Tuesday, March 19, 2019

"దంతెవాడ" కధలు (సమీక్ష)

"దంతెవాడ" కధలు (సమీక్ష)

"దంతెవాడ" కధా సంపుటి యొక్క ముఖ చిత్రం చూడగానే ఎంతో ఆసక్తి కలిగించింది.ఊడలు దిగిన ఒక మహావృక్షం,దానికింద కూర్చున్న పిల్లలు ఆసక్తిని కలిగించాయి.ఈ కదా సంపుటి కి తగిన ముఖ చిత్రం అని ఈ పుస్తకం చదివిన తరువాత చదువరి కి అనిపిస్తుంది.ముందు మాట లో డా.వి.ఆర్.శర్మ ఈ పుస్తకం లోని ఆత్మ ని చక్కగా వివరించిన తీరు లోనే ఈ 11 కధలు ఎటువంటి కొత్తదనాన్ని సంతరించుకున్నవో అర్ధమై పోతుంది.ఈ కధల్ని రాసిన మూర్తి కె.వి.వి.ఎస్. ఇప్పటికే గాడ్ ఫాదర్ నవల అనువాదకులు గా సాహితీ లోకానికి సుపరిచితులు.కధకుని గా కూడా తనదైన ముద్ర ని కనబరిచారు అనడం లో ఎలాంటి అనుమానం లేదు.

మొదటి కధ "స్మృతి" బ్రిటిష్ వారు నివసించిన ఒక ప్రాంతం లోకి మనల్ని తీసుకు వెళుతుంది.అప్పటి వారి జీవన విధానం,ఆ పరిసర ప్రాంతాల పై దాని యొక్క ప్రభావం తెలుసుకొని ఆశ్చర్యపోతాము.అనేక ఆలోచనలు ముప్పిరిగొని కొత్త లోకాలకి వెళతాము.భద్రాచలానికి దగ్గర లో ఉన్న అలనాటి తెల్లవారి సమాధులు కొత్త ద్వారాలను మన కళ్ళ ముందు తెరుస్తాయి.ఇక రెండవ కధ "ఆ రోజు" ఒడిశా రాష్ట్రం లో ని భుబనేశ్వర్ లో జరిగిన ఒక వింత సంగతిని వివరిస్తుంది.ఈ కధ లో కధకుడు మూర్తి ఆ రాష్ట్రం కి చెందిన సామాజిక చిత్రపటాన్ని మన కళ్ళ ముందు ఉంచుతారు.
ఇక "దంతెవాడ" కధ చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో ని ఆదివాసీ ల పై తీవ్రవాద ప్రభావం ఎలా ఉన్నది అనేది వివరించడమే గాక స్థానికంగా వివిధ రాష్ట్రాలకి చెందిన వారు ఎలా జీవిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది.ఈ కధ చివరి లో వచ్చే దృశ్యం పాఠకుల మనసుల్ని పిండివేస్తుంది.చదివిన వారిని అనేక రోజులు ఇది వెంటాడుతుంది.ఇక "వొట్టి బండ" అనే కధ ఉపాధ్యాయుని పాత్ర ఎంత గురుతరమైనదో,పిల్లల పట్ల ఎంత జాగ్రత్త గా వ్యవహరించాలో తెలుస్తుంది.ఎవరూ ఊహించలేని నేపధ్యం గల పిల్లలు ,వారి వెతలు హృదయ విదారకం గా ఉంటాయని ఈ కధ తెలియజేస్తుంది."రజనీకాంత్" అనే కధ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఇక్కట్లని వివరిస్తుంది.

"కిష్కింద కాండ" కధ లో జంతువులు ఏ విధంగా మనుషుల కన్నా ప్రత్యేకమైనవో ఆహ్లాదం గా చెప్పారు.కోతుల మీద మంచి పరిశీలన చేసి ఈ కధ రాసినట్లు గా అనిపిస్తుంది.కొట్టాయం,ముసలావిడ,మర్మయోగి,పోలింగ్ డ్యూటీ,నా డైరీ లోని కొన్ని పేజీలు ఇలాంటి కధలన్నీ ఆకట్టుకునే విధంగా సాగిపోతాయి.విసుగు తెప్పించకుండా మనో రంజకం గా ప్రతి కధని నడిపించారు.వస్తువు ని ఎన్నుకోవడం లోనూ,గుర్తుండిపోయే విధంగా దానిని మలచడం లోనూ మూర్తి చూపించిన వైవిధ్యం ప్రత్యేకమైనది.చాన్నాళ్ళకి ఒక మంచి కధా సంపుటి చదివిన అనుభూతి పాఠకుని కి కలుగుతుంది.ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ ఈ పుస్తకానికి రాసిన వెనుక మాట లో ఈ విషయాల్ని ప్రస్తావించి కితాబు నివ్వడం అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు.  --- జి.తులసి




No comments:

Post a Comment