Monday, January 11, 2016

చింగిజ్ ఐత్మతొవ్ "జమీలియ" నవల గురించి

చింగిజ్ ఐత్మతొవ్ "జమీలియ" నవల గురించి

1958 ప్రాంతం లో మొదట కిర్గిజ్ భాష లో రాయబడిన చిన్ని నవలని ఈ రోజునే తెలుగు లో చదివాను.తెలుగు సేత ఉప్పల లక్ష్మణ రావు గారని చెప్పనక్కర లేదు అనుకుంటా.కిర్గిజ్ స్తాన్ లోని ఒక గ్రామం లో జరిగే ప్రేమ కధ ఇది.ఒకే విడత లో పుస్తకం దించకుండా ఇటీవల నే చదివిన పుస్తకం ఇదే.యుద్ధ నేపధ్యం లో సాగుతుంది.ఒక చిన్న గ్రామం లోని సంఘటనల్ని ఎంత నేర్పు గా ,లోపలికి అంటా వెళ్ళి ఎలాంటి బోరు లేకుండా కధ నడిపిస్తాడో...ముఖ్యంగా కిర్గిజ్ ల గుర్రాల పోషణ,వ్యవసాయ విధానం,ఆ గోధుమల్ని బస్తాల్లో వేసుకొని ఆ స్టెప్పి ల వెంట ...కనుమల వెంట ప్రయాణించడం,ముఖ్యంగా ప్రకృతి వర్ణన లు చదువుతుంటే ఆ దరి దాపుల్లోకి వెళ్ళిపోయిన అనుభూతి ..అంత హృద్యమైన ...నిజానికి దగ్గరగా ఉండే ఆ వర్ణనలు ఏ  రచయిత చేశాడు ..అనిపించాయి.అక్కడ పెరిగే ప్రతి మొక్క ,చెట్టు ,ఇంకా వాతావరణ మార్పులు వీటన్నిటిని ఎంత నిశితం గా పరిశీలించాడో ..!

జమీల్య ..ఆమె అత్త ..యుద్ధ భుమి లో ఉండి ఉత్తరాల ద్వారా మాత్రమే పలకరించే జమీల్య భర్త,ఆమె మరిది సెయిత్ ,ఇంకా ఒస్మాన్,కరీం,జమీల్యా తో ప్రేమ లో ఉన్న ధానియార్ ,ఈ కధ అంతటిని తన ద్వారా వినిపించే చిత్రకారుడైన  సెయిత్ ..అలా చదివిన తర్వాత మనతో ఆ పాత్రలు మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి.చిన్న కధే..ఇలాంటివి మన పల్లె ల్లో కూడా జరిగినవే గాని ఇంత శిల్ప మాధుర్యం గా ఎవరైనా చెప్పారా అనిపించక మానదు.అయితే యుద్ధం లో గాయపడి పల్లె కి వచ్చిన అనాధ యువకుని(ధనియార్)  తో ప్రేమలో పడే జమీల్యా ది ఆకర్షణ మాత్రం గానే తోస్తుంది.ఉత్తరం ద్వారా పలకరించే భర్త తన విద్యుక్త ధర్మం లో భాగం గానే యుద్ధం కి వెళతాడు తప్ప భార్య పై ప్రేమ లేక కాదు కదా ..!Click

ఏది ఏమైనా చింగిజ్ ఐత్మతోవ్ కధనం ఎన్నదగినది.ప్రతి చిన్న కదలిక ని భలే గమనించాడే అనిపిస్తుంది. మనుషుల ,పరిసరాల భాషణల్ని ఏ మాత్రం చిరాకు పుట్టించకుండా చెప్పడం అది ఒక అభ్యాసమే.దానిలో చింగీజ్ అగ్రగణ్యుడని అనవచ్చు.వంద పేజీలు కూడ దాటని ఈ నవల లో ఎంత బరువు ని నింపాడు అని చివరి పేజీ లోకి వచ్చేసరికి తోస్తుంది.  దీన్ని కిర్గిజ్ భాష లో నే ఆయన రాయగా ఇంగ్లీష్ లోకి జేంస్ రియోర్డన్ అనువాదం చేశాడు.అయితే 1960 నుంచి చింగిజ్ కిర్గిజ్ లో కాక రష్యన్ భాష లో రాయడం మొదలు పెట్టాడు.రెండు భాష ల్లోను చింగీజ్ రాయగలిగే వాడు.రష్యా తరపున యూరోపియన్ యూనియన్ కి ,యునెస్కో వంటి వాటికి రాయబారిగా పనిచేసిన చింగీజ్ 2008 లో జర్మనీ లో కన్నుమూశాడు.అయితే అతని శవాన్ని ఆయన కోరిక మేరకు కిర్గిజ్ స్థాన్ లోని అతని స్వగ్రామం లో ఖననం చేయడం జరిగింది.   

No comments:

Post a Comment