గోపీనాథ్ మొహంతి "అమృత సంతానం" నవల పై ఓ రివ్యూ
--------------------------------------------------------------------------------
గోపీనాథ్ మహంతి గారు ఒరియా భాష లో కోంధ తెగ పై రాసిన అద్భుతమైన నవల ని పురిపండా అప్పలస్వామి గారు "అమృత సంతానం" పేరు తో అనువదించారు.ఆ రకంగా మన తెలుగు అనువాద సాహిత్యం లో ఓ మణిపూస వచ్చి చేరింది.543 పేజీలు గల ఈ పుస్తకాన్ని కాస్త మెల్లగానే చదవ వలసి వచ్చింది.మిగతా లౌకిక వ్యవహారాల సందడి లో బడి..!
నా అభిప్రాయాన్ని పంచుకోవాలని ఎంతో ప్రయత్నించగా ఇప్పటికి పడింది.ఒక మహా తేజస్సు ని కంటి తో చూసినప్పుడు ఒక్కసారి గా మ్రాన్ పడిపోతాము.దాని గురించి ఎక్కడ మొదలు పెట్టి ఏమి చెప్పాలో అర్ధం కాని స్థితి ఉంటుంది. ఈ నవల చదివిన తర్వాత సరిగ్గా అలాగే అనిపించింది.దేనిని వదిలి వేయాలి దేనిని చెప్పాలి అలా అయింది నా పరిస్థితి.
ఎంత చిన్న వాక్యాలు.ఎంత గుండెల్ని పట్టి ఊపి వేసే నేర్పు.ఏ పాత్ర స్వభావం దానిదే,ఎక్కడా తెచ్చిపెట్టుకున్న శైలి లేదు.అంత అందం గానూ పురిపండా వారి అనువాద నైపుణ్యం సాగింది.ఒరియా సొబగులు క్షుణ్ణం గా ఎరిగిన కళింగాంధ్రుడు ఆయన. వాడ్రేవు చిన వీరభద్రుడు గారి చొరవ వలన అనేక మంది ఈ నవల పై తమ అభిప్రాయాల్ని రాశారు.అది ఒక చక్కని ప్రయోగం.అక్కడ ప్రస్తావించినవి కాక ఇంకొన్ని ఇతర విషయాలు ముచ్చటించ యత్నిస్తానుసరే..నా వల్ల అయినంత మేరకు రాస్తాను.
ఒక ముఖ్య విషయం చెప్పాలి.మహాంతి గారు ఎక్కడ కూడా ఎవరి వైపూ నిలబడి తీర్పు ఇవ్వడు.అలాగే శృంగార సన్నివేశాలు కూడా ఒక పరిధి దాటి వర్ణించడు కాని ఆ అనుభూతిని కొన్ని మాటల్లోనే చెప్పి ఆ సంఘటన ని బలపరుస్తాడు.సోనా దేయి ని సోదా చేయడానికి అధికారులు వచ్చినప్పటి సన్నివేశాన్ని దీనికి ఉదాహరణ గా చెప్పవచ్చును.అలాగే దివుడికి,అతని భార్య కి మధ్య వచ్చే ఎడం కూడా ఎంత సున్నితం గా ఉంటుందో.అక్కడ ఆ యిద్దరి లో ఎవరిని తప్పని అనలేము.ఎంతో ఏరి కోరి దివుడు ఆమె ని చేసుకుంటాడు.పిల్లవాడు పుట్టినతర్వాత భార్య భర్త మీద కాక ధ్యాస ని ఎక్కువ పిల్లవాడైన హాకినా మీద పెట్టడం,తన సొగసు మీద కూడా దృష్టి పెట్టకపోవడం ,భర్త దగ్గరకి వచ్చినప్పుడు దూరం పోవడం ఇవన్నీ దివుడు లో ఆ భాష లో చెప్పాలంటే సిర్ర పుట్టిస్తుంది.
అందువల్ల తను బయట కి చూడటం మొదలవుతుంది.మళ్ళీ ఒకవైపు భార్య ని చూసినప్పుడు తన లో ఆత్మశోధన మొదలవుతుంది. ఎంత బక్క గా అయిపొయింది, పిల్లవాని ఆలనా పాలనా ,ఇంటి పనులు ఇవన్నీనూ ఆమెకి అని దివుడు మరోవైపు ఆలోచిస్తాడు.ఊరు కి పెద్ద తలకాయ తను కొరితే ఎంతో మంది వస్తారు కాని అప్పటికీ ఎంతో సమ్యమనం తో వ్యవహరించినట్లే అనుకోవాలి.పియోటి వంటి జాణతనం ఉన్న స్త్రీ తో కూడా ఎంతో జాగ్రత్త గా వ్యవహరిస్తాడు,ఆమె ఇతడిని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.
సరే..చివరకి ఆమె సఫలమవుతుంది.
బాగా తరచి చూస్తే ప్రతినాయకుల్లాంటి వారు తెలుగు వారే అని తేలుతుంది.దక్షిణాది నుంచి వచ్చిన వారని వ్యాపారస్తుల గురించి చెప్పడం ,ఆ పేర్లు అవీ ..ఇంకా పియోటి పెరిగిన,ఎరిగిన ఊర్లు మనుషులు గూర్చి రచయిత చెపుతున్నప్పుడు ఈ భావన మనకి కలుగుతుంది.బారికి వంటి వారు ఆ కొంధ సమాజం లో దళారి వంటి వారే.బెజుణి,డిసారి వంటి వారు ఆ సంస్కృతి లోని భాగాలు.పులి అనేది ఎంత గొప్ప భాగమో ఆ జీవితంలో.అచటి కొంధ ప్రజలు వేటకి తుపాకులు ఉపయోగించడం మన జీవనం తో పోల్చితే కొత్త గా అనిపిస్తుంది.
1955 లో ఈ నవల కి సాహిత్య అకాడెమి బహుమతి ప్రదానం చేయడం వలన ఇతర భాషల్లోకి ఆ సంస్థ కృషి చే వెళ్ళగలిగింది.అందుకు గాను ఆ సంస్థ ని అభినందించవలసిందే.ఆ రకంగా మనం తెలుగు లో చదవగలిగాము.కాని ఒకటి కటక్ లోని రావెన్ షా విశ్వ విద్యాలయం ఎంత గొప్పది అనిపిస్తుంది,అటు ఒరియా సాహిత్యం లో గాని ఇటు ఆంగ్ల సాహిత్యం లో గాని తారా తోరాణాలు గా నిలిచిన జయంత మహా పాత్ర,మనోజ్ దాస్ ఇంకా ఈ గోపీనాథ్ మహంతి ఇలాంటి వారు కొన్ని డజన్ల మంది అక్కడ ఆంగ్ల సాహిత్యం,ఇతరములు చదువుకుని బయటకి వచ్చారు.ఒక ప్రాంతానికి గాని,ఊరికి గాని ,విద్యాలయానికి గాని వన్నె తెచ్చేది అక్కడినుంచి వచ్చిన మహానుభావులవల్లనే గదా.
------ మూర్తి కెవివిఎస్ (7893541003)
-