Wednesday, February 17, 2016

ఆ తర్వాత కలకత్తా లో తిరగాలని నిర్ణయించుకున్నాను

గుర్తున్నదో..లేదో..గత నెల లో ఒక ముఖ్యమైన రోజున ఓ పోస్ట్ రాసి తీరాలి నేను.కాని ఎందుకనో మళ్ళీ రాయాలని అనిపించక రాయలేదు.స్వామి వివేకానంద జయంతి రోజు అది.అసలు ఆయన సందేశాన్ని ఆ రోజున గుర్తు చేసుకోవడానికి మరిచి పోయింది ఎప్పుడని..?సాధ్యమైనంత వరకు ప్రతి రోజు ఒకటి లేదా రెండు పేజీలు ఆయన బోధనలు ఇతర సాహిత్యము చదువుతూనే ఉంటాను.ఆయన కంప్లీట్ వర్క్స్ తో పాటు  ఆయన పై ఆయన శిష్యులు రాసిన పుస్తకాల్ని ఇంకా ద గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ ఇలా వేలాది పేజీలు కొన్ని ఏళ్ళు అలా చదువుతూంటాను.ఒక రౌండ్ పూర్తి అవగానే మళ్ళీ మొదటినుంచి మొదలు పెట్టి చదవడం ప్రారంభిస్తాను.అలా నాకు ఓపిక ఉన్ననాళ్ళు చదువుతూనే ఉంటాను.ఎందుకంటే ఒకరోజు చదివి మూసి వేసేవి కావు ఆ అక్షరాలు.ఎన్నో లౌకిక పరమైన ,సాధనా పరమైన అపురూప సత్యాల్ని పొందుపరిచారు..వారి జీవితం ద్వారా..!నాకు ఎప్పుడూ దిశ నిర్దేశం చేసేవి,నాలో తరగని ఉత్సాహము,బలము నింపేవి అవే. నేనిప్పటి దాకా ఇలా ఉన్నాను అంటే నా జీవితం ఇలా మారింది అంటే అది స్వామి వివేకానంద యొక్క మాటలే.


దాదాపు గా ఇరవై ఏళ్ళ కిందట మాట.కొన్ని సంఘటనవల్ల ఎందుకనో డిప్రెషన్ కి గురయి సూసైడ్ చేసుకోవాలని మణికట్టు దగ్గర, మెడ దగ్గర బ్లేడ్ తో కోసుకున్నా.చావు ని అత్యంత సమీపం గా చూశాను.ఆ క్షణాలు ఎంత ఉద్విగ్న భరితం గా ఉంటాయో, అదే సమయం లో ఎంత ప్రశాంతం గా ఉంటాయో అనుభవించాను.మాటలు ఉండవు కొన్ని వాటికి.అనుభవమే పరాకాష్ట.అలాంటి సమయం లో నేను చదివిన ఏ పుస్తక జ్ఞానము, ఏ మానసిక శాస్త్ర  విశ్లేషణ నన్ను మరలించలేకపోయింది.అది ఒక మలుపు తిరిగే సమయం అనుకుంటా నా జీవితం లో..!

అలాంటి సమయం లో ఒక వ్యక్తి తలవని తలపుగా "The practical Vedanta" అనే పుస్తకాన్ని నా చేతికి ఇచ్చారు.అది స్వామి వివేకానందునుది.అప్పటి దాకా ఆయన నాకు ఒక సంఘ సంస్కర్త గా ,దేశ భక్తుని గా ,అమెరికా లో ప్రసంగించిన హిందూ సన్యాసి గా మాత్రమే తెలుసు.అంతకంటే పెద్ద గా తెలియదు.అలా పుస్తకం తిరగేస్తుండగా ఒక చోట ఒక ఆదేశం మాదిరిగా కొన్ని వాక్యాలు కనిపించాయి.అవి ఏమంటే "Worn out than rust out.." అంటూ సాగే పేరా అది. తుప్పు పట్టి మరణించడం గాదు ఏదో ఒక పని చేస్తూ ఆ కార్య సాధన లో మరణించు అని వాటి మొత్తం లోని అర్ధం.ఆ వాక్యాలే నన్ను మళ్ళీ వెన్ను తట్టాయి..ఏది ఏమైనా కాని నేను ఎంచుకున్న పని లో పురోగమిస్తూ మాత్రమే నేను చావాలి అని నిర్ధారణకి వచ్చాను.అలా నాజీవితం రెండో అధ్యాయం మొదలయింది.

ఆయన రాసిన "రాజ యోగ" (పతంజలి యోగ మార్గానికి స్వామిజీ రాసిన భాష్యం) చదివిన తర్వాత నా జీవితం ఎందుకు నిలబెట్టబడిందో నాకు అవగతమయింది.ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితమూ వేరు వేరు కాదు.ఒకటి ఇంకొక దాన్ని ప్రభావితం చేస్తుంది.ప్రతి అనుభవానికి ఒక అర్ధం ఉంది...అని స్ఫురించింది.వెంటనే కలకత్తా వెళ్ళాలని హౌరా మెయిల్ ఎక్కాను.ఒక రాత్రి ఒక పగలు ప్రయాణించి హౌరా లో ఆ మరుసటి అర్ధరాత్రి దిగాను.అక్కడ తెలిసిన వాళ్ళూ అప్పటికి ఎవరూ లేరు,ఆ చుట్టు పక్కల ఏమి ఉన్నాయో కూడా నాకు తెలియదు.జనాలు సముద్రం లా కదులుతుండగా వాళ్ళతో కలిసి నేను బయటకి వచ్చాను.షట్టర్లు దించి ఉన్నాయి అంతటా...నడుచుకుంటూ వెళుతుండగా ఒక నల్లని రంగు వేసిన వీధి గుండా పోతున్నట్లు అనిపించింది. దాన్ని "సాల్కియా " అని అంటారు ..అలా అర్ధమయింది ఒక బోర్డ్ చూస్తే.

సమర్ (సోమోర్ ) అనే హోటల్ కనబడింది.దానిలో మకాం వేశాను.ఒక మాదిరి హోటల్ అది.ఎందుకనో కలకత్తా సంస్కారం నిండిన వృద్ధుని లా అనిపించింది..ఉన్నన్ని రోజులు.ఎక్కడ చూసినా పాతదనం..!వీధులు గాని,భవనాలు గాని..ఏదైనా గాని.ఎంత పేదవారి లోనూ ఒక సంస్కారం ఉన్నది అనిపించింది.భారత దేశానికి చుక్కాని లా భాసించిన బెంగాల్ ఇదేకదూ అనిపించింది.బేలూర్ లో స్వామిజి తిరుగాడిన ఆ ప్రదేశం లో కాసేపు ధ్యానించుకున్నాను.కాళీ ఘాట్ లో శ్రీ రామకృష్ణులు  తిరుగాడిన ఆ ప్రాంతం లో కాసేపు ఉన్నాను.

ఆ తర్వాత కలకత్తా లో తిరగాలని నిర్ణయించుకున్నాను.అది నాకు కొత్త ప్రదేశం మాదిరిగా అనిపించలేదు..భయం కూడా తోచలేదు..అప్పటికే చావు నుంచి బయటబడినవాడిని..ఎంత ప్రమాదం జరిగిన దానికన్నా ఎక్కువ ఏమవుతుంది..అనే భావం అంకురించింది.అట్లా...కొన్ని రోజులు తిరిగి ఇంటికి బయలు దేరుదామని హౌరా  స్టేషన్ కి వచ్చాను.రద్దీ బాగా ఉంది.స్టేషన్ కూడా అంతే..చాలా పాత గా ఉంది.టిక్కెట్లు కౌంటర్ కి ఒక మూలన చిన్న మట్టి కప్పులు చాలానే పారేసి ఉన్నాయి.( మిగతాది తరువత భాగం లో) 

No comments:

Post a Comment