Thursday, December 13, 2018

నా డైరీ లోని కొన్ని పేజీలు..!(కధ)--మూర్తి కె.వి.వి.ఎస్.


2-10-2018

ఇప్పుడు సిగిరియా వద్ద ఉన్నాను.శ్రీలంక లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం.రావణుడి వంశీకులు కట్టిన కోట దగ్గర.లయన్ రాక్ గా పిలువ బడే కొన్ని వందల మీటర్ల ఎత్తైన పర్వతం.దాని మీద కట్టిన కోట.శిధిలమై ఉన్నది.అలాగని గుర్తు పట్టలేనంతగా కాదు.శిల్ప సంపద,రహస్య సొరంగాలు,స్నానమాడే కొలనులు ఇలా అలనాటి దర్పానికి ప్రతీక గా ఇంకా నిలిచే ఉన్నాయి.ఎన్ని వేసవులు.ఎన్ని గాడ్పులు.ఎన్ని తుఫానులు..ఎన్ని వర్షపాతాలు...ఎన్నిటినో తట్టుకొని ఇంకా తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి.ఆ ఎత్తైన కొండకి చుట్టూరా కొన్ని మైళ్ళ పర్యంతం చుట్టూరా కందకాలు,వాటిలోని నిర్మల ప్రవాహాలు, ఆ దరులకిరువేపులా పచ్చని ప్రకృతి...బండరాళ్ళు పేర్చి కందకాలకి కట్టిన గోడలు...చుట్టూరా అరణ్యం...దానిలోనే ఈ కట్టడాలు..!ఒకానొక కాలం లో ఈ చోటులన్నీ ఎంత వైభవం తో తులతూగినవో...ఎవరెవరు ఇక్కడ తమ పాద ముద్రలు వదిలి కాల గర్భం లో కలిసిపోయారో..!ఇక్కడ నేను వదిలిన పాద ముద్రలు ,కొన్ని వందల ఏళ్ళ తర్వాత ఎవరైనా గుర్తుపడతారా...?సూక్ష్మ ప్రపంచం ని వీక్షించే ఏ యోగీశ్వరులో బహుశా ఆనవాలు పట్టవచ్చునేమో..!

అన్నట్టు రావణుడు ఆ భారత దేశం లోని దండకారణ్యం నుంచి ఇక్కడి దాకా సీతమ్మ ని తీసుకు వచ్చాడా..?ఎటువంటిది ఆ ఆకాశగమనం చేసిన వాహనం..!ఎన్నో సందేహాలు ముప్పిరిగొన్నాయి.వాల్మీకి భావనా ఝరి ఎన్నో ఏళ్ళు దాటి అలా సాగుతూనే ఉన్నది.ఏది ఏమైనా ఒక  సాంస్కృతిక బంధాన్ని నిర్మించాడు ఆ మహా కావ్యం తో..!నిజమో..ఊహ నో...కల్పనా చాతుర్యమో...ఒక్కొక్కరికీ ఒక లాగా ..! ఎవరి దృష్టి వారిది.ఈ సిగిరియా ని ఆధారం గా చేసుకుని ఎంత జీవన వ్యాపారం ఇక్కడ..?హోటళ్ళు,వివిధ రకాల అంగళ్ళు,ఆటోలు,మిగతా వాహనాలు ఇంకా వివిధ దేశాల టూరిస్టులు ...నిర్విరామంగా ..యాత్రామయం..!చిన్నప్పుడు చదివిన,విన్న రామాయణ ఘట్టాలు చుట్టుముడుతూన్నాయి నా ప్రమేయం లేకుండానే..!

3-10-2018

సిగిరియా నుంచి బయలు దేరాను.బస్సు సాగిపోతూన్నది కాండీ వైపు.అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఈ శ్రీలంక లో ఉందని అంటారు.అయితే ఆ ప్రాంతం ఏమిటని ఎందరినో అడిగాను.ఎవరూ నాకు సరిగా చెప్పలేకపోయారు.చరిత్ర ఒక్కోసారి పుక్కిట పురాణాల్లో కప్పివేయబడి ఉంటుంది.కొన్నిసార్లు జానపదుల నోళ్ళలో వివిధ రూపాలు గా నాని గుర్తు పట్టలేని తీరుగా తయారవుతుంది.ఒక్కోసారి కల్పన ఏదో పుక్కిట పురాణమేదో చెప్పలేని స్థితి.ఈ లంక లో ఎక్కడ చూసినా బుద్ధ వైభవమే..!రమారమి పాతిక వేల పై చిలుకు ప్రదేశాల్లో ఎక్కడ తవ్వినా బుద్ధుని తాలుకు చరిత్ర ని తెలిపే వైనమే..!మన దేశం నుంచే ఇక్కడికి వచ్చిన బౌద్ధం మన దగ్గర సన్నటి ధార గా పరిణమించడం ..ఏ చారిత్రక మలుపుల విభాత సంధ్య లో మరి ఏమి జరిగిన ప్రభావమో..!ఒకానొక కాలం లో బహుశా సముద్ర ప్రయాణం ని భారత దేశం లో నిషేధించడం అనేది ..బౌద్ధ మతం తో సంగమం అనేది మళ్ళీ జరగకూడదనేనా..?అయితే దానివల్ల ప్రపంచ పోకడలకు దూరం అవడం వల్ల నిలవ నీరు గా ఉన్న మన దేశాన్ని ఇతర జాతులు కబళించడం సులువు అయింది.

ఇండోనేషియా,సుమత్రా,బాలి వంటి సుదూర ద్వీపాల్లో సైతం భారతీయ సంస్కృతి లోని ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ భాష లోను,సంస్కృతి లోనూ నేటికీ కనబడతాయి.అంటే ఒకానొక సమయం లో మనవాళ్ళూ సముద్రాలు దాటి జైత్ర యాత్రలు చేశారు.ఆ తర్వాత ఎప్పుడైతే సముద్రయానం నిషేధించబడిందో అక్కడినుంచే మన క్షీణ దశ ప్రారంభమయింది.అంతదాకా ఎందుకు ఈ లంక లోనే చూసినా భారతీయ ఆత్మ ఇప్పటికీ ప్రతి మూలన అనుభవమవుతూనే ఉంటుంది.ఆ తూర్పు వేపున తమిళులు బాగా ఉన్నచోటనే కాదు శ్రీలంక లోని ప్రతి మూలన మనల్ని మనమే చూసుకున్నట్లుగా ఉంటుంది.ఏదో పరాయి దేశం లో ఉన్నట్లు గా ఉండదు.విమానాశ్రయం లో ఇమిగ్రేషన్ అధికారులు మన పాస్ పోర్ట్ ని అడిగి చెక్ చేసినప్పుడు మాత్రమే వేరే దేశం లో ఉన్నట్లు స్పృహ వస్తుంది.

4-10-2018

సిగిరియా నుంచి కాండీ వచ్చి ఒక హోటల్ లో సేదతీరాము.ఈ కాండీ ఇక్కడి పురాతన నగరాల్లో ఒకటి.ఎన్నో రాజవంశాల పాలనలు...బ్రిటీష్ పాలన వరకు..!ఈ దేశం లో ఎక్కడికి వెళ్ళినా వెన్నంటి వస్తూనే ఉన్నది పచ్చదనం.బుద్ధుని పన్ను యొక్క అవశేషం పైన కట్టిన ఆలయం ఈ కాండీ యొక్క ప్రత్యేకత.ఎంతో మంది విదేశీయులు.స్వదేశీయులు అంతటా ఈ ఆలయ సమీపం లో..!ఈ ఆలయం ముందే ఉన్నది క్వీన్స్ హోటల్ అనబడే గత కాలపు భవనం.ఇప్పటికీ వీడని రాజసం ఆ కట్టడం లో..!ఆ ఆలయ ప్రవేశానికి చెల్లించాను వెయ్యి రూపాయలు.అదీ శ్రీలంక కరెన్సీ లో.బుద్ధుని కి సమర్పించడానికి తామర పూలు,ఇంకా ఇతర పూలు తీసుకువెళుతున్నారు.ఆలయం లోకి అడుగుపెడుతూనే అక్కడి గోడల పై తధాగతుని జీవితాన్ని వివరించే ఎన్నో రంగురంగుల చిత్రాలు.తెల్లటి పొడవైన స్థూపం లోపల.ఇంకా ఎన్నో శిల్పాలు.కలప ని ధారళంగా వాడిన నిర్మాణం.మా ఊరి రామాలయం లో లాగానే అక్కడక్కడ కొంతమంది కింద కూర్చునే దీక్ష గా బౌద్ధ శాస్త్రాల్ని ఆలపిస్తున్నారు.అగరు పొగలు దట్టం గా సాగుతున్నాయి.ఉన్నట్టుండి శంఖారావాలు...ఢంకా రావాలు...ఊరేగింపు లోపలకి ప్రవేశిస్తోంది.కెమేరాలు క్లిక్ మనిపిస్తున్నారు.ఎటువంటి ఆటంకాలు లేవు కెమేరాలకి..!

తధాగతుని దర్శించుకుని బయటకి వచ్చాము.మాతో పాటు వచ్చిన బస్సు లో ని ప్రయాణికులు వాళ్ళు కూడా దర్శించుకుని బయటకు వచ్చారు.ఆలయం ముందే ఉన్న జలాశయాల్ని చూస్తూ ఆనందిస్తూ ఉండగా ఒక చిన్నపిల్లవాడు తప్పించుకు పోయాడు.ఇక చూడండి.తల్లిదండ్రుల బాధ.ఇలా వచ్చేప్పుడు అసలు చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారో తెలియదు.ఆ బస్సు లో కూడా అయిదేళ్ళ పిల్లవాడు మహా గోల.మిగతా ప్రయాణీకుల సహనాన్ని పరీక్షించే విధంగా  అందరి సామాన్లు చికాకు చేసేవారు.ముందు ఎంతో ఓర్పు తో ఉన్నా అబ్బా ఏం పిల్లలురా  బాబూ అనిపించసాగింది.అయితే వీడి తల్లిదండ్రులు మాత్రం అదేదో గొప్ప సంగతి లా విలాసం గా ముద్దు చేస్తోంటే మిగతా వాళ్ళకి చిర్రెత్తసాగింది.మన ఆనందం ఇతరులకి ఖేదం కాకూడదనే ఇంగితం ఎందుకు ఉండదో కొందరకి..!మొత్తానికి వాడు ఆ జనప్రవాహం లో ఒక చోట దొరికాడు.హమ్మయ్యా ..పోనీలే అనిపించింది.

5-10-2018

సరే...కాండీ నుంచి బయలుదేరాము.అక్కడినుంచి కొలొంబో వైపు సాగుతున్నాము.ఈ మధ్య లోనే నుగారవాలియ అనే ఊరు.బస్సు వెళుతుంటే ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.లోయలు ,జలపాతాలు,మధ్యలో తగిలే జనసముదాయాలు హాయిగా గూర్చుతున్నాయి. గత కొన్ని రోజులు గా చూస్తున్నా.ప్రతి రోజు ఎంతో కొంత వర్షం పడుతూనే ఉంది.వెంటనే వెలిసిపోతూనే ఉంది.ఎక్కడా ఇదే స్థితి ఈ ద్వీపం లో..!మేఘాలు గుత్తులు గుత్తులు గా కొండలమీది నుంచి ఆనుకుని సాగుతున్నాయి.నుగారవాలియా లోనే ఒక గుడి ముందు ఆగింది బస్సు.అది ఆంజనేయుని గుడి.బయట ద్వారానికి అటూ ఇటు ఆంజనేయుని శిల్పాలు.లోపలకి వెళ్ళినచో సీతారామ దర్శనం లక్ష్మణ సమేతం గా జరుగుతుంది.ఇక్కడి విశేషం ఏమిటంటే ఈ గుడి చుట్టూరా ఆనుకుని కొంత అటవీ భగం వున్నది.పొడుగైన చెట్ల తో  అశోక వనం లా ఉన్నది.ఈ ప్రాంతం లోనే సీతాదేవి వనవాసం లో గడిపినది అంటూ అక్కడ ఓ బోర్డ్ పై రాసి ఉన్నది.నిజంగా ఇప్పటికీ ఆ మహా సాధ్వీ అక్కడే ఉన్నట్లు అనిపించింది.ఆధారాలు ఇమ్మంటే ఇవ్వలేను.

అలా ప్రయాణిస్తూ ...సాయత్రం కి చిన్మయ మిషన్ వాళ్ళు కట్టిన ఇంకో ఆంజనేయుని గుడికి చేరుకున్నాము.ఈ లంక లో ఈ మహానుభావునికి ఎంత పాపులారిటీ నో..!ఇది ఒక పెద్ద గుట్ట మీద ఉంది.కింద నుంచి పైకి ఆటో లు వెళుతున్నాయి.పై నుంచి కిందకి చూస్తే ఈ భూగ్రహం ఇంత అందమైన ప్రదేశాలకి ఆలవాలమా అనిపించకమానదు.మెట్లు ఎక్కేసరికి కొద్దిగా కాళ్ళు పీకినా ఈ సుందర దృశ్యాలు కనిపించి నా అలసట ని మటుమాయం చేశాయి.బస్ ముందుకి సాగుతున్న కొద్దీ టీ ఫేక్టరీలు ,తోటలు విరివిగా కనిపిస్తున్నాయి.రాత్రి తొమ్మిది దాటింది కొలొంబో చేరుకునేసరికి.అప్పటికే బుక్ చేసిన ఓ హోటల్ లో దిగాము.ఇహ ఇప్పుడు అసలైన పని రేపటినుంచి ప్రారంభం కాబోతున్నది.అసలు ఈ దేశం లోకి అడుగు పెట్టిన ఉద్దేశ్యం అదే.ఇవన్నీ ..ఇప్పటి వరకూ తిరిగినది అంతా బోనస్ లాంటిదే.!ప్రపంచ శాంతి సమావేశాలు రేపటి నుంచి మొదలవబోతున్నాయి.అనేక దేశాల వాళ్ళు పాల్గోనబోతున్నారు దీనిలో..!మన దేశం నుంచి నేనూ ఒక ప్రతినిధి గా రావడం జరిగినది.తిరువళ్ళువర్ అన్నట్లు ఒక పని చేస్తున్నప్పుడు ,ఆ పని మూలం గా మరి యొక పని ని చేయడం అనేది ఎలాంటిది అంటే ఒక ఏనుగు ని పట్టి దాని సాయం తో మరి యొక ఏనుగు ని పట్టడం లాంటిది. (The end)

No comments:

Post a Comment