నైతిక జీవన విలువలు అన్నీ కూడా షింటో మతమే ప్రభావితం చేసింది అంటే అతిశయోక్తి కాదు.

ఇంతా చేసీ ప్రధాన దైవం అంటూ చెప్పడానికి ఎవరూ లేరు. ప్రకృతి లోని ప్రతి చెట్టు,నది,పర్వతం ఇలా ప్రతి దానిలోనూ మనిషి లో ఉన్నట్లే ఆత్మ ఉన్నది.మనిషి పోయిన తర్వాత శరీరం లోని సూక్ష్మశక్తి పై లోకాలకి చేరినట్లే , విశ్వం లోని ప్రతిది ఇక్కడ నాశనమైనప్పటికి వాటిలో ఉన్నది కూడా ఆ లోకాలకి చేరుతుంది. ఆ లోకాన్నే "కామి" (Kami) అంటారు.అదే జపనీయుల ఆరాధ్య దైవం. తమ పూర్వికులు కూడా అక్కడే ఉంటారని భావిస్తారు. ఈ కామి అనే పదాన్ని వారు బహువచనం లో కూడా వాడతారు. ఈ ఆత్మ లోకం లో స్వర్గం,నరకం అంటూ ఏమీ ఉండవు. ప్రతి మనిషి స్వతహాగా మంచివాడే అయినప్పటికీ కొన్ని దుష్ట ఆత్మలు అతడిని  చెడ్డవాడు అయ్యేలా ప్రేరేపిస్తాయని నమ్ముతారు.

జింజా అనేది షింటో మతం లో ఆలయం. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. ఇంటిలో నిర్మించుకునేదాన్ని కామిడన అంటారు. అలాగే కుటుంబం మొత్తానికి కలిపి ఒకటి ఇంకా సామూహికంగా అందరకీ కలిపి జింజా అనేది ఉంటుంది. జనాలు ఎవరైనా మూడవ ఆలయానికి వెళ్ళవచ్చు. లోపలికి వెళ్ళి దక్షిణ వేసి,గంట కొట్టాలి. ఆ తర్వాత గౌరవంగా వంగి కాసేపు ప్రార్థిస్తారు.కామి విశ్వాసం ప్రకారం శుభ్రత,నిజాయితీ,కష్టపడి పనిచేయడం ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. షింటో మత నమ్మకాలన్నీ కాలక్రమం లో ఒక్కొక్కటిగా చేరి రాయబడని శాసనాలుగా మిగిలిపోయాయి. క్రీ.పూ.300 ఏళ్ళ నుంచి ఈ షింటో మతం జపాన్ లో ఉన్నది.

అయితే విచిత్రం గా బౌద్ధ మతం క్రీ.శ.6 శతాబ్దం లో జపాన్ లోకి ప్రవేశించి షింటోమతం తో పడుగూ పేక లా కలిసిపోయింది. తనదైన తాత్విక విచారణ ను ప్రసరింపజేసి దానిలోని కొన్ని లోటుపాట్లను తీర్చింది. చాలా షింటో ఆలయాల్లో బుద్ధుని విగ్రహం కూడా ఓ చోట ఉంటుంది.1868 నుంచి 1912 దాకా జపాన్ ని పాలించిన మైజీ వంశానికి చెందిన చక్రవర్తి తమ దేశం లోని ఆలయాల్లో బుద్ధుని విగ్రహాలు ఎందుకు అని తొలగించాడు. అయితే ప్రజలు మాత్రం దాన్ని అంగీకరించలేదు. మళ్ళీ ఆయన విగ్రహాలు పెట్టడం ప్రారభించారు. షింటో మతాన్ని ఆచరించే ప్రతివారు మరణాంతరం చేసే కార్యక్రమాల్ని బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ చేయాలని నిర్ణయించారు. అందుకే జపాన్ లో ఒక సామెత పుట్టింది, షింటో మతం లో పుట్టిన ప్రతివ్యక్తి బౌద్ధ మతం లో కన్నుమూస్తాడని..!          

      "కామి" విశ్వాసం ప్రకారం మూడు రకాల పూజ్యులు ఉన్నారు.పై లోకం లో ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్న వాళ్ళు, ఇంకా అసంఖ్యాక పూర్వికుల ఆత్మలు. బాన్ అనేది పెద్ద పండుగ.ఆ రోజు పూర్వికుల ఆత్మలు భూమి పైకి వస్తాయని నమ్ముతారు. అప్పుడు రకరకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. షింటో ఆలయాల్లో పూజలు నిర్వహించే వారిని కనూషి అని పిలుస్తారు. జపాన్ లో ఉన్న రమారమి లక్షకి పైగా జింజా లు (ఆలయాలు) వారసత్వం గా వారి చేతి లోనే ఉండేవి. దాదాపు వంద తరాల నుంచి స్వంత జింజా లు ఉన్న కుటుంబాలు ఈనాటికి జపాన్ లో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వారసత్వ హక్కుల్ని రద్దు పరిచారు.

 షింటో మతం అనేక ఉప వర్గాలుగా కాలక్రమేణా విడిపోయినప్పటికీ దాని ప్రధాన సిద్ధాంతం మటుకు ప్రకృతి లోని, పూర్వికుల లోని ఆత్మ శక్తిని పూజించడమే! జపాన్ లో ఒక సగటు షింటో విశ్వాసిని,మీదే మతం అంటే నాది షింటో మతం అని చెప్పకపోవచ్చు. అసలు తాను ఓ మతాన్ని అనుసరిస్తున్నానే స్పృహ కూడా లేకుండా తమ పూజలు తాము చేసుకుంటూ పోతారు. అందుకే మనకి జపాన్ గణాంకాల్లో మతం ని వెల్లడించని వారి సంఖ్య కూడా బాగా కనబడుతుంది.


----- మూర్తి కెవివిఎస్ (7893541003) 




Friday, June 6, 2025

బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాఖ్ - కొన్ని విశేషాలు

బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాఖ్ - కొన్ని విశేషాలు

--------------------------------------------------------------

కర్నాటక రాష్ట్రానికి చెందిన రచయిత్రి బాను ముష్తాఖ్ ఆంగ్ల కథా సంపుటికి బుకర్ ప్రైజ్ (2025) వచ్చిందన్న వార్త తెలుగు పాఠకులకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. 1990 నుంచి 2023 వరకు ఆమె కన్నడం లో రాసిన చిన్న కథల్ని దీపా భస్తి అనే కొడగు ప్రాంతానికి చెందిన అనువాదకురాలు హార్ట్ లాంప్ అనే పేరు తో ఇంగ్లీష్ లో అనువదించారు. దానిలో 11 కథలు ఉన్నాయి. దీపా భస్తి జాతీయ,అంతర్జాతీయ ఇంగ్లీష్ పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ఈమె గతం లో కోట శివరామ కారంత్ నవలని ఇంకా చిన్న కథల్ని అనువాదం చేశారు. బాను ముష్తాఖ్ యొక్క జీవితం కూడా ఎంతో పోరాటశీలత తో కూడుకున్నది. ఆమె స్త్రీల హక్కుల కార్యకర్త గా,న్యాయవాదిగా, అన్నిరకాల అణచివేతల కి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు.అవన్నీ కూడా ఆమె రచనల్లో ప్రతిఫలించాయి.తన సొంత వర్గీయుల నుంచి సైతం ఎంతో వ్యతిరేకత ని ఎదుర్కున్నారు.

దళితుల,వెనుకబడిన వర్గాల నుంచి ఇంకా పీడన కి గురైన రచయితలు, రచయిత్రులు ఒక్క ఉప్పెన లాగా నిర్మించిన సాహిత్య ఉద్యమం కన్నడ దేశం లో చోటు చేసుకున్నది. అది బందయ సాహిత్య ఉద్యమం. దానిలో బాను ముష్తాఖ్ ప్రముఖ పాత్ర పోషించారు. అంతర్గతంగా , సంఘపరంగా ముస్లిం స్త్రీలు పడే వేదనలను ధైర్యంగా తమ రచనలతో ప్రశ్నించారు. బుకర్ జ్యూరీ లండన్ నుంచి వెలువరించిన పత్రికా ప్రకటన లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బాను ముష్తాఖ్ యొక్క శైలి వచన గేయం లా ఉండి,అనుభూతి లోతులను భయరహితమైన భావప్రకటన ని సంతరించుకుని శక్తిమంతమైన కాంతి లా ఆమె కథలు ఉంటాయని వక్కాణించింది.      

 బాను ముష్తాఖ్ గతం లో ఆరు కథా సంపుటాలు,ఒక నవల,ఒక వ్యాస సంపుటి ఇంకా ఓ కవితా సంపుటి కన్నడం లో వెలువరించారు. కర్ణాటక సాహిత్య అకాడెమీ,దాన చింతామణి అట్టిమబ్బె అవార్డులు పొందారు. ఇంకో విశేషం ఏమిటంటే ప్రస్తుతం బుకర్ పురస్కారం పొందిన హార్ట్ లాంప్ కథా సంపుటి "పెన్ ట్రాన్స్ లేట్స్" అనే అంతర్జాతీయ పురస్కారం కూడా పొందింది. బాను ముష్తాఖ్ కథల గురించి చెప్పాలంటే పాత్రలు సున్నితంగా, సహజంగా, మానవ వ్యథల చిత్రీకరణ పాఠకులకు హత్తుకునేలా ఉండి కొన్నిసార్లు వయక్కం బషీర్ కథల్ని తలపిస్తాయి. అయితే బలహీనమైన గుండె ఉన్న వారి కోసం ఈ కథలు రాయబడలేదు అని ఓ ఆంగ్లపత్రిక వ్యాఖ్యానించింది.

హార్ట్ లాంప్ సంపుటి లోని కథలు Stone slabs for Shaista mahal, Fire Rain, Black cobras, Red lungi, Heart lamp, High heeled shoe, Soft whispers, A taste of heaven, The shroud, The Arabic teacher and Gobi Manchuri, Be a woman once,oh Lord ఇలా ఉన్నాయి. మచ్చుకి కొన్ని కథల గురించి రేఖామాత్రంగా తెలుసుకుందాం. మొదటి కథ Stone slabs for Shaista Mahal లో రెండు కుటుంబాల మధ్య ఉండే అనుబంధం,స్నేహం అదే సమయం లో స్త్రీ అనారోగ్యం లో ఉంటూ కూడా పిల్లలు కనే యంత్రం లా మారడాన్ని చిత్రించారు. ముజాహిద్,జీనత్ లకి పెళ్ళయి సుమారు పది నెలలు అవుతుంది. మిత్రుడు ఇఫ్తీకర్,ఆమె భార్య షయిస్ట వాళ్ళ ఇంటికి వెళతారు.

షయిస్ట కి అప్పటికే ఆరుగురు పిల్లలు,భర్త ఇఫ్తీకర్ ఆమె పై విపరీతమైన ప్రేమ కలిగిఉంటాడు. అతనికి యాభై ఏళ్ళు కాగా ఆమె కి నలభై ఏళ్ళు. తాజ్ మహల్ మాదిరిగా భార్య కి షయిస్ట మహల్ కట్టిస్తానని చెబుతుంటాడు. పెద్ద కూతురు ఆసిఫా పెళ్ళి కి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయం లో షయిస్ట గర్భం తో ఉంటుంది. జీనత్ ఈనాటి యువతి గా వ్యతిరేకిస్తూ, ఆరోగ్యం అంతంత మాత్రం గా ఉన్న ఆమె ఏడవ సంతానాన్ని కనడం పట్ల విచారిస్తుంది.మగవారి ప్రేమ వెనుక ఉన్న స్వార్థాన్ని సున్నితం గా ఈ కథ స్పృశిస్తుంది. తల్లి ప్రేమ అన్నిటికన్నా గొప్పదని, తల్లి పోతే మరో తల్లి రాదని కానీ భార్య చనిపోతే మరో భార్య ఆ స్థానాన్ని పూరించవచ్చునని భర్త ముజాహిద్ అనడం ఆమె కి కోపాన్ని కలిగిస్తుంది. ఈ కథ రచయిత్రి బాను ముష్తాఖ్ యొక్క ఆలోచనా స్రవంతికి మచ్చుతునక గా చెప్పవచ్చును.

భర్త వదిలేసిన వితంతువు ఆమె పిల్లలతో పడే బాధల్ని,అదే సమయం లో స్థానిక ముతావలి సాయాన్ని కోరినప్పటికీ తాను ఏమి చేయలేని స్థితి లో ఉండడం దానికి గాను తోటి వారైన స్థానిక స్త్రీలు సహానుభూతి చూపకుండా ముతావలి ని నిందించడం ఇలాంటి కథా వస్తువు తో The black cobras అనే కథ సాగుతుంది. ధనవంతురాలైన రజియా అనే తల్లి తన కొడుకు తో పాటు తమ వీథిలో ఉన్న 18 మంది పిల్లలకి సుంతీ చేయించే కార్యక్రమం చేపడుతుంది. దీంట్లో పేద పిల్లలకి నాటుగా చేసిన సుంతీ ఎలాంటి అనారోగ్యం లేకుండా కోలుకునేలా చేస్తుంది. డబ్బులున్న వారు తమ పిల్లలకి అనాస్థీషియ ఇచ్చి నాజుకుగా చేయిస్తే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఏమీ లేనివారికి దేవుడే దిక్కు అని ఊరికే అనలేదు అని నిట్టూర్చుతుంది ఆమె!ఈ సంఘటన Red Lungi అనే కథ లోనిది.

అమ్మాయిలకి అరబీ పాఠాలు చెప్పే యువ ఉపాధ్యాయుడు, పనిలో పనిగా తనకి తగిన భార్య ఆ అమ్మాయిల్లో దొరుకుతుందేమోనని చూస్తుంటాడు. గోబీ మంచూరియ అనే వంటకం అతనికి బాగా ఇష్టం. దాన్ని బాగా వండేవాళ్ళనే చేసుకోవాలని తన కోరిక. ఎట్టకేలకు అలాంటి అమ్మాయిని కనిపెట్టి పెళ్ళి చేసుకుంటాడు. అయితే పెళ్ళి అయిన తర్వాత జరిగే విషయం వేరుగా ఉంటుంది. ఈ వర్ణన అంతా The Arabic teacher and Gobi Manchuri అనే కథ లోనిది.కొన్ని కథలు, వర్ణనలు రిపిటిషన్ లా అనిపిస్తాయి. మన తెలుగు లో కూడా మైనారిటి ప్రజల జీవితాల పై రకరకాల కథలు వచ్చాయి. స్కైబాబా లాంటి వాళ్ళ కథలు చక్కటి ఆదరణకి కూడా పొందాయి. బుకర్ ప్రైజ్ పొందటం వల్ల విస్తృతమైన పబ్లిసిటి వస్తుంది. పుస్తకాలకి మార్కెట్ పెరుగుతుంది. యాభై వేల పౌండ్లు వస్తాయి.వాటిని రచయిత్రి,అనువాదకురాలు సమానంగా పంచుకుంటారు. ఏది ఏమైనా మన పొరుగు భాష రచయిత్రి బాను ముష్తాఖ్ కృషి కి అంతర్జాతీయ గుర్తింపు లభించిన సందర్భం లో ఆమెకి శుభాకాంక్షలు, జేజేలు..!

                                       ----- మూర్తి కెవివిఎస్ 



              


     

Monday, May 12, 2025

ఆత్మాన్వేషణ లో ఓ భాగం - హెర్మన్ హెస్సి నవల సిద్ధార్థ

ఆత్మాన్వేషణ లో ఓ భాగం - హెర్మన్ హెస్సి నవల సిద్ధార్థ

--------------------------------------------------------------------------


 జర్మన్ రచయిత హెర్మన్ హెస్సి 1922 ప్రాంతం లో వెలువరించిన "సిద్ధార్థ" నవల అదే పేరు తో ఆంగ్లం లో కూడా అనువదింపబడటం తో చదివే అవకాశం దొరికింది. హెర్మన్ హెస్సి ని జర్మన్ స్విస్ రచయిత గా తరచూ ఉటంకిస్తుంటారు. తను జర్మనీ లో పుట్టినప్పటికి తల్లి వైపు మూలాలు స్విజర్ లాండ్ లో ఉండటం, చివరి దశలో అదే దేశం లో చనిపోవడం వల్ల అలా భావించడం లో తప్పులేదు. కానీ ఆయన రచనా వ్యాసంగం అంతా జర్మన్ భాష లోనే సాగింది. ఏ యూరోపియన్ భాష లో ఎన్నదగిన రచన వచ్చినా అది శరవేగం తో ఇంగ్లీష్ లోకి ఇతర ప్రపంచ భాషల్లోకి అనువాదమైపోతుంది.

సిద్ధార్థ అనే ఈ నవల పేరు చూసి ఇది బుద్ధుని గురించి రాసింది అనుకుంటే పొరబాటు. పైగా కవర్ మీద బుద్ధుని బొమ్మ కూడా ఉంది గదా. అయితే బుద్ధుని పాత్ర ఉంటుంది. కథానాయకుడైన సిద్ధార్థ తన పరివ్రాజక జీవితం లో ఒకసారి బుద్ధుడిని చూస్తాడు. అతని అనుయాయులతో కూడా మాట్లాడుతాడు. అంతే. ఈ నవల లో మరెక్కడా బుద్ధుడు మనకి కనిపించడు. కాని ఆయన బోధనలు ఆనాటి ప్రజల్లో కలిగించిన ప్రభావాన్ని మనం అనుభూతి పొందుతాము. అదీ వివిధ పాత్రల ద్వారా మాత్రమే.

సిద్ధార్థ ఒక బ్రాహ్మణ యువకుడు. చిన్నతనం నుంచి పూజాదికాలు ఇతర వైదిక కార్యక్రమాల్లో కాలం గడుపుతుంటాడు. తన జీవితం లో ఏదో వెలితి. అసలైన జ్ఞానకాంతి తన లో ప్రవేశించలేదని , ఇంకా ఏదో నేర్చుకోవాలి అని అరణ్యం లో కి వెళ్ళి సమానులతో కలిసిపోతాడు. సమానులు అనే మాటకి భౌతిక జీవితాన్ని నిర్జించి అన్వేషణ లో సన్యాసి గా మారినవారు అని ఈ పుస్తకం లోని అర్థం. Samana అని ఇంగ్లీష్ లో రాశారు. కొన్ని ఏళ్ళు ఉన్న తర్వాత సిద్ధార్థ కి ఇంకా అసంతృప్తి పెరుగుతుంది. ఇది తన దారి కాదు అనిపిస్తుంది. అయితే వాళ్ళతో ఉన్నప్పుడు కొన్ని విద్యలు నేర్చుకుంటాడు.    

తనతో పాటు గోవింద అనే మిత్రుడు కూడా ఉంటాడు. ఓసారి గౌతముడి ని (అంటే బుద్ధుడిని) ఇద్దరూ చూస్తారు. ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు,ఈ ఇద్దరూ గొప్ప గౌరవం తో ఆయన ని ఆలకిస్తారు. గోవింద ఆ బౌద్ధ సన్యాసులతో ఉండిపోతాడు. కాని సిద్ధార్థ మాత్రం లేదు లేదు నేను ముందుకి సాగిపోతాను. నేను తెలుసుకోవలసింది ఇంకా ఏదో ఉంది అని వెళ్ళిపోతాడు. అలా తను నడిచి నడిచి ఓ పట్టణానికి చేరుకుంటాడు. అక్కడ కమల అనే వేశ్య ని చూస్తాడు. ఆమె చాలా ధనవంతురాలు.రాజాస్థానం లో ఉంటుంది. సిద్ధార్థ తనకి ప్రేమ విద్య ని నేర్పించమని కోరుతాడు.

ఆమె నవ్వి నీ లాంటి సన్యాసుల్ని నా ఇంటి లోకి కూడా రానివ్వను. అయినా నీలో ఏదో ఉంది. నేర్పించుతాను గాని ముందు నువ్వు ధనం సంపాదించడం నేర్చుకో. మంచి వస్త్రాలతో దర్జాగా నా వద్దకి రా,అప్పుడు చూస్తాను అంటుంది కమల. కామస్వామి అనే వర్తకుడి దగ్గర సహాయకుని గా నియమిస్తుంది. వ్యాపారం జరిగే పద్దతి ని , మనుషుల ప్రవర్తన ని గమనిస్తూ మనుషులకి వయసు పెరిగినా మనసు లో పెద్దగా పరిణామం జరగట్లేదని చిన్నపిల్ల ల చేష్టలే అని భావిస్తుంటాడు.నష్టానికి విపరీతంగా కుంగి పోవడం,లాభానికి విపరీతంగా పొంగిపోవడం వింత గా అనిపిస్తుంది.తను సమానులతో ఉండి అన్ని పరిస్థితుల్లోనూ మధ్యేమార్గంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు.

కామస్వామి తో ఇదే అంటాడు. మనిషి అలా అనుభూతి చెందకపోతే ఎలా బ్రతకగలడు..అని ఆ కామస్వామి ఒక మాటంటాడు. నీకు నా ఆస్తి లో పావు భాగం ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించు .. నీ తెలివి తో లాభాలు తెస్తావా ..లేదా పోగొడతావా .. నీ ఇష్టం ..అని ఆ విధంగానే రాసిస్తాడు. మొదట్లో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా వ్యాపారం చేసినా పోను పోనూ ఒక అసలు సిసలు వ్యాపారి లా మారిపోతాడు సిద్ధార్థ. నష్టం వచ్చినపుడు కసి గా లాభాలు సంపాదించడం,లాభాలు రాగానే బాగా ఆనందించడం మొదలవుతుంది. కమల దగ్గర కి వెళతాడు. ఆమె కూడా ఇతనికి ప్రియురాలిగా మారిపోతుంది. ప్రేమ లో పట్లు అన్నీ నేర్పిస్తుంది.

ఇవన్నీ చేస్తూనే తన మనసు ని , దాని మార్పుల్ని వేరే మనిషి లా గమనిస్తుంటాడు. తాగుడు, జూదం కూడా మొదలవుతుంది. చివరకి ఉన్న ఆస్తి అంతా పోయి బికారి అవుతాడు. మిత్రులు అనుకున్న వాళ్ళు కూడా ఎవరూ అప్పు కూడా ఇవ్వరు. అసలు తన మొదటి స్థితి ఇదేగా ..ఎందుకు అనుకోవడం అని ఎంత సముదాయించుకున్నా బాధ ఆగదు. ఆత్మహత్య చేసుకోవాలని నది దగ్గర కి వెళతాడు. అక్కడ పడవ నడిపే వాసుదేవ అనే వ్యక్తి రక్షించి చేరదీస్తాడు. అతను నది ఒడ్డున ఒంటరిగా చిన్న గుడిసె లో నివసిస్తుంటాడు. 

తనూ అక్కడే కాలం గడుపుతూ , వాసుదేవ సాంగత్యం లో , ప్రకృతి ని, ముఖ్యంగా ఆ నది ని ఆస్వాదిస్తూ ,మాట్లాడుతూ ఏ విధంగా తను ఇన్నాళ్ళ నుంచి వెతుకులాడుతున్నాడో ఆ జ్ఞానాన్ని పొందుతాడు. నవల లోని చాలా పేరాలు సింబాలిక్ గా , ఒక్కొక్క జీవితపు పొర ని రకరకాల సంఘటనల ద్వారా చూపిస్తూ లోతైన అర్ధాన్ని ఈ నవల ద్వారా రచయిత నర్మగర్భంగా వివరించాడు. బౌద్ధ ధర్మాన్ని, వేదాంత ధోరణుల్ని హెర్మన్ హెస్సి బాగా చదివేడనే ఆలోచన మనకి స్ఫురిస్తుంది. కమల ద్వారా కలిగిన కొడుకు సిద్ధార్థ ని కలవడం ఆ తర్వాత జరిగే సన్నివేశాలు మెలోడ్రామా ని తలపిస్తాయి. 

ఈ నవల ఆధారంగా 1973 లో హిందీ లో శశి కపూర్ హీరో గా ఓ సినిమా తీశారు. ఇండో అమెరికన్ టెక్నీషియన్స్ పని చేసిన ఈ సినిమా కి కాన్రాడ్ రూక్స్ దర్శకత్వం వహించాడు. రిషికేష్ లోనూ,భరత్ పూర్ ప్యాలస్ లోనూ చిత్రీకరణ జరిగిన దీనిలో న్యూడ్ సీన్ లు ఉన్నాయని కొన్ని సీన్లని కత్తిరించారు. ఆ తర్వాత పంపిణీలో తేడాలొచ్చి కొన్నాళ్ళు రిలీజ్ కాకుండా ఆగిపోయింది.  

నిజానికి ఈ పుస్తకం గురించి ఇంకా చాలా రాయవచ్చు. కాని రచయిత చేసిన తాత్విక ఆలోచనలు ఎలాంటి పదాల్లో చెప్పాలో సంధిగ్ధం లో పడి ఆపుజేస్తున్నాను. ఎవరికి వాళ్ళు చదివి అర్థం చేసుకోవాలి. అదే మంచిది. ఈ చిన్న పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించి ఒకదాన్ని రోమై రోలా కి ఇంకోదాన్ని మరో మిత్రునికి అంకితం ఇచ్చాడు. నాకు నచ్చిన కొన్ని లైన్లను ఇక్కడ ఉటంకిస్తాను.

" The world, my friend, is not imperfect, or on a slow path towards perfection. No, it's perfect in every moment, all sin already carries the divine forgiveness in itself, all small children already have the old person in themselves, all infants already have death, all dying people the eternal life. It is not possible for any person to see how far another one has already progressed on his path: in the robber and dice-gambler , the Buddha is waiting." 

---  మూర్తి కెవివిఎస్  (78935 41003)