Friday, October 4, 2024

గోపీనాథ్ మొహంతి "అమృత సంతానం" నవల పై ఓ రివ్యూ

 గోపీనాథ్ మొహంతి "అమృత సంతానం" నవల పై ఓ రివ్యూ

--------------------------------------------------------------------------------

గోపీనాథ్ మహంతి గారు ఒరియా భాష లో కోంధ తెగ పై రాసిన అద్భుతమైన నవల ని పురిపండా అప్పలస్వామి గారు "అమృత సంతానం" పేరు తో అనువదించారు.ఆ రకంగా మన తెలుగు అనువాద సాహిత్యం లో ఓ మణిపూస వచ్చి చేరింది.543 పేజీలు గల ఈ పుస్తకాన్ని కాస్త మెల్లగానే చదవ వలసి వచ్చింది.మిగతా లౌకిక వ్యవహారాల సందడి లో బడి..!


నా అభిప్రాయాన్ని పంచుకోవాలని ఎంతో ప్రయత్నించగా ఇప్పటికి పడింది.ఒక మహా తేజస్సు ని కంటి తో చూసినప్పుడు ఒక్కసారి గా మ్రాన్ పడిపోతాము.దాని గురించి ఎక్కడ మొదలు పెట్టి ఏమి చెప్పాలో అర్ధం కాని స్థితి ఉంటుంది. ఈ నవల చదివిన తర్వాత సరిగ్గా అలాగే అనిపించింది.దేనిని వదిలి వేయాలి దేనిని చెప్పాలి అలా అయింది నా పరిస్థితి.

 ఎక్కడో అవిభక్త కోరాపుట్ జిల్లా లోని ఓ మారు మూల అరణ్య వాసాల్లోకి వెళ్ళిపోతాము.అక్కడి చెట్లుపుట్టలు,రుతువులు,జంతువులు,కోంధ జీవనం లోని ఎగుడు దిగుళ్ళు ఇంకా అది ఒక్కటే కాక సగటు మానవ జీవనం లోని రంగులు..ఎన్నని ? అన్నిటిని మహంతి గారు రాశారు అనడం కంటే తాను సాక్షి గా నిలిచి మనకి చూపించారు అనాలి.ఆయన లియో టాల్స్ టాయ్ ని అనువదించారు.గొప్పగా అర్ధం చేసుకున్నారు.కనుకనే ఒక సౌందర్యాన్ని ,దాని రెండు వైపుల్ని ఎంతో నేర్పు గా మన కళ్ళముందుంచారు.

ఎంత చిన్న వాక్యాలు.ఎంత గుండెల్ని పట్టి ఊపి వేసే నేర్పు.ఏ పాత్ర స్వభావం దానిదే,ఎక్కడా తెచ్చిపెట్టుకున్న శైలి లేదు.అంత అందం గానూ పురిపండా వారి అనువాద నైపుణ్యం సాగింది.ఒరియా సొబగులు క్షుణ్ణం గా ఎరిగిన కళింగాంధ్రుడు ఆయన. వాడ్రేవు చిన వీరభద్రుడు గారి చొరవ వలన అనేక మంది ఈ నవల పై తమ అభిప్రాయాల్ని రాశారు.అది ఒక చక్కని ప్రయోగం.అక్కడ ప్రస్తావించినవి కాక ఇంకొన్ని ఇతర విషయాలు ముచ్చటించ యత్నిస్తానుసరే..నా వల్ల అయినంత మేరకు రాస్తాను. 

ఊరి పెద్ద ,వయో వృద్దుడు అయిన దివుడు సావోతా తండ్రి మరణం తో కధ మొదలవుతుంది.దివుడు ఒక ప్రధాన పాత్ర అనాలి.ఎవరినో ఒకరిని నాయకీ నాయకులు గా  ఊహించలేము. చాలా పాత్రలు పోటీకి వచ్చి నిలుస్తాయి.అదే దీనిలోని గమ్మత్తు.దివుడు భార్య పుయు గాని,మన తెలుగు నేల మీద పెరిగి అచటికి వెళ్ళి కొంధ సమాజం లో కలిసిపోవడానికి ప్రయత్నించి చివరికి దివుడిని చేసుకున్న పియోటి గాని,పుబులి అనబడే దివుడి చెల్లెలు గాని,వయస్సు పరం గా తానే తన అన్న తర్వాత ఊరి పెద్ద కావాలని తపించే లెంజు కోదు గాని,ఇంటిలో వెలితి తో బయటికి చూసే సోనా దేయి గాని ఇలా ఏ పాత్ర స్థానం దానిదే.ఇంకా చాలా చిన్న పాత్రలు తారసపడతాయి.

ఒక ముఖ్య విషయం చెప్పాలి.మహాంతి గారు ఎక్కడ కూడా ఎవరి వైపూ నిలబడి తీర్పు ఇవ్వడు.అలాగే శృంగార సన్నివేశాలు కూడా ఒక పరిధి దాటి వర్ణించడు కాని ఆ అనుభూతిని కొన్ని మాటల్లోనే చెప్పి ఆ సంఘటన ని బలపరుస్తాడు.సోనా దేయి ని సోదా చేయడానికి అధికారులు వచ్చినప్పటి సన్నివేశాన్ని దీనికి ఉదాహరణ గా చెప్పవచ్చును.అలాగే దివుడికి,అతని భార్య కి మధ్య వచ్చే ఎడం కూడా ఎంత సున్నితం గా  ఉంటుందో.అక్కడ ఆ యిద్దరి లో ఎవరిని తప్పని అనలేము.ఎంతో ఏరి కోరి దివుడు ఆమె ని చేసుకుంటాడు.పిల్లవాడు పుట్టినతర్వాత భార్య భర్త మీద కాక ధ్యాస ని ఎక్కువ పిల్లవాడైన హాకినా మీద పెట్టడం,తన సొగసు మీద కూడా దృష్టి పెట్టకపోవడం ,భర్త దగ్గరకి వచ్చినప్పుడు దూరం పోవడం ఇవన్నీ దివుడు లో ఆ భాష లో చెప్పాలంటే సిర్ర పుట్టిస్తుంది.

అందువల్ల తను  బయట కి చూడటం మొదలవుతుంది.మళ్ళీ ఒకవైపు భార్య ని చూసినప్పుడు తన లో ఆత్మశోధన మొదలవుతుంది. ఎంత బక్క గా అయిపొయింది, పిల్లవాని ఆలనా పాలనా ,ఇంటి పనులు ఇవన్నీనూ ఆమెకి అని దివుడు మరోవైపు ఆలోచిస్తాడు.ఊరు కి పెద్ద తలకాయ తను కొరితే ఎంతో మంది వస్తారు కాని అప్పటికీ ఎంతో సమ్యమనం తో వ్యవహరించినట్లే అనుకోవాలి.పియోటి వంటి జాణతనం ఉన్న స్త్రీ తో కూడా ఎంతో జాగ్రత్త గా వ్యవహరిస్తాడు,ఆమె ఇతడిని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.
సరే..చివరకి ఆమె సఫలమవుతుంది.

ఎంత అనుకున్నా మనిషిని నడిపించే చోదకశక్తుల లో ప్రధానమైనది శృంగారమే,అది ఏ సమాజమైనా.డబ్బు మీద ప్రేమ బయటకి కనబడుతుంది.దాన్ని బయటకి చూపించడం లో తప్పు లేదనుకుంటాడు మనిషి.కాని మొదటి దాన్ని ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోడానికి సంఘ నీతి గట్రా అడ్డం గా నిలుస్తాయి.మళ్ళీ ఇంకో కోణాన్ని చూడవచ్చు.సోనా దేయి దివుడు పట్ల ఆసక్తి చూపించి,రెచ్చగొట్టి చివరకి అతను ఆమె ని చేరుదామన్న తరుణం లో ఆమె రచ్చ చేయడం తాను ద్వేషించిన తన మగడిని పైకెత్తినట్లు చేయడం ఒక్కసారిగా నివ్వెరపరుస్తుంది.ఈ పాత్ర స్వభావం ని మనం ఎన్నో చోట్లా చూశామా అనిపిస్తే మన తప్పు కాదు.అలాగే వయసులో నలభై అయిదు దాటి ,భార్య చనిపొయి ఇంకో తోడు కోసం చూసే లెంజు కోదు తో సైతం ఈమె చనువు చూపుతుంది.శృంగార భావనలు రేపడమే తప్పా శృంగారం నెరిపినట్లు ఎక్కడా ఉండదు,ఆ చెకింగ్ అధికారి వచ్చిన సందర్భం లో తప్పా.

బాగా తరచి చూస్తే  ప్రతినాయకుల్లాంటి వారు తెలుగు వారే అని తేలుతుంది.దక్షిణాది నుంచి వచ్చిన వారని వ్యాపారస్తుల గురించి చెప్పడం ,ఆ పేర్లు అవీ ..ఇంకా పియోటి పెరిగిన,ఎరిగిన ఊర్లు మనుషులు గూర్చి రచయిత చెపుతున్నప్పుడు ఈ భావన  మనకి కలుగుతుంది.బారికి వంటి వారు ఆ కొంధ సమాజం లో దళారి వంటి వారే.బెజుణి,డిసారి వంటి వారు ఆ సంస్కృతి లోని భాగాలు.పులి అనేది ఎంత గొప్ప భాగమో ఆ జీవితంలో.అచటి కొంధ ప్రజలు  వేటకి తుపాకులు ఉపయోగించడం మన జీవనం తో పోల్చితే కొత్త గా అనిపిస్తుంది.

సరే..మిగతా సంప్రదాయ ఆయుధాల తో పాటు. దీనిలో చాలా వర్ణనలు అనేక ఏళ్ళ పాటు మనలో నిలిచిపోతాయి.ఎప్పటికప్పుడు కొత్తగా తోస్తాయి.దానికి కారణం రచయిత జీవితాల్ని మన ముందు ఉంచుతాడే తప్పా ఏ రకమైన గ్లాసు ల్లో నుంచి చూడకపోవడం అని భావిస్తాను.ఈ నవల లోని కొన్ని చక్కటి భాగాల్ని మీ ముందు ఉంచుతాను.వీలు కుదిరినప్పుడల్లా.వాటిని  చదివినప్పుడల్లా మహంతి గారి ఆలోచనా విధానమూ,ప్రత్యేకత మనకి అవగతమవుతాయి.

1955 లో ఈ నవల కి సాహిత్య అకాడెమి బహుమతి ప్రదానం చేయడం వలన ఇతర భాషల్లోకి ఆ సంస్థ కృషి చే వెళ్ళగలిగింది.అందుకు గాను ఆ సంస్థ ని అభినందించవలసిందే.ఆ రకంగా మనం తెలుగు లో చదవగలిగాము.కాని ఒకటి కటక్ లోని రావెన్ షా విశ్వ విద్యాలయం ఎంత గొప్పది అనిపిస్తుంది,అటు ఒరియా సాహిత్యం లో గాని ఇటు ఆంగ్ల సాహిత్యం లో గాని తారా తోరాణాలు గా నిలిచిన జయంత మహా పాత్ర,మనోజ్ దాస్ ఇంకా ఈ గోపీనాథ్ మహంతి  ఇలాంటి వారు కొన్ని డజన్ల మంది అక్కడ ఆంగ్ల సాహిత్యం,ఇతరములు చదువుకుని బయటకి వచ్చారు.ఒక ప్రాంతానికి గాని,ఊరికి గాని ,విద్యాలయానికి గాని వన్నె తెచ్చేది అక్కడినుంచి వచ్చిన మహానుభావులవల్లనే గదా.  

------   మూర్తి కెవివిఎస్ (7893541003)

-

మన ఆన్ లైన్ డేటా అంతా ఏమవుతుంది ?

 


మనం చనిపోయిన తర్వాత మన ఆన్ లైన్ డేటా అంతా ఏమవుతుంది ?

--------------------------------------------------------------------------------------------------

 ఇది డిజిటల్ యుగం. అనేక సోషల్ మీడియా వేదికల పైన ఇంకా వెబ్ సైట్ ల మీదమన అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటాం. అంతే కాదు ఎంతో సమాచారాన్ని మనం అనేక ప్లాట్ ఫాం ల మీద నిక్షిప్తపరుస్తుంటాం. మరి ఆ సమాచారం అంతా మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది. అది ఎవరి సొంతమవుతుంది అనే సందేహం రాకమానదు. అదంతా మన వారసత్వ సంపద గా ఎవరికైనా ఇద్దాం అనుకుంటే పొరబాటే కాగలదు. చాలా సోషల్ మీడియా వెబ్ సైట్ లు అంత తొందరగా అంగీకరించవు. పైగా తమ ప్లాట్ ఫాం ల మీద ఉన్న ప్రతి అక్షరం తమ స్వంతమని అవి భావిస్తాయి.

స్ బుక్, ఇన్స్టాగ్రాం, ఈ మెయిల్ అకౌంట్స్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వివరాలు, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లో ఉన్న డేటా (క్లౌడ్ స్టోరేజ్) ఇదంతా ఏమవుతుంది అనే సందేహం రావచ్చు. ఫేస్ బుక్ విషయానికి వస్తే మన తదనంతరం అకౌంట్ కొనసాగించడానికి ఎవరికైనా వారసులకి యాక్సెస్ ఇవ్వవచ్చు. అయితే వాళ్ళు ప్రవేట్ మెసేజ్ లు పంపలేరు,చదవలేరు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు మేనేజ్ చేయవచ్చు. చనిపోయిన వారికి నివాళి సందేశాలు పోస్ట్ చేయవచ్చు. గూగుల్ కూడా ఇన్ యాక్టివ్ అకౌంట్ ని మేనేజ్ చేయడానికి అవకాశం ఇస్తుంది.వాళ్ళు చనిపోయిన వ్యక్తి డేటా ని మేనేజ్ చేస్తూ లెగసీ ని కొనసాగించవచ్చు.

ప్రస్తుతం ఎక్స్ గా పిలువబడుతున్న ట్విట్టర్ విషయానికి వస్తే కుటుంబ సభ్యులు ఎవరైనా తగు ప్రూఫ్ చూపించి అకౌంట్ ని కొనసాగించవచ్చు. లేకపోతే ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్ గా అకౌంట్ ఇన్ యాక్టివ్ అయిపోతుంది. ఇక యాపిల్ ఐడి కి యాక్సెస్ కావడం కొద్దిగా కష్టమే. లీగల్ డాక్యుమెంట్లు సమర్పించకపోతే ఐక్లౌడ్ అకౌంట్ కి యాక్సెస్ ఇవ్వదు.ఇలాంటి విషయాలు ముందే తెలుసుకుని ఉండటం మంచిది. పైగా రకరకాల దేశాల్లో డేటా రైట్స్ చట్టాలు వేరు వేరుగా ఉంటాయి.ఉదాహరణకి 2012 లో  జర్మనీ దేశానికి చెందిన  దంపతులు తమ చనిపోయిన కుమార్తె యొక్క  చివరి క్షణాల్ని అర్థం చేసుకోవడానికి ఫేస్ బుక్ ప్రొఫైల్ యాక్సెస్ అడిగితే నిరాకరించింది. చివరకి వాళ్ళు కోర్ట్ కి వెళ్ళి ఆ రైట్స్ సాధించుకున్నారు.

కాబట్టి మనకి సంబంధించిన ఆన్ లైన్ అకౌంట్ల అన్ని వివరాల్ని ఓ లిస్ట్ గా రాసిపెట్టుకోవడం చేయాలి.ఏ అకౌంట్ ని డిలిట్ చేయాలి,ఏ అకౌంట్ ని కొనసాగించాలి లాంటివి ముందే ఆలోచించుకోవడం మంచిది.వివిధ వెబ్ సైట్ లు,ఆన్ లైన్ ప్లాట్ ఫాం లు రకరకాల నిబంధనలు కలిగిఉంటాయి.ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ద ఆఫ్టర్ లైఫ్ ఆఫ్ డేటా అనే పుస్తకం లో కార్ల్ ఓమన్ మన డేటా పై మనకి గల హక్కుల్ని గుర్తు చేస్తూ మనం ఎంతో కష్టపడి ఆన్ లైన్ పై సృష్టించిన సమాచారాన్ని కార్పోరేట్ కంపెనీలు హస్తగతం చేసుకోవడానికి అనుమతించకూడదు అని హెచ్చరిస్తాడు.కనుక ఈ విషయాలన్నిటిని గమనిస్తూ మన డిజిటల్ ప్రయాణాన్ని సాగించాలి.

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003) 



Wednesday, September 4, 2024

చైనా అంత చౌకగా తమ ఉత్పత్తుల్ని ఎలా అమ్మగలుగుతుందో తెలుసా?

 

చైనా అంత చౌకగా తమ ఉత్పత్తుల్ని ఎలా అమ్మగలుగుతుందో తెలుసా?

-------------------------------------------------------------------------------------------------

మేడ్ ఇన్ చైనా అనే అక్షరాల్ని ఎన్నిసార్లు చదివి ఉంటాము ? చౌక గా ఎన్ని రకాల వస్తువులు ఆ దేశం నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ? మన దేశం మాత్రమే కాదు సుమా దాదాపు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా అక్కడ చైనా ఉత్పత్తులు స్వాగతం పలుకుతాయి. మరి అందుచేతనే ఆ దేశాన్ని ప్రపంచపు కర్మాగారం అని పిలుస్తారు. అంత చౌకగా ఆ దేశం వాళ్ళ ఉత్పత్తుల్ని ఎలా ఇవ్వగలుగుతోంది అనే సందేహం ఎవరికైనా రాక మానదు. 

చైనా లో చవకగా తక్కువ వేతనాలతో పని చేయడానికి ముందుకు వచ్చే శ్రామికులు ఎక్కువ గా ఉంటారు. దానితో బాటు ఆ దేశం  యొక్క పారిశ్రామిక విధానం కూడా మరో కారణం. తక్కువ టాక్స్ లు,దిగుమతి సుంకాలు, తమ కరెన్సీ యువాన్ విలువ ని 30 శాతం వరకు తగ్గించడం ఇలాంటి ఉత్పత్తి పోకడలతో పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న మానవ వనరుల్ని ఉపయోగించి మిగిలిన వారి కంటే తక్కువ రేటు కి వస్తు విక్రయం చేస్తూ మార్కెట్ లని కంట్రోల్ చేస్తుంది.

ఏ ప్రాంతం లో ఏ పరిశ్రమ పెట్టాలో నిర్ణయించుకున్న తర్వాత సప్లయ్ చేసే నెట్వర్క్, డిస్ట్రిబ్యూటర్లు, ఉత్పత్తి చేసే ఉద్యోగ గణం అందరూ ఉమ్మడిగా పనిచేస్తారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా చేదోడుగా ఉంటుంది. పర్యావరణ సమస్యలు,పారిశ్రామిక అనుమతులు,వేతనాల విషయం లో సమస్యలు ఇలాంటివి ఏమీ ఉండవు. అనవసరమైన ఖర్చులు కూడా పెట్టరు.దానితో చాలా చవకగా వస్తూత్పత్తి జరుగుతుంది. 

ఏ వస్తువు అయినా ఇతర మార్కెట్ లతో పోలిస్తే తక్కువ ధరకి  లభ్యమవుతుంది. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తమ కరెన్సీ విలువ ని కృత్రిమంగా తామే తగ్గించుకుంటారు. మెజారిటీ శ్రామికులు గ్రామీణ ప్రాంతానికి చెందిన మధ్య మరియు క్రింది తరగతి కి చెందినవారై ఉంటారు. బాల కార్మికుల విషయం లో కూడా అంత పట్టింపులు ఉండవు. గంటకి కనీస వేతనం లేదా నెల కి కనీస వేతనం రెండు రకాలుగా శ్రామికులకి జీతాలు ఇస్తారు. చైనా లో 31 ప్రావిన్స్ లు ఉన్నాయి. షాంఘై ప్రావిన్స్ లో గంట కి ఇచ్చే కనీస వేతనం మిగతా ప్రావిన్స్ లతో పోలిస్తే ఎక్కువ.     

చైనా ప్రపంచం లోనే రెండవ అతి పెద్ద ఆర్ధికవ్యవస్థ. 20,985 ప్రాజెక్ట్ ల్ని 165 దేశాల్లో నిర్వహిస్తూ వాటికి అప్పులు,గ్రాంట్లు ఇస్తూ వాటి అర్ధిక వ్యవస్థ ల్ని ప్రభావితం స్తుంది.ఆసియా,ఆఫ్రికా,యూరప్ వంటి ఖండాల్లో పెట్టుబడులు పెడుతుంది. 1.34 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడమే కాకుండా అమెరికా,హాంగ్ కాంగ్,జపా  న్, కొరియా,వియాత్నం  వంటి దేశాలతో వ్యాపార భాగస్వామ్యం కలిగిఉంది. 

ఇండియా లో కూడా అనేక స్టార్టప్ ల్లో చైనా పెట్టుబడులున్నాయి.ఎలెక్ట్రానిక్స్,ఎలెక్ట్రికల్స్,టెక్స్ టైల్స్,ఆటోమొబైల్స్,కెమికల్స్,కంప్యూటర్ ,ప్లాస్టిక్స్,మెడికల్ ఎక్విప్మెంట్ ఇలా ఒకటేమిటి అనేక ఉత్పత్తుల్ని ఇబ్బడి ముబ్బడిగా తయారుచేసి ప్రపంచ దేశాలకి చౌక గా అందిస్తుంది చైనా దేశం.ఇలా తనదైన మార్గంలో పయనిస్తూ ప్రపంచ దేశాల్లో తనదైన ముద్ర వేస్తోంది ఆ దేశం.

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003) 




Friday, August 30, 2024

డిజిటల్ డిమెన్షియ అంటే ఏమిటి ? దాని పరిణామాలు ఎలా ఉంటాయి ?

 "డిజిటల్ డిమెన్షియా" అంటే ఏమిటి ? దాని పరిణామాలు ఎలా ఉంటాయి ?

------------------------------------------------------------------------------------------------

టెక్నాలజీ మానవ జీవితాన్ని సుఖమయం చేసిన మాట వాస్తవం. కాని అదే టెక్నాలజీ ని అవసరానికి మించి అధికంగా ఉపయోగిస్తే మనం ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వాటిని మొదట గుర్తించడం కూడా కొంత కష్టమే! కాని కాలం గడుస్తున్న కొద్దీ మన శరీరం ఇచ్చే సంకేతాలు నిరాకరించలేని స్థాయి లో ఉంటాయి. విపరీతం గా స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ టైం ని వెచ్చించి గంటల కొద్దీ చూసే వారికి ఈ డిజిటల్ డిమెన్షియా అనే మానసిక రుగ్మత కలుగుతుందని న్యూరోశాస్త్రవేత్తలు అంటున్నారు. 

దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యమైన విషయాల్ని మర్చిపోవడం,వస్తువుల్ని ఒకచోట పెట్టి మరో చోట వెదకడం, మాట్లాడే సమయం లో చెప్పాలనుకున్న పదాలు నోటికి రాకపోవడం,క్రమేపి కాగ్నిటివ్ స్కిల్స్ బాగా తగ్గిపోవడం ఇలాంటివి అన్నీ డిజిటల్ డిమెన్షియా లో భాగాలే! జర్మన్ శాస్త్రవేత్త మన్ ఫ్రెడ్ స్పిజర్ ఈ మానసిక వ్యాధి లక్షణాల్ని మొదటిగా గుర్తించి దానికి ప్రత్యేకంగా ఈ పేరు ని పెట్టాడు.

దీంట్లో ఏడు స్థాయిలు ఉన్నట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశ లోనే గుర్తించి జాగ్రత్త పడితే ఫలితం ఉంటుంది లేదా అల్జీమర్స్ , ఫ్రంట్ టెంపోరల్ డిమెన్షియా కి దారి తీస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు మరికొన్ని ఏమిటంటే విపరీతంగా నిద్రపోవడం ఇంకా శ్వాసకోశపరమైన ఇబ్బంది కలగడం, యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ రావడం ఇలాంటివి సంభవిస్తాయి. మన మెదడు కి ఇవ్వవలసినంత పని రోజూ ఇవ్వాలి. 

టెక్నాలజీ ఉంది గదాని దాని పనితనాన్ని నిద్రబుచ్చితే సహజంగా మన మెదడు కి ఉండే కాగ్నిటివ్ స్కిల్స్ తగ్గిపోవడం ప్రారంభమవుతాయి. నేర్చుకునే శక్తి సన్నగిల్లడం, ఏకాగ్రత ఉండకపోవడం,జ్ఞాపక శక్తి దెబ్బతినడం జరుగుతాయి.ఇవి ఒకేసారి జరగకపోవచ్చు,కాలం గడుస్తున్నకొద్దీ ఇవి మనలో చోటుచేసుకుంటాయి.చివరి స్థాయి చేరే వరకు గుర్తించకపోతే రోజువారీ పనులు చేసుకోలేని దశకి చేరుకోవడం జరుగుతుంది.

మరి దీనికి తరుణోపాయం ఏమిటి అంటే, టెక్నాలజీ ని అవసరం మేరకు మాత్రమే వాడాలి. కాలక్షేపానికి గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్ లో కాలం గడపకుండా ఇతర వ్యాపకాలు పెంచుకోవాలి. పుస్తకాలు చదవడం , తగు వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే మెదడు కి మేత కల్పించే జీవన విధానం లోకి వెళ్ళాలి. గ్రీన్ టీ తాగడం కూడా మంచిది. ముఖ్యంగా మనుషులతో ప్రతిరోజూ ఎంతో కొంత సమయం మాట్లాడుతుండాలి. 

స్మార్ట్ ఫోన్ ని చూసే సమయం మీ చేతిలో ఉంచుకోవాలి.అవసరమైతే పొద్దున లేదా సాయంత్రం ఏదో ఖచ్చితమైన ,మీరు నిర్దేశించుకున్న సమయం లో మాత్రమే చూడాలి. మీరు ఫేస్ బుక్ లోనో,ఇంకే సోషల్ మీడియా లోనో చేసిన కామెంట్ కి ఎన్ని లైక్ లు వచ్చాయి అనే ఆత్రుత ని పూర్తిగా వదలిపెట్టాలి. ఇవన్నీ కూడా మన మెదడు యొక్క ఆరోగ్యం కంటే ఎక్కువేమీ కాదుగదా!

స్మార్ట్ ఫోన్ ని వదిలిపెట్టాం గదాని కంప్యూటర్ ని, టెలివిజన్ ని గంటలకొద్దీ చూద్దాం అనుకోవద్దు. అవి కూడా మన మెదడు లోని గ్రే మేటర్ పైనా,వైట్ మేటర్ పైనా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మన లోని ఉద్రేకాల్ని,కదలికల్ని,ఆలోచనా విధానాల్ని ఆ రెండు నిర్దేశిస్తాయనే సంగతి తెలిసిందే. మీరు ఏ స్థాయి లో ఉన్నారో తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష చేసుకోవచ్చు. 

 ఏవైనా అయిదు పదాల్ని ఒక క్రమం లో ముందు మనసు లో అనుకోండి. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత వాటిని అవే క్రమం లో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుదామని అనుకుని , తీరా మరో విషయాన్ని పొంతన లేకుండా మాట్లాడటం చేస్తున్నారా ఇలాంటి వాటిని పరిశీలించుకోవడం వల్ల మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు.మన దేశం లో దీనిని డయగ్నస్ చేసి వైద్యం చేసే స్పెషలిస్ట్ లు ప్రస్తుతానికైతే లేరు అని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఎవరి జాగ్రత్త వారు తీసుకోవడమే మనం చేయగల పని!  


----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003) 




Sunday, August 25, 2024

గల్ఫ్ దేశాల్లో మళయాళీలు ఎక్కువ... కారణమేమిటి?

 కేరళ రాష్ట్రం కి చెందిన ప్రజలు అత్యధికం గా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం అందరకీ తెలిసిందే. కువైట్ లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశం లోని కేరళ నుంచి వెళ్ళిన వారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటిగా గుర్తించి వాటిని అందిపుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో అలా కొనసాగుతూనే ఉంది. 1972 నుంచి 1983 మధ్య కాలం లో వచ్చిన గల్ఫ్ బూం ని మళయాళీలు బాగా వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువ గా ఉండటం ,సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలా మంది క్లర్కులు గా, ఆర్కిటెక్ట్ లుగా,నిర్మాణ రంగం లో సూపర్వైజర్ లుగా,ఇంజనీర్లుగా ఇలా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటి తరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని,స్నేహితుల్ని ఇక్కడకి తీసుకువచ్చారు.

ప్రస్తుతం వాళ్ళ సంఖ్య గల్ఫ్ దేశాల్లో ఎలా ఉందంటే యు.ఏ.ఈ.లో 7,73,624 మంది, కువైట్ లో 6,34,728 మంది,సౌదీ అరేబియా లో 4,47,440 మంది,ఖతర్ లో 4,45,000 మంది,ఒమన్ లో 1,34,019 మంది,బహ్రైన్ లో 1,01,556 మంది ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రం యొక్క ఆర్ధిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళ రాష్ట్రానికి వస్తుంటాయి.తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనం లో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకి పంపిస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మళయాళీ ప్రజలు గల్ఫ్ లో ఎక్కువ గా ఉండటానికి అనేక  కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళ రాష్ట్రానికి సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం.

కేరళ రాష్ట్రం లో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణం పై ప్రజల చైతన్యం ఎక్కువ గా ఉంటుంది. ట్రేడ్ యూనియన్ ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మళయాళీ ప్రవాసి గా వెళ్ళడానికి సిద్ధం గా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు.కోల్కతా,ముంబాయి,ఢిల్లీ ఇంకా దేశం లో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యం గా నర్సింగ్ వృత్తి పరం గా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్స్ లకి మంచి డిమాండ్ ఉంది. దేశం లో ఏ కార్పోరేట్ ఆసుపత్రి ని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్య లో కేరళ రాష్ట్రానికి చెందిన నర్సు లే ఉంటారు. గల్ఫ్ సంపద ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మళయాళీ బిలియనీర్లు ఆ దేశాల్లో నే వ్యాపారం చేసి తర్వాత మిగతా దేశాల్లో తమ బిజినెస్ ల్ని విస్తరించారు.

ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపద తో విస్తరించినవే. యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్) ,షం షేర్ వయలిల్ (విపిఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెంస్ ఎడ్యుకేషన్), పిఎన్సి మీనన్ (శోభ గ్రూప్), జార్జ్ ముథూట్ ఇలాంటి మళయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశం లో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి ధనం వస్తుంది.గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళ లో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకం గా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి,కోజీకోడ్,మలప్పురం,కన్ననూర్ వంటి ప్రాంతాలు గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారళంగా అమ్ముతుంటారు.

గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల కన్స్యూమరిజం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకి పెళ్ళి విషయం లో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాధలు లేవా అంటే ఉన్నాయి. స్థానికం గా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడే వారూ ఉన్నారు. అక్కడి పత్రికల్లోనూ, టీ.వి. చానెళ్ళ లోనూ అలాంటి వారి కోసం ప్రత్యేకం గా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ఆడు జీవితం (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించినదన్న సంగతి తెలిసిందే.ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ కి దన్ను గా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకి ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 78935 41003)    


(Printed in Janam Sakshi daily, 20.8.2024)

Thursday, August 15, 2024

నిజమైన స్నేహం అంటే ఏమిటి?

 జూలై 30 వ తేదీన అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం కాగా ఆగస్ట్ నెల లో గల మొదటి ఆదివారం నాడు మన దేశం లో స్నేహితుల దినోత్సవం జరుపుకున్నాము. ఆ రోజు జరిగిందేమిటి? అనేక మెసేజ్ లు మనం అందుకున్నాం అలాగే స్నేహితులు అనే వారికి మనం కూడా శుభాకాంక్షలు తెలియజేశాం. 

ఆ విధం గా సోషల్ మీడియా లో హోరెత్తించాము. అసలు స్నేహం అంటే ఏమిటి? స్నేహితులు అనబడే వారు అంతా నిజం గా స్నేహితులేనా? పరాగ్వే దేశానికి చెందిన జోయస్ హాల్ కృషి మేరకు 1958 లో మొదటి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరిగింది. 

జీవితం లో బాసట గా నిలిచి సహకరించిన ఎందరో మంచి వ్యక్తులకి కృతజ్ఞత తెలుపడానికి ఆయన ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించాడు. 

మరి మన దేశం లో ఈ పండగ ని జరుపుకుంటున్న స్నేహ ప్రియులకి ఎంతమందికి మనకి ,పాశ్చాత్య దేశాల వారికి స్నేహం అనే విషయం లో గల నిర్దిష్ట భావనలు తెలుసు? 

అసలు ఎన్నిరకాలు స్నేహాలున్నాయి,దేన్ని మనం నిజాయితీ గల స్నేహం అనవచ్చు. ఈ విషయాల్ని మనం కొద్దిగా లోతు గా వెళ్ళి పరిశీలిద్దాం. 

చిన్నప్పుడు స్నేహాలు మధురం గా ఉంటాయి. అక్కడ కొన్ని కేలిక్యులేషన్లు తెలియని ప్రాయం. అదే లోకం గా అనిపిస్తుంది. ప్రాణ స్నేహితులు ఉంటారు.

కలిసి ఎన్నో పనులు చేయడం ,భావాలు పంచుకోవడం ఇలా కాలేజ్ ప్రాయం వరకు సాగిపోతుంది. స్నేహితుల ప్రభావం మనకి తెలియకుండానే మన జీవితాంతం ఉండిపోతుంది.


జీవన యాత్ర లో ముందుకు సాగుతున్న కొద్దీ రకరకాల వాళ్ళు స్నేహితులు అవుతారు. ఈ వ్యక్తి ద్వారా నాకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా అనే ఆలోచన ప్రతివారి లోనూ ఏదో మూలన ఉంటుంది.ఉద్యోగ పరంగా, సంఘ జీవన పరంగా బతుకు సాఫీగా సాగాలంటే కొన్ని స్నేహాలు తప్పనిసరి.
ఈరోజుల్లో స్వచ్చమైన స్నేహం ఎక్కడుంది అంటారు కొంతమంది...గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలంటే దాంట్లో మనం కూడా ఉంటాం. ఫలానావాడితో పని లేదు అనుకుంటే ఫోన్ కూడా ఎత్తము.

అయితే మనది మనకి గుర్తు రాదు. అదే మనిషి తత్వం. పరస్పర ప్రయోజనాల కోసం సాగేది బిజినెస్ టైప్ ఫ్రెండ్ షిప్ అంటారు. దాంట్లోనూ కొంత నిజాయితీ ఉంటుంది,పరిశీలిస్తే..!
దీనికంటే ఘోరమైనది ఏవిటంటే స్నేహం పేరు తో మన వల్ల ప్రయోజనం పొంది మళ్ళీ మనకి ఏదైనా అవసరం వచ్చి చేయమంటే ముఖం చాటు చేసుకుంటారు కొంతమంది.

అది ఒక్క ధనం గురించే కాదు సుమా...ఏదో మాటసాయం కూడా కావచ్చును కొన్నిసార్లు.

కొంతమంది బిజినెస్ చేసే వారిలోనూ నాకు బాగా తెలిసినవారు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా మాటసాయమైన,పోనీ రికమండేషన్ లాంటిదే అనుకోండి... చేసినట్టయితే , వాళ్ళు తిరిగి నాకు ఏదో సాయం ఏదో సందర్భం లో తప్పనిసరిగా చేసిన జ్ఞాపకాలు నాకు ఉన్నాయి.

కానీ స్నేహం గురించి దాని స్వచ్చత గురించి పుంఖానుపుంఖాలుగా చెప్పేవాళ్ళు చేయడం వరకు వచ్చేసరికి ఏవో కుంటి కారణాలు చెప్పి కనిపించకుండాపోతారు. సాయం చేసిన వాళ్ళకి తిరిగి సాయం చేస్తే విలువ ఏముంది,చేయని వాళ్ళకి సాయం చేయడం గొప్ప అని వింత హిపోక్రసీ ని చూపెడతారు.

ఏమి ఆశించకుండా ఎదుటివారికి సాయం చేయడం దైవ లక్షణం. అది మానవ జన్మకి చెప్పుకోవడానికే తప్పా ఆచరించడం అంత సులువు కాదు. కనీసం మనకి ఏదైన ఒకటి చేసిన వారికి తిరిగి చేయాలనుకోవడం మానవత్వం.

ఆ మాత్రం చేయగలిగితే చాలా గొప్ప విషయమేనని చెప్పాలి.అది డబ్బు పరంగా అనే కాదు కొన్నిసార్లు దాన్ని మించిన సహానుభూతి కావచ్చు. ఇంకోటి కావచ్చు. వెస్ట్రన్ మైండ్ సెట్ కి మనకి ఉన్న తేడా ఏమిటంటే, రెసిప్రొకేషన్ అనేది ఓ జీవన శైలి గా ఉంటుంది.

ఎదుటి వారి సాయం అందుకున్నవారికి తప్పనిసరిగా కృతజ్ఞతా భావం ఉంటుంది. మళ్ళీ దాన్ని ఏదో రకం గా తీర్చుకోవాలి అనుకుంటారు. ఉదాహరణకి గాడ్ ఫాదర్ నవల లోని పాత్రలు చూడండి.

ప్రధాన పాత్ర కార్లియోన్ తను సిసిలీ ఇంకా ఇటలీ ప్రాంతాల నుండి వచ్చిన వారిని మాత్రమే ముఖ్యమైన అనుచరులుగా నియమించుకుంటాడు.వారి అవసరాలను తీర్చుతుంటాడు.తనకి అవసరం వచ్చినపుడు సాయం అడుగుతాడు.వాళ్ళు కూడా అలాగే చేస్తారు.

ఎందుకంటే మనకి సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయడం ధర్మం అని వాళ్ళు నమ్ముతారు.అది ఒమెర్తా అనే ప్రాచీన సంప్రదాయం నుంచి వచ్చిన అలవాటు. అమెరిగో బోనసెర కుమార్తె ని కొట్టి గాయపరిచిన ఇద్దరు యువకులు న్యూయార్క్ లో చాలా పలుకుబడి ఉన్న కుటుంబాలకి చెందినవారు.

కోర్ట్ లో కూడా శిక్ష ని తప్పించుకుంటారు. అయితే బోనసెరా ఆవేదన విన్న కార్లియోన్ వాళ్ళిద్దర్నీ తన కుర్రాళ్ళతో ఒక బార్ లో కొట్టిస్తాడు. కాలం తిరగబడి కొన్నాళ్ళకి కార్లియోన్ పెద్ద కొడుకు ని శత్రువులు చంపివేస్తారు , తను కూడా రహస్యంగా సంచరిస్తుంటాడు.

అలాంటి సమయం లో ఓ రాత్రిపూట బోనాసెరా ని కలిసి చనిపొయిన కుమారుడికి కాఫిన్ తయారు చేయమని చెప్పగా, బోనసెరా సంకోచిస్తాడు,ఎందుకంటే ఈ సంగతి తెలిస్తే కార్లియోన్ శత్రువులు తనను బతకనివ్వరు.
చ..నా కూతురు కోసం అంత రిస్క్ తీసుకున్న ఆ మనిషి విషయం లో ఇలా ఆలోచిస్తున్నానేమిటి ...అనుకుని చివరకి ఏదయితే అది కానీ కాఫిన్ తయారు చేస్తాను అంటాడు. అంటే రుణం తీర్చుకోవడం అనే గా భావన కి ఎంత విలువ ఇస్తారో మనకి అర్థం అవుతుంది.

స్నేహం అంటే అది ...పరస్పరం సహకరించుకోవడం. పాశ్చాత్యుల కుట్రలు ఎంత subtle గా long-sighted గా ఉంటాయో ,వాళ్ళ సహకరించుకునే పద్ధతులు కూడా అంత లోతు గా ఉంటాయి. ఆ సహకారాన్నే వాళ్ళు స్నేహం అనుకుంటారు.

ఉదాహరణకి ఫ్రాన్స్ కి ఏదైనా అరబ్బు దేశానికి యుద్ధం జరుగుతుంటే స్పెయిన్ దాన్ని ఖండిస్తుంది. బయటకి చూసే వాళ్ళకి అది నిజమనిపిస్తుంది.

అరబ్బుదేశాల నుంచి ఫ్రాన్స్ కి రావాలసిన ఆయిల్ ని లోపాయికారిగా స్పెయిన్ సప్లయ్ చేసి వాళ్ళ కమీషన్ వాళ్ళు తీసుకుంటారు.అవతలివాడు కూడా ఆనందం గా ఇస్తాడు. ఇలాంటి వ్యవహారాలు తీరిక ఉండి విశ్లేషించి చదవాలే గాని చరిత్రలో బోలెడన్నీ. !!

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 78935 41003)

ఆన్ లైన్ మోసాలకి అంతం ఎప్పుడు ?

  జంతారా అనే పేరు సైబర్ నేరాలు అనే పదానికి ప్రత్యామ్నాయం గా మారింది. ఆ ఊరు ఎక్కడ ఉందో చాలా మందికి తెలియకపోవచ్చు. కాని సెల్ ఫోన్ ఉన్న భారతీయులందరూ ఏదో ఓ సమయం లో ఆ ఊరి నుంచి ఒక్క కాల్ అయినా అందుకుని ఉంటారు. 

మీకు లాటరీ తగిలిందనో,మీకు వచ్చే ఓటిపి నెంబర్ చెప్పమనో,బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నట్లు గానో ఇలా అనేకమైన తీపి కబుర్లతో జనాల సొమ్ము ని కొల్లగొట్టడం లో ఇక్కడి ఆన్ లైన్ నేరగాళ్ళది అందె వేసిన చెయ్యి. 

నిరుద్యోగులైన యువతీ యువకుల్ని రిక్రూట్ చేసుకుని ,ఆ పైన వీళ్ళకి తగిన ట్రైనింగ్ ఇచ్చి ఓ కుటీర పరిశ్రమ లా ఈ చీటింగ్ కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటారు. ఇంతకీ ఈ జంతారా అనేది జార్ఖండ్ రాష్ట్రం లో ఓ చిన్న పట్టణం. 

భారతదేశపు ఆన్ లైన్ నేరాలకి రాజధాని లాంటిది. ఈ పట్టణం నుంచి జరిగే ఆన్ లైన్ నేరాల మీద నెట్ ఫ్లిక్స్ లో ఓ వెబ్ సిరీస్ వచ్చిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ కార్యకలాపాలు ఎలా ఉంటాయో !

భారతదేశం లో జరిగే సగానికి పైగా ఆన్ లైన్ స్కాం లు రాంచీ నగరానికి 210 కి.మీ. ఉండే ఈ జంతారా నుంచే జరుగుతుంటాయి. ఫిషింగ్ లింక్ లు పంపి తద్వారా జనాల సమాచారాన్ని సంపాదించి సొమ్ము కొల్లగొట్టడం లో వీరికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. 

ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడి నేరస్థుల కోసం పోలీసులు వస్తుంటారు. ఇప్పటి దాకా 28000 కప్లైంట్స్ ఈ జంతారా కి చెందిన నెట్ వర్క్ మీద వచ్చాయి. 

జంతారా లో ఉన్న నేరగాళ్ళ మీద పరిశోధన చేస్తున్నప్పుడు దీన్ని మించిన ఆన్ లైన్ స్కాం లు చేసే భరత్ పూర్ వెలుగు లోకి వచ్చింది. ఈ పట్టణం రాజస్థాన్ లో ఉంది. 

యోగేశ్వర్ మీనా అనే యువకుడు ఏకంగా 500 మంది నిరుద్యోగుల్ని నియమించుకుని ఈ దందా నడిపిస్తున్నాడు. ఇతగాడు స్టాక్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ స్కాం లు చెయ్యడం లో దిట్ట. దానికి ప్రత్యేకం గా టెలి గ్రాం గ్రూపు లు కూడా ఉన్నాయి. 

ఇక అదే రాష్ట్రం లో ఉండే మేవాట్ అనే పట్టణం భారతదేశపు నూతన ఆన్ లైన్ స్కాంల రాజధాని గా అవతరించింది. వీళ్ళు ఆన్ లైన్ నేరాలు చేయడం లో కొత్త పుంతలు తొక్కి దేశం లోని జనాల సొమ్ము ని మొత్తం 7000 కోట్ల రూపాయలకి పైగా లూటీ చేశారు.

 ఒక్క ఈ ఏడాది లో ఇప్పటిదాకా ఏడున్నర లక్షల కంప్లైంట్స్ ఇక్కడి వాళ్ళ మీద వచ్చాయంటే ఏ రేంజ్ లో వీరి పనితనం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఆకర్షణీయం గా వచ్చే మెసేజ్ ల్ని నమ్మడం మానుకోనంత వరకు వీరి ఆగడాలకి హద్దు లేకుండా పోతూనే ఉంటుంది. 

ఎన్ని దాడులు నిర్వహించినా తమ ప్రదేశాల్ని మార్చుకుని యధావిధిగా నేరస్థులు తమ పని చేసుకుపోతూనే ఉన్నారు. 

కేవైసి అప్ డేట్స్ గురించి మెసేజ్ లు పంపడం,న్యూడ్ వీడియోలు పంపి చూసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని బెదిరించడం,ఫిషింగ్ లింక్ ల ద్వారా మాల్ వేర్ ని పంపి పాస్ వర్డ్ ల సమాచారం దొంగిలించడం ఇలా ఎన్నో విన్నూత్న పోకడలతో ఆన్ లైన్ నేరాలకి పాల్పడుతున్నారు.

ఈమధ్య కాలం లో విపరీతం గా ఫేస్ బుక్ అకౌంట్ లు హ్యాక్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. మీ మిత్రుల పేరు తో మిమ్మల్ని డబ్బులు అర్జంట్ గా పంపించమని మెసేజ్ లు పెట్టడం కూడా చూసే ఉంటారు. 

ఏ అకౌంట్ ని హ్యాక్ చేయాలన్నా ముందు దానికి నమ్మకం గా అనిపించే ఫిషింగ్ లింక్ ని ఆకర్షణీయమైన యాడ్స్ రూపం లోనో మెసేజ్ రూపం లోనో పంపిస్తారు.

పొరబాటున ఒకసారి క్లిక్ చేస్తే ఇక అంతే. ఆ ఫేస్ బుక్ అకౌంట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినట్లే. హ్యాక్ అయిన అకౌంట్ తేడా కనిపిస్తూనే ఉంటుంది. 

బర్త్ డే, ఈమెయిల్, పాస్ వర్డ్ లాంటివి మారిపోతాయి. కొన్నిసార్లు పాస్ వర్డ్ మారదు.అలాంటప్పుడు వేరే సిస్టం లోనుంచి అకౌంట్ లోకి ప్రవేశించి పాస్ వర్డ్ మార్చుకుంటే మంచిది. అలాగే ఫేస్ బుక్ కి రిపోర్ట్ పెట్టడం మంచిది. 

మిగతా నేరాల విషయం లో తీసుకున్నంత శ్రద్ధ ఈ ఆన్ లైన్ గ్యాగ్ స్టర్ ల మీద మన వ్యవస్థ తీసుకోవడం లేదనిపిస్తుంది. అరెస్ట్ చేసినా మళ్ళీ బయటకి వచ్చి ప్రొఫైల్ మార్చుకుని అవే పనులు చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ప్రజలు తమ జాగ్రత్తలు తాము తీసుకోవడం మంచిది.         

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి: 78935 41003)

    


Tuesday, August 6, 2024

మన దేవాలయాల్లో ఉన్న బంగారం అక్షరాల 22 వేల టన్నులు

 

మన దేవాలయాల్లో ఉన్న బంగారం అక్షరాల 22 వేల టన్నులు 

----------------------------------------------------------------------------------

తిరుపతి లేదా తిరువనంతపురం లేదా పూరి ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు అమేయమైన కనక,వజ్ర,వైఢూర్యాది సంపద తో ఈ రోజున ప్రజలందర్నీ అబ్బురపరుస్తున్నాయి. ఈ ఆలయాలన్నీ కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగినవి. పై మూడింటి గురించి చెప్పాలంటే వెయ్యి ఏళ్ళ క్రితమే వెలసి కాల పరీక్ష ని తట్టుకుని నిలబడినవి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వారు 2016 లో వేసిన అంచనా ప్రకారం భారత దేశం లో గల మొత్తం ఆలయాల్లో రమారమి 22,000 టన్నుల బంగారం ఉన్నది. ఇతర విలువైన వజ్రాలు,వైఢుర్యాలు,పచ్చలు,గోమేధిక,పుష్యరాగాలు ఇంకా పురా వస్తు సంపద ని లెక్కగడితే అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చెప్పలేము.

ఇంత విలువైన సంపద ని దేవాలయాల్లో ఎందుకు భద్రపరిచారు పూర్వికులు అని ప్రశ్నించుకుంటే అనేక విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకి తిరువనంతపురం లోని అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయ నేలమాళిగల్లో దాచిన సంపద అంతా ఆనాటి ట్రావెంకూర్ రాజవంశీకులు తమకి విదేశీ వ్యాపారం ద్వారానూ పన్నుల ద్వారానూ ఇంకా ఇతరత్రా పద్ధతుల ద్వారా చేకూరినదే. ఆనాడు గుళ్ళు అనేవి కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే గాక సామాజిక,విద్యా కేంద్రాలు కూడా!అక్కడ చర్చలు జరిగేవి.విద్య గరపబడేది. వివిధ సాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునేవి. అందుకే ప్రాచీన ఆలయాలు వేటిని పరిశీలించినా చాలా విశాలమైన స్థలం లో నిర్మించబడినట్లు అర్థమవుతాయి.

తిరుపతి స్వామి విషయానికి వస్తే 7,000 ఎకరాల భూమి దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా, 16000 కోట్ల రూపాయల నగదు బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి.ఇవి గాక ఇతర మొత్తం ప్రోపర్టీ ని     లెక్కిస్తే 2.26 వేల కోట్ల రూపాయలని తేలింది. అయితే బంగారం,వజ్రాలు ఇంకా ఇతర విలువైన సంపద అది వేరేగా చెప్పాలి. అనంత పద్మనాభ స్వామి వారి నేల మాళిగలు తెరిచేవరకు మన ఏడుకొండల స్వామి యే సంపద లో నెంబర్ వన్ గా ఉండేవారు. వైష్ణోదేవి,సిద్ధివినాయక స్వామి (ముంబాయి),షిర్డీ సాయిబాబా,గురువాయూర్ , పూరి జగన్నాధ స్వామి,సోమనాధ ఆలయాలు దేశం లోని ధనిక ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని. ఇవి గాక ఇంకా చాలా ఉన్నాయి.

దేవాలయాలకి నాటి పాలకులు విరాళాలు ఇచ్చినపుడు తప్పనిసరిగా వాటికి సంబంధించిన శాసనాలు వేయించేవారు.అలాగే ఇతర రాజులు ఆలయాన్ని సందర్శించినపుడు వారికి విలువైన కానుకలు ఇచ్చేవారు. ప్రాచీన తమిళ కావ్యం శిలప్పదిగారం లో చేర రాజు సెంగొట్టయన్ కి అనంత పద్మనాభ స్వామి ఆలయం లో  బంగారు కానుకలు ఇచ్చిన వైనాన్ని ప్రస్తావించారు. హైందవేతరుల్ని తిరువనంతపురం,పూరి వంటి ఆలయాల్లోకి అనుమతించకపోవడం అనేది కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉన్నది.బహుశా దాని వెనుక ఉద్దేశ్యం సంపద ఉండే ప్రదేశాలు ఇతరులకు తెలియకూడదని కావచ్చును. ఇటీవల పూరీ క్షేత్రం లో జగన్నాథుని రత్నభండార్ ని 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెరిచిన వైనాన్ని చూశాము. బంగారం విషయం లో మన అనంత పద్మనాభ స్వామి, తిరుపతి స్వామి అంత స్థాయి లో లేకపోయినా జగన్నాథుని ఆలయానికి 30,000 ఎకరాల స్థలం ఉన్నది.  

----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)  


(Printed in Aruna prabha daily on 6-8-2024)

Wednesday, July 24, 2024

మొదటిసారి జపాన్ వెళుతున్నారా?

మొదటిసారి జపాన్ వెళుతున్నారా? ఇవి గుర్తుంచుకుంటే మంచిది.

---------------------------------------------------------------------------------------

 మొదటిసారి జపాన్ దేశం వెళుతున్న వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. జపాన్ అనగానే మనకి టోకియో నగరం జ్ఞాపకం వస్తుంది. నిజానికి ఆ దేశం లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.ఒసాకా,క్యోటో,నగానో, యోకోహామా ఇలా ఎన్నో నగరాలు ఉన్నాయి. మనం ఏ దేశం వెళ్ళినా అక్కడి స్థానిక అలవాట్లను,సంస్కృతి ని గౌరవించాలి. జపాన్ లో ఏ ఇంట్లోకి వెళ్ళాలన్నా ఇంకా కొన్ని వ్యాపార ప్రదేశాలకి వెళ్ళాలన్నా చెప్పులు బయట వదిలి వెళ్ళాలి. అంతేకాదు మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ పని చేసే సర్వర్ లకి గానీ,ఉద్యోగులకు గానీ పొరబాటున టిప్ అనేది ఇవ్వకూడదు. దాన్ని వారు సీరియస్ గా పరిగణిస్తారు.

పబ్లిక్ లో టాట్టూ లు ప్రదర్శించరాదు. ఎదుటి వారిపట్ల గౌరవం చూపాలి అనుకుంటే బౌ చేయాలి. అంటే శిరసు వంచి అలా చేస్తే గౌరవించినట్లు లెక్క.ఎస్కలేటర్స్ మీద ఎడమ వైపు నిల్చోవాలి. జపాన్ లో చౌకగా తిరగాలంటే రైల్ పాస్ అనేది కొనుక్కుంటే చాలు. బస్ ల్లోనూ,రైళ్ళ లోనూ ఇంకా ఇతరత్రా ప్రయాణ వాహనాల్లో అతి తక్కువ ఖర్చు తో చుట్టిరావచ్చు.లేదంటే ఖర్చు బాగా అవుతుంది. నగరాల్లో చాలామందికి ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి భాష సమస్య పెద్దగా ఉండదు. జపనీస్ డిక్షనరీ ని గూగుల్ ట్రాన్ స్లేట్ లో డౌన్లోడ్ చేసుకుంటే కూడా ఉపయుక్తం గా ఉంటుంది. జపాన్ లో కార్డ్ ల కంటే నగదు నే చాలా చోట్ల ఉపయోగిస్తారు. ముఖ్యం గా షాపింగ్ చేసేటప్పుడు,కనక సరిపోయినంత క్యాష్ ని చేతి లో ఉంచుకోవడం మంచిది.

ఏటిఎం ల దగ్గర మాత్రమే గాక పోస్ట్ ఆఫీసుల్లో ఇంకా 7 ఎలెవెన్ అనే స్టోర్ ల వద్ద కార్డులు ఉపయోగించి క్యాష్ ని పొందవచ్చు. డేటా రోమింగ్ కంటే పాకెట్ వై ఫై ని కొనుక్కుంటే చవగ్గా అన్ లిమిటెడ్ ఇంటెర్ నెట్ ని ఉపయోగించుకోవచ్చు. జపాన్ లో వారి స్థానిక వంట రుచుల్ని,ఆతిథ్యాన్ని చవి చూడాలంటే ర్యోకన్ అనే సంప్రదాయ నివాసాల్లో ఉండాలి.అంటే అవి ఒక తరహా లాడ్జ్ లు వంటివి. టాకుహాబిన్ అనే లగేజ్ సర్విస్ ఉంటుంది.మీ లగేజ్ బాగా బరువు ఉంటే వారికి ఒప్పజెప్పి అడ్రెస్ ఇస్తే చాలు, అక్కడికి తెచ్చి పెడతారు.నామమాత్రపు ఖర్చు తో ఈ పని చేస్తారు. శుభ్రత కి జపనీయులు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ఏదైనా చెత్త ఉంటే హోటల్ కి వచ్చేదాకా మీ జేబు లో పెట్టుకోవాలి లేదా దగ్గర లో స్టోర్ ఏదైన ఉంటే అక్కడి డస్ట్ బిన్ లో వేయాలి.

పరిసరాల్ని,ఇంటిని శుభ్రం గా ఉంచుకోవడం,పదిమందిలో ఎలా మెలగాలి,ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి కేవలం ఇలాంటి వాటిని నేర్చుకోవడానికే అక్కడి ప్రాథమిక విద్య లో ప్రాధాన్యతనిస్తారు. అయిదు ఏళ్ళు నిండిన ప్రతి చిన్నారి ,ఆడా మగ తేడా లేకుండా ఈ విషయాల్ని అభ్యసించాలి. ఎవరి స్కూల్ ని , ఆఫీస్ ని ఎవరికి వారే శుభ్రం చేసుకుంటారు.చిన్నప్పటి నుంచి ఇలాంటి మేనరిజం ని నేర్పించే పాఠశాలల్ని యో చిన్ అని జపనీస్ భాషలో పిలుస్తారు. మార్చ్ నుంచి మే నెలల మధ్య ఇంకా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలం లో జపాన్ దేశాన్ని సందర్శిస్తే బాగుంటుంది.

--- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)           




భారతదేశం లో ప్రస్తుత వైద్యవిద్య


భారతదేశం లో ప్రస్తుత వైద్యవిద్య

-------------------------------------------------------

 ఎంబిబిఎస్ చదవడానికి సీటు సంపాదించడం ఒక ఎత్తయితే ఆ తర్వాత విజయవంతమైన డాక్టర్ గా జీవితం లో నిలదొక్కుకోవడం మరో ఎత్తు. ప్రతి ఏటా మనదేశం లో దాదాపు లక్ష మంది వైద్య శాస్త్ర పట్టభద్రులు కాలేజ్ ల నుండి బయటికి వస్తున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఒకటిన్నర లక్షల జూనియర్ డాక్టర్లు నిరుద్యోగులుగా ఉన్నారని భోగట్టా. రెండు రకాలైన వాళ్ళు మెడిసిన్ చదివి బయటికి వచ్చే వాళ్ళ లో ఉంటారు. మొదటి రకం వాళ్ళు, వైద్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు,అంటే అప్పటికే వారి తల్లిదండ్రులు డాక్టర్లు గా అనుభవం సంపాదించినవారు కాగా రెండవ రకం వారు మొదటి తరం కి చెందిన వారు. దీంట్లో మొదటి కేటగిరీ కి చెందిన వారి జీవితం నల్లేరు మీద బండి కాగా రెండవ కేటగిరీ కి చెందిన వారు సక్సెస్ కావడానికి కొంత సమయం తీసుకోవలసిందే!

ప్రభుత్వ సర్వీస్ లో పనిచేయడం తప్పనిసరి కావడం తో తమ ప్రారంభ వేతనాన్ని 25 వేల రూపాయల నుంచి మొదలు పెట్టాలి. ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ,ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయడానికి ఇప్పుడొచ్చే తరం అంతగా ఇష్టపడటం లేదు. కారణం సరైన సదుపాయాలు ,రవాణా సౌకర్యాలు, ఆర్ధిక సౌలభ్యం ఆశించినంతగా ఉండకపోవడం. ఎక్కువమంది పేషెంట్లని చూసినా వచ్చే ఫీజులు అదనం గా ఏమీ ఉండవు. అదే సంఖ్యలో పేషెంట్లని బయట క్లినిక్ లో చూస్తే వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది. కార్పోరేట్ ఆసుపత్రులకి రిఫర్ చేస్తే దాని ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బడి గా ఉంటుంది. అలా అని చెప్పి ఎంబిబిఎస్ చదివి బయటకి వచ్చిన ప్రతి డాక్టర్ నెలకి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటే పొరబాటు.

ఆసుపత్రి ఉన్న ప్రదేశం,డాక్టర్ కి ఉండే నైపుణ్యం,మార్కెటింగ్ ఇంకా కమ్మ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి అన్నీ వైద్యుని గా సక్సెస్ అవడానికి తోడ్పడతాయి. ఈరోజున మనం చూస్తున్నాం, పేషెంట్ కి ఏదైనా జరగరానిది జరిగితే ఆసుపత్రి ని ధ్వంసం చేయడం ఓ రివాజు గా మారిపోయింది. కార్పోరేట్ ఆసుపత్రులు ఇలాంటి వాటిని తట్టుకోవడానికి సెక్యూరిటీ,లీగల్ టీం ల్ని పెట్టుకుంటాయి. ప్రత్యేకించి ఏ డాక్టర్ మీదనైనా ఎలిగేషన్ లు వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఓ సంతకం పెడితే చాలు,మిగతా వ్యవహారమంతా కార్పోరేట్ ఆసుపత్రి చూసుకుంటుంది. అలాంటి నెట్ వర్క్ ఉంటుంది.

 దక్షిణాది తో పోలిస్తే డాక్టర్ల కొరత ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ.తమిళనాడు , ఢిల్లీ, కర్నాటక,కేరళ, గోవా, పంజాబ్, ఆంధ్ర,తెలంగాణా వంటి రాష్ట్రాల్లో రోగుల సంఖ్య కి సరిపోయిన సంఖ్య లోనే డాక్టర్లు ఉన్నారు.జార్ఖండ్,చత్తీస్ ఘడ్, బీహార్,ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాలకి అందుబాటు లో ఉండే డాక్టర్ల సగటు దారుణం గా ఉందనే చెప్పాలి. కోట్లాది రూపాయలు డొనేషన్లు కట్టి వైద్య పట్టభద్రులు అవుతున్న యువతరం కేవలం సేవా దృక్పథం తోనే పని చేయాలని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అమెరికా,బ్రిటన్,సౌదీ అరేబియా,ఆస్ట్రేలియా,సింగపూర్ వంటి దేశాల్లో మన దేశపు వైద్యులకి మంచి డిమాండ్ ఉంది. కనుక ప్రతి యేటా వందల సంఖ్య లో వలస పోతున్నారు. దీని ప్రభావం దేశ ఆరోగ్య పరిస్థితులపై ఎక్కువగా ఉన్నది.     

       ప్రతి ఏటా ఇంతమంది యువతీ యువకులు పట్టభద్రులయి బయటకు వస్తున్నారు.కానీ వారంతా ఆ వృత్తి మీద ఎంతో ఇష్టం తో వెళ్ళారా అంటే చెప్పడం కష్టం. తల్లిదండ్రులు ఆ వృత్తి లో ఉన్నారనో,పెద్దవాళ్ళ కోరిక తీర్చడానికో,సంఘం లో ఓ గౌరవం కోసమో మన దేశం లో వైద్య వృత్తిని ఎంచుకుంటున్నారు. వైద్య పరిశోధన విషయానికి వస్తే భారతదేశం చాలా వెనుకబడి ఉందని చెప్పాలి. క్లినికల్ మెటీరియల్ ఎక్కువ గా ఉంది తప్పా పరిశోధన కి సంబందించిన డేటా గానీ,ఎక్విప్ మెంట్ గానీ మన వద్ద లేదని, పరిశోధనా పద్దతులపై ఆసక్తి ని కలగజేసే విధానం వైద్య విద్య లో లేదని సందీప్ గోడ్సే అనే నిపుణుడు అభిప్రాయపడ్డాడు. కార్డియాలజీ,గ్యాస్ట్రో ఎంటిరాలజీ వంటి రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వైద్యులున్నప్పటికీ అంతర్జాతీయస్థాయి లో చెప్పుకోదగ్గ పరిశోధనలు ఏమీ చేయలేకపోయిన మాట వాస్తవమని అంటున్నారు.  

--- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 78935 41003)