Sunday, January 13, 2019

వివేకానంద స్వామి లో ఓ గొప్ప భావుకుడు కూడా ఉన్నాడు.


పొద్దుటి నుంచి ఆలోచిస్తున్నాను,ఏది రాయాలి,ఏది రాయకూడదు అని..!అదే ఈ రోజు వివేకానంద స్వామి జయంతి కదా..!ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి ఆయన గూర్చి ..అది నాకు పెద్ద సమస్య ఎప్పుడూ..! కొంతమంది కి ఆయన నీతి ని బోధించే గురువు గా కనిపిస్తే ,ఇంకొంతమందికి అభ్యుదయ భావాలు గల వ్యక్తి గా,మరి కొంతమందికి హిందూ మత విశిష్టత ని జగతి కి చాటిన తాత్వికుని గా ...ఇలా రకరకాలు గా కనిపిస్తారు.నిజానికి ఇలా కనిపించాలని ఓ ప్రయత్నం ప్రకారం చేసినది కాదు..ఆయన జీవితం.ఆయన మాట్లాడిన,రాసిన ప్రతి పలుకు ని అనేక ఏళ్ళుగా చదువుతూనే ఉన్నాను.ఇంకా అంత అద్భుతం గానూ,కొత్త రంగులీనుతూ ఈ రోజు కీ అన్వయింపగలిగే భావ వీచికలు గా అవి గోచరిస్తూ ఉంటాయి.

దానికి కారణం ఏమిటి...తన కాలాన్ని దాటి అనేక వందల ఏళ్ళు ముందు ఉన్నట్టుగా గోచరిస్తారు.మనం చాలామందిమి ఆయన కొటేషన్ లు మంచి గా ఉన్నవి కొన్నిటిని గూర్చి ఉటంకించుకుంటూ ఉంటాము.అయితే అవి అన్నీ ఆయన చెప్పిన విస్తృతమైన భావాల మధ్య లో నుంచి తీసుకున్నట్టివి.ఆ మాటలకి ముందు,వెనుక చాలా గొప్ప ధార ఉంటుంది అది పూర్తి గా ఆ పాఠం అంతా చదివితేనే బోధపడుతుంది.లేదా సగమే చేరుతుంది.అయినప్పటికీ ఆ మాటల్లోని ఉద్వేగం ,ఆకర్షణ అనంతమైనది.అది ఎంత తపో ధార తో,ఎంత హృదయ పరితాపం తో వచ్చినదో ఆయన పుస్తకాల్ని పూర్తి గా చదివితేనే అర్ధం అవుతుంది.

నాకు అర్ధమైనంతవరకు ...చెప్పాలంటే....హిందూ మతం లోని గొప్పతనం ని ఎంత ఉగ్గడించాడో,దానిలో ఉన్న చేర్చబడిన కొన్ని అమానవీయ పద్ధతులను అంత ఖండించాడు.అంతే గాక కొన్ని సాహసోపేత విషయాలను సైతం ఎవరు ఏమని అనుకుంటారో అని ఆలోచించకుండా చెప్పడం కనిపిస్తుంది.ఆ రోజుల లోనే బ్రాహ్మాణాధిక్యాన్ని ఖండించడం మామూలు విషయం కాదు.మీ ఇల్లూ,పరిసరాలు,శరీరాలు అన్నీ బలహీనతనే తలపింపజేస్తాయి.విద్య ,జ్ఞాన సముపార్జన కింది స్థాయి వరకు చేరకపోవడం వల్లనే మన దేశం మీదికి వచ్చిన ప్రతి జాతి కి బానిసల్లా బ్రతికాము.ఇదే గనక కొనసాగితే ఇక్కడి అధోజగతి జనులు చేసే పోరాటం ను మీరు తట్టుకొనలేరు.ఎందుకంటే అనేక వందల  ఏళ్ళ నుంచి వారు చేసిన శ్రమల వల్ల వారి మనసు,శరీరాలు బలవత్తరమైనవి.అని ఇటువంటి ఒక Prophetic call ని ఆ రోజుల్లో నే ఇచ్చారు.ఇది ఒక్కటే కాదు.. ఇలాంటి అనేక విషయాల్ని ఎన్నిటినో వక్కాణించారు..కాని వాటిని పెద్దగా ప్రాచుర్యం లోకి పెట్టరు ..!ఎవరకి కావలసినవి వారు తీసుకోవడం అనేది ఉన్నదే గదా..!
మళ్ళీ ఓ సందర్భం లో అంటారు,ఈ రోజు కీ మన దేశం లో ఏ కొన్ని శాస్త్రాలు మిగిలినా సంస్కృతి మిగిలినా ధనాన్ని తృణప్రాయం గా ఎంచే విప్రుల వల్లనే మిగిలిందని కూడా మరిచిపోరాదు.ప్రపంచం లో అత్యంత పేద పౌరహిత్యం నెరపే వారు వీరే ,అందుకనే వీరి పట్టు ప్రజలపై అంత గట్టిగా ఉంటుంది.నేను ప్రపంచం లోని అనేక దేశాల్లో చూశాను.పౌరహిత్యం నెరపే ఇతర మతాలలోని వారందరూ చాలా ధనవంతులే..!ఇలా ..ఎన్నో ఊహకి అందని అంశాల్ని చర్చించారు స్వామి ఆ రోజుల్లోనే.

పడమటి దేశాల్లోని అనేక విశిష్ట విషయాల్ని నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు.నల్లని వర్ణం వారు,రాగి వర్ణం వారు,పసుపు వర్ణం వారు ఎవరైతేనేం ..వారందరూ ఈ బ్రిటిష్ వారి ముందు ఎందుకు పాలితులు గా మారారో తెలుసా ...ఇక్కడి సైన్యం లో గాని,ప్రజా జీవనం లో గాని నాయకుడు అనేవాడు తాను ముందు గా త్యాగ ధనుడు గా ఉంటాడు.అందుకే అతని అనుచరులు కూడా అతని మాటని గౌరవిస్తారు.అలా ఎన్ని ..విషయాలో ఆయన చెప్పినవి.ఇవన్నీ ఒక ఎత్తయితే రాజయోగం మీద ఆయన రాసిన భాష్యం చాలా గొప్పది. ఎందుకనో సిద్ధులని ఆయన తిరస్కరించాడు గాని వాటి సాయం తో ఒక మతం నే తను స్థాపించి ఉండేవాడు.ఆత్మల తో మాటాడడం,ఎదుటి మనిషి లోని భావాల్ని ఉనది ఉన్నట్లు చదవడం ఇలా ...అనేకమైన వాటిని తను ఎరుగును.గాని వాటిని సామాన్యులలో ప్రచారం చేయడాన్ని ఇష్టపడలేదు.ఈ కోణం ని ఎవరూ పెద్దగా ప్రచారం లోకి కూడా తేలేదు.

ఇంగ్లీష్ భాష లో కూడా స్వామీజీ ది ఓ ప్రత్యేకమైన శైలి.ఎక్కడ ఏ మాట ఎంత తూకం వేయాలో అంత తూకం గా ప్రయోగిస్తారు.అందుకే వాటిలో అంత దమ్ము ఉంటుంది.కొంత మంది మహానుభావులు ఈయన ని కోట్ చేయకుండానే వాటిని వాడుకొంటూ ఉంటే నవ్వు వస్తుంది. వివేకానంద స్వామి లో ఓ గొప్ప భావుకుడు కూడా ఉన్నాడు.ఆయన కవితల్లో అది వ్యక్తమవుతుంది.Kali the Mother అనే కవితలో ఓ చోట ఇలా అంటారు...The stars are blotted out, The clouds are covering clouds, It is darkness vibrant, sonant.....For Terror is thy name, Death is thy breath, And every shaking step destroys a world for e'ver.....Who dares misery love,
And hug the form of death. Dance in destruction's dance, To him the Mother comes. 

No comments:

Post a Comment