భద్రాద్రి ఎక్స్ ప్రెస్
నాకు తోచిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ బ్లాగుని ఎంచుకున్నాను.అందులోను తెలుగు భాషలో అంతర్జాలంలో రాయ డం,చదవడం భలేగా ఉంటుంది.మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ బ్లాగుని చూస్తూ ఉండండి.మీకు ఈ బ్లాగ్ నచ్చితే BOOK MARK చేయండి.
Tuesday, April 29, 2025
Friday, April 18, 2025
పుస్తక విక్రేతల్లో "హిగ్గిన్ బాథంస్" చరిత్ర ప్రత్యేకమైనది
పుస్తక విక్రేతల్లో "హిగ్గిన్ బాథంస్" చరిత్ర ప్రత్యేకమైనది
-----------------------------------------------------------------------
ఒకానొక సమయం లో రైల్వేస్టేషన్ లో ఉన్న హిగ్గిన్ బాథంస్ లో పుస్తకం కొనడం అనేది మరిచిపోలేని అనుభూతి. ఎన్నో దేశ,విదేశ పత్రికలు ఇంకా రకరకాల పుస్తకాలు పాఠకుల్ని రారమ్మని పిలుస్తుండేవి. ఇంచుమించు ప్రతి ప్రముఖ రైల్వే స్టేషన్ లో హిగ్గిన్ బాథంస్ వారికి షాపు ఉండేది. ఆ అక్షరాల్ని చదవడం లోనే ఓ ఆనందం ఉండేది. నిజానికి హిగ్గిన్ బాథంస్ అనేది ఓ బ్రిటీష్ వ్యాపారి పేరు. ఆయన అసలు ఎప్పుడు,ఏ పరిస్థితుల్లో ఆ బుక్ స్టోర్స్ ని స్థాపించి దాన్ని అంచెలంచెలుగా విస్తరించాడు అనేది తెలుసుకుందాం.
హిగ్గిన్ బాథంస్ అసలు పేరు ఏబుల్ జాషువ హిగ్గిన్ బాథంస్. లండన్ లో బయలు దేరి చెన్నయ్ వచ్చే ఒక ఓడ లో దాక్కుని భారత దేశం లో దిగాడు. ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దామని ప్రయత్నించగా మిషనరీస్ నడిపే ఓ పుస్తకాల షాపు లో పని దొరికింది.అది 1840 వ సంవత్సరం. భారత దేశం లో అతి పాత బుక్ స్టోర్ అది. దాన్ని ప్రీమియర్ బుక్ షాప్ ఆఫ్ మెడ్రాస్ అని పిలిచేవారు. ఆ పుస్తకాల షాపు కి నష్టాలు వచ్చి మూసివేసే స్థితి లో హిగ్గిన్ బాథంస్ దాన్ని 1844 లో తక్కువ ధర కి కొన్నాడు. ఆ తర్వాత పుస్తకాల్ని ముద్రించి అమ్మడం, స్టేషనరీ సామాను అమ్మడం లాంటివి చేయడం తో ఆ షాపు లాభాల బాట పట్టింది.
పుస్తకాల షాపు కి ప్రముఖుల్ని ఆహ్వానించేవాడు. బ్రిటీష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ, మైసూర్ మహారాజా,ఇంకా ఇతర ప్రముఖులు వచ్చి యూరప్ లో రిలీజ్ అయిన పుస్తకాల్ని వెంటనే ఇక్కడ కొనే ఏర్పాటు చేసేవాడు. తన షాపు కి అలా మంచి పబ్లిసిటీ వచ్చేలా చూసుకునేవాడు.దానితో భారతీయ ఉన్నత వర్గాల వారు కూడా మౌంట్ రోడ్ (చెన్నై) లో ఉన్న ఆ షాపు లో పుస్తకాలు కొనడం ఓ ప్రిస్టేజ్ గా భావించేవారు. 1858 లో భారతదేశ పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ రాణి చేతిలోకి వెళ్ళింది. దానికి సంబందించిన అధికారపత్రాన్ని ఇంగ్లీష్ లోనూ, తమిళ్ లోనూ ముద్రించి పాఠకులందరికీ హిగ్గిన్ బాథంస్ ఉచితంగా పంచిపెట్టాడు.
దానితో ఆనాటి అధికార వర్గాల్లో మంచి పేరు సంపాదించుకున్న హిగ్గిన్ బాథంస్ బ్రిటీష్ రాచ కుటుంబాల వారికి అఫీషియల్ బుక్ సెల్లర్ గా ప్రకటించబడ్డాడు. అంతేగాక ప్రసిద్ది చెందిన కన్నెమెర లైబ్రరీ కి బుక్ సప్లయర్ గా మారిపోయాడు. ఆ తర్వాత మొట్టమొదటి బుక్ స్టోర్స్ చైన్ ని స్థాపించాలనే ఉద్దేశ్యం తో దక్షిణ భారత దేశం లోని చాలా ప్రముఖ రైల్వే స్టేషన్ లలో హిగ్గిన్ బాథంస్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతని కుమారుడు వాటిని ఇంకా అభివృద్ది లోకి తీసుకురావడం జరిగింది. బెంగళూరు లోని మొదటి పుస్తకాల షాపు ని కూడా ఈ సంస్థ వారే స్థాపించారు. 1929 కల్లా మొత్తం 400 మంది ఉద్యోగులు పనిచేస్తుండేవారు.
లార్డ్ మెకాలే కి ఒక బ్రిటీష్ మిత్రుడు ఇలా రాశాడు." మౌంట్ రోడ్ లో ఉన్న హిగ్గిన్ బాథంస్ బుక్ షాప్ కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం.మన యూరప్ లో విడుదల అయిన ప్రతి ప్రముఖ పుస్తకాన్ని ఇక్కడకి వెంటనే తెప్పిస్తారు.సోక్రటీస్,ప్లేటో,షిల్లర్,గేథే లాంటి తత్వవేత్తల రచనలు ఎన్నో లభ్యమవుతాయి. అంతేకాదు, విక్టర్ హ్యూగో రచించిన తాజా పుస్తకాన్ని నేను ఇక్కడే కొన్నాను." అంటూ ప్రస్తుతించాడు.
అయితే 1925 లో ఈ హిగ్గిన్ బాథంస్ గ్రూప్ ని స్పెన్సర్ గ్రూప్ కొనుగోలు చేసింది. మళ్ళీ చేతులు మారి అనంత కృష్ణన్ కి చెందిన అమాల్గమేషన్ గ్రూప్ కి సొంతమయింది. 1990 దాకా కూడా హిగ్గిన్ బాథంస్ పెద్ద బుక్ స్టోర్స్ చైన్ గానే ఉండింది. ప్రస్తుతం కేవలం 22 బుక్ షాప్ లు మాత్రమే దక్షిణ భారతదేశం లో నడుస్తున్నాయి. అమేజాన్ లాంటి దిగ్గజాలు కోరుకున్న పుస్తకాన్ని ఇంటివద్దకే చేరుస్తున్న ఈ తరుణం లో హిగ్గిన్ బాథంస్ ఒకప్పటి ప్రతిష్ఠ కొంత మసక బారిందనే చెప్పాలి. పుస్తకాల విక్రయం గురించి ఎవరు రాసినా హిగ్గిన్ బాథంస్ కి ఉన్న చరిత్ర కొన్ని పేజీల్లో తప్పక రాయవలసిందే!
----- మూర్తి కెవివిఎస్
In Nirbhaya Vaarta Daily (18-4-2025)
Friday, March 14, 2025
ద బ్లాక్ హిల్ " ఈశాన్య భారత నేపథ్యం లో ఓ గొప్ప నవల
" ద బ్లాక్ హిల్ " ఈశాన్య భారత నేపథ్యం లో ఓ గొప్ప నవల
-------------------------------------------------------------------------------
మమాంగ్ డాయ్ గురించి మన తెలుగు సాహితీలోకం లో తెలియవలసినంత గా తెలియలేదేమో. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఆమె రచనల గురించి ఇంకా ఎంతో తెలియవలసి ఉంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన బలమైన స్వరాల్లో మమాంగ్ డాయ్ ఒకరు. ఇటీవల ఆమె ఆంగ్ల నవల "ద బ్లాక్ హిల్" చదివిన తర్వాత కొన్ని అంశాలు పంచుకోవాలనిపించింది. ప్రకృతి అందాలకు పర్యాయ పదం ఈశాన్య రాష్ట్రాలు. అయితే అక్కడ జీవిస్తున్న వివిధ గిరిజన తెగల గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి,చరిత్ర లో వారి స్థానం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. పుస్తకాలు లేక కాదు వాటి గురించి బయట ప్రపంచానికి పబ్లిసిటి లేక పోవడం. అలా రరకాల కారణాల వల్ల జరుగుతుంది.
ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న మేబో,జయుల్ ఇంకా టిబెట్ దాకా ఈ కథా ప్రదేశాలు ఉన్నాయి. ఇది చరిత్ర కి కొంత కాల్పనికత అద్దిన నవల అని చెప్పాలి. 1840 నుంచి ఇప్పటి కాలం దాకా సాగిపోతుంది.బ్రిటీష్ వారు అప్పటి ఈశాన్య ప్రాంతాల్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. మిష్మి,అబోర్ తెగలు విదేశీయుల రాకని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాయి. కజిన్ ష, గైమర్ అనే యువ ప్రేమికులు ఈ రెండు తెగలకి చెందిన వారు. ఒక తెగ కి మరో తెగ కి పడదు. అందువల్ల వీరిద్దరూ టిబెట్ కి దగ్గర్లో ఉన్న ఓ అడవి లోకి పారిపోయి జీవనం గడుపుతుంటారు. అక్కడి అరణ్యాల్ని,పర్వతాల్ని,సహజసిద్ధ జీవనాన్ని రచయిత్రి అద్భుతం గా కళ్ళకి కట్టినట్లు రాశారు.
అడవి లో వాగు పక్కనే గుడిసె వేసుకుని నివసిస్తున్న ఆ జంట కి ఓ మగపిల్లాడు పుడతాడు. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చినందుకు ఇరువురు బాధపడుతున్నా ,ఇంతకి మించిన దారి లేదని సముదాయించుకుంటారు. ఇలా ఉండగా నికోలస్ క్రిక్ అనే క్రైస్తవ మిషనరీ ఫ్రాన్స్ నుంచి ఇక్కడకి వస్తాడు.చెన్నయ్ లో ఓడ దిగి,అక్కడ నుంచి కలకత్తా వచ్చి, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పటి అస్సాం లో ని గువాహతి దగ్గర ఓ చిన్న ఊరు కి చేరుకుంటాడు. అక్కడ గది అద్దె కి తీసుకుంటాడు. టిబెట్ కి వెళ్ళాలనేది అతని ఆలోచన. మిష్మి,అబోర్ ఇంకా ఇతర తెగలున్న ప్రాంతాల గుండా వెళ్ళవలసి ఉంటుంది.
స్థానికులైన ఒకరికి డబ్బులు ఇచ్చి టిబెట్ కి దారి చూపమంటాడు. ప్రయాణం అంతా నడక ద్వారా నే సాగుతుంది. దాదాపు పది రోజులు పైన కొండలు,వాగులు దాటుతూ ప్రయాణిస్తారు. చాలా బాధలు పడి అక్కడికి చేరిన తర్వాత అక్కడి అధికారులు మీ దేవుడు మాకవసరం లేదు,ఇక్కడ నుంచి వెళ్ళిపో అని నిరాదరిస్తారు. మళ్ళీ తిరుగు ప్రయాణం లో అడవుల వెంబడి వస్తుండగా కజిన్ ష, గైమర్ లు కనిపిస్తారు. వాళ్ళతో సంభాషణలు రకరకాల విధాలుగా జరుగుతాయి.
కొన్నాళ్ళు కాపురం చేసిన తరువాత కజిన్ ష, గైమర్ ల మధ్య గొడవులు జరిగి ఆమె భర్త ని విడిచిపెట్టి ఓ రాత్రి పూట పుట్టింటికి చేరుకుంటుంది.అప్పటికే తల్లి మరణిస్తుంది.ఆమె సోదరుడు ఈమె ని ఆదరిస్తాడు. పుట్టిన కొడుకు వచ్చే దారి లో మరణిస్తాడు. ఆ అడవి లోనే కప్పెడుతుంది.మళ్ళీ విచారం గా రోజులు గడుపుతూ ఉండగా , అటు కజిన్ ష కూడా తమ మిష్మీ తెగకి చెందిన స్వగ్రామానికి చేరుకుంటాడు. మిషనరీ నికోలస్ క్రిక్ పట్టువదలని విక్రమార్కునిలా మళ్ళీ మిష్మీ కొండప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ చిన్న చర్చ్ నెలకొల్పాలని , జనాలకి అవసరమైన మందుల్ని కూడా తీసుకుని వెళతాడు.
ఈసారి క్రిక్ కి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే కొంతమంది శత్రువులు కూడా ఏర్పడి ఇతనికి ఆటంకాలు కలిగిస్తుంటారు. చివరకి ఈయన్ని ఓ వాగు దగ్గర కత్తి తో నరికి చంపుతారు. ఇతడిని మాత్రమే కాకుండా సహాయకారి గా వచ్చిన మరో విదేశీ మిషనరీ ని కూడా చంపుతారు. దానితో బ్రిటిష్ సైనికాధికారులు సీరియస్ గా తీసుకుని స్థానికం గా ఉన్న కొంతమందిని డబ్బు తో కొని కొండప్రాంతాల్లోని మిష్మీ తెగ వారిని ఊచకోత కోసి కజిన్ ష ని బందీ గా తీసుకువెళతారు. ఆ తర్వాత గైమర్ ఈయన కోసం చేసింది,అక్కడి ప్రజలు ఎలా తిరుగుబాటు చేశారు, ఇదంతా తెలియాలంటే నవల మొత్తం చదవాలి.
ఈశాన్య భారత దేశం లోని కొన్ని తెగల జీవన శైలిని తెలుసుకోవాలంటే ఈ నవల బాగా ఉపయోగపడుతుంది.విదేశీ జాతుల్ని నిలువరించడం లో వారి యుద్ధ నైపుణ్యం తెలియవస్తుంది. ఏ జంతువు నైనా చంపకుండా ,వాటితో ఎలా కలిసి జీవించాలో మమాంగ్ డాయ్ చిత్రించిన విధానం వాస్తవానికి దగ్గరగా ఉంది. అంతదాకా ఎందుకు, స్వర్గతుల్యమైన మిష్మి కొండల నడుమ మనల్ని ఊపిరి సలపనీయకుండా నడిపిస్తారు.
దీంట్లో చాలా సంఘటనల్ని ఏ రికార్డుల నుంచితీసుకున్నదీ సోదాహరణగా చెప్పినపుడు కల్పితం కంటే కొన్నిసార్లు వాస్తవమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రచయిత్రి మమాంగ్ డాయ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి 1979 లో IAS కి ఆ రాష్ట్రానికి చెందిన మొదటి వ్యక్తి గా సెలెక్ట్ అయినారు. ఆ తరువాత కొన్నాళ్ళకి రాజీనామా చేసి తనకి ఎంతో ఇష్టమైన జర్నలిజం లో కొనసాగారు. టెలిగ్రాఫ్, హిందూస్థాన్ టైంస్ లోనూ రాసేవారు.
----- మూర్తి కెవివిఎస్
(పేజీలు :296 , వెల :499, అలీఫ్ కంపెనీ ప్రచురణ )
Wednesday, March 5, 2025
పుస్తకపఠనం వల్ల ఊహించని లాభాలున్నాయి!
పుస్తకపఠనం వల్ల ఊహించని లాభాలున్నాయి!
---------------------------------------------------------------
ఇంకా మీరు ప్రింట్ చేసిన పుస్తకాల్ని చదువుతున్నారా? అంతా సోషల్ మీడియా లోనూ,ఇంకా ఈ పేపర్ల ని, పి.డి.ఎఫ్. ల్ని చదువుతున్నారు. ఎందుకు ఆ పాత పద్ధతి అని ఎవరైనా అంటే వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోలేదని అర్థం. అదేమిటంటే బిల్ గేట్స్,ఎలన్ మస్క్, మార్క్ జూకర్ బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఇంకా ఇప్పటికీ ప్రింట్ పుస్తకాల్ని చదువుతూనే ఉన్నారు. వాళ్ళకి కంప్యూటర్ లు లేకనా లేదా ఉపయోగించటం రాకనా? మరోవైపు ఎలెక్ట్రానిక్ వెర్షన్స్ లో చదువుతున్నప్పటికీ వాళ్ళు ప్రింట్ పుస్తకాలు చదవటం మానలేదు. ప్రింట్ చేసిన పుస్తకానికి ఉండే సౌలభ్యం వేరు. అది పాఠకులకి అందరకీ తెలుసు.
మరొక అంశం ఏమిటంటే పుస్తకపఠనం వల్ల బ్రెయిన్ కి వ్యాయామం జరిగి క్రిటికల్ థింకింగ్,ఎనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఏకాగ్రత,జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. మనం చదువుతున్న కొద్దీ మెదడు లోని న్యూరాన్లు వాటి పనితనాన్ని పెంచుకుంటాయి. అందుకే రోజుకి కొంత సేపు అయినా పుస్తక పఠనం చేయడం మానరాదు. అవసరమైతే కొన్ని గంటల సేపు చదివినా మీ మెదడు అలిసిపోదు.కానీ అదే పనిగా సిస్టం లో చదివితే తప్పనిసరిగా కళ్ళనొప్పి,నిద్ర లేమి, మతిమరుపు లాంటివి చోటు చేసుకుంటాయి. స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించితే మరింత త్వరగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
ఎవరికి వాళ్ళకి ఇవి తెలుస్తూనే ఉంటాయి,కానీ అవి తీవ్ర రూపం దాల్చితే తప్పా చాలా మంది గమనించరు.కాబట్టి కంప్యూటర్ ని తప్పనిసరిగా ఉండే అవసరాలకి మాత్రమే ఉపయోగిస్తే మంచిది. స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఇంటికి వస్తే చాలు గంటలకొద్దీ విరామం లేకుండా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. దీని ప్రభావం వాళ్ళ మీద పడుతూనే ఉంది. తల్లి మందలించిందని,టీచర్ మందలించిందని చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకి పాల్పడటం చేస్తున్నారు. దీని వెనుక సామాజిక కారణాలకంటే వారి మెదడు లోని న్యూరాన్లు పనితనం దెబ్బతినడం ఇంకా ఆందోళన,ఒత్తిడి పెరగడం మూలంగా ఇలాంటి ఆఘాయిత్యాలకి ఒడిగడుతున్నారు.
కనీసం రోజుకి 30 నిమిషాలు పాటు పుస్తక పఠనం చేయడం వల్ల ఫిజికల్ ఇంకా ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కనుక సాధ్యమైనంతవరకు పిల్లలకి ఈ విషయం చెప్పి స్మార్ట్ ఫోన్ వాడే సమయాన్ని తగ్గించాలి. మన దేశం లో 71 శాతం మంది వార్తల్ని ఆన్ లైన్ లో చూస్తున్నట్లు తేలింది. కేవలం 29 శాతం మంది మాత్రమే ప్రింట్ వెర్షన్స్ చదువుతున్నారు. ముఖ్యమైన హెడ్ లైన్స్ ని, బ్రేకింగ్ న్యూస్ ని ఆన్ లైన్ లో చూసినా వార్తల్ని వివరంగా చదవడానికి ప్రింట్ అయిన పేపర్ ని చదవాలి. దానివల్ల కంటికి,మెదడు కి కలిగే మార్పు ని ఎవరికి వారే అనుభవించగలరు. కేరళ లో ఎక్కువ అక్షరాస్యత ఉన్నప్పటికి ప్రింట్ వెర్షన్స్ ని కొని చదివే విషయం లో మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ముందున్నాయి.
----- మూర్తి కెవివిఎస్ (78935 41003)
Sunday, February 23, 2025
Sunday, February 2, 2025
తోడేలు ప్రత్యేకత దేనికీ లేదు
తోడేలు అనగానే కుక్క లాంటి మరో జంతువు అనుకుంటాము. రూపం లో కుక్క కి దగ్గర గా ఉన్నప్పటికీ తోడేలు చాలా ప్రత్యేకతలు ఉన్న జంతువు. కుక్క ని పెంచుకుని మన ఇంట్లో కాపలా ఉంచుకోవచ్చు. శిక్షణ ఇస్తే చెప్పిన పనులు చేస్తుంది.కానీ తోడేలు అలా కాదు.దాన్ని మన ఇంట్లో పెంచుకుని శిక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తే అది మనం చెప్పినట్లు చెయ్యదు.అసలు మచ్చిక కావడం కూడా కష్టం అంటున్నారు నిపుణులు. మన దేశం లో ఎక్కువ గా బూడిద రంగు లో ఉన్న తోడేళ్ళు ఉన్నాయి. ఇవి చాలా తెలివైనవి.
చింపాంజీ,ఏనుగు,డాల్ఫిన్ ఇలాంటి పది అత్యున్నత తెలివైన జంతువుల్లో ఇది కూడా ఒకటి. వాటి పిల్లలకి వేట గురించి నేర్పించడమే కాకుండా , వాటికి గాయాలు తగిలితే మనుషుల్లాగానే జాగ్రత్తలు తీసుకుంటాయి. సాధ్యమైనంత వరకు మనుషులకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. చూడటానికి గాని,ఫోటో తీసుకోవడానికి గాని తోడేళ్ళకి కనీసం 100 యార్డ్ లు దూరం ఉండటం మంచిది. అవి కౄర జంతువులు అనే విషయం గుర్తుంచుకోవాలి.
తోడేళ్ళని కొన్ని దేశాల్లో మృత్యువు కి, వినాశనానికి సంకేతం గా పరిగణిస్తారు. అయితే రోమన్ పురాణాల్లో వీటికి గౌరవనీయమైన స్థానమున్నది. హిట్లర్ తమ మూడు మిలటరీ స్థావరాలకి హెర్ వుల్ఫ్, కండక్టర్ వుల్ఫ్, వర్ వుల్ఫ్ అనే పేర్లు పెట్టాడు. వ్యవసాయానికి,యుద్ధానికి అధి దేవతలుగా తోడేళ్ళని భావించడం వల్ల చాలా పాశ్చాత్య దేశాల్లో వాటిని వేటాడరు.మనం కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో కూడా చూసి ఉంటాం.అడివి లో తోడేలు ఎదురైతే తుపాకి ని గాల్లోకి పేల్చి వాటిని వెళ్ళగొడతారు తప్పా చంపరు.
రొములస్,రెముస్ అనే చంటిపిల్లల్ని అడివి లోకి తీసుకెళ్ళి చంపమని అమూలియస్ అనే రాజు ఆజ్ఞాపించగా వాళ్ళని కొన్ని తోడేళ్ళు పాలిచ్చిపెంచాయని రోమన్ పురాణాల్లో ఒక ఉదంతం ఉన్నది. దానివల్ల తోడేలు విషయం లో వాళ్ళకి ఓ సెంట్ మెంట్ ఉందనుకోవాలి. ఇవి దుప్పి,కుందేలు,చిట్టెలుక,పక్షులు ఇంకా చిన్న జంతువుల్ని వేటాడి తింటాయి. మనుషుల్ని చంపిన ఉదంతాలు తక్కువ.అయితే ఇవి మంద గా ఉన్న సమయం లో ఎంతకైనా తెగించే అవకాశం ఉంది.
6 నుంచి 13 సంవత్సరాలు జీవించే ఈ తోడేళ్ళు అన్యోన్య దాంపత్యానికి మారు పేరు అని చెప్పవచ్చు.ఒక ఆడ తోడేలు జీవితాంతం ఒక మగ తోడేలు తోనే ఉంటుంది. ఇది మరే జంతువు లోనూ కనబడదు. మంద లో ఉన్నప్పటికీ ఎవరి పనులు అవి విభజించుకుని చేస్తాయి.ఆహారం కూడా మంద లో ఉన్న తోడేలు నాయకుడు తిన్న తర్వాత మిగతావి తింటాయి. ఒకేసారి 9 కిలోల మాంసాన్ని కూడా ఇవి తినగలవు.
6 అడుగుల పొడవు,30 నుంచి 50 అంగుళాల ఎత్తు ఉండే తోడేళ్ళు పుట్టిన పిల్లల ని మనుషుల మాదిరిగానే ఆహారం ఇవ్వడం లోనూ,దెబ్బలు తగిలితే ఆదుకోవడం లోనూ జాగ్రత్త గా ప్రవర్తిస్తాయి. వీటికి నలభై రెండు పళ్ళు ఉంటాయి.పుట్టిన వెంటనే పిల్లలకి కొన్ని రోజులపాటు కళ్ళు,చెవులు పనిచేయవు. కిర్గిస్థాన్ దేశ ప్రజలు తోడేలు కలలోకి వస్తే మంచిదని నమ్ముతారు. రాజస్థాన్ ,గుజరాత్,కర్నాటక,మధ్య ప్రదేశ్,మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్ ఇంకా హిమాలయ సానువుల్లో కూడా గణనీయం గా ఉన్నాయి.
తోక ఊపడం,ముఖ కవళికలు,నోటి ద్వారా చేసే శబ్దాలు వీటన్నిటిని చేస్తూ వాటిలో ఆవి మాట్లాడుకుంటాయి. వేటాడేప్పుడు జంతువు ని బాగా ఉరికేలా చేసి అవి అలిసిపోయినప్పుడు మందగా పడి చంపుతాయి.ఇక యూరేషియన్ తోడేళ్ళు తెలివి గురించి చెప్పాలంటే , వేట కుక్క వచ్చినపుడు ఎరగా ఆడ తోడేలు ని దాని దగ్గరకి పంపి ట్రాప్ చేసి చంపుతాయి.అమెరికా లో తోడేళ్ళ సంఖ్య 60,000 కాగా (పాత) రష్యా లో కూడా 60,000 దాకా ఉన్నాయి. మిగతా యూరపు దేశాల్లో కూడా 20,000 దాకా ఉన్నాయి. మన దేశం లో కేవలం డార్జిలింగ్ లో మాత్రమే తోడేళ్ళ కి సంభందించిన సంరక్షణ కేంద్రం ఉన్నది.
----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003)
Tuesday, January 28, 2025
ఏనుగుల వీరాస్వామి గారి యాత్రా పుస్తకం
ఏనుగుల వీరాస్వామి గారి యాత్రా పుస్తకం ఆనాటి సామాజిక పరిస్థితుల దర్పణం
ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం ఇప్పుడు సులభమైన తెలుగు లోకి రావడం తో చదవడం కుదిరింది.చదివిన తర్వాత కొన్ని అంశాల్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది.1830 మే నెల లో చెన్నపట్నం లో బయలుదేరి మళ్ళీ 1831 సెప్టెంబర్ మాసం లో ఆయన తన పరివారం తో యాత్ర ముగించుకొని వెనక్కి వచ్చారు.ఇది ఒక యాత్ర గురించిన పుస్తకమే కాదు.అప్పటి సామాజిక,సాంస్కృతిక,ఆర్ధిక భారతం చాలా కొత్త కోణం లో కనబడుతుంది.ఎంతో సహనం తో తాను గమనించిన అంశాల్ని రికార్డ్ చేసిన తీరు అమోఘం.యాత్ర లో సాగుతూనే వారానికి ఒక ఉత్తరం చొప్పున తన ప్రాణ స్నేహితుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై కి రాశాడు.ఇచ్చిన మాట ప్రకారం..! అది మొత్తం మనకి ఒక ఉద్గ్రంధమైనది.
దీన్ని పూర్తి చేసిన తర్వాత ప్రచురణ కి గాను సాయం చేయమని బ్రౌన్ దొర కి అందించుతాడు మన ఏనుగుల వీరస్వామి ,అయితే ఎందుకో గాని ఆయన కొన్ని నెలలు తర్వాత ఎటువంటి సాయం ఈ విషయం లో చేయకుండా చెన్నపట్నం లోని ఒక గ్రంధాలయానికి ఈ మాన్యుస్క్రిప్ట్ ని ఇచ్చి లండన్ వెళ్ళిపోతాడు.అయితే దీనికి కారణం ఒకటి ఉంటుంది.అది చివరన చెప్పుకుందాం.వీరాస్వామి తిరుపతి ,శ్రీశైలం,హైదరాబాద్,నిర్మల్,నాగ్పూర్,జబల్పూర్ ప్రయాగ మీదుగా కాశీ చేరి మళ్ళీ పాట్నా,కలకత్తా,బరంపురం,చత్రపురం,శ్రీకాకుళం,రాజమండ్రి,నెల్లూరు ల మీదుగా చెన్నపట్నం చేరుతాడు.
వీరాస్వామి గారు పేద కుటుంబం లో జన్మించినప్పటికీ స్వయం కృషి తో ఆంగ్లం,తమిళం,పారశీకం ఇత్యాది అన్య భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి ఆనాటి చెన్నపట్నం లోని సుప్రీం కోర్ట్ లో దుబాషీ గా పనిచేసి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు.న్యాయమూర్తు లు గా ఉన్న తెల్ల దొరలకి తమిళం,తెలుగు భాషల్లో ఉండే వ్యవహారాల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి వారికి ఇవ్వడం ఈయన పని.యాభై ఏళ్ళు దాటిన పిమ్మట ఈ యాత్ర చేయాలనే తలంపు కలుగుతుంది.వాళ్ళమ్మ గారు కాశీ తీసుకెళ్ళమని కోరగా సరే ..నీతో పాటు ఇంకా ఎక్కువమందిని ఆ కాశీ విశ్వనాధుని వద్ద కి తీసుకెళ్ళి ఆ పుణ్యం మూటగట్టుకుంటానని సంకల్పించుకుంటాడు.
తాను పనిచేసే తెల్ల దొరల వద్ద నుంచి సర్టిఫికెట్లు తీసుకుంటాడు.ఇవి ఆయనకి ఎంతో ఉపయోగపడతాయి ఈ దూర ప్రయాణం లో..!మధ్యలో తగిలే జమీందారులు,చిన్న తరహా పాలకులు వీటికి విలువనిస్తారు.కొన్ని చోట్ల లెక్కచేయని వారూ ఉన్నారనుకొండి.ప్రతి రోజు 20 లేదా 22 కి.మీ.నడక ఉంటుంది.అక్కడ ఆగడం.గుడారాలు వేసుకోవడం.కొన్ని చోట్ల సత్రాలు ఉంటాయి.కొన్ని చోట్ల ఉండవు.అడవి లో మృగాలు భయపడటానికి తుపాకులు కూడా పేలుస్తుంటారు.ముందు వెళ్ళబొయే ఊరు ని గురించిన వివరాలు తెలుసుకుండానికి గుర్రాల మీదనో ఇంకో రకం గానో కొంతమంది తన మనుషుల్ని పంపించడం..అలాంటి ప్లానింగ్ లు చాల గొప్ప గా ఉంటాయి.దీంతో బాటు గా ఆయన తెచ్చుకునే ఖర్చుల నిమిత్తపు డబ్బు ఇంకా నగల్ని కాపాడుకోవడానికి అనుసరించిన విధానం వీరాస్వామి గారి తెలివితేటలకి నిదర్శనం.
శ్రీ శైలం దగ్గరి ఆలయాల పరిస్థితి దయనీయం గా ఉన్నట్లు రాస్తాడు.హైదరాబాద్ లో ప్రవేశించిన తర్వాత పరిస్థితి ని గురించి రాస్తూ ఆయుధాల్ని ఆభరణాలు గా ధరించి రోడ్ల మీద తిరిగే వాళ్ళ గురించి వర్ణిస్తాడు.ఇక్కడ నోరుండి,కత్తి ఉన్నవానిదే రాజ్యం.అలా ఉంది పరిస్థితి అంటాడు.నాగ్పూర్ రాజ్యం లోకి వచ్చిన తర్వాత నాగరిక ప్రపంచం లోకి వచ్చినట్లు ఉందని అంటాడు.హైదరాబాద్ లో కూరగాయలు,పండ్లు ఆ నేల నీరు వల్లనో ఏమో మంచి రుచిగా ఉన్నాయనీ అంటాడు.నాగ్ పూర్ లో కూడా హైద్రాబాద్ లానే స్వతంత్ర రాజులు ఉన్నా బ్రిటీష్ వారికి కప్పం కట్టుకుంటూనే పాలన సాగిస్తుంటారు.ఇంకా ఆపైన చిన్న రాజ్యాలు ఎన్నో తగులుతుంటాయి.వాటి అన్నిటి వివరాలు ఎవరకి వారు చదవవలసిందే.అక్కడి వ్యవహారాలూ అవన్నీనూ..!
తినే తిండిని బట్టే వంటికి బలమూ పౌరుషమూ వస్తాయి అంటాడు ఓ చోట..ఉత్తరాది వారికి దక్షిణాది వారికి భేదం చెపుతూ..!దూద్ పేడాలు,పెరుగు,పాలు,రొట్టెలు, నెయ్యి ఇట్లాంటి వాటిని తింటూ అరాయించుకునే వీరి దేహాలు స్త్రీ,పురుషులు గాని మంచి బలిష్టం గా ఉంటాయి అని అభిప్రాయపడతాడు.జబల్ పూర్ ,రాయ్ పూర్ లాంటి మధ్య భారత రాజ్యాల్లో సత్రాల్లో దిగుతూ లేదా గుడారాలు వేసుకుంటూ ఉంటూ స్థానిక పరిస్థితులు తెలుసుకుంటూ తన పరివారం తో సాగిపోతుంటాడు.
దాదాపు గా అయిదు భాషల్లో వీరాస్వామి గారు తన భావావేశం లో రాసిన ఈ యాత్రా సాహిత్యాన్ని ఒక పద్ధతి గా పెట్టి అందరకీ సులభం గా అర్ధమయ్యే రీతి లో మన ముందు కి ఇప్పుడు తెచ్చిన మాచవరపు ఆదినారయణ గారు బహు ప్రశంసనీయులు.గతం లో కొన్ని వెర్షన్లు రాకపోలేదు కాని దీనికి గల రీడబిలిటి గొప్పది.అలాగని వీరాస్వామి యొక్క ఆత్మ ని ఆయన ఎక్కడా చిన్నబుచ్చలేదు.పుస్తకం చదువుతుంటే ఆ మూల కర్త యే మన ముందు కూర్చొని మాటాడుతున్నట్లు ఉంటుంది.ప్రపంచాన్ని చూడటం లో,వ్యాఖ్యానించడం లో వీరాస్వామి గారి దృస్టి అచ్చెరువు కొలుపుతుంది.దాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఉదాహరణకి 273 పేజీ లో ఇలా అంటారు. "ఎందుకు ఇలా ఖర్చు చేస్తున్నారు..?అని అందరూ అడుగుతూ ఉంటారు."తన డబ్బు తనకి నచ్చిన విధంగా ఖర్చు పెట్టకుండా మరణించడం వలన ప్రయోజనం ఉండదు" అని ధృఢంగా నమ్ముతాను. నేను సుప్రీం కోర్ట్ లో ఉండి ఎన్నెన్నో మరణ శాసనాలు(వీలునామాలు) చదివాను. వారు తమ తరువాత జరుగవలసిన పనుల గురించి రాసి మరణిస్తారు.అయితే వారు చెయ్యమని చెప్పిన పనులు వారి వారసులు ఎవరూ చేయలేదు.పైగా ఆ వారసులందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు.అలా నా జీవితం లో జరుగకూడదు.....అందువలన నా మనసు కి నచ్చిన విధం గా నా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటాను అనే నిర్ణయం తీసుకున్నాను...నా జీవితం నాకు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి సమాధానాలు చెప్పుకుంటూపోతున్నాను. ఆ ఈశ్వరుడి భాషని నాకు అర్ధమైనంత వరకూ అనువాదం చేసుకున్నాను.అదే చాలు నా జీవితానికి.." అంటారు.
ఇంకోటి ఏమంటే ఈ పుస్తకం లో ప్రస్తావించిన ఉప్పాడ బోయీలు ...వారు నన్ను ఎంతో ఆలోచింపజేశారు.ఇంత మహా ప్రయాణం ని విజయవంతం గా పూర్తి జేశారూ అంటే వాళ్ళ రెక్కల కష్టం ఎంత ఉన్నదో గదా..!ఇంతా జేసీ వాళ్ళ గురించి రాయకుండా ఎలా ఉంటాడు ఆయన..? ఉప్పాడ ఇంకా పరిసర గ్రామాలకి చెందిన ఈ బోయీలు తల్చుకుంటే భూమండలం అంతా తిరిగిరావచ్చును అంటాడు వీరాస్వామి.వీరు ఎంతో కష్టజీవులు.అయితే మద్యపానానికి వాటికి అలవాటు పడి అప్పులు చేసి,జీవిక కోసం దూర ప్రాంతాలైన చెన్నపట్నం వంటి పట్నాలకి వెళ్ళి బోయీలు గా పనిచేస్తూ బ్రతుకుతుంటారు.ఇంటి నుంచి పారిపొయి మళ్ళ్ళీ రమ్మన్నా రాకుండా ఈ విధంగా జీవితం గడుపుతుంటారు.ప్రయాణం లో వీరికి అనారోగ్యం చేసినా వీరికి తన వద్దనున్న మందులు ఇచ్చి వీరాస్వామి గారు ఆదుకున్నాడు.కొంతమంది కి బాగోలేనప్పుడు వారి బదులు ఇంకోళ్ళని రిక్రూట్ చేసుకోవడం అలా ఉంటుంది..వీరికి అయ్యే ఖర్చులు అన్నీ ఆయనే పెట్టుకున్నాడు.ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,అది మోసిన బోయీలెవ్వరు అనే శ్రీ శ్రీ మాటలు గుర్తుకు రాకమానవు.వీరి గురించి ఇంకా ఎక్కడైన ఎవరైనా పరిశోధన చేశారా అనే సంశయం నాకు వచ్చింది.
ఆ రోజుల్లో నెల్లూరు ప్రాంతం వేశ్యావృత్తికి చెందిన వారికి మిరాశి గా ఉండడం గమనించవచ్చు.గోదావరీ పరీవాహ ప్రాంతం లో భూ వసతి లేని బ్రాహ్మలు లేరు.మేజువాణీలు అవీ సరే.వీరాస్వామి గారి బందువర్గమైన కొచ్చెర్లకోట జమీందారుల ఇళ్ళకి వచ్చినపుడు వారు చేసిన సన్మానాలు గురించి రాస్తూ ఆ నృత్యకారిణులని దారుణం గా అంత సేపు నిలబెట్టి ఉంచడం దారుణం అంటాడు.ఓఢ్ర పండితుల సంస్కృత పాండిత్యం గౌడ దేశీయుల తో పోల్చితే చాలా గొప్పది.కళింగ ప్రాంతం లో ఆ రోజుల్లోని బందిపోట్ల భయం.నాగ్ పూర్ ప్రాంతం దాటిన తర్వాత చెట్లకి వేలాడ దీసి ఉన్న శవాలు...దొంగలకి వార్నింగ్ మాదిరి గా వేలాడదీసిన తెల్ల దొరలు.ఇలా ఎన్నో..ఎన్నో ..విషయాలతో ఎక్కడా రవంత బోరు కొట్టకుండా పుతకం అలా సాగిపోతుంది.
మనకాలపు మహా యాత్రికుడు ఆదినారాయణ గార్కి ఒక సెంటిమెంట్ ఉందీ వీరాస్వామి గారి తో..!సరిగ్గా ఈయన మే 18 న జన్మిస్తే,అదే రోజున వీరాస్వామి తన యాత్ర కి శ్రీకారం చుట్టాడు.అంతే కాదు తిరుగు ప్రయాణం లో ఆయన వీరి యొక్క జన్మస్థలం మీదుగా అమ్మనబ్రోలు వెళ్ళి అక్కడ సత్రం లో బస చేయడం విశేషం.ఆ రకంగా భారత యాత్రా సాహిత్యానికి పితామహుడైన వీరాస్వామి ఆయా ప్రాంతాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.ఇప్పుడు మనం రాయలసీమ,ఆంద్ర,తెలంగాణా అని చెప్పుకుంటున్న తెలుగు ప్రాంతాలు ఈ పుస్తకం లో అనేక రంగుల తో దర్శనమిస్తాయి.అప్పుడు ప్రస్తావించిన చాలా ఊళ్ళని గుర్తుపట్టినపుడు థ్రిల్లింగ్ గా అనిపించకమానదు.
ఇక బ్రౌన్ ఎందుకు ఈ యాత్రా పొత్తాన్ని ముద్రించలేదు అని సందేహం గదా ..?ఆ రోజుల్లో ఆయన బందరు మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్నాడు.ఈ యాత్రంతా చేసి వచ్చి రాత ప్రతి ని సాపు చేసి బ్రౌన్ కి పంపితే చాన్నాళ్ళు ఉంచుకొని మద్రాస్ లో ఓ లైబ్రరీ కి ఇచ్చి వెళ్ళిపోతాడు.వీరాస్వామి కి కూడా సందేహం వచ్చి తన ప్రతి లో ఏమన్నా తప్పు రాశానా అని సరి చూసుకుంటే ఓ పొరబాటు తెలుస్తుంది.తాను యాత్ర లో భాగంగా బ్రౌన్ దొరని కలిసి ఆయన ఆతిధ్యం స్వీకరించినప్పటికీ ఆ ప్రస్తావన ఏదీ పుస్తకం లో రాయలేదు.అయితే దానికీ ఓ కారణం ఉన్నది.తన తమ్ముడు కి ఉద్యోగం వేయించమని ఈ సంధర్భం గా కోరుతాడు.ఇవన్నీ వ్యక్తిగత సంగతులు గదా అని పుస్తకం లో రాయడు.సరిగ్గా అక్కడే బ్రౌన్ మనసు బాధపడి ఉంటుంది.
అయితే ఆయన మిత్రులు అంతా కలిసి పుస్తకం మేము ముద్రిస్తాము అని అన్నా వీరాస్వామి తిరస్కరిస్తాడు.ఏనాటికైనా దీన్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి ప్రచురిస్తేనే నాకు నిజమైన గౌరవం అని చెబుతాడు.ఆయన చివరి మాటలు కొన్ని ఇక్కడ పొందుపరిచి ఇక నేను కూడా ముగిస్తాను.
"నిన్నటి నుండి నా పరిస్థితి ఏమీ బాగా లేదు(1836,అక్టోబర్ 3), ..ఈ సాయంత్రం నీరెండలో కూర్చుంటే కొంచెం ఫర్వాలేదు అనిపిస్తూ ఉంది.ఈ నవరంధ్రాల పంజరం లోని చిలుక ఎగిరిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను.జీవితం లో అనుకొన్న పనులన్నీ చేయగలిగాను.నా పుస్తకం ముద్రణ జరిగి ఉంటే ఆ సంతోషం తో మరి కొన్నాళ్ళు జీవించి ఉండేవాడినేమో !అయినా నాకు తృప్తి గానే ఉంది.నా జీవితం లెక్క లో నాకు సున్నా వచ్చింది.అదృష్టవంతుణ్ణి.జన్మరాహిత్యం కలుగజేయమని ఆ ఈశ్వరుణ్ణి వేడుకుంటున్నాను.కాశీయాత్రికులకి నా పుస్తకం ఒక కరదీపిక లాగా ఉంటే చాలు...దేవుడు నాకు అన్నీ చాలా ఎక్కువగానే ఇచ్చి దీవించాడు.అంతకు మించి కొరుకోకూడదు.ఇచ్చింది తీసుకోవడమే ఇప్పుడు చేయవలసింది.మణికర్ణికా ఘాటు నుండి ఆ కాశీ విశ్వనాధుని ఢమరుక ధ్వని,గంగానదీ తరంగాల మీదుగా నా కుడి చెవుకు లీల గా వినిపిస్తూన్నది.."
Saturday, January 18, 2025
ఆ గ్రామం లో అందరూ యూట్యూబర్లే సుమా!
ఆ గ్రామం లో అందరూ యూట్యూబర్లే సుమా!---------------------------------------------------------------
చత్తీస్ ఘడ్ అనగానే మనకి వెంటనే గుర్తుకు వచ్చేవి నక్సల్ సమస్య ఇంకా అక్కడి మౌలిక వసతులు లేని వెనుకబడిన జిల్లాలు. కాని ఆ రాష్ట్రం లోని తుల్సి అనే గ్రామం ఈ మధ్య కాలం లో మరొక ఆసక్తికరమైన అంశం తో దేశం లోని అనేకమందిని ఆకర్షిస్తున్నది. ప్రముఖ మీడియా సంస్థలు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడి యువతీ యువకుల పనితీరుని ఇంటర్యూ చేసి బయటి ప్రపంచానికి చూపించాయి.దానితో ఒక్కసారిగా 4000 జనాభా ఉన్న ఆ తుల్సి గ్రామం అందరి దృష్టిని ఆకట్టుకుంది. రాయ పూర్ కి సుమారు 33 కి.మీ. దూరం ఉండే ఆ గ్రామం యూట్యూబర్ల గ్రామం గా పేరు తెచ్చుకుంది.ఆ ఊరి లోని ప్రతి ఇంటి నుంచి ఓ యూట్యూబర్ ఉన్నారు. అంతే కాదు,చిన్న పిల్లల దగ్గరనుంచి ముసలివాళ్ళ దాకా అందరూ ఆర్టిస్టులే సుమా!
మీరు ఆ ఊరి లోకి ప్రవేశిస్తుంటే కొంతమంది డిజిటాల్ కెమెరాలు,స్మార్ట్ ఫోన్ లు,మైక్రో ఫోన్ లు పట్టుకుని వాళ్ళ పని లో వాళ్ళు బిజీ గా షూట్ చేసుకుంటూ కనిపిస్తారు. రకరకాల కంటెంట్ ని వారే తయారు చేసుకుని విభిన్నమైన వీడియోలు తయారుచేసుకుంటారు. విద్య,వినోదం,విజ్ఞానం ..ఇలా అనేక జానర్ల లో వీడియోలు రూపొందిస్తారు. అయితే ఎట్టి పరిస్థితి లోనూ కుటుంబం అంతా చూసేలా ఉండాలితప్పా అసభ్యత ఉన్న వీడియోలు చేయకూడదని వీరి నియమం. పండుగలు పబ్బాలు ఒకప్పుడు ఎలా ఉండేవి అని పెద్ద వయసు వాళ్ళు చెబుతారు.భక్తి కథలు వినిపిస్తారు.హాస్యం నిండిన ఇతివృత్తాలతో ఎక్కువ గా సీరియళ్ళు రూపొందిస్తారు.అలాగే పిల్లలకి పనికి వచ్చే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తారు. కొంతమంది టెక్నాలజీ కి సంబంధించినవి చేస్తారు.
ఎవరికి వారు స్క్రిప్ట్ తయారు చేసుకున్న తర్వాత దాంట్లో ఏ నటీ నటులైతే బాగుంటుందో నిర్ణయించుకుంటారు. ఆ ఆర్టిస్ట్ లు కూడా అంతా ఆ ఊరి వాళ్ళే. మొత్తం ఊరి లో 1000 మంది యూట్యూబర్లు ఉన్నప్పటికీ బాగా ప్రసిద్ది చెందినవి నలభై దాకా ఉన్నాయి. అసలు మొట్టమొదట 2016 లో జై వర్మ ఇంకా జ్ఞానేంద్ర శుక్లా అనే ఇద్దరు స్నేహితులు సరద గా రెండు చానెళ్ళు స్టార్ట్ చేశారు. ఒకటి పిల్లల కి పాఠాలు చెప్పడానికి,ఇంకొకటి టెక్నికల్ అంశాలు చెప్పడానికి. వీళ్ళకి మొదట ఈ వీడియో చానెల్స్ బాగా హిట్ అయితే డబ్బులు వస్తాయన్న విషయం కూడా తెలియదు. కాపీరైట్ లాంటి వ్యవహారాలూ తెలియదు. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతి లో చేసుకుపోయారు. కాలం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటీ తెలుసుకుని ఇరవై నుంచి ముఫై వేల దాకా నెల నెలా సంపాదన రావడం తో ,అది చూసి మిగతా యువకులు కూడా ఇంటికి ఓ చానెల్ చొప్పున ప్రారంభించారు.
బీయింగ్ చత్తీస్ ఘడ్, నిమగ చత్తీస్ గఢ్, ఫన్ టప్రి ఇంకా కొన్ని మ్యూజిక్ చానెళ్ళు లాంటివి బాగా పేరు తెచ్చుకున్నాయి. దూర ప్రాంతాలలో ఉన్న చాలామంది తమను అభినందిస్తుంటారని వారు అంటున్నారు.ఈ ఊరి చానెల్స్ లో నటిస్తూండే పింకీ సాహూ అనే అమ్మాయికి పెద్ద తెర పై నటించే అవకాశం వచ్చింది. మరో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఈ యూట్యూబర్లు అంతా జిల్లా కలెక్టర్ ని కలిసి వారికి టెక్నికల్ గా ఉపయోగపడటానికి గానూ తమ గ్రామం లో ఓ స్టూడియో ని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఆయన 25 లక్షల ఖర్చుతో స్టూడియో ని మంజూరు చేశారు. దీంతో ఎడిటింగ్,మ్యూజిక్ ఇంకా ఇతర ఆధునిక సౌకర్యాల్ని యూట్యూబర్లు పొందుతున్నారు. దానితో వీడియోల నాణ్యత పెరిగింది. ఒకప్పుడు ఆడపిల్లలు ఇక్కడ గడప దాటడం కష్టం గా ఉండేది. అలాంటిది ప్రస్తుతం యూట్యూబర్ల కి ఆర్టిస్ట్ లు లేని లోటు తీరుస్తూ డబ్బు,పేరు కూడా పొందుతున్నారు.
----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003)
Thursday, January 16, 2025
Wednesday, January 1, 2025
పులికి ఉన్న విశిష్ఠ లక్షణాలు ఆశ్చర్యకరమైనవి
పులి అనేది కౄర మృగమైనప్పటికి మానవ సమాజం లో దానికి ఒక విశిస్ఠ స్థానం ఉన్నది. ఫలానా వాడు పులి లాంటి వాడురా అంటే అది చాలాగౌరవం గా పరిగణింపబడుతుంది. నిజానికి అడవికి రాజు గా సింహాన్ని చెబుతాము. దానికి పోటీ వచ్చే మృగం ఏదన్నా ఉన్నదా అంటే పులి నే చెప్పాలి. అయితే వీటి మధ్య ఓ ప్రధానమైన తేడా ఏమిటంటే సింహాలు 10 నుంచి 15 వరకు ఓ మంద గా జీవిస్తాయి. పులి మాత్రం ఎప్పుడూ ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంది.
పులి జీవన ప్రమాణం 15 నుంచి 20 ఏళ్ళు మాత్రమే.సగానికి సగం పులి పిల్లలు మొదటి రెండు సంవత్సరాల్లోనే వివిధ కారణాలతో మరణిస్తుంటాయి. ప్రపంచం లో ఎక్కువగా వీటి సంఖ్య మన దేశం లోనే ఉండగా అదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం లో గణనీయం గా ఉన్నాయి. దాదాపుగా 3,167 గా ఉన్న మొత్తం పులుల్లో 300 కి పైగా మధ్యప్రదేశ్ లో ఉన్నాయి.
ఆ తర్వాత ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయి.పులి రాత్రి పూట మాత్రమే తన ఆహారానికి కావలసిన వేట చేస్తుంది. మనిషి కళ్ళ కంటే ఆరు రెట్లు చీకట్లో చూడగలిగే శక్తి దానికి ఉంది. కనుక పొదల్లోనూ ,చెట్ల మధ్య లోనూ నక్కి ఉండి తనకి కావలసిన జంతువు యొక్క శబ్దాల్ని వింటూ అనువైన సమయం లో విరుచుకు పడుతుంది.
పులి పంజా సింహం యొక్క ముందు కాళ్ళ కంటే కూడా శక్తివంతం గా ఉంటుంది.ఎలాంటి జంతువునైనా ఒకటి రెండు దెబ్బలతో నే పడేస్తుంది.ఆ తర్వాత పీకని కొరికేస్తుంది. దాని ప్రధాన ఆహారం దుప్పి,లేడి,అడివి పంది,ఎద్దు,కుందేలు ఇలా చాలా వాటిని తింటుంది.పక్షులు,చేపలు ఇంకా చిన్న జంతువుల్ని కూడా తింటుంది.
పులి స్వభావాన్ని అధ్యయనం చేసిన నిపుణులు చెప్పేదేమంటే సాధ్యమైనంతవరకు మనిషి ని చూస్తే తప్పుకుని వెళ్ళిపోతుందని. మనం అడివి లో నివసిస్తూ, ఒక్కసారి పులిని చూశాము అంటే దాని అర్థం దానికి ముందే మనల్ని కనీసం ఆ పులి యాభై సార్లు చూసి ఉంటుందని!అయితే దాన్ని ప్రతిఘటించినట్లయితే తప్పకుండా చంపితీరుతుంది. పెద్ద జంతువు ని వేట చేస్తే దాన్ని తింటూ ఓ వారం గడుపుతూ విశ్రాంతి తీసుకుంటుంది.
ముఖ్యం గా చల్లగా ఉన్నచోట అంటే వాగుల పక్కన,పొదల మాటున,గుహల్లో,ఇంకా చెట్ల నీడన కూడా గంటలకొద్దీ గడుపుతుంది. నీళ్ళలో చాలాసేపు ఈదుతూ కాలం గడపడం పులికి చాలా ఇష్టం.తోటి పులులు కనబడితే కళ్ళ తోనే మాట్లాడుకుంటాయి. తన ఆధిపత్య ప్రాంతం లోకి మరో మగ పులి వస్తే సహించదు. అయితే ఎద కి వచ్చిన సమయం లో అడివి లో పెద్ద గా గర్జన చేస్తుంటాయి. ఆ శబ్దం మూడు మైళ్ళ దాకా వినిపిస్తుంది. అది విన్న ఆడ పులి జత కట్టడానికి వస్తుంది.
ఆడపులి తన ఆధిపత్య ప్రాంతం గా 15 నుంచి 20 కి.మీ. ని ఉంచుకుంటుంది. మగ పులి ఇంత కంటే ఎక్కువ ప్రాంతాన్ని తన ఆధీనం లో ఉన్నట్లు ప్రకటిస్తుంది.అంటే అక్కడ ఉన్న జంతుజాలం అంతా తనది అన్నట్లుగా భావించుకోవడం.ఒకరి ప్రాంతం లోకి మరొక పులి వచ్చినట్లయితే పోరు జరుగుతుంది.గెలిచినది విజయవంతంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది.అయితే పులిని మించిన కౄర మృగం వంటి మనిషి అడవుల్లోకి వెళ్ళి వాటి టెరిటరీ ని ఆక్రమిస్తుంటాడు.
దాని ప్రభావం వల్ల పులుల జనాభా గణనీయం గా తగ్గిపోయింది. వాటికి ఎక్కడకి వెళ్ళాలో అర్థం గాక గ్రామాల మీద పడితే వాటిని హతమారుస్తుంటారు. పులి ముసలిదై , పళ్ళు ఊడిపొయిన స్థితి లో మరే జంతువు ని వేటాడే శక్తి ఉండదు. అలాంటి సమయం లో మాత్రం ఆహారం కోసం మనిషి ని కూడా వేటాడుతుంది. అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ఏనుగులకి,ఎలుగుబంట్లకి పులి భయపడుతుంది.వాటి జోలికి పోదు. అయితే బెంగాల్ టైగర్ ఏనుగు పైకి కూడా లంఘించి చంపుతుంది. పులి గంటకి ముప్ఫై నుంచి నలభై మైళ్ళ దాకా పరుగెడుతుంది. అంటే చీతా కంటే తక్కువ వేగమే,కాని శక్తి విషయం లో పులి ముందంజ లో ఉంటుంది. మూడున్నర నెలలు గెస్టేషన్ పీరియడ్. ఆడ పులి గర్భం తో ఉన్నప్పటికీ చివరి 12 రోజులలో మాత్రమే అలా కనిపిస్తుంది.
ఉత్తరాఖండ్ లోని జిం కార్బెట్ నేషనల్ టైగర్ పార్క్ 500 ఎకరాల విస్తీర్ణం లో విస్తరించి ఉంది.అక్కడ పులులు స్వేఛ్చగా తిరుగుతుంటాయి.వేటాడానికి అనుమతి లేదు. బాంధవ్ గఢ్,రణతం బోర్ వద్ద ఉన్న పార్క్ లలో సైతం వేటాడడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. అక్కడ కూడా స్వేఛ్చగా తిరుగుతుంటాయి. నాగార్జున సాగర్-శ్రీ శైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశం లోని రిజర్వ్ ల్లో పెద్దది.నల్లమల అడవి లో నల్గొండ,మహబూబ్ నగర్,కర్నూలు,ప్రకాశం జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది.
తరించిపోతున్న పులుల సంఖ్య ని పెంచడానికి అంతర్జాతీయం గా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేవలం 13 దేశాల్లో మాత్రమే పులులు మనుగడ సాగిస్తున్నాయి.మిగతా దేశాల్లో వాటి శరీర భాగాలకి ఉన్న డిమాండ్ వల్ల వేటగాళ్ళ చేతుల్లో కనుమూస్తున్నాయి. మన దేశం లోని రేవా ప్రాంతం లో ఉండే తెల్ల పులి దాదాపుగా అంతరించిపోయింది.అరుదైన జంతువుల్ని సంరక్షించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో దినోత్సవాల్ని జరిపి ఆ తర్వాత మర్చిపోవడం కాదు,ఆ స్ఫూర్తిని భావితరాల్లో కూడా ప్రభావవంతం గా పాదుకొల్పాలి.అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది.
----- మూర్తి కెవివిఎస్ (చర వాణి: 78935 41003)