Sunday, July 1, 2018

ముసలావిడ (కధ)---మూర్తి కె వి వి ఎస్

ఆ ముసలావిడ అందరకీ పరిచయమే..!అలాగని ఆమె గురించి ఎవరికైనా తెలుసా అంటే అనుమానమే..!అసలు ఆమె మాటాడే భాష ఏమిటో చాలా మందికి తెలియదు.మాటాడితే వినడమే..అంతే తప్పా ఆ వ్యక్తి ఏమి మాటాడుతోందో ఎవరకీ తెలియదు.అది ఒక వింత భాష.కొత్త గా ఉంటుంది.కనక కాసేపు ఆగి, విని నవ్వుకుని వెళ్ళిపోతుంటారు.అంతకు మించి ఎవరకీ అవసరం లేదు.ఒక్కొక్క మారు ఆకాశం కేసి చూస్తూ పట్టరాని కోపం తో ఏదో మాటాడుతుంది ఊగిపోతూ..!మరోసారి తనలో తాను ఏదో గొణుగుకుంటూ మురిసిపోతూంటుంది.ఒక్కోసారి ఎవరో తన ముందు ఉన్నట్టు వాళ్ళతో చాలా ముఖ్యమైన విషయాలు మాటాడుతున్నట్లు ఏదో లోకం లో తేలియాడుతూ కనిపిస్తుంది.

 పుణ్య క్షేత్రం  అంటే ఎంత గౌరవమో ...ఇలాంటి నయం కాని బాధలేవైనా వస్తే ఇదిగో ఇలా ఎక్కడినుంచో మరీ తీసుకొచ్చి ఈ ప్రదేశం లో విడిచి పెట్టి మరీ పోతుంటారు.భారం ఆ దేవుడి మీద వేసి.ఈ మనిషి ఎలా అయినా చావనీ..జంతువు లా రోడ్ల వెంబడి తిరుగుతూ ,ఆ మురుగు కాలవల పక్కన పడుకుంటూ దొరికినది ఏదో తింటూ ,ఏమీ దొరక్క పోతే ఏ మూలనో మునగదీసుకుని ఉంటూ,ఏదో రోజున ఊపిరి పోయి ఓ కుక్క శవం లానే కుళ్ళిపోయి ఉంటుంది.
పడితే ఓ చిన్న వార్త ఏ డైలీ లోనో పడచ్చు.అనాధ శవం ఏదో ఉందనో,యాచకురాలు ఎవరో పోయారనో..!అంతకు మించి ఎవరకి అవసరం..?అసలు వాళ్ళకే లేనప్పుడు..!జిరాక్స్ షాప్ గోపాలం ఏదో మాటల్లో చెప్పాడు."నీకు ఓ విషయం తెలుసా,మా షాప్ కి ముందు ఉన్న రోడ్డు మీద ..సరిగ్గా మధ్యన డివైడర్ మీద..ఎప్పుడూ ఓ మతి భ్రమించిన ముసలామె కాపురం ఉంటుంది" అని.

"ఆ..చూశాను.నిజం చెప్పాలంటే రోజూ చూస్తూనే ఉన్నాను,బజారు లోకి ఏదో పని మీద వచ్చినపుడు..!మాంచి ఎండలో కూడా ఆ డివైడర్ మీదనే పడుకుంటూ ఉంటుంది.పొద్దున ,రాత్రి అలాంటి తేడాలు ఏమీ లేవు.అక్కడే మొహం కడగడం,స్నానం చేయడం అన్నీనూ.కానీ మన జనాలు కూడా మంచి ఓపికమంతులు.చూసి వెళ్ళిపోతుంటారు తప్పా ఇంకో ఆలోచన చేయరు..."

"ఏం చేయాలంటావు..ఆమె కి ఏ ఆపద కల్పించడం లేదు.అంతవరకు నయమే గదా .."

" నువ్వు చెప్పిందీ నిజమేలే ఇప్పుడున్న రోజుల్లో..!"
ఆ తర్వాత ఎవరి గొడవ వారిది.ఎవరి ప్రపంచం వారిది.గోపాలాన్ని కలవడం పడలేదు.అయితే వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఆ రోడ్డు మీద ఆ ముసలామె ని గమనిస్తూనే ఉన్నాను.ఆమె ప్రపంచం ఆమె దే.సరిగ్గా రోడ్డు డివైడర్ మీదనే కూర్చునేది.అది ఎండ అయినా...వాన అయినా...చలి అయినా ...!గమ్మత్తు పిచ్చిదే..!పూర్తి గా పిచ్చిదీ అనీ అనలేము. మన పిచ్చి గాని ఈ లోకం లో ప్రతి వాడూ ఓ పిచ్చి వ్యక్తే ..కాకపోతే లోకం ఆమోదించిన పిచ్చి.అంతే.

ఒకసారి మాట్లాడాలని ప్రయత్నించాను.కాని విఫలమైంది.ఎందుకా..అంతలోనే ఎవరో తెలిసిన వ్యక్తి తారసపడటం తో నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను.పిచ్చి వాళ్ళతో మాటాడినా వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళు గా జమ కట్టే లోకం ఇది.నా పై నాకే అసహ్యం వేసింది.ఎటువంటి లోకం లో రా నువ్వు బతుకుతున్నది.

ఆ ముసలావిడ దగ్గర ఎప్పుడూ ఒక దుడ్డు కర్ర ఉండేది.మరి అది ఆమె ఎందుకు ఎన్నుకున్నదో తెలియదు.ఇరవై నాలుగు గంటలు అది ఆమె తో ఉండాల్సిందే.దానితో గనక బలం గా నెత్తి మీద ఒక్కటి వేస్తే చచ్చి ఊరుకోవలసిందే.కాళీ మాత చేతి లోని త్రిశూలం లా అది ఎప్పుడూ అలా ఉండవలసిందే.అందుకు కొంత జనాలు ఆమె జోలికి రావడానికి జడిసేవారు.ఏమో చికాకు లేసి ఒకటి మోదితే..!సరే ..ఆ మేరకు తెలివైన  ఘటమే..!

అయితే మా గోపాలం ఒకసారి అన్నమాట గుర్తు వచ్చింది." నేను ఓ సారి ఆమె తో మాట్లాడాను.ఆమె మాట్లాడేది ఒరియా భాష.అయితే హిందీ కూడా ఆమె కి తెలుసు.ఆ ముసలామె కి మాటాడాలనిపిస్తే బాగా మాటాడుతుంది.లేకపోతే అసలు నోరు విప్పదు " అని.

"సరే ..నీతో ఏమి మాట్లాడింది..." అడిగాను.

" ఏదో మాట్లాడింది లే గానీ..ఒక మాటకి ఇంకో మాటకీ పొంతన లేదు.నాకు అర్ధం అయింది ఏమిటంటే కొంచెం పట్టించుకొని శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉంటే ఆమె చక్కని మనిషి గా అవుతుంది.దానిలో సందేహం లేదు.వాళ్ళ కుటుంబం లోని వ్యక్తులు ఎవరూ  ఆ దిశ గా ఆలోచించే వాళ్ళు లేకపోవడం దురదృష్టం."

" అవును..గోపాలం ..బాగా చెప్పావు.ఈ సృష్టి లో ఎంత అర్ధం చేసుకున్నా ఇంకా మిగిలిపోయేది ఏదైనా ఉందీ అంటే అది మనిషి మెదడు మాత్రమే..అక్కడ జరిగే చిన్న మార్పులు అతని జీవితాన్నే మార్చి వేస్తాయి.ఎవరి కోసమైతే తపన పడి ఆ బుర్ర ని పగలగొట్టుకుంటాడో ..అది పాడయి తేడా వస్తే ..ఆ పక్కనున్న మనుషులే అతడిని ఎందుకూ కొరగాని వాని గా భావించి ఇదిగో ఇలా రోడ్ల మీద పారేస్తుంటారు..."

సరే...!ఒకసారి జనవరి నెల లో ఏదో ఇంటర్వ్యూ కి అటెండ్ అయి తిరిగి వస్తున్నాను.సమయం అర్ధరాత్రి దాటింది.నడిచి వస్తున్నాను.ఏమిటి ఏ శబ్దం లేని ...నడిరేయి దాటిన తర్వాత నా పట్టణం ఇలా ఉంటుందా అని అనిపించింది.దేని అందం దానిదే.ఎంత నిశ్శబ్దం.ఎంత ధ్యానావస్థ ఎటుచూసినా..!ఆ మూల మలుపు తిరగగానే వీధి దీపం కింద ..ఆ డివైడర్ మీద పాత జంపకానా ఒకటి కప్పుకొని నిద్ర పోతోంది.ఆ ముసలామె.నిద్ర లో అంతా సమానమే అని ఎందుకు అన్నారో అర్ధం అయింది.ఇప్పుడు ఏ లారీ నో వచ్చి ఢీ కొడితే ఆమె ప్రాణానికి దిక్కేమిటి..?ఆ ఆలోచనే నాకు వణుకు తెప్పించింది.ఇలా దేశం లో ఎంతమందో..ప్రతి రోజు వాళ్ళ ప్రాణం లాటరీ మీద ఉండవలసిందే.

ఎంత నాగరిక సమాజం మనది..?ఒక మనిషి జంతు ప్రాయం గా బ్రతికే సమాజం.మనిషి మార్స్ మీదకి వెళితేనేం..?అంతరిక్షం లో గిరికీలు కొడితేనేం...?సాటి మనిషి ఓ కుక్క మాదిరి గా ,పంది మాదిరి గా మన మధ్యనే మెసలుతూ దీనం గా తిరుగుతుంటే ఆ సమాజం ఎంత గొప్పదైతే ఏమిటి..?ఎంత గొప్ప ఆలోచనలు చేస్తే ఏమిటి..?ఎంత గొప్ప సంస్కృతి అని వగలు పోతే ఏమిటి..?అన్నీ పనికిరాని శుష్క ప్రేలాపనలే...!

ఆసక్తి కొద్దీ ఆలుబాక గ్రామం కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు సంధించాను మిత్రుడు నరేన్ కి..!నరేన్ నా కాలేజ్ మేట్.ఇంకా సన్మిత్రుడు.ఇప్పటి దాకా మా స్నేహం కొనసాగుతున్నదంటే ఇక మీరు అర్ధం చేసుకోవచ్చు.ఎంత గాఢమైనదో..!తను ఆ గ్రామం లోని హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.ఎక్కడ లేని పుస్తకాలన్నీ తెప్పించి చదువుతూ ఉంటాడు. కనుక నాకు అర్ధం కాని కొన్ని విషయాలు అతడిని అడుగుతుంటాను.అదే గ్రామం లో ఒక గుట్ట మీద బ్రిటీష్ వాళ్ళు ఎప్పుడో నిర్మించిన శిధిల దశ లో ఉన్న నిర్మాణాన్ని చూడటానికి మేము ఇద్దరం వెళ్ళినప్పుడు అడిగాను.

"మిత్రమా...అసలు ఈ పిచ్చి అంటే ఏమిటి..? ఎందుకని మెదడు లో అలా మార్పులు జరిగి ఉన్నట్లుండి అలా అవుతాడు..?ఏ ఊరి లో చూసినా ఇలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు..పట్టించుకునే నాధుడే ఉండడు...దీనికి నిష్కృతి లేదా..?"

" ఈ దేశం లో వాళ్ళ ని పట్టించుకునే వ్యక్తి నీ రూపం లో ఒకరు ఉన్నందుకు ధన్యవాదాలు.ఎందుకంటే అసలు దీన్ని ఒక సమస్య గానే మన సమాజం లో గుర్తించరు.అదీ అసలు సమస్య.మన దేశం లో ప్రతి ముగ్గురి లో ఒకరు ఏదో ఓ మానసిక సమస్య తో బాధపడుతున్నవారే అని సర్వే లో తేలింది.కాని ఎవరూ మానసిక వైద్యుణ్ణి కలవాలని అనుకోరు.మనిషి మెదడు చాలా సున్నితమైనది.ఏ కారణం చేత అది రిపేర్ కి వస్తుందో చెప్పలేము.శారీరక వ్యాధుల్ని పట్టించుకున్నట్లుగా వీటిని పట్టించుకోరు..."

" దీనికి మరి సొల్యూషన్ ఏమిటి?"

" షిజోఫ్రెనియ అనే మానసిక రుగ్మత తోనే ఎక్కువ మంది బాధపడుతున్నట్లు తెలుస్తోంది.దీనిలో అయిదు రకాలు ఉన్నాయి.జీన్స్ పరంగా వచ్చేవి...బ్రెయిన్ లోని ద్రవాలు సమతులనం తప్పడం తో వచ్చేవి...ఇలా ఉన్నాయి.డిల్యూఝన్స్,హెల్యూసినేషన్స్ ఇలాంటివి ముందు మొదలై...మొదటి దశ లో పట్టించుకోకపోతే అవి తీవ్ర రూపం దాలుస్తుంటాయి.దీనికి కారణాలు కూడా ఫలానా అని ఒక్కోసారి చెప్పలేము. సాధ్యమైనంత త్వరగా డాక్టర్ ని సంప్రదించడమే మంచిది.. విచిత్రంగా చాలా మంది ప్రపంచ స్థాయి మేధావులు గా పేరుపొందిన వారి లో కూడా ఏదో దశ లో ఇలాంటి స్థితి ని అనుభవించిన వారే.."

" అలాంటి వారు ఎవరున్నారు.."

"మన దగ్గర చెప్పుకోడానికి సిగ్గుపడుతుంటారు గాని వెస్ట్ లో బాహాటం గా ఒప్పుకుంటారు.దానివల్ల అక్కడ చికిత్స సమయానికి జరుగుతుంది..అంతార్జాతీయం గా చెప్పాలంటే..అల్బర్ట్ ఐన్ స్టీన్ కొడుకు ఎడ్వర్డ్ కూడా కొంత కాలం షిజొఫ్రెనిక్ గా ట్రీట్ మెంట్ తీసుకున్నాడు.చిత్రం ఏమిటంటే తను స్వయం గా మానసిక వైద్యుడే.టాం హారెల్ అనే విఖ్యాత జాజ్ కళాకారుడు,జాన్ నాష్ అనే నోబెల్ విజేత ఇలా ఎంతో మంది.అలాగే మన ఇండియా లో ప్రఖ్యాత నటి పర్వీన్ బాబీ విషయం తెలిసిందే.అమెరికా గూఢచార సంస్థలు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాయని చెపుతుండేది.మనీషా కోయిరాలా ,హనీ సింగ్,షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా తాము ఒకానొక దశ లో ఆ స్థాయి లో బాధపడి కోలుకున్నామని చెప్పినది మనకు తెలుసు గదా ...అంత దాకా ఎందుకు శ్రీ శ్రీ కూడా ఒకానొక సమయం లో అలాంటి దశని చవి చూసిన వాడే.అతని వ్యతిరేకులు ఆ సమయం లో తనకి పిచ్చి ఎక్కినట్లు గా ప్రచారం చేసి ఆనందించారు. "

"మన దగ్గర తీరా ముదిరిన తర్వాత ఏ దూరపు ప్రాంతం లోనో బంధువులు వదిలేసి పోతుంటారు,అదీ అసలు సమస్య..పట్టించుకునే నాధుడు ఉండడు.."

" అలా అనకు...ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మార్పు వస్తోంది.ఇదిగో ఈ పేపర్ చూడు" అంటూ జిల్లా ఎడిషన్ నా చేతికి ఇచ్చాడు.
ఆశ్చర్య పోయాను అది చదివి..!నిజంగా ఇంకా మానవత్వం అంతరించిపోలేదు.ఇలాటి దీనులను గురించి ఆలోచించి..కేవలం ఆలోచించడమే కాదు ..దానికి తగిన తరుణోపాయాన్ని వెదికి చేతల్లో చూపించే ఒక మనీషి ఇంకా ఉన్నారు.కొదవలేదు.ఈ ఒరవడి ఇలాగే సాగితే ఎంత బాగుంటుంది..?మా పుణ్య క్షేత్రానికి సంబందించిన వార్తే అది.నేను రోజూ చూసే ఆ ముసలామె గురించినదే అది.ఆమె ఫోటో కూడా ఉంది..ఆమె చక్కగా గుండు చేయించుకుంటున్న ఫోటో అది.విచ్చలవిడిగా తైల సంస్కారం లేకుండా పెరిగిన పిచ్చిపొదల్లాటి ఆ జుట్టు ని ఒక క్షురకుడు కత్తిరిస్తున్నాడు. ఇంకా మంచి విషయం ఏమిటంటే ఆమె ని ఒక మంచి హాస్పిటల్ కి పంపిస్తున్నారు.ఎవరూ అని చూస్తే...మా పుణ్య క్షేత్రపు సబ్ కలెక్టర్ యోగితా రాణా అనే ఆవిడ.ఇంకా ఎంత కాలం అంటారు ..ప్రభుత్వ అధికారులు... బ్యూరోక్రసీ అంతా ... ఆ పాత ధోరణి లోనే ఉన్నారని.విన్నూత్నం గా,మానవత నిండిన హృదయం తో యోచించే  ఇలాంటి ఒక్కర్ని అభినందించితే అది ఎంతమందికి స్ఫూర్తి దాయకంగా ఉంటుందో..!ఈ ప్రపంచం లో ఎప్పుడూ మానవత్వం ఉంది..కాకపోతే దాన్ని గుర్తించడం లోనే తేడా ఉంది. (సమాప్తం) --Murthy kvvs   

No comments:

Post a Comment