Tuesday, July 10, 2018

ప్రసిద్ధ మళయాళీ కధా రచయిత వైక్కోం ముహమ్మద్ బషీర్

తిరిగే ప్రతి వాడు ఓ మహా రచయిత కాకపోవచ్చును గాని చరిత్ర లో నిలిచిపోయిన చాలామంది రచయితలు విస్తారం గా తిరిగినవారే.జీవితం వాళ్ళని ఒక ముందు చూపు తో ..అనేక అనుభవాలు ప్రోది చేసుకోవడానికి అలా తిప్పుతుందేమో.మనుషుల తీరు,లోకం లోని అనేక వర్ణాలు కేవలం వినడం వల్ల నే గాక స్వయం గా వాటిలో ఓ భాగం గా కలిసి మెలిసి ఆకళింపు చేసుకోడానికి అలా ఓ అవకాశం ప్రకృతి వారికి కల్పిస్తుందేమో.

ప్రసిద్ధ మళయాళీ కధా రచయిత వైక్కోం ముహమ్మద్ బషీర్ యొక్క అనువాద కధలు ఈ మధ్య కొన్ని చదివిన తర్వాత కొన్ని దశాబ్దాల క్రితమే ఎటువంటి ముందు చూపు తో అప్పటిలోనే విభిన్న ఇతివృత్తలని ఎన్నుకున్నాడో అనిపించింది.చెప్పే రీతి లో ఓ సులువుదనం,నవ్యతలని ప్రదర్శించాడు.ఆఫ్ఘనిస్తాన్ అని ఎక్కడా చెప్పడు గాని ..ఆ వర్ణనల లోని కొన్ని విషయాలని బట్టి అది తెలిసిపోతూ ఉంటుంది.అక్కడ పని చేయడానికి ఓ భారతీయుడు వెళతాడు..అతనికి ఆ ప్రాంతం అంటే అంతగా ఇష్టం ఉండదు.అక్కడి మనుషులు కసాయిలని ,ఎలాంటి వారి పట్లా దయ చూపరని ఆ పాత్ర ప్రగాఢ నమ్మకం.అక్కడ హోటల్ లో అనుకోని విధం గా బాకీ పడతాడు..డబ్బులు పోగొట్టుకోవడం తో..!ఎంతో వేదన అనుభవిస్తూ ,చివరి దశ కి చేరుకున్న తరుణం లో ఆ డబ్బు ని తస్కరించిన వ్యక్తి యే వచ్చి అతని తరపున హోటల్ యాజమానికి బాకీ చెల్లించుతాడు.అప్పుడు ..అనుకుంటాడు.ఈ  లోకం లో నూరు శాతం దుర్మార్గులు నూరు శాతం సన్మార్గులు ఎవరూ ఉండరని తెలిసి వస్తుంది.

ఈ కధ చాలా హృద్యం గా చెప్పబడింది.దీని టైటిల్ ని అల దూర తీరాన అని పెట్టారు.అలాగే ఓ గ్రామం లోని ఆయుర్వేద వైద్యుని మీద ఓ కధ.పెళ్ళికావాలసిన ఆ యువ వైద్యుడు మాటి మాటి కి అద్దం లో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూంటాడు.ఒక రోజు ఓ పాము ఇంటి కప్పు మీదినుంచి ఇతని మీదికి దూకుతుంది.అది తన రూపాన్ని అద్దం లో చూసుకుని ఎలా ప్రతిస్పందించింది అనేది గమ్మత్తు గా చెబుతాడు.వాక్యాలు చిన్నగా ఉండి సులభం గా అర్ధమవడం ,నిత్య వ్యవహారికం లోని సంఘటలనుంచి కధా వస్తువు ని తీసుకుని ఆహ్లాదం గా చెప్పడం బషీర్ కధల్లో కనబడుతుంది.

ఈయన జీవితం  ఆసక్తిదాయకమైనది.హోటల్ సర్వర్ గా,వంట వాడి గా,జ్యోతిష్యం చెప్పేవాని గా,గొర్రెల కాపరి గా,వాచ్ మేన్ గా ఇలా ఎన్నో పనుల్ని చేశాడు.చివరకి పత్రికా విలేకరి గా,పత్రికా ఏజెంట్ గా కూడా అవతారం దాల్చాడు.కేరళ నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ,బొంబాయి,కాశ్మీర్ వరకు ఇంకా పెషావర్ ,ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్ళాడు.కొన్నాళ్ళు పిచ్చాసుపత్రి లోను,జైలు లోను ఉన్నాడు.ఈ అనుభవాలన్నీ ఆయన రాసిన వందలాది కధల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయి.

అతి సామాన్య భాష లో ,గ్రామర్ ని కూడా ఖాతరు చేయకుండా నిజ జీవితం లో మనుషులు ఎలా మాటాడుకుంటారో అలాగే మళయాళ భాష లో రాసేవాడు.కొంతమంది సంపాదకులు సరిదిద్ది శిష్ట భాషలో రాస్తే ,వారితో గొడవ పడీ మరీ తను రాసిన విధం గానే ప్రచురించమని కోరేవాడు.తనకి వ్యాకరణం రాక అలా రాయడం లేదు.కావాలనే రాస్తున్నానని చెప్పేవాడు.ఆ తర్వాత ఆ ఒరవడి కి గొప్ప ఆదరణ లభించింది.

మీ మీద ఎవరి ప్రభావం ఉంది అని అంటే ఇలా చెప్పేవాడు." నేను రచన మొదలు పెట్టే సమయానికి పెద్ద గా ఎవర్నీ చదివింది లేదు.అయితే ప్రపంచం లోని మిగతా వాళ్ళు ఎలా రాస్తున్నారు అని తెలుసుకోడానికి గాను సోమర్సెట్ మాం, ఫ్లాబర్ట్,పెరల్స్ బక్,మపాసా,గోర్కీ ,స్టీన్ బాక్,రోమై రోలా ,హెమింగ్ వే లాంటి వారిని చదివాను.అయితే వాళ్ళ ప్రభావం ఉందని చెప్పలేను గాని రోమై రోలా,స్టీన్ బాక్ లాంటి వాళ్ళు నాకు తెలియకుండానే నాలో చొరబడిఉండవచ్చు.నాకు అంటూ ఒక శైలి ఉంది.అది నాదే.అది ఎవరిదీ కాదు.."       

No comments:

Post a Comment