Friday, January 5, 2018

ఆ రోజున ఏమైనా రాస్తానో లేదో నాకు తెలియదు.

వచ్చే పన్నెండున వివేకానంద జయంతి.ఆ రోజున  ఏమైనా రాస్తానో లేదో నాకు తెలియదు.ఎందుకంటే ఒక రోజు అంజలి ఘటించి మళ్ళీ వచ్చే ఏడు అదే తేదీ కోసం చూడటము నాకైతే కష్టమైన పని.వివేకానందుని పరిధి చాలా విస్తృతమైనది.కొన్నిసార్లు అనిపిస్తుంది ...ఎంత ఆయన జీవిత సంఘటనల లోకి వెళుతుంటే అంత భావ విప్లవకారుని గా దర్శనమిస్తాడు.దానిలో అనేక కోణాలు.ఆయన ఒక మార్మిక  కవి,భాష్యకారుడు,గాయకుడు,కళా విమర్శకుడు,వివిధ సంస్కృతుల్ని సమ దృష్టితో వ్యాఖ్యానించిన ద్రష్ట.కాని మనలో  చాలా మందికి హైందవ ఝంఝామారుతం గానే తెలుసును..ఈ పేరు తో మొదట పిలిచినది ఒక పాశ్చాత్య పత్రికనే.   

దాదాపు మూడు  దశాబ్దాల క్రితం వివేకానందుని అంశ నన్ను కదిలించినది.మళ్ళీ మళ్ళీ ఆయన రాసిన, మాట్లాడిన వాటిని చదువుతూనే ఉన్నాను.కొత్త కొత్త అర్ధాలు స్ఫురిస్తుంటాయి ఎప్పటికప్పుడు.కొన్ని సూక్తులు గా కాక ఆ పుస్తకాల లోని ప్రతి అక్షరమూ.అలా చదవగలిగినప్పుడే కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి.నా శరీరం లోని నిద్ర లేచిన ప్రతి శక్తి దాని లోని పర్యవసానమే అనిపిస్తుంది.దానికి కృతజ్ఞత వ్యక్తీకరించడానికి కూడా నాకు తగిన మాటలు దొరకవు వెంటనే.

ఈ సందర్భంగా ఒక సంఘటన చెప్పాలని ఉంది.అది 1897 ,కలకత్తా లోని బాఘ్ బజార్ నందు ఉన్న బాబు బలరాం బోస్ అనే శిష్యుని ఇంట్లో మాట్లాడుతుంటాడు.మాక్స్ ముల్లర్ రాసిన వేద భాష్యాల మీద ఉన్న పుస్తకాన్ని ఒకాయన తీసుకు రాగా దాని మీదకి చర్చ మళ్ళుతుంది.అప్పుడు ఆయన ఇలా అంటాడు " నేను యూరపు ప్రయాణం లో ఉన్నప్పుడు ఆ దంపతుల్ని కలుసుకున్నాను..వారి ఇంటిలో వశిష్టుడు ,అరుంధతి వలె నాకు కనిపించారు.అలనాటి భాష్యకారుడైన ఆ శాయనాచార్యుడే మళ్ళీ ఇప్పుడు ఈ మాక్స్ ముల్లర్ రూపం లో జన్మించినట్లు అనిపించింది.శ్రీ రామకృష్ణుల పట్ల ఆయనకి ఎంత గౌరవమో!నాకు వీడ్కోలు చెప్పేసమయం లో ఆయన కంటిలో నీళ్ళు నిండినవి".

" శాయనుడు మళ్ళీ జన్మించితే పావనమైన మన దేశం లో జన్మించాలి గాని  అక్కడ ఎందుకు జన్మించాలి " అని ప్రశ్నిస్తాడు ఒకాయన.

" రుషి ఎక్కడైనా జన్మిస్తాడు భూమి మీద ...దీనికి వ్యతిరేక భావం ఉంటే అది మన అజ్ఞానం.ఇరవై ఏళ్ళు వేద వాజ్మయాన్ని అర్ధం చేసుకొని ప్రపంచానికి అర్ధం అయ్యే ఇంగ్లీష్ భాష  లో  అందివ్వడం కోసం కృషి చేశాడు..అంతే గాక ఇంకో ఇరవై ఏళ్ళు దాన్ని ప్రచురించే పని లో ఉన్నాడు...మొత్తం నలభై ఏళ్ళు తను జీవితాన్ని ఒక కార్యం కోసం వినియోగించాడు.ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ వాల్యూం లు అన్నిటిని ప్రచురించడానికి గాను లక్ష రూపాయలు ఇచ్చింది.ఒక పనిని చేపడితే దాన్ని తుదముట్టించాడానికి తమ జీవితాల్ని అర్పించే ఈ గుణమే వారి గొప్పతనానికి కారణము...మనకో....పిల్లలు సరిగా ఎదగకుండానే పెళ్ళి...ఆ తర్వాత కుటుంబ భారం..వారికి పిల్లలు..ఇలా గడిచిపోతుంది.ప్రతి మనిషి ఏదో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి.ఒక లక్ష్యం కలిగిన వ్యక్తి లేని వాని కంటే తక్కువ తప్పులు చేస్తాడు". 

Murthy Kvvs                 

No comments:

Post a Comment