Tuesday, April 24, 2018

ఆ రోజు (కధ)...మూర్తి కె.వి.వి.ఎస్.

ఆ రోజు  (కధ)...మూర్తి కె.వి.వి.ఎస్.

ఇది నిజమేనా...! ఊహా గానమా..! లేదా ఇంకేమైనా ఉందా ఆ వార్త వెనుక...?ఏమైనా కానీ..!ఆ వార్త చదివిన తర్వాత కాసేపు ఒళ్ళు జలదరించిన మాట మాత్రం వాస్తవం.ఎన్ని రకాలుగా సర్ది చెప్పుకున్నా అది నిజం.ఇంతకీ ఏమిటది ..అంటున్నారా..అక్కడకే వస్తున్నా..!రెండు రోజుల క్రితం "ఒరిస్సా పోస్ట్" ఇంగ్లీష్ డైలీ ని నా లాప్ టాప్ లో చదువుతుండగా ఒక విచిత్రమైన వార్త తారసపడింది.అయినా ఆ దిన పత్రిక తో నీకేం పని..అనవద్దు.ఒరిస్సా గురించిన రోజువారి వార్తలు,ఇంకా సాంస్కృతిక, సాహిత్య,సామాజిక పరిణామాలు దానిద్వారా తెలుసుకుంటూ ఉంటాను.అది అనే కాదు వివిధ రాష్ట్రాల్లో నుంచి వెలువడే రకరకాల న్యూస్ పోర్టల్స్ ని ఆన్ లైన్ లో చదవడం నాకు ఓ హాబీ.ముఖ్యంగా ఆంగ్లంలో మరీ సులువు.తధాగత శతపథి సంపాదకుడు గా వెలువడే ఈ ఒరిస్సా పోస్ట్ ఇంగ్లీష్ డైలి యొక్క శైలి కూడా నాకు నచ్చుతుంది.

సరే..ఇంకా ముందుకి వస్తాను.ఆ రోజు నేను చదివిన విచిత్ర వార్త ఏమిటంటే అది ఆత్మల గురించిన విషయం.అవును మీరు సరిగానే చదివారు. భువనేశ్వర్ లోని రైల్వే స్టేషన్ నుంచి జన్ పథ్ మార్గ్ లోని బిగ్ బజార్ వరకు ఉన్న మార్గం అంతా "ఆత్మల" కి ఆలవాలమైన ప్రదేశమని ...ముఖ్యంగా అర్ధరాత్రిళ్ళు వేళ ..కొంతమందికి కొన్ని అనుభవాలు కలిగాయని ..అదీ ఆ వార్త సారాంశం.ఇంతకీ ఇదెవరు చెప్పారని అనుకుంటున్నారు ...?ఆ భువనేశ్వర్ లోనే ఉన్న ఇండియన్ పేరా నార్మల్ సొసైటి వాళ్ళు.అతీంద్రియ శక్తుల మీద పరిశోధన చేసే ఓ సభ్యుల బృందం అది.

మరయితే దానికీ నీకు లంకె ఏమిటి అని నన్ను అడగవచ్చు.ఉంది.ఒక నెల క్రితం నేను భువనేశ్వర్ వెళ్ళి ఉండకపోతే ...ఆ  రోడ్డు మీదుగా నడిచి ఉండకపోతే ..సవాలక్ష వార్తల్లో ఇది ఒకటిగా చదివి మర్చిపోయే వాణ్ణి..!

*  *  *  *   *

ఆ రోజు నాకు బాగా గుర్తు.నాకున్న ఓ చెడ్డ అలవాటు ఏమిటంటే ఒక ప్రణాళిక వేసుకొని నేను ప్రయాణాలు చేయను.మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు కూడా.దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతుంటాను.అయినా వాటిని వెంటనే మర్చిపోతుంటాను.ప్రయాణం ఇచ్చే అనుభూతి ముందు అవెంతా..?ఓ బ్లాగర్ మిత్రుణ్ణి కలవడానికి ఇంకా భువనేశ్వర్ ని మళ్ళీ ఓసారి దర్శించడానికి బయలుదేరాను.ఆన్ లైన్ లో చెక్ చేస్తే సమీప రైల్వే స్టేషన్ నుంచి టికెట్ దొరికే పరిస్థితి లేదు.వెంటనే విశాఖ బస్ ఎక్కేశాను.అక్కడ దిగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ని అందుకున్నాను.మధ్యానం రెండున్నర దాటింది.మాస్టర్ కేంటిన్ ఏరియా లోని రైల్వెయ్ స్టేషన్ లో దిగేసరికి.భువనేశ్వర్ లోని విశేషం ఏమిటంటే పచ్చదనం బాగా ఉండటం వల్ల నో ఏమో పెద్ద వేడి గా అనిపించలేదు.రైల్వెయ్ స్టేషన్ ముందు నుంచి అశోక్ నగర్ మెయిన్ రోడ్ మీదకి పోవడానికి రెండు దారులు ఉన్నాయి.మళ్ళీ అవి పోయి జన్ పథ్ మార్గ్ కి కలుస్తాయి .అక్కడ ఒక చౌరస్తా.నేను ఎడమ వేపున బస్ స్టాప్ ముందు నుంచి దారి తీశాను.గతం లో నేను దిగిన హోటల్ కి అది దగ్గర మార్గం.మళ్ళీ ఎడమ వేపు ఉన్న గల్లీ లోకి తిరిగాను.దాన్ని ఝన్ ఝన్ వాలా అని పిలుస్తారు.అక్కడ వరసాగ్గా ఉన్న హోటళ్ళ లో రెండవదే అమృత హోటల్.

గతం లో రెండేళ్ళ క్రితం వచ్చినపుడు అప్పుడప్పుడే నిర్మాణం పూర్తయిన దశ లో ఉంది.ఒక కొత్త వాసన.ఇప్పుడు కొద్దిగా పాతబడింది ..అయినా శుభ్రత కి వచ్చిన లోటు ఏమీ లేదు.ముందర పూల మొక్కలు ఆహ్లాదకరం గా ఉన్నాయి.అప్పుడు రెసెప్షన్ లో గణేశ్ మిశ్రా అనే యువకుడు ఉండేవాడు.అతని స్థానం లో ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తి.హోటల్ రేట్లు అప్పటికీ ఇప్పటికీ పెద్ద గా పెరగలేదు అనిపించింది.సింగిల్ రూం నీట్ గా ఉంది.మల్లె పూవు లాంటి బెడ్,ఒక కుర్చి,ఒక టీ పాయ్ ,కప్ బోర్డ్ ..అంతా హాయి గా ఉంది.రిసెప్షన్ కౌంటర్ ఎదురు గా ఇంతలేసి కళ్ళ తో పూరీ జగన్నాధుని చిత్ర పటం.తన సోదరీ సోదరుని తో..!

సాయంత్రం కాగానే తలారా స్నానం కానిచ్చాను.ప్రయాణం వల్ల కలిగిన నిద్ర మత్తు వదిలిపోయింది. హోటల్ నుంచి బయటబడ్డాను.ఆ ఝన్ ఝన్ వాలా నుంచి తిన్నగా నడుచుకుంటూ వచ్చి ప్రధాన రహదారి మీద కి వచ్చాను.కనుచూపు మేర వరకు నగరం దేదీప్యమానం గా వెలిగిపోతోంది.ఇంకా ముందుకు సాగుతూ పండా మార్ట్ దాకా వచ్చి వీధి తిండి ఏదైనా ప్రయత్నించుదాం అనుకున్నాను.
దహి వడ-ఆలూ దం ని రుచి చూశాను.ఫరవాలేదు అనిపించింది.అక్కడే ఉన్న ఓ హోర్డింగ్ లో పరిశీలనగా చూస్తే తోశాలి ప్రాంగణం లో హేండి క్రాఫ్ట్స్ కి సంబందించిన ఎగ్జిబిషన్ జరుగుతున్నట్లు గా రాసి ఉంది.అంత కన్నా ముందు అదే చోట జరుగుతున్న  సత్యజీత్ జెనా యొక్క మ్యూజికల్ ప్రోగ్రాం నన్ను ఆకర్షించింది.సరెగమ లిటిల్ చాంప్స్ లో తను మంచి ప్రతిభని కనబరిచిన బాల గాయకుడు.కియోంజర్ జిల్లా కి చెందిన అతను ఆ ఒక్క ప్రొగ్రాం తో ఎంతోమందిని ఆకర్షించాడు.
అది రాత్రి ఏడున్నర నుంచి స్టార్ట్ అవుతుందని ఉంది.ఇక ఆలశ్యం ఎందుకని బారా ముండా వెళ్ళే బస్ ఎక్కాను.చేరుకునేసరికి అక్కడ అంతా కోలాహలం గా ఉంది.వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్ ఉన్నాయి.తెలుగు వారి స్టాల్స్ ఉన్నాయా అని చూశాను.ఉన్నాయి.అదేమిటో గాని మనాళ్ళు గదా అని పరాయి రాష్ట్రం లో పలకరించామో మనల్ని ఇంకా చులకన గా చూసి చెప్పిన దానికి ఒక్క పైసా తగ్గించరు.కొన్ని గతానుభవాలు అలా ఉన్నాయిలెండి.

భువనేశ్వర్ ఈ రాష్ట్రానికి రాజధాని అయితే ,కటక్ సాంస్కృతిక రాజధాని గా భావిస్తారు.ప్రాచీనమైనవీ,ఆధునికమైనవీ అన్నీ కలిపి  ఒక నగరం లో కొన్ని వందల గుళ్ళు ఎక్కడైనా ఉన్నాయి అంటే అది ఈ భువనేశ్వర్ లోనే.ఒక ప్లాన్ ప్రకారం ఏర్పడిన నగరాల్లో ఇది ఒకటి.విపరీతమైన నగరపు  వత్తిడి అనేది ఎక్కడా ఫీలవ్వము.అంతా చూసుకొని హోటల్ కి బయలు దేరాను.అప్పటికి రాత్రి పది అయింది.ప్రధాన వీధుల్లో తప్పా మిగతా చోట్లా పెద్ద గా జనాలు కనిపించడం లేదు.ఝున్ ఝున్ వాలా కి దారి తీసే మొదట్లో నే ఆటో దిగాను.దాని పక్కనే యూకో బ్యాంక్ శాఖ.ఇంకో పక్క సగం కూలిన అపార్ట్మెంట్ ..ఏమిటో ఒక ప్రేత కళ గోచరించింది ఆ పరిసరాల్లో..!

  ఎక్కడో ఒక కుక్క దూరంగా మొరుగుతున్న శబ్దం...!ఆ యూకో బ్యాంక్ పక్కనున్న చిన్న వీధి నుంచి ముందుకు సాగుతున్నాను.జనాలు బయట ఎవరూ కనబడటం లేదు.మా హోటల్ లోకి వచ్చి రిసెప్షన్ లో తాళాలు తీసుకుని రూం తెరిచి బెడ్ మీద వాలిపోయాను.కాసేపు రెస్ట్ తీసుకుని బాత్ రూం లోకి వెళ్ళి ఫ్రెష్ అయి నిద్ర పట్టక టి.వి. ని ఆన్ చేశాను.దామోదర్ రౌత్ అనే మినిస్టర్ ని అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పదవి నుంచి తొలగించారు.ఓ టివి,కళింగ టివి,ఈ టివి ఒడియా ఇలా ప్రాంతీయ చానెళ్ళు అన్నిట్లో అదే చర్చ,వార్తలూనూ.బ్రాహ్మల మీద ఆయన తీవ్ర విమర్శలు చేసిన దరిమిల ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందట.దాని మీద రెండు వర్గాలు గా చీలి రగడ జరుగుతోంది..!

ఒరియా సమాజం మౌలికం గా ఉత్తరాది కే దగ్గరగా ఉంటుంది,దక్షిణ జిల్లాల్లో కొంత తెలుగు వారి ప్రాధాన్యత ఉన్నప్పటికీ..!అక్కడ రాజకీయ ,వ్యాపార,సామాజిక ఇంకా అన్ని రంగాలన్నిటిలోను పై భాగం లో ఉండేది పట్నాయక్ లు అనబడే  కరణాలు ఇంకా బ్రాహ్మణులు.ఆటో రిక్షా నడిపే వారి దగ్గర నుండి ముఖ్యమంత్రి పీఠం దాకా వీరు తారసపడటం మనం చూడవచ్చు.ఇదొక రకమైన సామాజిక చిత్రపటం.

అలా చానెళ్ళు తిప్పుతూ తిప్పుతూ ఎప్పుడు వొచ్చిందో నిద్ర వచ్చేసింది.ఓ గంట పాటు సోయి లేనట్లు గా నిద్రపోయాను.ఎందుకో కళ్ళు తెరిచి చూస్తే టి.వి. వాగుతూనే ఉంది.లైట్లు వెలుగుతూనే ఉన్నాయి.ఓపిక తెచ్చుకొని లేచి బట్టలు విప్పేసి లుంగి కట్టుకున్నాను.టి.వి.ని ఆఫ్ చేశాను.జీరో బల్బ్ ఆన్ చేసి మిగతా లైట్లు ఆఫ్ చేశాను.మళ్ళీ బెడ్ మీద ఒరగడం తో జీవుడు నిద్ర లోకి జారుకుంటున్నాడు.ప్రాణం హాయి గా ఏ లోకాలకో చేరుకుంటోంది ..విశ్రాంతి లో..!ఇహ కాసేపు అలాగే గాఢ నిద్ర లోకి జారుకుంటే మళ్ళీ తెల్లవారు జామునే తెలివి వచ్చెదేమో..!

ఒక వైపు ఒత్తిగిల్లి పడుకున్నాను గదా..!ఉన్నట్లుండి ఎవరో తన వెనుక భాగాన్ని నాకు ఆనించి కూచున్నట్లుగా అనుభూతి కలిగింది. నా లోపల జీవుడు ఎలర్ట్ అయ్యాడు..ఎవరది అని ప్రశ్నిస్తూ..! కళ్ళు తెరవాలని ప్రయత్నించాను.ఎవరో ఫెవికోల్ తో నా రెప్పల్ని అలా అంటించేసినట్లు అవి తెరుచుకోవడం లేదు.మళ్ళీ ప్రయత్నించాను.అబ్బే లాభం లేదు.ఏమయింది నాకు...!ఎవరది 'అని అడుగుదామని నోరు మెదపబోయాను.ఈ పెదాలు తెరుచుకోవడం లేదు.ఈ అవయవాలు అన్నిటిని నేనేగా నియంత్రించవలసింది..? మరి నా మాట వినడం లేదేమిటి ఇవి..?  
అశక్తుడనై అలాగే పడుకుని నిశితం గా గమనిస్తున్నాను..!జరుగుతున్న దాన్ని కళ్ళు తెరవకుండానే..!కొన్ని సెకండ్లు గడిచిన తర్వాత నా కటి ప్రదేశం పై ఎవరో చేతి తో తడుముతున్న అనుభూతి కలుగుతోంది.వెన్ను లో చలి పుట్టడం అంటే ఏమిటో మొదటిసారి గా అర్ధమయింది.వెంటనే నా ఆధ్యాత్మిక గురువులు గుర్తుకు వచ్చి మనసు లోనే  ప్రార్దించాను. ఈ సంకటం నుంచి దాటించమని.నా గది చుట్టూరా మీ రక్షణ వలయాన్ని ఏర్పరచండి అని..!అలా పది నిమిషాలు గడిచాయి.వాన వెలిసి పొయినట్లుగా అయింది.ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి,పెదాలూ  తెరుచుకున్నాయి..ఇప్పుడు ఒక కొత్త మనిషిని అయినట్లయింది.మెల్లిగా లేచి బెడ్ చివరనే కూర్చున్నాను.కాసిన్ని నీళ్ళు తాగి ట్యూబ్ లైట్ వేసుకున్నాను.బాత్ రూం కి వెళ్ళి వచ్చి నిద్రకి ఉపక్రమించాను.లేచేసరికి తెల్లవారింది.ఇక ఎలాటి అసుర శక్తులు దరి జేరినా ఇక భయపడను.ఆ తర్వాత మరో మూడు రోజులు అదే రూం లో ఉన్నాను.మళ్ళీ ఆ సంఘటన పునరావృతమవుతుందా అని చూశాను గాని ఎందుకనో అలా జరగలేదు...!దానికి కారణం ఏమిటి అంటే ఏదో ఒకటి మీకు నేను చెప్పగలను.కాని అదేదీ సరైనది కాదు అని నాకు తెలుసు .

నేను తిరుగుప్రయాణం చేసే రోజు అది..!చెక్ అవుట్ చేసేటప్పుడు అడిగాను రిసెప్షన్ లో ఉన్నతన్ని" ఈ మధ్య కాలం లో ఎవరైనా మీ హోటల్ చుట్టుపక్కలా సూసైడ్ చేసుకొని చనిపోయారా " అని..!ఆ హోటల్ లో జరిగిందా అంటే బాగోదు గదా..!

" లేదు..లేదు..అలాంటిది ఏమీ లేదు" అన్నాడతను,నిర్ఘాంతపోతూ..!

"ధన్యబాద్" అని చెప్పి నా లగేజ్ తీసుకొని బయటకి నడిచాను.గేటు దగ్గర ఉన్న చౌకీదార్ నన్ను చూసి ఒద్దికగా సేల్యూట్ చేశాడు.
ఓ పది నోటు తీసి అతని చేతి లో పెట్టాను.తలవని తలంపు గా వెనక్కి తిరిగి చూస్తే రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి అక్కడి నుంచే నా వేపు తదేకం గా చూస్తున్నాడు.ఏమైనా చెప్పాలని అనుకుంటున్నాడా తను..!తెలియదు..!ఇంకో పావు గంట లో నా రైలు పట్టుకోవాలి ,నాకిప్పుడు టైం కూడా లేదు ,పిలిచినా వెనక్కి వెళ్ళడానికి..! (సమాప్తం)    

No comments:

Post a Comment