Wednesday, October 6, 2021

జార్జ్ ఆర్వెల్ నవల Animal Form గూర్చి...

 చాలా మందికి ఇదివరకే తెలుసును George Orwell రాసిన ఈ పుస్తకం కొన్ని కారణాల వల్ల ప్రపంచ సాహిత్యం లో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇది రెండవ ప్రపంచ యుద్ధం పూర్తి అయిన పిమ్మట కొన్ని ప్రత్యేక సంఘటనలను ఆలంబన గా చేసుకొని రాసినటువంటిది.రచయిత స్వతహా గా బ్రిటీష్ వ్యక్తి యే అయినప్పటికి బర్మా లో పుట్టాడు,చిరు ఉద్యొగాలు చేశాడు,జర్నలిస్ట్ గా ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక ల్లో పనిచేశాడు.బతికి ఉన్నంత కాలం ఈ రచన వల్ల పెద్ద గా పేరు రాలేదు గాని మరణాంతరం ఆయన రచనలు అన్నిటి లోకి బాగా పేరు పొందింది.దానికి కారణం Time మేగజైన్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కొన్ని పుస్తకాల్లో దీన్ని కూడా సెలెక్ట్ చేయడం తో అందరి దృష్టి దీని మీద బడింది.


అసలు ఏమిటి దీనిలోని ప్రత్యేకత...? ఉంది.కొద్ది గా కధ చెప్పుకుందాము.అప్పుడు మీకు కొంత ఊహ కలుగుతుంది..కొన్ని వాటి గురుంచి..!అది ఒక ఇంగ్లీష్ గ్రామం.అక్కడ Mr.Jones అనే రైతు..అతనికి ఒక పెద్ద పశు క్షేత్రం ఉంటుంది.దాని  పేరు Manor Farm.దానిలో పందులు,మేకలు,ఆవులు,కోళ్ళు ఇట్లా అనేక రకాల జంతువులు ఉంటాయి.విచిత్రం గా అవన్నీ కూడా చక్కగా మాట్లాడుకుంటుంటాయి.ముఖ్యంగా వాటి బాధలు..ఎన్ని రకాలు గా తమ మూతులు కట్టేసి మానవులు తమని దోపిడీ చేస్తున్నారో చెప్పుకుంటుంటాయి.వీటన్నిటికి నాయకుడు,సిద్ధాంత కర్త ఎవరూ అంటే Old Major అనబడే ఒక పంది.అది తోటి పశువుల్లో తన ఉపన్యాసాలతో చైతన్యం నింపుతుంది.చివరకి అన్నీ కలిసి తమ మానవ యజమాని పై తిరుగుబాటు చేసి ఆ Farm ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తాయి.అయితే కాలం వికటించి Old Major మరణిస్తుంది.

అయితే నింపుకున్న చైతన్యం ఎక్కడికి పోతుంది... Napolean ఇంకా Snowball అనబడే రెండు పందులు పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాయి.మనం మానవ యజమాని పై పోరాడి విజయం సాధిస్తేనే అది మన కామ్రేడ్ Old Major కి ఇచ్చే నివాళి అవుతుంది..అంటూ మిగతా అన్నిటి లో స్పూర్తిని రగిలిస్తాయి ఇవి.అంతే కాదు అవి కొన్ని స్లోగన్లు కూడా ఏర్పరచుకుంటాయి.Four legs good , Two legs bad ..ఆ విధంగా అన్నమాట.మనలో ఏ వ్యత్యసాలు ఉండరాదు ..అంతా సమానమే కనక అందరం కామ్రేడ్ అని ఒకరికి ఒకరు పిలుచుకోవాలని నిర్ణయించుకుంటాయి.Seven Commandments రూపొందించుకుంటాయి ..వాటి జీవన సూత్రాలన్నమాట.

సరే..మొత్తానికి ఒక రోజు యజమాని ఆదమరుపు గా ఉన్నప్పుడు దాడి చేసి అతడిని తరిమి వేస్తాయి.ఆ ఫార్మ్ పేరుని Animal Farm గా మార్చుకుంటాయి. ఇక వాటిదైన సొంత పాలన మొదలవుతుంది.అందరూ సమానంగా కష్టపడి పంట పండించుకుంటాయి.సమానంగా పంచుకొని తింటూ ఉంటాయి.ఎవరూ పెద్ద లేరు,ఎవరూ చిన్న లేరు.కరంట్ కూడా తయారు చేసుకోడానికి Windmill ని నిర్మించుకుంటాయి.దాన్ని Snowball నిర్మింప చేస్తుంది.దానితో Napolean కి ఈర్ష్య కలుగుతుంది.పోను పోను ఇదే లీడర్ అయ్యేలా ఉంది ..దీన్నెలా అయినా తప్పించాలి అని ప్లాన్ వేస్తుంది.ఓ అంశం మీద చర్చ జరిగినప్పుడు Bluebell,Tessie అనే రెండు కుక్కల్ని ఈ Snowball మీదకి పంపి పారిపోయేలా చేస్తుంది.ఇప్పుడు Napolean కి అధికారం వచ్చింది కదా..!దానిష్టం వచ్చినట్లు  చేస్తుంది.Seven commondments కి వ్యతిరేకం గా మానవులతో మంచి సంభందాలు నెరుపుతుంది అంతే కాదు వ్యాపారాలు కూడా చేస్తుంది.Clover అనే ముసలి గుర్రాన్ని కసాయి వాడికి అమ్మేస్తుంది.

అంతేకాదు తమ పంది జాతి చాలా గొప్పదని ప్రచారం చేసుకొని ప్రత్యేక హక్కులు కట్టబెడుతుంది.పందులు ఆపిళ్ళు,పాలు ఇంకా చక్కని తిండిని తింటూ పరుపుల మీద శయనిస్తూ ఉంటాయి. పాపం మిగతా వాటికి అరకొర తిండి..సరైన సదుపాయాలు ఉండావాయే.ఎవరైన దీన్ని ప్రశ్నిస్తే Squeler అనే పంది, పంది జాతి చేసే సేవలు వాటి త్యాగ బుద్ధి గురుంచి ఊదరగొడుతూ వ్యతిరేకతని తగ్గించడానికి కృషి చేస్తుంది. ఇది మీడియా లాంటిది అన్న మాట.

రోజులు గడిచే కొద్దీ Napolean పాలన ఘోరంగా తయారవుతుంది.ఏ మానవుల దోపిడికి,పీడన కి వ్యతిరేకంగా పోరాడి ఈ రాజ్యాన్ని స్థాపించుకున్నాయో చివరకి ఇప్పటి పాలకులు ఆ మానవుల తోనే సత్సంభందాలు నెరపుతున్నాయి.వాళ్ళ తో కలసి తాగడమూ,కార్డ్స్ ఆడటం,వ్యాపారాలు చేసి తమ కోసం దాచుకోవడమూ..ఇలాంటివి చూస్తూ మిగతా బలహీన జంతువులు ఏమీ చేయలేక ఆవేదన చెందుతుంటాయి.ఆ విధంగా కధ ముగుస్తుంది.కొందరు అనడము ఏమిటంటే సోవియట్ రష్యా లోని అప్పటి స్థితి గతులను ప్రతీకత్మకంగా దీనిలో చెప్పారని..! Napolean పాత్ర స్టాలిన్ అని,మానవ యజమాని పాత్ర జార్ చక్రవర్తి అని,Snowball పాత్ర TraaTskii ది అని Squeler పాత్ర అక్కడ మీడియా దని చెబుతారు.

ఒక జర్నలిస్ట్ వార్త ని ప్రెజెంట్ చేస్తున్నట్లు గా ఉంటుంది జార్జ్ ఆర్వెల్ శైలి.ఇది Novella అని చెప్పాలి.అంటే నవలకి చిన్నది,కధ కంటే పెద్దది.ఒక పెద్ద కధ అనవచ్చు.జంతువులు మధ్య జరిగే సంభాషణలు వినోదాత్మకంగా ఉన్నాయి. కొన్ని రచనలు గొప్పగా కొనియాడబడటం, దానివల్ల అవి మరింత పాపులర్ కావడం ప్రపంచ సాహిత్యం లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. బహుశా దాని వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఉంటాయి, ఈ నవల చదువుతుంటే ఆ విషయం జ్ఞాపకం వస్తుంటుంది. అందుకోసమైన ఈ నవల చదవ వలసిందే.అయితే సాధారణ పాఠకుడి కి చదువుతున్నప్పుడు దాని నిజగుణాలు తెలిసిపోతూనే ఉంటాయి.

  ------- మూర్తి కెవివిఎస్ (7893541003)

Printed in Nava Telangana Daily , 4.10.2021


No comments:

Post a Comment