Wednesday, May 2, 2018

స్మృతి (కధ)---మూర్తి కె వి వి ఎస్

స్మృతి (కధ)---మూర్తి కె వి వి ఎస్

బహుశా అదే కృష్ణారావు గారి ఇల్లు కావచ్చుననుకుంటూ అటువైపు గా నడిచాడతను.చుట్టుపక్కల పెద్ద గా ఇళ్ళు లేవు.కానీ కూతవేటు దూరం లో మాత్రం ఓ రెండు మూడు కుటుంబాలు ఉన్న జాడ అగుపిస్తున్నది.కాసేపు ఆగి ఆ భవనాన్ని అలాగే చూశాడు.భవనానికి రాయి,సున్నం వాడినట్లు తోచింది.గాలి రావడం కోసం పెద్ద పెద్ద కిటికీలు...లోపలకి ప్రవేశించగానే విశాలమైన హాలు ,దానికి రెండు వేపులా చిన్న హాళ్ళు,వెలుతురు రావడానికి పైన నిర్మించిన జాలీలు,మధ్యలో ఉన్న హాలు కి అనుసంధానం గా వెనుక మరో విశాలమైన గది ఉన్నది.కింద నిర్మాణం గాక పైన కూడా ఇలాగే ఇంచు మించు ఉన్నది ఇంకో అంతస్తు.ప్రస్తుతం దీని లో ఒక హాస్టల్ వంటిది ఉన్నది.ఆ పాత భవంతి కే సున్నాలు వేసి నడిపిస్తున్నారు.

దుమ్ముగూడెం కి దగ్గర లోని లక్ష్మి నగరం లో ఇంకా ఆ పరిసర ప్రాంతం లో బ్రిటీష్ వారు అలనాడు నిర్మించిన నిర్మాణాలు ఉన్నాయని ఓ మిత్రుడు చెపితే తను ఇక్కడకి చూడటానికి వచ్చాడు.అంతే కాదు అక్కడ కొన్ని తెల్ల వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయని దాని మీద వారి పేర్లూ అవీ కూడా చెక్కి ఉన్నాయని తెలిసింది.మన కి దగ్గర లోని చరిత్ర ని మనం తెలుసుకోలేకపోతే ఎలా ..అదే తనని ఇక్కడకి రప్పించింది.అయితే తను ఇప్పుడు తిరుగాడుతున్నది వర్క్ షాప్ ప్రాంతం లో...అలాగని ఇప్పుడేదో వర్క్ షాప్ అక్కడుందని అనుకోకండి.బ్రిటీష్ వాళ్ళు ఇక్కడ గోదావరి మీద లాకులు నిర్మించారు.ఇక్కడ నుంచి కలప ఇంకా ఇతర వస్తువులు పైకి వెళ్ళేవి జలరవాణా ద్వారా..!అలాగే రాజమండ్రి నుంచి ఇక్కడకి అనేక ఉత్పత్తులు దిగేవి.అలా ఆ లాకుల్ని మెయింటైన్ చేయడానికి ఏర్పరిచిందే ఆ వర్క్ షాప్.ప్రస్తుతం అది లేదు,గాని పేరు మాత్రం మిగిలిపోయింది.

ఆ ప్రాంతం లో అర్ధ శతాబ్దం పైబడి ఇంకా అదృష్టవశాత్తు జీవించి ఉన్న ఆ చింత,రావి ఇంకా ఇతర వృక్షాలకి గనక నోళ్ళు ఉండి ఉంటే అప్పటి గాధల్ని ఏమేమి చెప్పి ఉండేవో..?!అక్కడ తిరుగాడుతున్న ఒక పిల్లవాడిని అప్పటి సమాదుల్ని గురించి ప్రశ్నించగా అవి రోడ్డు కి పక్కనున్న ములకపాడు చివరి లో ఉన్నాయని చెప్పాడు.తను కలవాలనుకున్న కృష్ణా రావు గారి ఇల్లు కూడా అటే ఉంటుందని చెప్పాడు.

ఒక పది నిమిషాల్లో అటు చేరుకున్నాడు.ఆయన బయటకి వచ్చి ఈ కొత్త వ్యక్తి ఎవరా అన్నట్లు చూడసాగారు.తను ఫలానా పత్రిక విలేకరి అని అలనాటి బ్రిటీష్ వారి నిర్మాణాల్ని పరిశీలించి ఒక వార్తా కధనాన్ని రాయడానికి వచ్చానని చెప్పడం తో కృష్ణారావు గారు ఎంతో సంతోషించారు.

" అవును..నా గురించి ఎలా తెలుసు" రావు గారే అడిగారు.

" మీరు ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్నట్లు మా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు.ఈ పరిసరాల మీద మీకు మంచి అవగాహన ఉందని నాకు తెలుసు" అన్నాడు తను.

" ఓ..మొత్తానికి మీరు సామాన్యుల్లా లేరే..!ఈ కాలం లో కూడా మీ వంటి జిజ్ఞాసువులు ఉండటం ఆనందం గా ఉంది.." రావు గారు నవ్వుతున్నప్పుడు వార్ధాక్యం వల్ల వేలాడుతున్న బుగ్గల పైని చర్మం ఒక గంభీరత ని కలిగిస్తోంది.

" మీ సహకారం కావాలి..రావు గారు,ఆ తెల్ల సమాధుల దగ్గరకి దారి చూపించగలరా "

" అదిగో...అక్కడ దూరం గా పాత ప్రహరీ కనిపిస్తున్నదే... ఆ లోపలే బ్రిటీష్ వారి సమాధులు కొన్ని ఉన్నాయి ..వెళ్ళి చూస్తూ ఉండండి..ఇంట్లో చిన్న పని చూసుకొని వచ్చి మీతో జాయిన్ అవుతా "
సరే..అని చెప్పి కదిలాడు తను.ఇంచు మించు ఓ వంద గజాల దూరం ఉంటుందేమో..అది..!నాలుగు వేపులా పాతబడిన గోడలు..! ముందు ఒక ఇనుప గేటు..నామ మాత్రం గా ఉంది.చుట్టూతా పొలాలు ఇంకా కొన్ని చెట్లు ..నివాసాలు మాత్రం ఏమీ కనిపించలేదు.మనం పెద్దగా గమనించము గాని ఒక ప్రాంతం దగ్గరకి గాని ఒక మనిషి దగ్గరకి గాని వెళ్ళినపుడు దానికే పరిమితమైన కొన్ని వైబ్రేషన్స్ మన చుట్టూ అల్లుకుంటాయి.అవి మన ఆలోచనల సూక్ష్మ లోకం లో ఏవో వ్యక్తీకరించడానికి వీలుపడని ప్రభావాలని మోపుతుంటాయి.

వేసవి కావడం వల్ల చిరు చెమటలు పడుతున్నాయి తనకి.అస్థిపంజరం లా ఉంది స్మశానం.లోనికి ప్రవేశించగానే తనలో కలిగిన భావమది.ఇక్కడ ఈ సమాధుల్లో తిరిగి లేవలేని గాఢ నిద్ర లో ఉన్న వీరి వెనుక ఎలాంటి ఆవేదనలు ఉండేవో,ఆకాంక్షలు ఉండేవో ..!తమ తమ జీవిత కాలాల్లో వారు అనుభవించిన సుఖమేమిటో ,దుఖమేమిటో..! రవి అస్తమించని సామ్రాజ్యమని గర్వించిన బ్రిటీష్ ప్రాభావం నేడు లుప్తమైపోయింది.ఇక్కడ సమాధి చేయబడ్డ బ్రిటీష్ జాతీయులలో ఎన్ని రకాలు ఉన్నారో...ఒక డయ్యర్ ఉండి ఉండవచ్చును లేదా ఒక బ్రౌన్ ఇంకా ఓ కాటన్ ఉండివుండవచ్చును.ఆనాటి బ్రిటీష్ మహా సామ్రాజ్యం లో వీరు చిన్న మర మేకులు గా పనిచేసినవారు కావచ్చు.స్థానిక ప్రజలతో వారి సంభందాలు ఎన్ని కోణాలలో ఉండేవో ...!

కొన్ని సమాధులు పాలరాతి తో ఫ్రేం చేయబడి ఉన్నాయి.ఇంకొన్ని నున్న గా ఉన్న నల్ల రాతి తో నిర్మించబడిఉన్నాయి.పిచ్చి మొక్కలు బాగా పెరిగిన ఆ ప్రాంగణం తైల సంస్కారం లేని కుర్రాడిలా ఉంది.ప్రతి సమాధి పైన చనిపొయిన వ్యక్తి వివరాలు ఉన్నాయి.తనకి మొదటి గా కనబడిన సమాధి "అంగస్ అల్స్టైర్ ఫెర్నాండెజ్ " అనే అతనిది.దాని మీద చెక్కిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో భద్రాచలం ప్రాంతానికి అసిస్టెంట్ కలెక్టర్ గాను స్పెషల్ ఏజెంట్ గానూ పనిచేశాడు.తను ఇరవై ఐదవ ఏటనే సమాధి కాబడ్డాడు దాని మీద ఉన్న జనన మరణ వివరాల ప్రకారం..!ఆ రోజుల్లో సివిల్ సర్విసెస్ లో సెలెక్ట్ కావడానికి గరిష్ట వయోపరిమితి ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే అనేది గుర్తుకు వచ్చింది.మరి అంత పిన్న వయసు లో ఎలా చనిపోయాడు..కారణమేమిటో..? ఈ.ఎం.ఫోరెస్టర్ రాసిన ఏ పాసేజ్ టు ఇండియా నవల లోని యువ సివిల్ సర్విస్ అధికారులు గుర్తుకు వచ్చారు.

ఈ ఏజెన్సీ లో పనిచేయడం మా వల్ల కాదు అంటూ ఆరోగ్య కారణాలతో బయటకి వెళ్ళడానికి ప్రయత్నించే నేటి ఉద్యోగులు ఆ రోజు ల్లో అయితే ఇక్కడ పని చేయగలిగేవారా..?సరే... కారణాలు ఏమైనా గాని వాళ్ళ ఉద్యోగం కోసమో,జీతం రాళ్ళ కోసమో..అటువంటి ఒక మొక్కవోని లాయల్టి తమ ప్రభుత్వం మీద ఉండటం వల్లనే గదా ఈ మారు మూలకి వచ్చింది.బ్రిటిష్ వారికి ప్రభుత్వం అంటే రాణి యొక్క ఆజ్ఞ యే.కల లో కూడా దానిని వారు మీరరు.ఆ ఏకతా సూత్రమే ,ఆ బంధనమే వాళ్ళ ని ప్రపంచ విజేతలు గా నిలిపింది.  

ఇంకొంచెం ముందుకి వెళితే...ఒక సమాధి పై మిస్ సారా క్లెయిర్ అని ఉంది,దాని పక్క నే ఉన్న మరో సమాధి పై మిస్ డొరోతి అని చెక్కి ఉంది.వాటిమీద వివరాల్ని బట్టి వాళ్ళు ఇద్దరూ మిషనరీ టీచర్స్.ఆ స్మశానం లో అన్నిటికన్నా అందం గా ఉన్న సమాధి సరిగ్గా మధ్య లో ఉంది.అది ఒక పదిహేనేళ్ళ అమ్మాయిది పేరు చూస్తే మిస్ హెన్రిటా చార్లోట్ అని ఉంది.ఆమె తండ్రి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ హాస్పిటల్స్,మద్రాస్ అని ఉంది.మరి ఇక్కడ ఎందుకు సమాధి చేయబడిందో..!

దురదృష్టకరమైన సంగతి ఏమిటంటే చాలా సమాధులు ఘోరంగా తవ్వబడి ఉన్నాయి.లోపల నిధులు లాంటివి ఉంటాయనేమో పిచ్చి పిచ్చి గా తవ్వి పడేశారు కొంతమంది పనికిమాలిన వెధవలు.లేదా ఒక కాలక్షేపం కోసమైన ధ్వంసం చేసే మనుషులున్న దేశం మనది.ఏమీ ప్రయోజనం ఉండనక్కరలేదు.అదో సరదా..అంతే..!తను ఇలాంటి సంఘటనల్ని ఎన్నైనా చెప్పగలడు.

" హలో.." వెనుక నుంచి ఓ స్వరం.

వొళ్ళు ఝల్లుమంది.వెనక్కి తిరిగి చూస్తే రావు గారు.ఎంతైనా తాను ఉన్నది స్మశానం లో గదా..!

"రండి..రండి..మీ గురించే అనుకుంటున్నా"

" ఏమిటి..వీటిలో లీనమై పోయినట్లున్నారే.."

" అవును ..ఆ కాలం లోకి వెళ్ళిపోయా.."
" నాకు ఇరవై ఏళ్ళు వచ్చేదాక ఇక్కడే ఉన్నా.అప్పట్లో ఈ పరిసరాలన్నీ కోలాహలం గా ఉండేవి.." చెప్పారు రావు గారు.

"ఆ వైభవమంతా ఏమైనట్లు.."

" అదే నాకూ అనిపిస్తుంది..కాలం చిత్రమైనది.నగరం వెలసిన చోటు దిబ్బ అవుతుంది.ఒకనాటి దిబ్బ అవసరాన్ని బట్టి నగరం అవుతుంది"

" అంత పెద్ద గా ఉండేదా"

" చెప్పుకోదగ్గ ఊరే...భద్రాచలం కంటే ఈ ప్రాంతం జనాల తో కళ కళ లాడుతూ ఉండేది.పైగా జలరవాణా కి ప్రాధాన్యత వల్ల ఇక్కడ కొన్ని బ్రిటీష్ కుటుంబాలు ఉండేవి.ఈ పక్కనే దుమ్ముగూడేం దగ్గర గోదావరి నది మీద ఆనకట్ట కట్టారు.కొంత మంది తెల్లవాళ్ళతో నాకు పరిచయం ఉంది."

"ఆ విశేషాలు కొన్ని చెప్పండి.."

"నాకూ చెప్పాలనే ఉంది.మళ్ళీ మీలాంటి శ్రోత నాకు దొరకకపోవచ్చు.భద్రాచలం పరిసర ప్రాంతాల లోని గిరిజన  పల్లెల్లో సాధ్యమైనన్ని  యెయిడెడ్ పాఠశాలల్నిపెట్టడం వల్ల విద్య ఆ రోజుల్లోనే అందుబాటులోకి వచ్చింది.అవతల వర్క్ షాప్ ప్రాంతం లో పీడిత వర్గాలకి చెందిన బాల బాలికలకి హాస్టల్స్ నడిపేవారు.ఇంకా వారికి లేసులు అల్లకం లో ,కార్పెంట్రి లో శిక్షణ ఇచ్చేవారు.ఎనిమిదవ తరగతి దాకా చదివిన వారిని టీచర్ ట్రైనింగ్ కి పంపి ఉద్యోగాలు ఇప్పించేవారు...సారా క్లెయిర్ ,డొరోతి అమ్మగార్లు ఇక్కడ ఇంచార్జ్ లు గా ఉండేవారు" చెప్పారు రావు గారు.

"కాని బ్రిటీష్ వారు మనల్ని దోచుకున్నది నిజం కాదా .." ప్రశ్నించాడు తను.

" అభివృద్ది చెందిన జాతి ,చెందని ప్రాంతానికి వెళ్ళి సంపద ని ఆర్జించడం లోక స్వభావం లోనే ఉంది.ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతున్నదదే...రూపాలు వేరు కావచ్చు.కాసేపు చరిత్ర పుస్తకాల్లో చదివినది అవతల ఉంచండి.బ్రిటీష్ వాళ్ళు చేసినదంతా రైట్ అని అనను.అయితే ఒకటి మాత్రం నిజం...మనం పైకి ఎన్ని చెప్పినా ...ఈ దేశం లోని అధో జగత్తు వర్గాలకి విద్య అనే ద్వారం తెరిచింది బ్రిటీష్ వారు మాత్రమే..అంటే కాదనగలమా!వాళ్ళు ప్రారంభించిన కొన్ని పనులు మన అభివృద్ధిని వేగిరపరిచాయి.అనేక మూఢనమ్మకాల తో కునారిల్లే సమాజాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన రాజారాం మోహన్ రాయ్,వీరేశలింగం పంతులు,ఫూలే ఇంకా ఇలాంటి వారికి చేయూతనిచ్చారు.ఈ రోజున ఇంగ్లీష్ అనే కిటికీ ద్వారా ఎంత ప్రపంచాన్ని చూస్తున్నాం..ఎన్ని దేశాలలో కి పరుగులు తీస్తున్నాం..?"

" చైనా ,జపాన్ లాంటి దేశాలు ఇంగ్లీష్ కాకుండా వారి మాతృ భాషల తోనే అభివృద్ది చెందలేదా" వాదించాడు తను.

" వాటి ఆత్మ వేరు.మన దగ్గర ఉన్నన్ని వందల ఉపకులాలు,భాషలు అక్కడలేవు.అవసరమైనప్పుడు ఐక్యం గా పోరాడే జాతీయ సమైక్యత అక్కడి సంస్కృతి లో ఇమిడి ఉంది.ఏరోజునా చైనా గాని జపాన్ గాని యూరోపియన్ల చేత రాజకీయం గా పరిపాలింపబడలేదు ..దాని కారణం అదే..!కాని మనం.. దేశం అనే భావన ఎక్కడుంది..? కుల ప్రయోజనాలు,ప్రాంత ప్రయోజనాలు ఆ తర్వాతనే ఏదైనా..!" రావు గారి లోక జ్ఞానం ఎంత లోతైనదో అర్ధం అవుతోంది.

"మరోలా అనుకోకపోతే ఓ సందేహం...మీరు ఇంత మారుమూల ప్రదేశం లో ఎందుకున్నారు రిటైర్ అయిన తరువాత"

" నేను రిటైర్ అయ్యే ఇరవై ఏళ్ళు దాటింది...ఎక్కడ మనసు ఉంటే అక్కడ నివసించాలి.అన్నీ అవే వస్తాయి.మనం బద్ధకించనపుడు.మనకి ఇష్టమైనపుడు.."

"మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు.నాకు ఇంత గా సహకరించినందుకు.."

" ఆ ..దానిదేముందిలెండి...!మరి ఈ ఆర్టికల్ కి ఏమి పేరు పెడతారు..?"

"ఒక స్మశానం -కొన్ని స్మృతులు "

"బావుంది.." నవ్వుతూ అభినందించారు రావు గారు. (సమాప్తం)  

No comments:

Post a Comment