ఓసారి నిషేధింపబడిన కోకో కోల, దేశం లో నెంబర్ వన్ ఎలా అయింది ?
--------------------------------------------------------------------------------------------
కొకో కోల పేరు తెలియని వారు మన దేశం లో బహుశా ఎవరూ ఉండరు. నగరం గాని, చిన్న పట్టణం గాని, గ్రామం గాని ప్రతి చోట ఆ కంపెనీ కి చెందిన శీతల పానీయాలు తాగుతూనే ఉంటారు. ఏ శుభకార్యాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలన్నా ఆ కూల్ డ్రింక్స్ తెప్పించకపోతే ఏదో లోటులా ఫీల్ అవుతుంటారు. థంస్ అప్, ఫాంటా, స్ప్రైట్ ఇలాంటి డ్రింక్ లన్నీ కూడా కోకో కోల కంపెనీ కి చెందినవనే నిజం చాలా మందికి తెలియదు. ప్రపంచం లోని 200 దేశాల్లో ప్రస్తుతం కోకో కోల తమ ఉత్పత్తుల్ని అమ్ముతోంది. చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థల్ని శాసించగలిగే స్థాయి లో ఉండే ఈ బహుళ జాతి సంస్థ అమెరికా లో 1886 లో చిన్న వ్యాపార సంస్థ గా ఊపిరిపోసుకుంది.
జాన్ ఎస్. పెంబర్టన్ అనే వైద్యుడు మందుల్లోకి వాడటానికి కోకో ఆకుల రసం తీసి ఓ సిరప్ తయారు చేశాడు. అదే క్రమేణా అనేక మార్పులు పొందుతూ సాఫ్ట్ డ్రింక్ లా అవతరించింది. ప్రస్తుతం దీనిలో కార్బోనేటెడ్ వాటర్,సుగర్, కరమెల్ కలర్,ఫాస్పరిక్ ఆసిడ్,ఇంకా కొన్ని సహజ ఉత్పత్తులు వాడుతున్నట్లు చెబుతారు.అయితే దీంట్లో ఇంతవరకు ఎవరకీ తెలియని రెండు రహస్యమైన ఉత్పత్తుల్ని కలుపుతారని , అది కేవలం కంపెనీ కి చెందిన ఇద్దరు అధికారులకి మాత్రమే తెలుస్తుందని , దాని అసలు ఫార్ములా అట్లాంటా లోగల సన్ ట్రస్ట్ బ్యాంక్ లోని ఓ వాల్ట్ లో భద్రంగా ఉందనేది జగమెరిగిన సత్యం.
మన దేశం లోనికి కోకో కోల కంపెనీ నిజానికి 1956 లోనే ప్రవేశించింది.ఇరవై ఏళ్ళపాటు ఎదురులేని సాఫ్ట్ డ్రింక్ గా లాభాలు పొందింది. స్థానిక వ్యాపారులకి ఎలాంటి ఈక్విటీ ఇవ్వకుండా వచ్చిన లాభాలన్నీ ఆ కంపెనీ యే పొందుతుండటం తో , ప్రధాని ఇందిరా గాంధి హయాం లో విదేశీ పెట్టుబడులకి సంబంధించి కీలకమైన యాక్ట్ చేశారు. దానితో కోకో కోల ఇరుకున పడింది. ఆ తరువాత 1977 లో అధికారం లోకి వచ్చిన జనతా పార్టీ కూడా కోకో కోల ఉత్పత్తుల్ని నిషేధించే దిశగా సాగింది. ఈ కంపెనీ కి వ్యతిరేకంగా జార్జ్ ఫెర్నాండెజ్ చాలా ఉద్యమాలు చేసి సక్సెస్ అయ్యారు. దానితో కోకో కోల మన దేశం నుంచి నిష్క్రమించింది.
నిషేధింపబడిన తర్వాత, అలాగే ఉండిపోతే అది కోకో కోల ఎందుకవుతుంది. ఆర్ధిక సరళీకరణ ప్రారంభం కావడం తో మళ్ళీ 1993 లో మన దేశం లోకి అడుగుపెట్టింది. పార్లే గ్రూప్ కి చెందిన అన్ని సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్ ని కొనేసింది. భారతదేశ శీతల పానీయాల రంగం లో ప్రస్తుతం నెంబర్ వన్ గా కొనసాగుతోంది. అయితే జుబిలెంట్ భాటియ కంపెనీ తో బాటిల్స్ తయారు చేసే విషయం లో ఒప్పందం చేసుకుంది. సంకేత్ రే ప్రస్తుతం ఇండియా విభాగానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు.
గత ఆర్ధిక సంవత్సరం లో 4,713 కోట్ల రూపాయల అమ్మకాలు మన దేశం లో సాగించింది. ప్రచారం విషయం లో ఎప్పటికప్పుడు కోకోకోల కొత్త పుంతలు తొక్కుతుంది. సెలెబ్రెటీ లతో యాడ్స్ చేయడమే కాకుండా ఆయా దేశాల్లోని సంస్కృతిని,పండుగల్ని వాటిల్లో ప్రవేశపెడుతూ ప్రజల కి చేరువ అవుతుంది. పట్టణం గానీ, పల్లె గానీ ఏ వైపు చూసినా కోకోకోల లోగో కనబడేలా ప్రణాళిక రూపొందించింది. దాని పర్యవసానంగా నిరక్షరాస్యులు కూడా దాన్ని గుర్తుపడతారు.
ఇదిలా ఉండగా కోకో కోల బాగా సేవించే వారికి ఒబేసిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తున్నాయని కొన్ని లాటిన్ అమెరికా దేశాల్లో ఆందోళనలు జరిగాయి. భూమి లోనుంచి కోకో కోల యూనిట్లు విపరీతం గా నీళ్ళ ని లాగేస్తున్నాయని మన దేశం లో సైతం కొంతమంది కోర్ట్ లకి ఎక్కిన ఉదాహరణలున్నాయి. ఒక లీటర్ డ్రింక్ తయారు చేయడానికి రమారమి మూడు లీటర్ల భూగర్భ జలాలు లాగుతున్నారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ హెల్త్ కేర్ డ్రింక్స్ తయారు చేసే ప్రణాళికలు తయారుచేస్తోంది. కొబ్బరి నీళ్ళ ని కూడా సేకరించి మార్కెట్ చేసే యోచన లో ఉన్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజూ 1.9 బిలియన్ కోకోకోల ఉత్పత్తుల్ని దేశదేశాల్లో అమ్మే ఈ సంస్థ కి పోటీ వచ్చే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్ సంస్థ మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు.
----- మూర్తి కెవివిఎస్ (7893541003)